
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అడ్వకేట్ జనరల్(ఏజీ)గా సీనియర్ న్యాయవాది ఎ.సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఏజీగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 2011–2014 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీ హైకోర్టుకు చివరి ఏజీగా ఆయన పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులను వాదించిన అనుభవం సుదర్శన్ రెడ్డికి ఉంది. నిజాం కాలేజీలో డిగ్రీ, ఓయూ నుంచి లా పూర్తి చేశారు. 1985లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యారు.
2009–10 మధ్య ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1984–85 మధ్య ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచ్పల్లిలో వ్యవసాయ కుటుంబంలో (జగపతిరెడ్డి, బుచ్చమ్మ దంపతులకు) 1959 జులై 25న సుదర్మన్ రెడ్డి జన్మించారు. ఆయనకు భార్య రేణుక, ఇద్దరు పిల్లలు ఉన్నారు.