నిజామాబాద్​ రూరల్​ నుంచి మండవ!

నిజామాబాద్​ రూరల్​ నుంచి మండవ!
  • బాన్సువాడ బరిలో ఏనుగు రవీందర్​ రెడ్డి?
  •  ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్​లో చేరికలు
  • ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా రాజకీయం


కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ ​జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్​ నేతలు మండవ వెంకటేశ్వర​రావు, ఏనుగు రవీందర్​రెడ్డి కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖాయమైంది. ఏనుగు రవీందర్​రెడ్డిని బాన్సువాడ నుంచి, మండవ వెంకటేశ్వరరావును నిజామాబాద్​ రూరల్​ నుంచి బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది.  పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి, ఇతర ముఖ్య నేతలు వీరితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్​లో మండవ వెంకటేశ్వర​రావు ఇంటికి రేవంత్​రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి తదితరులు వెళ్లారు. వీరితో పాటు ఏనుగు రవీందర్​రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరిని పార్టీలోకి రావాలని కాంగ్రెస్​ నేతలు ఆహ్వానించారు. వీరు పార్టీలో ఎప్పుడు చేరుతారన్నది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది. 

బాన్సువాడ బరిలో రవీందర్​!

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి బీజేపీ​ సీనియర్​ నేతగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్​ బీఆర్ఎస్​లో చేరడంతో ఏనుగు రవీందర్​రెడ్డికి పార్టీలో ప్రయార్టీ తగ్గింది. ఈటల రాజేందర్​తో కలిసి ఏనుగు రవీందర్​రెడ్డి బీజేపీలో చేరారు. హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో యాక్టివ్​గా పని చేశారు. ఆ తర్వాత ఈటెలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏనుగు బీజేపీ కార్యక్రమాలతో పాటు, ఈటలకు దూరంగా ఉంటున్నారు. రెండు నెలలుగా ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఎల్లారెడ్డి టికెట్​ కోసం ఆయన అప్లయ్​ కూడా చేయలేదు.

పది రోజుల కింద మళ్లీ బీజేపీలోనే కొనసాగుతారని, ఎన్నికల బరిలో నిలుస్తారని ఆయన అనుచరులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన కాంగ్రెస్​ ముఖ్య నేతలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఎల్లారెడ్డి టికెట్​ఆశిస్తున్నప్పటికీ, ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీలో ఇక్కడి నుంచి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఏనుగు రవీందర్​రెడ్డిని బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీలో ఉంటారనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

సెటిలర్లు ఎక్కువగా ఉన్న రూరల్ ​నుంచి మండవ

ఉమ్మడి జిల్లాలో టీడీపీ సీనియర్​ నేత అయిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర​రావు 2019 పార్లమెంట్ ​ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పట్లో సీఎం కేసీఆర్​స్వయంగా మండవ ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. ఏదైనా కీలక పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. నిజామాబాద్​ ఎంపీగా కవిత ఓటమి, అనంతరం మండవ కూడా సైలెంట్ ​అయ్యారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మండవను కాంగ్రెస్​లో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు భావించారు. కొద్దిరోజుల కింద ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు.

తుమ్మలకు మండవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తుమ్మల ద్వారా మండవను కాంగ్రెస్​లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని  నిజామాబాద్​ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో సెటిలర్ల​ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మండవ రాకతో ఆ ఓట్లు తమకు పడతాయని హస్తం నేతలు భావిస్తున్నారు. నిజామాబాద్​ రూరల్​లో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఇక్కడి నుంచి మండవను పోటీ చేయిస్తారని చర్చ నడుస్తోంది. ఇక్కడి నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, మార్కెట్ ​కమిటీ మాజీ చైర్మన్ నగేశ్​రెడ్డి టికెట్​ ఆశిస్తున్నారు.