రూపొందించిన లేహ్ ఎస్పీ
న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక సంచలన నివేదిక బయటికి వచ్చింది. తూర్పు లడఖ్ బార్డర్లోని 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26 పెట్రోలింగ్ పాయింట్లపై భారత సైన్యం పట్టును కోల్పోయిందని ఆ రిపోర్టులో ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, లేహ్– లడఖ్ రీజియన్ ఎస్పీగా వ్యవహరిస్తున్న పి.డి.నిత్య ఈ రిసెర్చ్ పేపర్ను రూపొందించారు. గత వారం ఢిల్లీ వేదికగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమక్షంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు డీజీపీలు, ఇన్స్పెక్టర్ జనరళ్ల సమావేశం జరిగింది.
ఆ సందర్భంగానే లడఖ్ బార్డర్లో చైనా ఆగడాలపై తాను రూపొందించిన రిపోర్ట్ను ఎస్పీ పి.డి.నిత్య సమర్పించారు.
“తూర్పు లడఖ్ సరిహద్దులో ఫెన్సింగ్ లేని.. ప్రజలు నివసించని.. భారత భూభాగంపై పట్టుకోసం చైనా పాకులాడుతోంది. ప్రస్తుతం కారకోరం కనుమ నుంచి చుముర్ వరకు 65 బార్డర్ పెట్రోలింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో 26 చోట్ల మనం గ్రిప్ కోల్పోయాం. చైనా చేతిలోకి వెళ్లిపోయిన వాటిలో 5 నుంచి 17, 24 నుంచి 32, 37,51, 52, 62 నంబర్ పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. దీనివల్ల వాటి సమీపంలోని పాయింట్లపై కూడా చైనా పట్టు పెరుగుతుంది. ఒక్కో ఇంచుగా భూ ఆక్రమణ పెంచుకునేందుకు చైనా సైన్యం అనుసరించే ఈ ప్లానింగ్ను ‘సలామీ స్లైసింగ్’ అంటారు. తదుపరి వ్యూహంలో భాగంగా.. తాము ఆక్రమించుకున్న పెట్రోలింగ్ పాయింట్లలో కూడా భారత సైన్యం కదలికలను చైనా సైన్యం అనుమతించకపోవచ్చు” అని ఎస్పీ పి.డి.నిత్య వివరించారు.