
- సెన్సెక్స్ 1,196 పాయింట్లు అప్
- 23,000 మార్క్కు చేరువైన నిఫ్టీ
- రూ.4.28 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: బ్యాంకింగ్, ఆయిల్ ఆటో షేర్లలో కొనుగోళ్లకుతోడు, ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయిలో డివిడెండ్ చెల్లించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం 1.6 శాతానికి పైగా ర్యాలీ చేసి జీవితకాల గరిష్ట స్థాయిలలో ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఏడాది జనవరి 29 తర్వాత 75 వేల స్థాయికి తిరిగొచ్చింది. ఈ ఇండెక్స్ గురువారం 1,196.98 పాయింట్లు దూసుకెళ్లింది. ఇది 1.61 శాతం పెరిగి 75,418.04 వద్ద ఆల్-టైమ్ గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,278.85 పాయింట్లు జూమ్ చేసి దాని ఆల్-టైమ్ ఇంట్రా-డే గరిష్ట స్థాయి 75,499.91కి చేరుకుంది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో రికార్డు స్థాయి 23,000 మార్క్కు చేరువైంది. ఇది 369.85 పాయింట్లు పెరిగి 22,967.65కి చేరుకుంది. ఇంట్రాడేలో 395.8 పాయింట్లు జంప్ చేసి 22,993.60 లెవెల్ను టచ్ చేసింది . దీంతో గురువారం ఇన్వెస్టర్ల సంపద 4.28 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. సన్ఫార్మా, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ వెనకబడ్డాయి.
ఆర్బీఐ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ. 2.1 లక్షల కోట్ల డివిడెండ్ను చెల్లించనుంది. ఇది బడ్జెట్ అంచనాల కంటే రెండింతలు ఎక్కువ. "ప్రభుత్వానికి ఆర్బీఐ రూ. 2.1 లక్షల కోట్ల డివిడెండ్ను ఆమోదించిన తర్వాత ఈక్విటీ మార్కెట్లో ఉత్సాహం కనిపించింది. ఇది మెరుగైన ఆర్థిక స్థితిని, తక్కువ బాండ్ రాబడులను సూచిస్తుంది. ఈ సానుకూల చర్య ఫలితంగా మార్కెట్లో కొంత షార్ట్ కవరింగ్ ఉండొచ్చు. ఎన్నికల ఫలితాలు ప్రస్తుత మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంటే జూన్ మొదటి వారంలో నిఫ్టీ కొత్త గరిష్టాలను చేరుకుంటుందని అనుకుంటున్నాం" అని యాక్సిస్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ హెడ్ నీరజ్ చదావర్ అన్నారు.
బ్రాడ్ మార్కెట్ కూడా భేష్
బ్రాడ్ మార్కెట్లో, బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 0.58 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం పెరిగింది. ఇండెక్స్లలో ఆటో 2.28 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.13 శాతం, బ్యాంకెక్స్ 1.98 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.64 శాతం, సర్వీసెస్ 1.63 శాతం, టెక్ 1.42 శాతం, కన్స్యూమర్ డిస్క్రెషన్ 1.19 శాతం, ఐటీ 1.19 శాతం చొప్పున పెరిగాయి. మెటల్ ఇండెక్స్ 1.18 శాతం తగ్గింది. ఎన్ఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల కోట్ల డాలర్ల మార్కును తాకింది.
ఆసియా మార్కెట్లలో టోక్యో గ్రీన్లో ముగియగా, సియోల్, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా గ్రీన్లో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ బుధవారం నెగెటివ్గా ముగిసింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.33 శాతం పెరిగి 82.17 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) బుధవారం రూ. 686.04 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.