
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేదరికంపై అంతర్జాతీయ సంస్థ బ్రాక్ (బీఆర్ఏసీ) అమలు చేస్తున్న తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్(టీజీఐఎల్పీ)లు తుది పోరాటంగా మారాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. పేదరికంపై టీజీఐఎల్పీ ద్వారా విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఆమెను సెక్రటేరియెట్ లో బ్రాక్ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..‘‘ అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించడమే టీజీఐఎల్పీ లక్ష్యం.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న కృషికి బ్రాక్ సంస్థ తమ వంతు సహకారం అందించాలి. స్థానిక వనరులు, ప్రజల అవసరాలకు తగ్గట్లు జీవనోపాధికి రూపకల్పన చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో లభించే ఇప్ప పువ్వుతో నూనె, ఆహార పదార్థాల తయారీ కోసం కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలి’’ అని బ్రాక్ బృందానికి సూచించారు. ఐదు జిల్లాల్లోని 8 మండలాల్లో టీజీఐఎల్పీ అమలవుతోందని, ఇప్పటివరకు 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించినట్లు బ్రాక్ ప్రతినిధులు మంత్రికి వివరించారు.