జహీరాబాద్​ ఎంపీ టికెట్​కు ..కమలంలో తీవ్ర పోటీ

జహీరాబాద్​ ఎంపీ టికెట్​కు ..కమలంలో తీవ్ర పోటీ
  •     కామారెడ్డిలో గెలుపుతో చిగురించిన ఆశలు
  •     ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి గణనీయంగా పెరిగిన ఓట్లు
  •     జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆశావహులు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడంతో పాటు, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఓటు బ్యాంకు​ పెరగడంతో జహీరాబాద్​ ఎంపీ టికెట్​కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ గణనీయమైన ఓట్లు వచ్చాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. దీంతో వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేయాలని కీలక నేతలు భావిస్తున్నారు. 

బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డిని ఓడించి అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి తోడు ప్రధాని మోదీ చరిష్మా, యూత్​లో బీజేపీకి ఉన్న క్రేజ్​, అయోధ్యలో రామమందిర ప్రారంభం తదితర అంశాలు కలిసి వస్తాయని ఆశావహులు భావిస్తున్నారు. దీంతో జహీరాబాద్ ​ఎంపీ టికెట్  ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగింది. వీరంతా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అధిష్టానం మాత్రం ఇంకా ఏ నేతకు హామీ ఇవ్వలేదు. మరో వైపు టికెట్​ ఆశిస్తున్న వారు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ద్వితీయ శ్రేణి లీడర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

టికెట్ ఆశిస్తున్న వారిలో..

జహీరాబాద్​ టికెట్​ఆశిస్తున్న వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన నేతలతో పాటు, ఉమ్మడి మెదక్​జిల్లాకు చెందిన లీడర్లు కూడా ఉన్నారు. కొందరు స్టేట్ ​లీడర్లు కూడా ఈ స్థానంపై గురిపెట్టారు. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిన బాణాల లక్ష్మారెడ్డి, పార్టీ సీనియర్​ నేత ఉప్పునూతుల మురళీధర్​గౌడ్, తాడ్వాయి మండలం దేవాయిపల్లి వాసి, సెంటిస్ట్​పైడి ఎల్లారెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసిన వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, బోధన్ ​టికెట్​ఆశించిన మేడపాటి ప్రకాశ్​రెడ్డి, అడ్వకేట్ ​రచనా రెడ్డి, జైపాల్​రెడ్డి, సురేశ్​రెడ్డి, ఆలే భాస్కర్, బిచ్కుంద మఠాధిపతి  సోమయప్ప టికెట్ ​రేసులో ఉన్నారు. 

వీరంతా రాష్ట్ర నేతలు కిషన్​రెడ్డి, బండి సంజయ్, డాక్టర్​ లక్ష్మణ్​లతో పాటు, ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసిన సేవలు, ఇతర కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో వారికున్న అనుబంధాలను వివరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​లో పార్లమెంట్​ఎన్నికల సన్నద్ధతపై మీటింగ్​నిర్వహించారు. కేంద్రమంత్రి అమిత్​షా ఈ సమావేశానికి అటెండయ్యారు. ఆయా పార్లమెంట్​ స్థానాల నుంచి టికెట్​ ఆశిస్తున్న వారి నుంచి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని స్టేట్​ ముఖ్య నేతలకు షా సూచించారు. ఈ లిస్ట్​లో ఎవరి పేర్లు ఉంటాయోనని ఆశావహులు ఉత్కంఠతో ఉన్నారు

పెరిగిన ఓట్లతో..

జహీరాబాద్​ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నాలుగు కామారెడ్డి జిల్లాలో, మూడు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. జహీరాబాద్​ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి 1,72,766 ఓట్లు వచ్చాయి. 2018లో 98,514 ఓట్లు మాత్రమే పడ్డాయి. 

గతంతో పోలిస్తే  ఈ ఎన్నికల్లో 74,252 ఓట్లు పెరిగాయి. కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఈ సారి 1,45,774 ఓట్లు  వచ్చాయి. బీజేపీకి కామారెడ్డిలో 66,652, ఎల్లారెడ్డిలో 27 వేలు,  బాన్సువాడలో 23,685 , జుక్కల్​లో 28,433 ఓట్లు పడ్డాయి. 2018లో జిల్లాలోని ఈ నాలుగు స్థానాల్లో 43,596 ఓట్లు మాత్రమే బీజేపీ సాధించింది. జిల్లాలో ఈసారి బీజేపీకి 1,02,178 ఓట్లు అధికంగా పోలయ్యాయి.