మంత్రి పేషీ నుంచి ప్లేయర్​కు లైంగిక వేధింపులు!

మంత్రి పేషీ నుంచి ప్లేయర్​కు లైంగిక వేధింపులు!

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర క్రీడాశాఖలో మహిళా క్రీడాకారులపై  లైంగిక వేధింపుల ఘటన మరొకటి బయటకు వచ్చింది. తెలంగాణ  స్టేట్​ స్పోర్ట్స్​ స్కూల్​లో ఓఎస్డీపై లైంగిక వేధింపుల ఆరోపణలు  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపగా.. ఇప్పుడు ఏకంగా  క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్​ గౌడ్​ పేషీ నుంచే ఓ అమ్మాయిని వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పేషీలో పని చేస్తున్న ఉద్యోగి ఓ నేషనల్ ​లెవెల్​ ప్లేయర్​ను వేధించాడు. సదరు ప్లేయర్​కు హెల్ప్​ చేయాలంటూ ఆమె బంధువు మంత్రి దగ్గరకు తీసుకెళ్లాడు.  

ఆ టైమ్​లో  అమ్మాయితో పరిచయం చేసుకున్న ఉద్యోగి  ఆమె  ఫోన్​ నెంబర్​ తీసుకున్నాడు.​ సాయం చేయడానికి బదులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.  నిన్ను పర్సనల్​గా కలవాలి.. పర్సనల్​ ఫొటోలు పంపించు అంటూ మెసేజ్​లు చేశాడు.  ఈ విషయాన్ని తనను మంత్రికి కలిపించిన బంధువు దృష్టికి ఆ ప్లేయర్​ తీసుకెళ్లింది. దాంతో, ఆమె బంధువు ఉద్యోగికి ఫోన్​ చేసి నిలదీసిన ఆడియో బయటకు వచ్చింది. మంత్రికి చెబుతానని హెచ్చరించడంతో  తప్పయిందంటూ ఉద్యోగి  ​కాళ్ల బేరానికి వచ్చాడు. విషయం తెలిసి పేషీ నుంచి అతడిని తొలగించినట్టు తెలుస్తోంది. 

విచారణ కమిటీ చేతికి వేధింపుల కాల్​ రికార్డులు?

శామీర్​పేట, వెలుగు: హకీంపేట స్కూల్లో లైంగిక వేధింపుల కేసులో  విచారణ కమిటీ రెండో రోజు కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న ఆధారాలు, కాల్​ రికార్డులను  కమిటీ సభ్యులకు అందించినట్టు సమాచారం.  ముందుగా స్కూల్ లో స్టూడెంట్లను ఎంక్వయిరీ చేసి వారి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. మరో రెండురోజులు విచారణ చేసిన తర్వాత కలెక్టర్ కు రిపోర్టు అందజేయనుంది. 

మరోవైపు సస్పెన్షన్​ కు గురైన అధికారిని కాపాడేందుకు స్పోర్ట్స్​ స్కూల్​లో ఆయనకు అనుచరులుగా ఉన్న కొందరు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్​లోని  ఓ టీచర్, మహిళా ఉద్యోగి, ఇద్దరు కోచ్​లు ఓఎస్డీ గురించి కమిటీకి పాజిటివ్​గా చెప్పాలని అక్కడి స్టాఫ్​, స్టూడెంట్లపై ఒత్తిడి తెస్తున్నారని,  వీళ్లను స్పోర్ట్స్ స్కూల్ నుంచి తప్పిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని క్రీడాకారులు, కోచ్‌‌లు చెబుతున్నారు.