కీచక గురువును తరిమికొట్టిన తల్లిదండ్రులు

కీచక గురువును తరిమికొట్టిన తల్లిదండ్రులు

అథ్లెటిక్స్​లో జాతీయ స్థాయి మెడల్​ సాధించి ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్​లో విధులు నిర్వహిస్తున్న పీఈటీ హాస్టల్ లోని ఇద్దరు మగ పిల్లలను మూడు రోజులుగా లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాధిత విద్యార్థులను భయపెట్టాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు గురువారం స్కూల్​కు వచ్చి పీఈటీకి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన యాలాల పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెద్దేముల్​ మండలం ఓమ్లానాయక్​ తండాకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు తాండూరు శివారులోని ప్రతిభ రెసిడెన్షియల్ హైస్కూల్​లో 7, 8వ తరగతి చదువుతున్నారు. ఇటీవల స్కూల్ లో వార్డెన్ కమ్ పీఈటీగా చేరిన కేస్లావత్ దశరథ్ కొంతకాలంగా ఇద్దరు పిల్లలపై కన్నేశాడు. రాత్రిపూట విద్యార్థులంతా నిద్ర పోగానే దశరథ్​వారి వద్దకు వచ్చి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇలాంటి పనులు తాము చేయలేమంటూ విద్యార్థులు చెప్పినా వినకుండా వారి బట్టలు చింపేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెబుతామని విద్యార్థులు ఎదురుతిరగడంతో దశరథ్​ మరింత రెచ్చిపోయాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. గత్యంతరం లేక విద్యార్థులు తమకు తెలిసిన రమేష్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. గురువారం ఉదయం స్కూల్ కు వచ్చిన గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు విఠల్​నాయక్, మాజీ కౌన్సెలర్ భీంసింగ్​రాథోడ్, విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ ప్రిన్సిపాల్ జాకోబ్ పీటర్​కు ఫిర్యాదు చేశారు. వార్డెన్ దశరథ్​ను పిలిపించడంతో బాధిత కుటుంబీకులు అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే యాలాల పోలీసులకు సమాచారం అందజేశారు. నిందితుడు దశరథ్​ను అదుపులోకి తీసుకుని యాలాల స్టేషన్​కు తరలించారు. సంఘటనపై డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలంధర్​రెడ్డి, ఎస్సైలు విఠల్​రెడ్డి, మహిపాల్​రెడ్డి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్, యాజమాన్య ప్రతినిధులను, విద్యార్థులను, టీచర్లను, తల్లిదండ్రులను విచారించారు. నిందితుడిపై ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు దశరథ్ శంకర్​పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన గిరిజనుడు. కాలేజీ చదివే రోజుల్లో జాతీయ స్థాయి అథ్లెటిక్స్​లో మెడల్ సాధించాడు. దశరథ్​ను కఠినంగా శిక్షించాలని యాజమాన్య ప్రతినిధులు చంద్రశేఖర్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు.