బిజినెస్ డెస్క్, వెలుగు: 11 నెలల్లో 250 బేసిస్ పాయింట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), తాజా పాలసీ మీటింగ్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేకిచ్చింది. క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నా, ఇన్ఫ్లేషన్ ఇంకా 6 శాతానికి పైనే కొనసాగుతున్నా గ్రోత్కే ప్రాధాన్యం ఇచ్చింది. వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉండడంతో యూఎస్, యూరప్లలో బ్యాంకింగ్ క్రైసిస్ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నిలకడగా కనిపిస్తోంది. ఫిస్కల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మెరుగుపడ్డాయి. జీఎస్టీ కలెక్షన్స్ రికార్డ్ లెవెల్లో ఉన్నాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా వడ్డీ రేట్ల పెంపును ఆపాలని నిర్ణయించుకుంది. కాగా, వడ్డీ రేట్లు పెరగడంతో వినియోగం, హౌసింగ్ సేల్స్ తగ్గిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్లను పెంచకపోవడంతో రెపో రేటు 6.5 శాతం దగ్గరే కొనసాగుతుంది. ఈసారి పాలసీ మీటింగ్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి, తర్వాతి ఎంపీసీ మీటింగ్ నుంచి రేట్ల పెంపును నిలిపేస్తారని మెజార్టీ ఎక్స్పర్ట్లు అంచనావేశారు. కానీ, రేట్లను పెంచకుండా ఆర్బీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇన్ఫ్లేషన్ దిగొస్తది..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 5.2 శాతానికి దిగొస్తుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనావేసింది. గతంలో వేసిన అంచనా 5.3 శాతం కంటే కొద్దిగా తగ్గించింది. వాతావరణ మార్పులు, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లో సమస్యలు ఇన్ఫ్లేషన్ తగ్గడంలో అడ్డుగా ఉన్నాయని వెల్లడించింది. రబీ సీజన్లో పంటల దిగుబడి అంచనాలకు అనుగుణంగా ఉండడంతో ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నా, పాల ధరలు మాత్రం ఇంకా హయ్యర్ లెవెల్లోనే కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. డిమాండ్కు తగ్గ సప్లయ్ లేకపోవడం, దాణా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని వివరించింది. ఒపెక్ ప్లస్ తాజాగా క్రూడాయిల్ ప్రొడక్షన్ను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్లోబల్గా వోలటాలిటీ కొనసాగుతోందని, ఈ ఏడాది క్రూడాయిల్ ధర బ్యారెల్కు 85 డాలర్లుగా ఉంటుందని, వర్షాకాలం సాధారణంగానే ఉంటుందని భావిస్తూ ఇన్ఫ్లేషన్ అంచనాలను తగ్గించామని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కిందటి నెల 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 6.5 శాతంగా రికార్డవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫ్లేషన్ క్యూ1 లో 5.1 శాతంగా, సెప్టెంబర్, డిసెంబర్ క్వార్టర్లలో 5.4 శాతంగా రికార్డవుతుందని దాస్ అన్నారు. వచ్చే ఏడాది మార్చి క్వార్టర్లో 5.2 శాతానికి తగ్గుతుందని పేర్కొన్నారు. ధరలు కంఫర్టబుల్ లెవెల్కు దిగొచ్చేంత వరకు ఇన్ఫ్లేషన్పై తాము చేస్తున్న యుద్ధం కొనసాగుతుందని అన్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 6.44 శాతంగా నమోదయ్యింది. ఇది ఆర్బీఐ పెట్టుకున్న అప్పర్ లిమిట్ 6 శాతం కంటే ఎక్కువ.
అవసరమంటే పెంచడానికి రెడీనే..
వడ్డీ రేట్లను పెంచకపోయినప్పటికీ తన పాలసీ వైఖరిని మాత్రం ఆర్బీఐ మార్చలేదు. వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించడంపైనే తమ ఫోకస్ ఉంటుందని తెలిపింది. ‘అకామిడేషన్ విధానాన్ని విత్డ్రా’ చేసుకునే వైఖరీ కొనసాగుతుందని తెలిపింది. అంతేకాకుండా రేట్లను తాత్కాలికంగానే పెంచకుండా ఆపామని, అవసరమనుకుంటే మళ్లీ రేట్లను పెంచడానికి సిద్ధమేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కాగా, ఆర్బీఐ కిందటేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య రెపో రేటును 2.5 శాతం పెంచింది. ఫలితంగా లోన్లపై వడ్డీ పెరిగింది. డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కూడా పెరుగుతోంది.
గ్రోత్ అంచనాలు కొద్దిగా పెంచి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనావేసింది. గతంలో వేసిన అంచనా 6.4 శాతం నుంచి కొద్దిగా పెంచింది. కమొడిటీ ధరలు తగ్గుతుండడం, రబీలో దిగుబడి పెరగడం, ప్రభుత్వం క్యాపెక్స్ కోసం భారీగా ఖర్చు చేయాలను కుంటుం డడంతో జీడీపీ గ్రోత్ అంచనాలను పెంచింది. 2022–23 లో దేశ జీడీపీ గ్రోత్ రేటు 7 శాతంగా రికార్డవుతుందని ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యూ1 లో జీడీపీ గ్రోత్ రేటు 7.8 శాతంగా, క్యూ2 లో 6.2 శాతంగా, క్యూ3 లో 6.1 శాతంగా, క్యూ4 లో 5.9 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. బ్యాంకింగ్ క్రైసిస్తో గ్లోబల్గా ఆర్థిక సంక్షోభం నెలకొందని, అభివృద్ధి చెందిన దేశాలు తమ బలహీనతలను గుర్తించి సరిదిద్దుకోవాలని శక్తికాంత దాస్ అన్నారు. ఇండియాలోని ఇన్స్టిట్యూషన్లు రిస్క్ మేనేజ్మెంట్ను కచ్చితంగా ఫాలో కావాలని, కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపరుచుకోవాలని, ఆస్తులను అప్పులను బ్యాలెన్స్ చేసుకోవాలని, సరిపడినంత క్యాపిటల్ను రెడీగా ఉంచుకోవాలని సూచించారు. బ్యాంకుల దగ్గర క్లయిమ్ చేసుకోకుండా ఉన్న డిపాజిట్ల గురించి ప్రజలు తెలుసుకునేలా సెంట్రలైజ్డ్ పోర్టల్ ఒకటి తీసుకొస్తామన్నారు.