శంషాబాద్ టు పరిగి 55 కి.మీ రేడియల్ రోడ్డు.. 4 మండలాలు, 24 గ్రామాలకు కనెక్టివిటీ

శంషాబాద్ టు పరిగి 55 కి.మీ రేడియల్ రోడ్డు.. 4 మండలాలు, 24 గ్రామాలకు కనెక్టివిటీ
  • త్వరలో డీపీఆర్​.. టెండర్లు
  • మార్కింగ్​ పనులు షురూ

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్​ రింగ్​ రోడ్(ట్రిపుల్ ఆర్​)ను ఔటర్ రింగ్ ​రోడ్​తో లింక్​ చేస్తూ పలు ప్రాంతాల్లో రేడియల్​ రోడ్ల నిర్మాణానికి హెచ్​ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రేడియల్​ నిర్మాణాల కోసం హెచ్​ఎండీఏ నోడల్​ ఏజెన్సీగా వ్యవహరించనుంది. హెచ్​ఎండీఏ పరిధి ఔటర్​ నుంచి ట్రిపుల్​ఆర్​ వరకూ పెరగడంతో అక్కడి వరకు కనెక్టివిటీ రోడ్లను(రేడియల్​) నిర్మించనుంది. అందులో భాగంగానే ఇప్పటికే మొదటి రోడ్​ను ఓఆర్​ఆర్​ ఎగ్జిట్​ నంబర్​ 13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్​గల్​ వరకు నిర్మించనున్నారు. 

దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా హెచ్​ఎండీఏ పూర్తి చేసింది. తాజాగా శంషాబాద్​ నుంచి పరిగి వరకు 55 కి.మీ. రేడియల్​ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే డీపీఆర్​ పూర్తి చేసి టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రేడియల్ రోడ్​కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్​ పనులు కూడా చేపడుతున్నారు. 

మొదట రావిల్యాల మీదుగా ఆమన్​గల్​ వరకు..

ట్రిపుల్ ఆర్​ పరిధిలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని సంగారెడ్డి, నర్సాపూర్​, తూప్రాన్​, గజ్వేల్​, జగదేవ్​పూర్​, భువనగిరి, ఆమన్​గల్​, యాచారం,  కందుకూరు, షాద్​నగర్​, చేవెళ్ల, కంది వరకు దాదాపు 11 రోడ్లను నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. రేడియల్​ రోడ్లను నిర్మించి ఆయా ప్రాంతాలకు ఓఆర్​ఆర్​, ట్రిపుల్​ ఆర్​కు లింక్​ చేస్తారు. ఇందులో భాగంగా మొదటి దశలో ఓఆర్ఆర్​ ఎగ్జిట్​ 13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్​గల్ వరకు రేడియల్​ రోడ్​ను నిర్మించనున్నారు. దాదాపు 42 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డు పరిధిలోకి కొంగర కుర్ధు, కొంగర కలాన్​, ఫిరోజ్​గూడ, లేమూరు, తిమ్మాపూర్​, రాచలూరు, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్​ఖాన్​పేట, ముచ్చర్ల, కుర్మిద్ద, కడ్తాల్​ నుంచి ఆమన్​గల్​ అనుసంధానం అవుతాయి. దీంతో ఆయా ప్రాంతాలను డెవలప్​ చేసేలా హెచ్​ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. 

శంషాబాద్​– పరిగి మార్కింగ్​ షురూ​..

తాజాగా శంషాబాద్​ ఓఆర్ఆర్​ ఎగ్జిట్​ నంబర్​ 17 నుంచి పరిగి ఓఆర్ఆర్​ వరకు 55 కిలోమీటర్ల రేడియల్​ రోడ్​ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో మార్కింగ్​ పనులు ప్రారంభమయ్యాయి. శంషాబాద్​ హుడా కాలనీ అండర్​పాస్​ వద్ద ప్రారంభమై వికారాబాద్​ రాకంచర్ల వరకు విశాలమైన రేడియల్​ రోడ్​ను నిర్మించనున్నారు. ఈ రహదారి రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లోని నాలుగు మండలాలు, 24 గ్రామాలను కలుపనుంది. ఓఆర్​ఆర్​ ఎగ్జిట్​ నంబర్​  2, 4, 8, 10, 13, 15, 17 రహదారులకు సంబంధించి ప్రణాళికను హెచ్​ఎండీఏ రెడీ చేసింది. త్వరలో రెండో రేడియల్​ రోడ్​కు సంబంధించి టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు. 

భూసేకరణకు నిర్ణయం.. 

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, షాబాద్​ మండలాల్లోని శంషాబాద్​, కొత్వాల్​గూడ, అమ్మపల్లి, నర్కుడా, సుల్తాన్​పల్లి, కాచారం, రాయన్నగూడ, మల్కారం, రామాంజపూర్​, సోలిపేట, హైతాబాద్​, పెద్వీడు, దామర్లపల్లి, మాచన్​పల్లి, నాగర్​కుంట, బోన్​గిరిపల్లి, షాబాద్​, కొమరబండ, ఉబ్బగుంట, బొబ్బిలిగాం, వికారాబాద్​ పరిధిలోని పరిగి, పూడూర్​, కంకల్​, మాచన్​పల్లి, పరిగి, మాదారం, రాకంచర్ల తదితర గ్రామాల గుండా రేడియల్​ నిర్మాణం జరగనుంది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన భూములను కూడా రైతుల నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు.

రేడియల్​ రోడ్డు మాకొద్దు

పరిగి, వికారాబాద్​, వెలుగు: పరిగి నుంచి శంషాబాద్​ వరకు రేడియల్​ నిర్మాణం తమకు అవసరం లేదని రైతు వేదికలో రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రేడియల్​లో భూములు కోల్పోతున్న రైతులు శుక్రవారం రంగాపూర్​ రైతువేదిక క్లస్టర్​ ఎదుట రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. రోడ్డు నిర్మాణం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. శంషాబాద్​ నుంచి నాగర్​గూడ వరకు, షాద్​నగర్​ నుంచి పరిగి వరకు ఆరు లేన్ల రోడ్డు వేస్తే రైతులు నష్టపోతారన్నారు. మరోవైపు ట్రిపుల్​ ఆర్​లో తమ భూములు పోకుండా చూడాలని కోరుతూ నవాబుపేట మండల చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​కు వినతిపత్రం ఇచ్చారు.