ముంబై: క్రికెటేతర విషయాల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై హాలీవుడ్ సెలబ్రిటీ రిహన్నా చేసిన ట్వీట్కు స్పందనగా కామెంట్లు చేసిన క్రికెటర్లలో సచిన్ కూడా ఉన్నాడు. భారత అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం అనవసరమని, తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలమని సచిన్ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్లపై కాంగ్రెస్తోపాటు ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి.
వ్యవసాయం అంటే క్రికెట్లో సిక్స్ కొట్టినంత సులువు కాదంటూ క్రికెటర్లను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెటేతర విషయాల మీద స్పందించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సచిన్కు శరద్ పవార్ చురకలు అంటించారు. రైతుల గురించి కామెంట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. దేశంలోని చాలామంది సెలబ్రిటీల తీరుపై అందరూ చర్చించుకుంటున్నారని, పూర్తి వివరాలను తెలుసుకొని స్పందిస్తే మంచిదని హితవు పలికారు. దీనిపై ఎంఎన్ఎస్ పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే కూడా స్పందించారు. తమకు మద్దతుగా ట్వీట్లు చేయమని చెప్పి సచిన్, లతా మంగేష్కర్ల ప్రతిష్టను కేంద్ర ప్రభుత్వం పణంగా పెట్టిందని ఠాక్రే మండిపడ్డారు. వీళ్లు భారత రత్న పురస్కార గ్రహీతలని.. ఇలాంటి విషయాలకు అక్షయ్ కుమార్ లాంటి నటులు సరిపోతారంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.