- మొత్తం అమ్మకాల్లో రూ. 45 లక్షల లోపు ఉండే ఇండ్ల వాటా 22 శాతానికి డౌన్
- మార్చి క్వార్టర్లో టాప్ 8 సిటీల్లో రూ.1.11 లక్షల కోట్ల విలువైన ఇండ్ల అమ్మకం: ప్రాప్టైగర్
న్యూఢిల్లీ: అఫోర్డబుల్ ఇండ్ల (తక్కువ రేటుండే ఇండ్ల) అమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ ఏడాది జనవరి– మార్చిలో టాప్ 8 సిటీల్లో రూ.45 లక్షల వరకు ధర ఉండే ఇండ్ల సేల్స్ సగానికి పైగా పడిపోయాయి. మొత్తం ఇండ్ల సేల్స్లో అఫోర్డబుల్ ఇండ్ల వాటా 22 శాతంగా రికార్డయ్యింది. ప్రాప్టైగర్ రిపోర్ట్ ప్రకారం, కిందటేడాది జనవరి–మార్చి క్వార్టర్లో అమ్ముడైన ఇండ్లలో అఫోర్డబుల్ ఇండ్ల వాటా 48 శాతంగా ఉంది. మొత్తం రియల్ ఎస్టేట్ సెక్టార్ చూసుకుంటే దేశంలోని టాప్ ఎనిమిది సిటీల్లో ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో 1,20,640 ఇండ్లు సేల్ అయ్యాయి. కిందటేడాది ఇదే టైమ్లో సేల్ అయిన 85,840 ఇండ్లతో పోలిస్తే 41 శాతం వృద్ధి చెందాయి.
వీటిలో రూ.25 లక్షల కంటే తక్కువ విలువున్న ఇండ్ల వాటా 5 శాతంగా ఉంది. కిందటేడాది జనవరి–మార్చి క్వార్టర్లో ఈ కేటగిరీ వాటా 15 శాతంగా రికార్డయ్యింది. రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల బ్రాకెట్లోని ఇండ్ల వాటా 23 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. కరోనా సంక్షోభం తర్వాత లగ్జరీ ఇండ్లపై బయ్యర్ల ఆసక్తి పెరిగిందని తాజా రిపోర్ట్లో ప్రాప్ టైగర్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో రూ.కోటిపైన విలువున్న ఇండ్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. మొత్తం ఇండ్ల సేల్స్లో వీటి వాటా ఏడాది ప్రాతిపదికన 24 శాతం నుంచి 37 శాతానికి చేరుకుంది. ప్రాప్ టైగర్ రిపోర్ట్ ప్రకారం, మొత్తం ఇండ్ల అమ్మకాల్లో రూ.45–75 లక్షల బ్రాకెట్లోని ఇండ్ల వాటా 26 శాతం దగ్గర ఫ్లాట్గా ఉంది. రూ.75 లక్షల నుంచి రూ. కోటి మధ్య విలువుండే ఇండ్ల వాటా 12 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది.
జోరులో రియల్ ఎస్టేట్ సెక్టార్
హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్కతా, ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ (ఎంఎంఆర్), పూణె సిటీల్లో ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో రూ.1,10,880 కోట్ల విలువైన ఇండ్లు అమ్ముడయ్యాయని ప్రాప్టైగర్ రిపోర్ట్ పేర్కొంది. కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ.66,155 కోట్ల విలువైన ఇండ్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ కింద ఘజియాబాద్, ఫరీదాబాద్, గ్రేటర్ నోయిడా, నోయిడా, గురుగ్రామ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లు వస్తాయి. ఎంఎంఆర్ కింద ముంబై, థానే, నవి ముంబై వస్తాయి. ఈ టాప్ 8 సిటీల్లో ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 16.2 కోట్ల చదరపు అడుగులు అమ్ముడయ్యాయి. ఇది కిందటేడాది మార్చి క్వార్టర్లో సేల్ అయిన 9.9 కోట్ల చదరపు అడుగుల కంటే 63 శాతం ఎక్కువ.
ఇండ్ల సేల్స్ పెరగడం ఎకానమీకి మంచిదని, ఈ సెక్టార్పై ఆధారపడుతున్న సిమెంట్, స్టీల్ వంటి 200 అనుబంధ రంగాలకు ఇది మేలు చేస్తుందని ప్రాప్టైగర్ డాట్ కామ్ బిజినెస్ హెడ్ వికాశ్ వాధవన్ పేర్కొన్నారు. టాప్ ఎనిమిది సిటీల్లో ఇండ్ల సేల్స్ వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. మోర్టగేజ్ రేట్లు నిలకడగా ఉండడం, ఎకానమీ స్ట్రాంగ్గా ఉండడం, ఇండ్లు కొనుక్కోవడానికి బయ్యర్లు ఆసక్తి చూపిస్తుండడం కలిసొస్తోందని అన్నారు.