కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో దరిద్రపు పాలన

కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో దరిద్రపు పాలన

తెలంగాణలో సర్కార్ బడులకంటే బెల్టు షాపులే ఎక్కువ
కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్

కొల్లాపూర్(నాగర్​కర్నూల్​), వెలుగు : రాష్ట్రంలో దరిద్రపు పాలన నడుస్తోందని, ఎనిమిదేండ్లుగా బూటకపు హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన మోసగాడు సీఎం కేసీఆర్​ అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమె సాయంత్రం కొల్లాపూర్​ పట్టణానికి చేరుకుని.. అక్కడ సభలో మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య బూటకమేనని, రాష్ట్రంలో సర్కార్​ బడుల కంటే బెల్టు షాపులే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్​వన్​గా ఉందని, ఇదే కేసీఆర్​ మార్క్ సంక్షేమమని ఆమె ఎద్దేవా చేశారు. సీఎం ప్రకటించిన పథకాలు, ఇచ్చిన హామీలు అన్నీ మోసమేనని అన్నారు.  

ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. సింగోటం–- గోపాల దిన్నె లింక్ కెనాల్ పనులు ఎందుకు ప్రారంభించలేదని షర్మిల నిలదీశారు. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్​ది అయితే, దానిని మేయింటేన్ చేసే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. వైఎస్ హయాంలో కేఎల్ఐ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని, సింగోటం జాతరప్పుడు కృష్ణానదిలో బోటు మునిగి 60 మంది చనిపోతే ఆయన కొల్లాపూర్ వచ్చి సమీక్షించారని షర్మిల గుర్తుచేశారు. ఫాంహౌస్ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను కలుస్తారు కానీ, కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి పోయేందుకు మనసు రాలేదని మండిపడ్డారు. 

లక్ష కోట్లు కేసీఆర్​ పాలైనయ్
కాళేశ్వరం వరద పాలైందని, రూ. లక్ష కోట్లు కేసీఅర్ పాలయ్యాయని షర్మిల ఆరోపించారు. ఆయన అవినీతి తేలాలంటే కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలను సవాల్ చేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్​లో చేరిన అక్రమ రాజకీయ నేత అని ఆరోపించారు. ఎల్లూరు పంప్ హౌస్​ మునిగితే దిక్కులేదని, రెండు మోటార్లు మునిగినా ప్రభుత్వానికి బాగు చేయించే సోయిలేదని అన్నారు. టీఆర్ఎస్ లీడర్లు కమీషన్ల కోసమే తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదన్నారు. మాజీ మంత్రి జూపల్లి, -హర్షవర్ధన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండి రోడ్డున పడి కొట్టుకుంటున్నారని ఎద్దెవా చేశారు. సోమశిల వంతెన నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని జూపల్లిని షర్మిల డిమాండ్ చేశారు.