
సికింద్రాబాద్, వెలుగు: సనత్ నగర్ సెగ్మెంట్ సమగ్ర అభివృద్ధి సాధించాలని , తనను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని పలు చర్చిలను ఆమె సందర్శించారు. అనంతరం బన్సీలాల్ పేటలోని ఐడీహెచ్ కాలనీలో కాంగ్రెస్ శ్రేణులతో ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాను సనత్ నగర్లోనే ఉంటానని ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నారు. బస్తీ వాసులకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి అధికార పార్టీ నోళ్లు మూత పడ్డాయని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి, రమేశ్, మల్లం రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బన్సీలాల్ పేటలో ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.