బాలాపూర్, వెలుగు: మాట్లాడుకుని వివాదం పరిష్కరించుకుందామంటూ పిలిచి ఓ యువకుడిని అతడి స్నేహితులు కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ సిటీకి చెందిన ఫహాద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బల్కసూర్(29), సయ్యద్ బిన్ ఫైసల్ బాన్, సాలం భామ్ స్నేహితులు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. లావాదేవీల విషయంలో బల్కసూర్ కు.. మిగతా ఇద్దరితో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో గొడవలను సామరస్యంగా పరిష్కరించకుందామని రెహమాన్ బల్కనూర్ను ఫైసల్ బాన్, సాలం భామ్బాలాపూర్ పరిధిలోని బార్కాస్ సలాలా మరియం కాలనీకి సోమవారం తెల్లవారుజామున పిలిపించారు. అక్కడికి వచ్చాక వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఫైసల్ బాన్, సాలం భామ్ తమ వెంట తెచ్చుకున్న కత్తులతో బల్కసూర్ను విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.
