- ఇతర పారామెడికల్ స్టాప్ సరిపోని దుస్థితి
- వానాకాలం విష జ్వరాల సీజన్ మొదలవుతుండటంతో మరింత భయం
- ఏటా ఈ టైంలో వేల సంఖ్యలో మలేరియా, డెంగ్యూ, విష జ్వరాల కేసులు
- కరోనా వ్యాప్తి, డాక్టర్లు లేకపోవడంతో ట్రీట్మెంట్ ఎట్లాగనే ఆందోళన
రాష్ట్రంలోని సర్కారీ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్, ఓపీ గందరగోళంగా మారాయి. ఇప్పటికే డాక్టర్ల కొరత. మంజూరైన పోస్టులే తక్కువంటే.. అందులో మూడోవంతు ఖాళీయే. ఉన్న డాక్టర్లలోనూ కరోనా బారినపడ్డవాళ్లు కొందరు, క్వారంటైన్ అవుతున్నోళ్లు మరికొందరు, కరోనా ట్రీట్ మెట్ కోసం స్పెషల్ గా డ్యూటీ చేస్తున్న వాళ్లు ఇంకొందరు.. జ్వరమొచ్చిందని దవాఖానాకు పోతే చూసే దిక్కుండని పరిస్థితి నెలకొంటోంది. ఇక నర్సులు, ఇతర పారామెడికల్ స్టాఫ్ కూడా బాగా తక్కువగా ఉన్న దుస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీల నుంచి టీచింగ్ ఆస్పిటళ్ల దాకా ఇదే పరిస్థి తి. ఇంకో రెండు వారాల్లో రాష్ట్రంలో కరోనా కేసులు 12 వేలు దాటుతాయని హెల్త్ డిపార్ట్ మెంటే అంచనా వేసింది. దీనికితోడు వానాకాలం మొదలవడం, విష జ్వరాల సీజన్ కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఏటా ఈ సీజన్ లో మలేరియా, డెంగీ, చికున్ గున్యా ఇతర విష జ్వరాలు వ్యాప్తిస్తుంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలూ ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ దాకా కూడా పెద్ద సంఖ్యలో పేషెంట్లు దవాఖానాలకు వస్తుంటారు. ఇప్పుడీ కరోనా వ్యాప్తి, డాక్టర్లు అందుబాటులో లేకపోవ డంతో హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ పరిస్థితి ఏమిటన్న ఆందోళన కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం పీహెచ్సీల నుంచి టీచింగ్ హాస్పిటళ్ల దాకా డాక్టర్ పోస్టులు 7,029 ఉంటే.. అందులో 2,2 00కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన టీచింగ్ హాస్పిటళ్లలోనే వందల సంఖ్యలో ఖాళీలు వెక్కిరిస్తున్నయి. వరంగల్ ఎంజీఎంలో 1,476 పోస్టులకు 826 మంది డాక్టర్లే ఉన్నారు. మిగతా 644 పోస్టులు ఖాళీగా ఉన్నయి. ఆదిలాబాద్ రిమ్స్ లో 209 పోస్టు లకు 116 మందే ఉండగా.. నిజామాబాద్ హాస్పిటల్లో 311 పోస్టులకు కేవలం104 మంది రెగ్యులర్ డాక్టర్లు మాత్రమే ఉన్నరు. మరో 83 మందిని కాంట్రాక్ట్ బేస్ పైనే తీసుకున్నారు. వందకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నయి. ఇలా ప్రతి హాస్పిటల్లోనూ పెద్ద సంఖ్యలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. ఇక నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పరిస్థితీ ఇట్లాగే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారీ దవాఖాన్లలో 30 వేల వరకు బెడ్స్ఉన్నాయి. రూల్స్ ప్రకారం మూడు షిఫ్టులు కలిపి 18 నుంచి 20 వేల మంది నర్సులు ఉండాలి. కానీ కేవలం 4,473 మంది రెగ్యులర్ నర్సులు మాత్రమే పనిచేస్తున్నారు. గాంధీ దవాఖానాలో 2 వేల బెడ్లకు సుమారు వెయ్యి మంది నర్సులు కావాల్సిఉంటే .. 350 మంది మాత్రమే పని చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఇటీవల 16 వందల మంది నర్సులను కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ పద్ధతి లో తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నా ఇప్పటికీ ఆ రిక్రూట్మెంట్ పూర్తి చేయలేదు. ఇంకో 15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు 12 వేలు దాటుతాయని హెల్త్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. ఆ తర్వాతా పెరిగే ప్రమాదం ఉందని ఎక్స్ ఫర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ల కొరత మరింత ఇబ్బంది కరంగా మారనుంది. అసలే వానా కాలం డెంగీ, మలేరియా, ఇతర విషజ్వరాలు సోకే పరిస్థితి ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉన్న డాక్టర్లలో పలువురికి కరోనా
అసలే డాక్టర్ల కొరత ఉంటే.. ఉన్న డాక్టర్లకు కరోనా సోకుతుండటం కలవరపెడుతోంది. ప్రధానంగా హైదరాబాద్ లో వేగంగా విస్తరిస్తున్న కరోనా బారిన పడుతున్న డాక్టర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 100 మందికిపైగా సోకింది. నిమ్స్, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటల్స్లోని డాక్టర్లకు కరోనా వస్తుండడంతో… కొందరు ట్రీట్ మెంట్కు, మరికొందరు క్వారంటైన్కు వెళ్తున్నా రు. దీంతో పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఆగిపోతోంది. పీజీ డాక్టర్లకు కూడా పాజిటివ్ వస్తుండడంతో చాలా హాస్పిటళ్లలో ఓపీ సేవలు ఆగిపోతున్నాయి. ఈ కారణంతోనే నిమ్స్ లో కొన్ని డిపార్ట్ మెంట్లను పూర్తిగా మూసేశారు. సర్జరీలు కూడా ఆగిపోయాయి. వానలు పడుతుండడంతో దగ్గు, జలుబు, డెంగీ, మలేరియా లాంటి కేసులు పెరుగుతున్నాయి. వారిని చేర్చుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు వెనుకాడుతున్నాయి. ఒకవేళ చేర్చుకున్నా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.
13 మంది ఉండాల్సిన చోట నలుగురే..
ఐసీయూ ట్రీట్మెంట్ రూల్స్ ప్రకారం ప్రతి పది బెడ్లకు ఇద్దరు రెగ్యులర్ డాక్టర్లు, ఒక ప్రొఫెసర్, ప్రతి బెడ్ కు ఒక నర్స్, ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయి ఉండాలి. 65 బెడ్లు ఉన్న గాంధీ ఐసీయూ వార్డులో షిఫ్టుకు నలుగురే రెగ్యులర్ డాక్టర్లు, ఆరుగురు నర్సులు, ఇద్దరు ముగ్గురు వార్డు బాయ్స్ ఉంటున్నారని అక్కడి డాక్టర్లు చెప్తున్నారు .
పేరుకే ‘టిమ్స్’.. అందరూ కాంట్రాక్టే..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను దవాఖానాగా మార్చారు. కరోనా స్పెషల్గా ఏర్పాటు చేశామన్న ఈ టిమ్స్ లో ఒక్క ఉద్యోగిని కూడా నియమించలేదు. ఇటీవల 499 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది కూడా కాంట్రాక్ట్ రిక్రూట్మెంటే కావడం గమనార్హం. ఒక ఏడాదికిగానీ, లేదా అవసరమైనంత మేరకు గానీ ఈ ఉద్యోగాలు ఉంటాయని సర్కారు ప్రకటించింది. అయితే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి టీచింగ్ పోస్టులను సైతం కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం ఏమిటని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
ఏ హాస్పిటల్ లో చూసినా ఖాళీలే..
..వరంగల్ ఎంజీఎంలో 1,476 పోస్టులకు 644 ఖాళీ..
..ఆదిలాబాద్రిమ్స్లో 209 డాక్టర్లకుగాను 93 ఖాళీయే.
..నిజామాబాద్ హాస్పిటల్లో 311 పోస్టులకు 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
.. గాంధీ హాస్పిటల్లో సుమారు 800 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 300కుపైగా అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నయి.
.. ఉస్మానియా హాస్పిటల్లో ఖాళీలు పెద్దగా లేకున్నా..గాంధీ హాస్పిటల్ ను పూర్తిగా క్లోజ్ చేయడంతో.. ఉస్మానియాకు పేషెంట్లు భారీగా పెరిగారు. కొన్ని విభాగాల్లో బెడ్లు సరిపోవడం లేదు. డాక్టర్లపై ఒత్తిడి పెరిగింది.
..నీలోఫర్ ఆస్పత్రిలో 40 పోస్టుల డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ
సీజనల్ వ్యాధులు ప్రబలితే ఎట్లా?
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఏటా వానాకాలంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్నా యి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. గతేడాది 13,361 డెంగీ, 1,711 మలేరియా, 1,374 చికున్ గున్యా కేసులు రికార్డయ్యా యి. అనధికారికంగా జిల్లాల్లో ఇంతకు నాలుగు రెట్లకేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెంగీ కేసులు ఏటా పెరుగుతున్నయే తప్ప తగ్గడం లేదు. 2015లో రా ష్ట్రవ్యాప్తంగా1,830 డెంగీ కేసులు రాగా.. ఐదేళ్లలో ఏడు రెట్లు పెరిగాయి. ఇక ఏటా వేలమందిని బలిగొంటున్న విష జ్వరాలు సర్కారు లెక్కలోకే రావడం లేదు. ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాల్లో గతేడాది ఐదు లక్షల దికిపైగా విష జ్వరాలు సోకినట్లు ఆయా జిల్లాల్లోని హెల్త్ డిపార్ట్ మెంట్ లెక్కలే చెబుతున్నాయి. ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, ఖమ్మం, మహబూబ్నగర్ లు డెంగ్యూ హైరిస్క్ జిల్లాలుగా.. కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్ లు మలేరియా హైరిస్క్ జిల్లాలుగా మెడికల్ ఆఫీసర్లు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో విష జ్వరాల కేసులు ఎక్కు వగా వచ్చేచాన్స్ ఉందని స్పష్ట మవుతోంది. కరోనా విజృంభిస్తున్న ఈ టైంలో సీజనల్ జ్వరాలు ప్రబలితే.. ట్రీట్మెంట్ ఎలానో తెలియని పరిస్థితి అని డాక్టర్లు అంటున్నా రు. గతేడాది ఇదే సీజన్లో డెంగీ ప్రబలినప్పుడు గాంధీలో బెడ్లు సరిపోక కొందరికి వరండాలో ట్రీట్ మెంట్ చేశారన్నారు.