హైదరాబాద్, వెలుగు: నీట్ లీకేజీ స్కామ్పై ఈడీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఇది దేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద ఎంట్రెన్స్ పేపర్ లీక్ స్కామ్ అని అన్నారు. గొర్రెల పంపిణీ వంటి వాటిపైనే ఈడీని ప్రయోగించే మోదీ.. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ లీక్ అయిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపించారని, ఒక్కో స్టూడెంట్కు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు నీట్ రాసిన 24 లక్షల మందికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని సంజయ్ని నిలదీశారు.