న్యూఢిల్లీ: దేశంలో 75% జనాభా అధిక భూకంప ప్రమాద జోన్లో ఉందని, భూకంపాల నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా హాజరైన పిటిషనర్ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ప్రశ్నించింది. “అయితే అందర్నీ చంద్రుడిపైకి తరలించాలా? లేక ఇంకెక్కడికైనా పంపాల్నా?” అని ప్రశ్నించింది.
పిటిషనర్ జవాబిస్తూ, గతంలో ఢిల్లీ మాత్రమే అధిక భూకంప జోన్లో ఉందనుకునేవాళ్లమని, ఇప్పుడు కొత్త అధ్యయనాల ప్రకారం దేశంలో 75 శాతం జనాబా డేంజర్ జోన్లోనే ఉన్నట్లు తేలిందని గుర్తుచేశారు. అయితే, అది విధానపరమైన పని అని, సుప్రీం కోర్టు ఏమీ చేయలేదని చెబుతూ.. పిటిషన్ను బెంచ్ తోసిపుచ్చింది.

