ఈవీలతో లాభాలే కాదు.. సమస్యలూ ఉన్నయ్!

ఈవీలతో లాభాలే కాదు.. సమస్యలూ ఉన్నయ్!

న్యూఢిల్లీ: న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌ దగ్గర పడుతోంది కాబట్టి ఆటో కంపెనీలు, కార్ల డీలర్లు ఆఫర్లను గుమ్మరిస్తున్నారు. డిస్కౌంట్లూ  ఇస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్‌‌‌‌ కార్ల సంఖ్యా పెరుగుతోంది. ఎందుకంటే పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ ధరలు ఎక్కువ అవుతున్నాయి. వీటివల్ల కాలుష్యం పెరుగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మామూలు కారు కొనడం మంచిదా.. ఎలక్ట్రిక్‌‌‌‌ కారు తీసుకోవడం మంచిదా ? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఎలక్ట్రిక్‌‌‌‌ కారు కొనాలని ఉన్నా దీని గురించి చాలా సందేహాలు ఉన్నాయి. చార్జింగ్‌‌‌‌ ఎలా ? తగినన్ని చార్జింగ్‌‌‌‌ పాయింట్లు ఉన్నాయా ? వంటి డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడైతే ఎలక్ట్రిక్‌‌‌‌ కార్ల మార్కెట్‌‌‌‌ ప్రారంభదశలోనే ఉంది. అయితే వీటికి ఇన్‌‌ఫ్రాను పెంచడానికి, రాయితీల కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. 2026 నాటికి ఎలక్ట్రిక్‌‌‌‌ కార్ల వాటా 12 శాతానికి పెరుగుతుందని అంచనా. అంతేకాదు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సేల్స్‌‌‌‌ 109 శాతం పెరిగాయి.  ఇటువంటి పరిస్థితుల్లో రెండింట్లోని మంచి చెడులు ఏంటో చూద్దాం...

 ఈవీలతో ఇవీ లాభాలు

ఎలక్ట్రిక్‌‌‌‌ కార్లకు ఫ్యూయల్‌‌‌‌, మెయింటెనన్స్‌‌‌‌ వంటి ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి మామూలు కారులో రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే నెలకు కరెంటుకు పెట్రోల్‌‌‌‌/డీజిల్‌‌‌‌కు రూ.ఐదు వేల దాకా ఖర్చవుతుంది. ఎలక్ట్రిక్‌‌‌‌ కారు అయితే రూ.800 లోపే ఖర్చవుతుంది. ఐదేళ్లకు మెయింటెనెన్స్‌‌‌‌ ఖర్చులు రూ.25 వేలు మించవని టాటా ప్రకటించింది. అయితే పవర్ టారిఫ్‌‌‌‌లను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరో సంగతి ఏమిటంటే ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ వల్ల కాలుష్యం ఉండదు.    శబ్దం రాదు. సెక్షన్‌‌‌‌ వీటి కొనుగోలుపై రూ.1.5 లక్షల వరకు పన్ను లాభాలు పొందవచ్చు. పర్సనల్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌కు గ్రీన్‌‌‌‌ట్యాక్స్‌‌‌‌ ఉంటుంది. ఎలక్ట్రిక్‌‌‌‌ వేరియంట్లకు   రోడ్‌‌‌‌, రిజిస్ట్రేషన్‌‌‌‌ చార్జీలూ ఉండవు. జీఎస్టీ ఐదు శాతం మాత్రమే. కొన్ని రాష్ట్రాలు ఒక్కో యూనిట్‌‌‌‌పై రూ.10 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నాయి. 

ఇవీ సమస్యలు:

ఎలక్ట్రిక్‌‌‌‌ కార్ల ధరలు చాలా ఎక్కువ. అయితే ఫ్యూయల్‌‌‌‌, రన్నింగ్‌‌‌‌, మెయింటెనెన్స్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ తక్కువే అయినా బీమా ఖర్చులు ఎక్కువ. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ చార్జింగ్‌‌‌‌ పాయింట్లు లేవు. కొన్ని పబ్లిక్‌‌‌‌, ప్రైవేటు కంపెనీలు పెట్రోలు బంకుల వద్ద, ఇతర ప్రాంతాల్లో చార్జింగ్‌‌‌‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. మరో సమస్య ఏంటంటే.. ఫాస్ట్‌‌‌‌ చార్జర్‌‌‌‌ వాడినా పూర్తి చార్జింగ్‌‌‌‌కు గంట వరకు పడుతుంది. ఇంట్లోనూ చార్జర్‌‌‌‌ ఉండటం తప్పనిసరి. ఎక్కువ దూరం ప్రయాణాలకు ఇవి అనువుగా ఉండవు. మనదేశంలో ఎలక్ట్రిక్‌‌‌‌ కార్ల మోడల్స్‌‌‌‌ ఐదుకు మించడం లేదు. మరో ఆరు మోడళ్లు వచ్చే ఏడాది లాంచ్‌‌‌‌ అవుతున్నాయి. వీటి బ్యాటరీల ధర చాలా ఎక్కువ. మూడునాలుగేళ్లకు ఓసారి బ్యాటరీలను మార్చాలి.

ఇంతకీ ఏ కారు కొనాలి ?

పర్యావరణానికి మేలు చేయాలి.. కాలుష్యం తక్కువ విడుదల చేసే బండి కావాలంటే మాత్రం ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్‌‌‌‌ బెస్ట్‌‌‌‌. ఈవీ ధర ఎక్కువే అయినా నిర్వహణ ఖర్చు తక్కువ కాబట్టి సమస్య ఉండదు. తగినన్ని చార్జింగ్‌‌‌‌ పాయింట్లు ఉన్న మెట్రో సిటీల జనం కూడా ఎలక్ట్రిక్‌‌‌‌ కార్లను ప్రయత్నించవచ్చు. మిగతా ప్రాంతాల జనం మాత్రం కరెంటు కారు కొనేందుకు మరో రెండుమూడేళ్లు ఆగడం మంచిది.