
టీమిండియా ప్లేయర్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా బౌలర్ బుమ్రా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్కు దూరం కాగా..అటు వెన్ను గాయంతో శ్రేయాస్ అయ్యర్ తొలి టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా శ్రేయాస్ అయ్యర్ రెండో టెస్టులోనూ ఆడటం కష్టంగా మారింది. వెన్ను గాయం నుంచి శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకోకపోవడంతో..ఢిల్లీ వేదికగా జరిగే సెకండ్ టెస్టులో అతను ఆడేది అనుమానమే.
వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అయ్యర్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం గాయంతో జట్టుకు దూరమైన ప్లేయర్...మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలంటే ..కనీసం ఒక దేశవాళీ మ్యాచ్ అయినా అడాలి. కానీ రెండో టెస్టుకు మరో 3 రోజులే మిగిలి ఉంది. ఈ సమయంలో శ్రేయస్ కోలుకున్నా..అతను నేరుగా రెండో టెస్ట్ ఆడే అవకాశం లేదు.
శ్రేయాస్ క్రికెట్కు దూరమైన నెలరోజులైంది. ప్రస్తుతం ఇరానీ కప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియా, మధ్య ప్రదేశ్ మధ్య మార్చి 1 నుంచి 5 వరకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒక వేళ ఈ మ్యాచులో ఆడితే మాత్రం..తన ఫిట్ నెస్ను నిరూపించుకుని శ్రేయాస్ జట్టులోకి రావచ్చు.
చివరి టెస్టులకు మయాంక్ అగర్వాల్?
ఆసీస్తో జరగబోయే చివరి రెండు టెస్టులకు మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అతను ఇప్పటికే రంజీ ట్రోఫీలో ఫాం నిరూపించుకున్నాడు. 249 పరుగులతో రాణించాడు. దీంతో కర్నాటక రంజీ ట్రోఫీలో సెమీస్ కు చేరింది. ఈ నేపథ్యంలో చివరి రెండు టెస్టులకు సెలక్టర్లు మయాంక్ ను ఎంపిక చేసే ఛాన్సుంది.
రెండో టెస్టులో కేఎల్ రాహుల్ ఔట్..?
ఫాం లేమితో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ టీమిండియాకు భారంగా మారాడు. ఎన్ని అవకాశాలిచ్చినా అతను ఉపయోగించుకోవడం లేదు. ఇక తొలి టెస్టులో భీకర ఫాంలో ఉన్న గిల్ ను కాదని..కెప్టెన్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ కు ఛాన్సిచ్చాడు. కానీ అందివచ్చిన అవకాశాన్ని రాహుల్ ఉపయోగించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టే అవకాశాలున్నాయి. అతని స్థానంలో శుభ్ మన్ గిల్ ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.
నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది. ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్ లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ ఆలోచిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.