సిద్దిపేట రూరల్, వెలుగు: కొద్ది నెలలుగా డాక్టర్ గా చెప్పుకుంటూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో తిరుగుతున్న వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నంగునూరు మండలం రాజగోపాల్ పేటకు చెందిన భాను అనే యువకుడు సిద్దిపేటలో ఉంటున్నాడు. డాక్టర్ కావాలని అనుకుని కాలేకపోయాడు. దీంతో డాక్టర్గా రెడీ అయి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తిరుగుతున్నాడు.
ఆపరేషన్ థియేటర్ లోకి సైతం వెళ్లడంతో అనుమానం వచ్చి ఆస్పత్రి ఆర్ఎంవో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ వాసుదేవరావు తెలిపారు.

