
సిద్దిపేట, వెలుగు : ‘సిద్దిపేట జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కష్టపడింది బీఆర్ఎస్ అయితే.. దానిని ప్రారంభించేందుకు సీఎం రేవంత్రెడ్డి కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో కొత్తగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అందరి దృష్టిలో అది ఫ్యాక్టరీ అయితే.. తన దృష్టిలో మాత్రం ఓ ఎమోషన్ అని, వేలాదిమంది రైతుల జీవితంలో మార్పు తీసుకొచ్చే ఫ్యాక్టరీ అని అన్నారు. నంగునూరు ప్రాంతంలో గతంలో కరువు తాండవించేదని, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన సాగునీటి పనులు, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల కారణంగా భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెరిగాయన్నారు.
సిద్దిపేటలో ఆయిల్పామ్ సాగు చేద్దామని ప్రయత్నం చేసిన మొదట్లో.. గాలిలో తేమశాతం తక్కువ ఉండడంతో ఇక్కడ ఆ పంట సాగు కష్టమని తేల్చారని గుర్తు చేశారు. తర్వాత అనంతగిరి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్తో పాటు చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నింపడంతో గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఆయిల్పామ్ సాగు చేసుకోవచ్చని 2021లో ప్రకటించారని చెప్పారు.
ఆయిల్పామ్ సాగు కారణంగా రైతులకు ప్రతి నెల ఆదాయం వస్తుందన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని, జిల్లాకో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం నాగరాజుపల్లెకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.