డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో విజయాలను అందుకుని హీరోగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ రెండు చిత్రాలను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా, తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మంగళవారం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్తో ఈ సినిమాను ప్రకటించారు.
ఇందులో పెద్ద గన్తో పాటు విలేజ్ బ్యాక్డ్రాప్ను చూపించారు. ‘లాక్డ్.. లోడెడ్.. నో బ్రేక్స్.. నో ఫిల్టర్స్..’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక సిద్ధుకి హీరోగా ఇది ఆరో చిత్రం కాగా, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న 40వ సినిమా. ఇందులో సిద్ధు జొన్నలగడ్డను సరికొత్త అవతార్లో చూడబోతున్నారని నిర్మాతలు తెలియజేశారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
