మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన మార్గశిరమాసం కొనసాగుతుంది. ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయన్నది పండితులు చెబుతున్నారు. శీర్షం... అంటే శిరసు...అని అర్ధం. ఈ మాసంలో పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం కాబట్టి ఈ మాసానికే మార్గశిరమని వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. .
మార్గశిర మాసం కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.
మార్గశిర మాసంలో ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసంలో లక్ష్మీ పూజ చెయ్యడం శుభప్రదంగా భావిస్తారు. ఈ వ్రతం చేస్తే ఆర్థికంగా బలపడతారని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది ( 2025) మార్గశిర మాసం మొదటి గురువారం నవంబర్ 27 వ తేది వచ్చింది. గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ, ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద. ఆరోగ్య భాగ్యం చేకూరతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఎలా పూజ చేయాలి
- బ్రహ్మ ముహూర్తానికి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నీరు చల్లండి.
- పూజ స్థలంలో పీటను ఏర్పాటు చేసి.. కొత్త వస్త్రాన్ని ఉంచి దానిపై కొద్దిగి బియ్యం పోసి మధ్యలో కలశాన్ని ఏర్పాటు చేయండి. దానికి ఎర్రటి వస్త్రాన్ని చుట్టండి.
- లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని కాని ... చిత్రపటాన్ని కాని ప్రతిష్టించి పూలతో అలంకారం చేయండి.
- పీట ముందు రంగులతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. దీనిలోని నాలుగు గీతలు.. నాలుగు వేదాలను సూచిస్తాయి.
- దీపారాధన చేయండి.
- లక్ష్మీనారాయణులను ఆహ్వానించండి. కలశం దగ్గర పసుపుతో దేవత పాదముద్రలు వేయండి. దీనివల్ల లక్ష్మిదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఆర్థిక సమస్యలను దూరం చేస్తుందని నమ్మకం.
- విష్ణుసహస్రనామం చదవండి.. లక్ష్మీదేవిని పూజించండి.
- పసుపు పూలతో పూజించండి. పసుపు, కుంకుమ, గంధం సమర్పించండి.
- మార్గశిరమాసం లక్ష్మీవారం కథ చదవండి.
- అగర్ బత్తీలు వెలిగించి ధూపం సమర్పించండి.
- లక్ష్మికి ఖీర్ (బియ్యం పాయసం) నైవేద్యంగా పెట్టండి. అలాగే విష్ణువుకు చిన్న పళ్ళెంలో బెల్లం, శనగపప్పు సమర్పించండి.
- సమృద్ధికి గుర్తుగా పసుపు పువ్వులు, కొన్ని నాణేలు, స్వీట్లు అమ్మకి అర్పించండి. దీంతో కుటుంబ సబ్యులకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు పండితులు.
ఏ మంత్రాన్ని పఠించాలి..
- ఓంశ్రీమహాలక్ష్మ్యై నమః.. అనే లక్ష్మీ మంత్రం 108 సార్లు చదవండి..
- ఓంశ్రీమహాలక్ష్మీవిద్మహే... విష్ణుపత్న్యైచాధీమహి ...తన్నోలక్ష్మీ ప్రచోదయాత్..అంటూ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపించండి.
సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి.. సాయంత్రం తులసి కోట దగ్గర 16 వత్తులతో దీపారాధన చేయండి. సాయంత్రం హారతి తర్వాత నైవేద్యంగా పెట్టిన ఖీర్ని స్వీకరించి ఉపవాసం విరమించండి.
ఈ వ్రతం చేయడం వలన గత జన్మ పాపాలను, కర్మ అడ్డంకులను తొలగిపోయి... మానసిక స్పష్టత, కుటుంబ సామరస్యం, భౌతిక శ్రేయస్సునుకలుగుతుంది. ఆధ్యాత్మిక వృద్ధిని పెంచుతుంది. లక్ష్మి, విష్ణువు ఇద్దరి ఆశీర్వాదాలు కలుగుతాయని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
