సిమ్ స్వాపింగ్ తో దోపిడీకి పాల్పడుతున్న ముఠా
ముంబై గ్యాంగ్ తో కలిసి దోచేస్తున్న నైజీరియన్
శని, ఆదివారాల్లో నైజీరియా నుంచే ఆపరేషన్
సైబరాబాద్ పోలీసులకు చిక్కిన ముంబై ముఠా
హైదరాబాద్, వెలుగు: శని, ఆదివారాలు.. అంతా వీకెండ్ మూడ్లో ఉండే రోజులు. కానీ, ఓ నైజీరియన్ ముఠాకు అవే పని రోజులు. వ్యక్తుల ఫోన్ నంబర్లను టార్గెట్ చేయడం.. వారి సిమ్ కార్డులను బ్లాక్ చేయడం.. అదే నెంబర్తో కొత్త సిమ్ తీసుకోవడం.. ఆ నంబర్తో లింకైన బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి ఖాతా ఖాళీ చేయడం. ఇదే వాళ్ల పని. 2011 నుంచి ముంబై అడ్డాగా సాగుతోందీ సిమ్ స్వాపింగ్ దోపిడీ. ముంబైకి చెందిన ఈ గ్యాంగ్ లోని ఐదుగురిని గురువారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఫేక్ ఆధార్ కార్డులు,4 రబ్బర్ స్టాంపులు, 15 ఫోన్లు, కంపెనీల లెటర్ ప్యాడ్లు, సిమ్ కార్డులు, స్వైపింగ్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మాస్టర్మైండ్ నైజీరియన్పై రెడ్కార్నర్ నోటీసులు జారీ చేశారు. కేసు వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
ఫిషింగ్ మెసేజ్లు పంపి..
నైజీరియాకు చెందిన జేమ్స్ సిమ్ స్వాపింగ్లో మాస్టర్మైండ్. నైజీరియా నుంచే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పేరుతో ఫిషింగ్ మెసేజ్లను పంపి కార్పొరేట్ కంపెనీల మెయిల్స్నూ హ్యాక్ చేసేవాడు. కంపెనీల బ్యాంక్ అకౌంట్స్, నెట్ బ్యాంకింగ్, ఆ అకౌంట్లతో లింకైన ఫోన్ నంబర్ల వివరాలు సేకరించేవాడు. ఆ వివరాలతో దోపిడీలకు పాల్పడేందుకు ముంబైలో మీరారోడ్కు చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లే (34)తో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. ముంబైకే చెందిన అహ్మద్ మునీర్(28), సోహెబ్ షేక్(25), ఆదిల్ హసన్ అలీ సయీద్(32), జునైద్ అహ్మద్ షేక్(32), అశ్విన్ నారాయణ షేర్గర్(40)లను ఆ ముఠాలో చేర్చాడు. వీళ్లు శని, ఆదివారాల్లో ఆ ఫోన్ నంబర్లను బ్లాక్ చేసి.. హ్యాక్ చేసిన కంపెనీల ఫేక్ లెటర్ ప్యాడ్లతో అదే నెంబర్పై కొత్త సిమ్కార్డులు తీసుకునేవాళ్లు. తర్వాత రాత్రి 11.30 నుంచి ఒంటి గంట మధ్యలో నైజీరియా నుంచే జేమ్స్ నెట్ బ్యాంకింగ్ చేసేవాడు. చంద్రకాంత్ తన వద్ద ఉన్న ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలను జేమ్స్కు చెప్పేవాడు. ఐఎంపీఎస్ ద్వారా సొమ్ము కాజేసేవాడు. ట్రాన్సాక్షన్ అయ్యాక ఆ మొత్తాన్ని ముంబై గ్యాంగ్ అకౌంట్లోకి పంపించేవాడు. కమీషన్ పోనూ మిగతా డబ్బును బిట్కాయిన్స్, హవాలా రూపంలో తిరిగి జేమ్స్కు ముంబై ముఠా పంపించేది.
గంటల వ్యవధిలోనే..
గతేడాది జూన్ 21న మాదాపూర్లోని ఓ కంపెనీకి చెందిన వ్యక్తి సిమ్కార్డ్ బ్లాక్ అయింది. సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే.. ఆ నంబర్తో మరో సిమ్ కార్డు తీసుకున్నట్టు చెప్పారు. దీంతో తన కొటక్ మహీంద్రా బ్యాక్ అకౌంట్లోకి నెట్బ్యాంకింగ్ లాగిన్ కోసం ప్రయత్నించాడు. నెట్బ్యాంకింగ్ ఐడీ, పాస్వర్డ్ మారినట్టు తెలుసుకున్నాడు. తర్వాత కొద్ది సేపటికే రూ.4.25 లక్షలు అతడి ఖాతా నుంచి మాయమయ్యాయి. మూడు ట్రాన్సాక్షన్లతో ఆ సొమ్మును ముఠా కొట్టేసింది. దీంతో సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అక్టోబర్లోనూ మరో బాధితుడి అకౌంట్ నుంచీ రూ.6.75 లక్షలు కొల్లగొట్టారు. ఈ రెండు కేసుల్లో బాధితుల బ్యాంకు ఖాతాల ఆధారంగా ముంబై గ్యాంగ్ సొమ్మును దోచేసినట్టు పోలీసులు గుర్తించారు.
సిమ్కార్డులు హ్యాక్ అవుతయ్
ఫిషింగ్ మెయిల్స్, లింక్స్తో జాగ్రత్తగా ఉండండి. నెట్బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్స్తో లింకైన ఫోన్ నంబర్లను బయటి వాళ్లకు ఇవ్వొద్దు. సిమ్ కార్డులు హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిమ్లో ఎలాంటి సమస్యలొచ్చినా సర్వీస్ ప్రొవైడర్లను వెంటనే సంప్రదించాలి. సిమ్ కార్డు పోయినా,
బ్లాక్ అయినా వెంటనే కంపెనీకి కంప్లయింట్ చేయాలి. – సజ్జనార్, సైబరాబాద్ సీపీ
ఇవి కూడా చదవండి
4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?
హఫీజ్పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు
చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!
ఫేస్ బుక్-వాట్సప్లలో చర్చిస్తారు.. ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తారు