చిన్న పరిశ్రమలకు నేరుగా.. సింగరేణి బొగ్గు సప్లై హైదరాబాద్లో విక్రయ కేంద్రం ఏర్పాటు

చిన్న పరిశ్రమలకు నేరుగా.. సింగరేణి బొగ్గు సప్లై హైదరాబాద్లో విక్రయ కేంద్రం ఏర్పాటు
  • హైగ్రేడ్, లోగ్రేడ్​ కలిపి రవాణాకు చర్యలు
  • కస్టమర్లు చేజారకుండా అధికారుల నిర్ణయం
  • అధిక ఆదాయమే టార్గెట్​గా ప్లాన్  
  • కొత్త కస్టమర్లతోనూ అగ్రిమెంట్

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, ​సోలార్, హైడల్​విద్యుత్​తయారీలో దూసుకెళ్తుండగా.. తాజాగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో చిన్న పరిశ్రమలకు బొగ్గును విక్రయించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. తద్వారా సంస్థకు నేరుగా నగదు లభించడంతో పాటు రవాణా ఖర్చు తగ్గుతుందని, బొగ్గు అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.  ప్రస్తుతం ఉత్పత్తి అయ్యే బొగ్గులో 80 శాతం మన రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లోని విద్యుత్ కేంద్రాలకు సప్లై చేస్తోంది. 

మరో 20 శాతం సిమెంటు, పింగాణి, గాజు తదితర 2 వేల చిన్న పరిశ్రమలకు అందిస్తోంది. ఈ ఏడాది 76మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. బొగ్గును కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రధానంగా రైల్వే ద్వారా తరలించుకుపోతున్నారు.ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సింగరేణి బొగ్గు క్వాలిటీగా ఉండడంతో కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వినియోగదారులు రోడ్డు మార్గంలో బొగ్గును తీసుకెళ్తున్నారు.

అయితే తక్కువ బొగ్గు అవసరమైన వారికి తీసుకెళ్లడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిశ్రమలకు హైదరాబాద్​లో ప్రత్యేకంగా బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్​నిర్ణయించారు. అందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. 

హైదరాబాద్​సమీప ప్రాంతాల్లో బొగ్గుకు మంచి డిమాండ్​ఉంది. రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తే టన్నుకు రూ.1,600 వరకు ఖర్చు అవుతుంది. అదే రైల్వే ద్వారా హైదరాబాద్​కోల్​డంప్​యార్డ్​కు తరలిస్తే టన్నుకు కేవలం రూ.500 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్​లో విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తే కస్టమర్లకు బొగ్గు తక్కువ ధరకే విక్రయించవచ్చని ఆఫీసర్లు భావిస్తున్నారు. 

బొగ్గు గ్రేడ్​లను మిక్స్​చేసి రవాణా చేసేందుకు.. 

సింగరేణి సంస్థ రోజుకు సుమారు 2.10లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అదేస్థాయిలో బొగ్గు రవాణా కూడా జరుగుతోంది. రోజుకు సుమారు రూ.5 కోట్ల విలువైన బొగ్గు  సప్లై అవుతోంది. కోల్​వాసరీ ద్వారా క్వాలిటీ బొగ్గు అందించే చాన్స్ ఉన్నా, వాసరీలో సుమారు 40శాతం బొగ్గు వృథాగా పోతోంది. మిగిలిన 60 శాతం మాత్రమే చేతికి వస్తుంది. ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం కస్టమర్లకు క్వాలిటీ గ్రేడ్​బొగ్గు ఇవ్వకపోతే నష్టపరిహారం కూడా సింగరేణి చెల్లించాల్సి ఉంటుంది.

గ్రేడ్​లను మిక్స్​చేసి రవాణా చేయడం మేలని భావించింది. ఇప్పటికే బొగ్గు సరఫరాలో జాయింట్​షాంప్లింగ్​విధానంలో థర్డ్​పార్టీ క్వాలిటీ పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా సత్తుపల్లి ప్రాంతంలో ఒక కోల్​వాసరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  ఇటీవల కొత్త వినియోదారులతో బొగ్గు సప్లైకి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. 

ఇప్పటికే  సింగరేణి ఎన్టీపీసీ, జెన్​కోతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు అమ్ముతోంది.  కొత్తగా గత నెల 15న చత్తీస్​గఢ్ లోని దుర్గాపూర్​ ఎన్​ఎస్​పీసీఎల్​పవర్ ప్లాంట్​కు 5 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు అగ్రిమెంట్​చేసుకుంది. దీంతో పాటు మరిన్ని సంస్థలతో ఒప్పందం కోసం సింగరేణి సంప్రదింపులు చేస్తోంది. 

వినియోగదారులు చేజారకుండా..

సింగరేణి ఉత్పత్తి చేస్తున్న జి–-15 గ్రేడ్​ బొగ్గును తీసుకునేందుకు థర్మల్​విద్యుత్​కేంద్రాలు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా రోజుకు 42 రేకుల(బొగ్గు తీసుకవెళ్లే గూడ్స్​రైళ్లు) బదులు 34  రేక్​లే రవాణా అవుతున్నాయి. దీంతో  8 రేక్​ల( సుమారు 32వేల టన్నులు) బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయి. నిల్వ ఉన్న బొగ్గు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దగ్ధమయ్యే పరిస్థితులున్నాయి. మిగతా పరిశ్రమల కంటే సింగరేణి బొగ్గుకు ధర ఎక్కువగా ఉండటంపై వినియోగదారులు చాలాసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో సంస్థ ఉత్పత్తి చేస్తున్న జి–10, జి–11, జి–13, జి–14, జి–15తో పాటు మరికొన్ని గ్రేడ్​లను కలిపి జి–-13గ్రేడ్​గా మార్చి క్వాలిటీ బొగ్గును కస్టమర్లకు సప్లై చేయాలని సంస్థ నిర్ణయించింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని సీహెచ్​పీల్లో అన్ని గ్రేడ్​లను కలిసి జి–-13 బొగ్గు సరఫరా చేయాలని జీఎంలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆర్జీ---–1 ఏరియాలో జి–-8 గ్రేడ్ కొనసాగేలా, అలాగే ఆర్జీ-– 2 ఏరియాలో జి–-11 గ్రేడ్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎండీ ఆదేశించారు.