
- 272 పోస్టులకు ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణ
- ఎగ్జామ్ రాసిన 12,045 మంది అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 64.57 శాతం హాజరు నమోదైంది. 12,045 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత శనివారం మూడు షిఫ్టులలో జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, మేనేజ్ మెంట్ ట్రెయినీ (ఎఫ్అండ్ఎ), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మేనేజ్ మెంట్ ట్రెయినీ హైడ్రోజియాలజిస్ట్, మేనేజ్ మెంట్ ట్రెయినీ సివిల్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, మేనేజ్ మెంట్ ట్రెయినీ (ఐఈ), సబ్ ఓవర్సీర్ ట్రెయినీ సివిల్ పోస్టులకు పరీక్ష నిర్వహించగా మొత్తం11,724 మంది అభ్యర్థులకు గాను 7,073 మంది అభ్యర్థులు(60.53 శాతం) హాజరయ్యారు.
అలాగే 21న రెండు షిఫ్టులలో మేనేజ్ మెంట్ ట్రెయినీ( మైనింగ్), మేనేజ్ మెంట్ ట్రెయినీ (పర్సనల్) పోస్టులకు పరీక్ష నిర్వహించగా 6,931 అభ్యర్థులకు గాను 4,972 మంది (71.73శాతం) అభ్యర్థులు పరీక్షలకు అటెండ్ అయ్యారు. మొత్తమ్మీద 18,665 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా..12,045 మంది (65శాతం)పరీక్షలకు హాజరయ్యారు. ఆదివారం సీఎండీ బలరామ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
త్వరలోనే కీ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో ఎవరి ప్రమేయం ఉండదని, ఎలాంటి రికమండేషన్ లకు తావు లేదన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని.ఎవరైనా మోసగాళ్లు మాయ మాటలు చెప్తే విజిలెన్స్ విభాగం, పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని బలరామ్ కోరారు.