టార్గెట్ ​రీచ్ అయ్యేందుకు సింగరేణి మల్లగుల్లాలు

టార్గెట్ ​రీచ్ అయ్యేందుకు సింగరేణి మల్లగుల్లాలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : బొగ్గు ఉత్పత్తి టార్గెట్ ​రీచ్ అయ్యేందుకు సింగరేణి సంస్థ మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 45.36 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 40.26 మిలియన్​ టన్నులు మాత్రమే తీసింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి ఇంటర్నల్​గా 74 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని యాజమాన్యం నిర్దేశించుకుంది. అధికారికంగా 70 మిలియన్​ టన్నులు ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో కోల్ ప్రొడక్షన్​ భారీగా తగ్గింది. దీనికి తోడు ఓసీల్లో ఓవర్ బర్డెన్​ పనులు అనుకున్న ప్రకారం జరగలేదు. అది కూడా ప్రొడక్షన్ ​తగ్గడానికి కారణమైంది. సరైన ప్రణాళికలు రూపొందించడంలో యాజమాన్యం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి.

వేర్వేరు కారణాలు..

ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్ లో ఈ ఏడాది 7,32,692 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్​ పెట్టుకోగా ఇప్పటి వరకు ఒక్క బొగ్గు పెళ్ల బయటికి రాలేదు. కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీలో సాంకేతిక, రక్షణ కారణాలతో 1.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాలేదు. మొత్తంగా యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా 40.26 మిలియన్​టన్నుల బొగ్గును తీసి, 89 శాతంతో సరిపెట్టుకుంది. ఆర్జీ–1, మణుగూరు, ఆర్జీ–2 ఏరియాల్లో మాత్రమే వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి సాధించారు. ఓసీపీ(ఓపెన్​కాస్ట్​ప్రాజెక్ట్)​ల నుంచి 39.60 మిలియన్​టన్నులకు గానూ 36.17 మిలియన్​ టన్నులు, యూజీఎం(అండర్​గ్రౌండ్​ మైన్స్) నుంచి 57.65 లక్షల టన్నులకు 40.90లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. 

కార్మికుల్లో అసంతృప్తి

బొగ్గు ఉత్పత్తికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు కీలకంగా మారాయి. టార్గెట్​ రీచ్​ అయ్యేందుకు యాజమాన్యం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏమీ ప్రకటించకపోవడంతో కార్మికులు కొంత అసంతృప్తితో ఉన్నారు. మరో వైపు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ టైంలో ఎన్నికలు నిర్వహిస్తే బొగ్గు ఉత్పత్తికి   ఆటంకం కలిగే అవకాశం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టార్గెట్​ రీచ్​ అయ్యే దిశగా కంపెనీ డైరెక్టర్లు, ఏరియాల జీఎంలతో సీఎండీ శ్రీధర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.