ఆఫీసర్ల సొంత అవసరాలకే అంబులెన్స్​లు .. పట్టించుకోని ఉన్నతాధికారులు

ఆఫీసర్ల సొంత అవసరాలకే అంబులెన్స్​లు .. పట్టించుకోని ఉన్నతాధికారులు
  • సింగరేణిలో అంబులెన్స్​ల దుర్వినియోగం
  • ముగ్గురు పైలట్​లు ఉండాల్సి ఉన్నా.. ఇద్దరితోనే కొనసాగింపు
  • వరుస డ్యూటీలతో ప్రమాదాల బారిన అంబులెన్స్ లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి హాస్పిటల్స్ ​అంబులెన్స్​లను ఆఫీసర్లు సొంత అవసరాలకు వినియోగిస్తున్నారు. పేషెంట్ల పరిస్థితులను పట్టించుకోవడం లేదు. కొత్తగూడెంలో ఉన్న మెయిన్ ​హాస్పిటల్ తోపాటు ఇల్లెందు ఏరియాలోని అంబులెన్స్​లను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. ఇల్లెందు ఏరియాకు చెందిన సింగరేణి అంబులెన్స్​ను ఓ డాక్టర్​ తన సొంత అవసరాలకు వాడుకుంటుండగా విజిలెన్స్ ​సిబ్బంది పట్టుకున్నారు. ఇదే పరిస్థితి సింగరేణి వ్యాప్తంగా పలు హాస్పిటల్స్​ల్లో ఉన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. 

టెండర్​ ద్వారా మెయింటెనెన్స్...

జిల్లా కేంద్రంలోని సింగరేణి మెయిన్​ హాస్పిటల్​తోపాటు ఇల్లెందు, మణుగూరు ఏరియా హాస్పిటల్స్ ల్లో నాలుగు చొప్పున అంబులెన్స్​లున్నాయి. కొత్తగూడెంలో మరో రెండు సంజీవని పేరుతో నడుస్తున్నాయి. రుద్రంపూర్​డిస్పెన్సరీలో మరో అంబులెన్స్​కూడా ఉంది. టెండర్​పద్ధతిలో అద్దె ప్రాతిపదికన అంబులెన్స్​లను సింగరేణి యాజమాన్యం వినియోగిస్తోంది. అత్యవసర సమయాల్లో పేషెంట్లను ఇంటి నుంచి హాస్పిటల్​కు, ఏరియా హాస్పిటల్స్​నుంచి కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​ హాస్పిటల్​కు, రిఫరల్​పేషెంట్స్ ను హైదరాబాద్​లోని వివిధ హాస్పిటల్స్​కు తరలించేందుకు అంబులెన్స్​లను వాడుతారు. మైన్స్​యాక్సిడెంట్స్ ​టైంలోనూ ఇవే అంబులెన్స్​లను వినియోగిస్తుంటారు. 

ఇష్టారాజ్యంగా ఇల్లెందు డాక్టర్ తీరు..​

ఇల్లెందు ఏరియా హాస్పిటల్​లో పని చేస్తున్న ఓ డాక్టర్​సొంత అవసరాలకు ఇష్టారాజ్యంగా అంబులెన్స్​లను వాడుతున్నారు. డాక్టర్​ బంధువులు కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లో ఉంటారు. ఇల్లెందు నుంచి కొత్తగూడెం మెయిన్ ​హాస్పిటల్​కు పేషెంట్లను తీసుకెళ్లినప్పుడల్లా ఈ అంబులెన్స్ దాదాపు పది కిలోమీటర్ల దూరంలోని రుద్రంపూర్​కు డాక్టర్ బంధువుల ఇంటికి వెళ్తుంది. బంధువులను ఇల్లెందుకు తీసుకెళ్లి ఇంటి వద్ద వదులుతుంటారు. ఈ క్రమంలోనే గతమంగళవారం ఇల్లెందు నుంచి పేషెంట్​ను కొత్తగూడెంలోని మెయిన్​ హాస్పిటల్​కు అంబులెన్స్​లో తీసుకొచ్చారు. అక్కడ దింపాక అంబులెన్స్ ​రుద్రంపూర్​లోని డాక్టర్ బంధువుల ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న సింగరేణి విజిలెన్స్ ​సిబ్బంది నిఘా వేసి పట్టుకున్నారు. విచారించగా పలుమార్లు అంబులెన్స్ డాక్టర్ బంధువుల ఇంటికి వస్తున్నట్టు వెల్లడైంది. అంబులెన్స్​లో పేషెంట్ తోపాటు బంధువుల రాకపోకలు కామన్​గా మారింది. 

ట్రాన్స్ పోర్టు వెహికల్స్​గా అంబులెన్స్ లు..

కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ ​హాస్పిటల్​లోని అంబులెన్స్​లను ట్రాన్స్ పోర్టు వెహికల్స్​గా వాడుతున్నారు. పట్టణంలోని హోల్ సెల్ మెడికల్ షాపుల నుంచి మెడిసిన్స్​ను తెచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు కార్గో, ఇతర షాపుల నుంచి మెడిసిన్స్​ను తెచ్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్​లను వాడుతున్నారు. అందుకు వేరే వాహనాలను వాడాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టి అంబులెన్స్​లనే వాడుతుండడంలో ఆంతర్యమేమిటో సింగరేణి ఆఫీసర్లకే తెలియాలి. ఇటీవలే టెండర్​ గడువు ముగిసిన రెండు అంబులెన్స్​లను ఆఫీసర్లు పక్కన పెట్టారు. ఎక్స్​టెన్షన్ అడిగితే కుదరదు అని చెప్పిన ఆఫీసర్ల మాటలు రెండు రోజుల్లోనే మారాయి. వాటికి ఎక్స్ టెన్షన్ ​ఇవ్వడం చర్చానీయాంశంగా మారింది. 

ముగ్గురి జీతాలిస్తున్నా.. డ్యూటీలో ఇద్దరే..

ప్రతి అంబులెన్స్​కు ముగ్గురు డ్రైవర్లు ఉండాలి. కాని ఇద్దరితోనే యజమానులు సాగిస్తున్నారు. ఒక్కో అంబులెన్స్​కు ముగ్గురు డ్రైవర్ల జీతాలను సింగరేణి చెల్లిస్తున్నా ఇద్దరినే వినియోగిస్తూ మరో డ్రైవర్ జీతాన్ని జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా సింగరేణి అధికారులు, విజిలెన్స్ వారు పట్టించుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడ్తొందనే విమర్శలున్నాయి. పలు అంబులెన్స్​లకు ఫిట్ నెస్ లేకున్నా నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో కొత్తగూడెం మెయిన్​హాస్పిటల్​ నుంచి హైదరాబాద్​కు పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్​టైర్ వీల్​ ఆక్సిల్ విరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కొంత కాలం తర్వాత ఇదే అంబులెన్స్​మరో పేషెంట్​ను హైదరాబాద్​కు తరలిస్తుండగా నార్కాట్ పల్లి వద్ద డివైడర్​ను ఢీకొంది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వరుస డ్యూటీలు చేస్తున్న డ్రైవర్లు​ నిద్ర మత్తులో ప్రమాదాలు అవుతున్నాయనే మాట వినిపిస్తోంది. 

విచారించి చర్యలు తీసుకుంటాం..

నిబంధనల ప్రకారం ఒక్కో అంబులెన్స్​కు ముగ్గురు డ్రైవర్లుండాలి. ఇద్దరే అన్న విషయం మా దృష్టికి రాలేదు. ఇల్లెందు ఏరియా హాస్పటల్ అంబులెన్స్​సొంత అవసరాలకు రుద్రంపూర్ ​వెళ్లిన విషయం తెలియదు. ఎంక్వైరీ చేయిస్తాం. కార్గో, బయటి షాపుల నుంచి మెడిసిన్స్, ఇతరత్రా అవసరాలపై కూడా విచారిస్తాం.

వెంకటేశ్వరరావు, చీఫ్ ​మెడికల్ ఆఫీసర్, సింగరేణి