- పైప్ ద్వారా నీటిని అందించిన రెస్క్యూ టీం
- గని వద్ద బైఠాయించిన కార్మికుల కుటుంబాలు
రామగుండం: సింగరేణి ఆర్జీ 3 పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్పి) గనిలో నిన్న జరిగిన ప్రమాదంలో శిధిలాల కింద చిక్కుకున్న బదిలీ వర్కర్ రవీందర్ స్పందించాడు. తాను క్షేమంగా ఉన్నాననని బదిలీ వర్కర్ రవీందర్ జవాబు ఇచ్చాడు. దీంతో రెస్క్యూ టీం మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. శిధిలాలకు జాగ్రత్తగా రంద్రం చేస్తూ పైప్ లైన్ వేసి బదిలీ రవీందర్ కు తాగునీరు పంపారు. మిగిలిన ముగ్గురి జాడ కోసం రెస్క్యూ కొనసాగుతోంది.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని సింగరేణి ఆర్జీ 3 పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్పి) గనిలో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు బొగ్గు కూలిన విషయం తెలిసిందే. గనిలోని 86వ లెవెల్లో 540 మీటర్ల లోతులో వెహికల్స్ను పనిస్థలాలకు తీసుకెళ్లే మార్గంలో వారం క్రితం కూలిన బొగ్గును మెషీన్లతో క్లియర్ చేస్తుండగా, 30 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల మందంతో మరోసారి బొగ్గు మీద పడింది. పనిని పర్యవేక్షిస్తున్న మేనేజర్ బ్రాహ్మాజీ బొగ్గు పడుతున్న విషయాన్ని గమనించి పరిగెత్తగా, అక్కడే ఉన్న ఏరియా సేప్టీ ఆఫీసర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ తేజావత్ చైతన్యతేజ, ఓవర్మెన్ పిల్లి నరేశ్, వెల్డింగ్ పనులు చేస్తున్న బదిలీ వర్కర్ రవీందర్, ఫ్రంట్ బ్రేక్ లోడర్ (ఎఫ్బీఎల్) మెషీన్ ఆపరేటర్ జాడి వెంకటేశ్వర్లు, హెల్పర్గా పనిచేసిన అవుట్ సోర్సింగ్ (వీటీసీ) కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ బొగ్గు పెళ్లల కింద చిక్కుకుని గల్లంతయ్యారు.
ముగ్గురి వెలికితీత
ప్రమాదంలో గల్లంతైన ఏడుగురిలో ఇవాళ ఉదయం వరకు ముగ్గురిని బయటకు తీశారు. సపోర్ట్ మేన్ వీరయ్య, ఆపరేటర్ జాడి వెంకటేష్, మైనింగ్ సర్దార్ పిల్లి నరేష్ బయటపడ్డారు. మరో నలుగురు శిధిలాల కిందనే ఉండడంతో వెలికితీత కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. కొద్దిసేపటి క్రితం బదిలీ వర్కర్ రవీందర్ టచ్ లోకి రావడంతో అతనికి పైప్ లైన్ ద్వారా నీటిని పంపారు. మిగిలిన వారిలో సిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, జెన్కో ట్రైనీ తోట శ్రీకాంత్, సేఫ్టీ ఆపీసర్ జయరాజు ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
గని వద్ద కార్మికుల కుటుంబాలు
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా.. శిధిలాల కింద చిక్కుకున్న వారి కుటుంబాలు అక్కడే ఉండి ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. భార్యా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులంతా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ వివరాలు తెసుకుంటూ క్షణమొక యుగంలా ఎదురు చూస్తున్నారు. గని వద్ద కార్మికుల కుటుంబాలు శోకసముద్రంలో కంటతడి పెట్టుకుని తల్లడిల్లుతున్నాయి.
ఇవాళ రాష్ట్రపతి సేఫ్టీ అవార్డు తీసుకోనున్న సింగరేణి
సెఫ్టీ విషయంలో సింగరేణి సంస్థ ఈరోజు రాష్ట్రపతి నుండి నేషనల్ అవార్డు తీసుకోవాల్సి ఉంది. నేషనల్ అవార్డు తీసుకోడానికి ఒకరోజు ముందు ప్రమాదం జరిగింది. లేటెస్ట్ సెఫ్టీ టెక్నాలజీ ప్రవేశ పెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. యేటా 10 నుంచి 12 కార్మికులు గని ప్రమాదంలో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఆమె ఆరోగ్యానికి ఆఖరి ప్రయారిటీ ఎందుకు ?
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్