ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

పంటపొలాలపైనా యుద్ధమా?

ఉక్రెయిన్ లో ని పంట పొలాలను సైతం రష్యా ధ్వంసం చేస్తోందని, చివరకు ఆకలిని కూడా ఒక ఆయుధంగా మలచుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. బుధవారం ఐర్లాండ్​ పార్లమెంట్​నుద్దేశించి ఆయన మాట్లాడారు. రైతుల పంట పొలాలు, వ్యవసాయ పనిముట్లను రష్యా బలగాలు ధ్వంసం చేస్తున్నాయని, ఉక్రెయిన్ రేవుల నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆకలిని కూడా వాళ్లు ఆయుధంగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలో వ్యవసాయం ఎక్కువగా చేసే దేశాల్లో ఉక్రెయిన్​ కూడా ఒకటి. ఎగుమతులకు రష్యా అడ్డంకులు సృష్టించడం వల్ల ఆసియా, ఆఫ్రికాల్లోని చాలా పేద దేశాలకు తిండి గింజలు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో తిండికి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ఆకలి కేకలు పెరిగే ప్రమాదముంది’’ అని జెలెన్​స్కీ అన్నారు. మానవతా కోణంలో వివిధ దేశాలు పంపిస్తున్న సాయాన్ని రష్యా అడ్డుకుంటోందని, సముద్రం, నేలను మొత్తం గుప్పిట్లో పెట్టుకుందన్నారు. తిండి, నీళ్లు, మందులు సహా అన్నింటినీ అడ్డుకుంటోందని చెప్పారు. రష్యాపై ఈయూ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలన్నారు. యుద్ధం వల్ల మారారని,167 మంది పిల్లలు చనిపోయారని చెప్పారు. 

ఉక్రెయిన్ జెండాను ముద్దాడిన పోప్​ 

బూచాలో రష్యా సృష్టించిన మారణ హోమంపై పోప్​ ఫ్రాన్సిస్ ​ఆవేదన వ్యక్తం చేశారు. వాటికన్​ సిటీ ఆడిటోరియంలో వీక్లీ ప్రసంగం సందర్భంగా ఆయన.. ఉక్రెయిన్​ జాతీయ జెండాను ముద్దాడారు. ఉక్రెయిన్​లో ఇటీవలి పరిణామాలు కలచివేస్తున్నాయన్నారు. మహిళలు, పిల్లలపైనా అరాచకాలకు పాల్పడడం దారుణమన్నారు. గతంలో బూచా ప్రజలే తనకు ఈ జాతీయ జెండాను పంపించారని చెప్పిన ఆయన.. దానిని ఎగరేశారు.

ఈస్ట్​, సౌత్ ఉక్రెయిన్​పై దాడులు 

ఇన్నాళ్లూ పశ్చిమ ఉక్రెయిన్​పై తీవ్ర దాడులు చేసిన రష్యా ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్​పై పట్టు సాధించేందుకు దాడులను మరింత తీవ్రం చేసింది. లుహాన్స్క్, డాన్బాస్, డొనెట్స్క్​తో పాటు ఇతర ప్రాంతాలపై ఎయిర్​స్ట్రైక్స్​కు పాల్పడుతోంది. మరియుపోల్​లో మానవతా సంక్షోభం తీవ్రంగా ఉందని, రష్యా దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆ సిటీ మేయర్​ వాదిమ్​ బోయ్చెంకో ఆవేదన వ్యక్తం చేశారు. 

రష్యాలో 'చానల్' హ్యాండ్ బ్యాగ్స్ చించేస్తున్రు

రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ఆ దేశంలో తమ బ్యాగులు వాడొద్దని చెప్పిన ఫ్రెంచ్ కంపెనీ ‘చానెల్’కు రష్యన్ మహిళలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచిన ఖరీదైన చానెల్ బ్రాండ్ బ్యాగ్ లను కట్ చేసి, చించేస్తూ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  రష్యాకు చెందిన సెలెబ్రిటీ మహిళలు ఖరీదైన 'చానల్' బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ కట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 'మాకు, మా దేశ గౌరవానికి మించి ఏ బ్రాండు ఎక్కువ కాదు' అని చెప్తున్నారు. 

పుతిన్ బిడ్డలపై ఈయూ ఆంక్షలు 

రష్యాపై అన్ని రకాల ఆంక్షలు విధిస్తున్న పశ్చిమ, యూరప్​ దేశాలు.. మరో అడుగు ముందుకేశాయి. ఇప్పటికే రష్యా ప్రముఖులు, రాజకీయ నాయకులు, డిప్లమాట్లు, వ్యాపారవేత్తలపై ఆంక్షలు విధించిన ఈయూ దేశాలు.. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూతుళ్లపైనా ఆంక్షలు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. సైనికులను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన రష్యా.. బూచా సిటీలో ఊచకోతలకు పాల్పడడంపై మండిపడుతున్న ఈయూ దేశాలు.. ఈ మేరకు కేటరీనా, మరియా వోరోనోత్సవాలను ఆంక్షల జాబితాలో చేర్చేందుకు చర్చిస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు 12 మంది రష్యన్ డిప్లమాట్​లను గ్రీక్ బహిష్కరించింది. 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వ్యూహం ప్రకారమే భారత వైఖరి

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఒక పక్షంవైపు నిలబడాల్సివస్తే అది శాంతి పక్షమేనని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. హింసకు వెంటనే ముగింపు పలికేందుకు తాము మద్దతు పలుకుతామన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై లోక్‎సభలో చర్చ సందర్భంగా విదేశాంగశాఖ మంత్రి వివరణ ఇచ్చారు. దేశ నమ్మకాలు, విలువలు, జాతీయ ప్రయోజనం, వ్యూహం ప్రకారమే భారత వైఖరి ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధానికి భారత్ వ్యతిరేకమన్నారు. అమాయకుల ప్రాణాలు తీయటం, రక్తపాతంతో పరిష్కారం లభించదన్నారు. ఐక్యరాజ్యసమితితో పాటు.. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే భారత వైఖరి స్పష్టం చేశామని జైశంకర్ అన్నారు. 

 

సాయం కోసం మెట్రో మాల్ ముందు బారులు

ఫిబ్రవరి 24 నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. యుద్ధంతో లక్షల మంది రోడ్డున పడ్డారు. నీళ్లు, తిండి లేక సాయం కోసం ఎదరుచూస్తున్నారు. ఒకప్పుడు 4 లక్షల మందితో ఉన్న మరియుపోల్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. నిత్యావసరాల కోసం మెట్రో మాల్ ముందు జనాలు బారులు తీరారు.  ఎవరైనా సాయం చేయకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మూసేయండి

కీవ్: ‘‘ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న దారుణాలు కన్పిస్తలేవా? మా దేశంలో జరుగుతున్న నరమేధం చూస్తుంటే ఐఎస్ టెర్రరిస్టులకు, రష్యాకు తేడా ఏమీ లేదనిపిస్తోంది. వెంటనే మీరు స్పందించండి. లేకపోతే భద్రతా మండలిని మూసేసుకోండి” అని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా మంగళవారం ఆయన భద్రతా మండలి సమావేశంలో వర్చువల్ గా మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్న డయీష్ టెర్రరిస్టులకు, బూచా సిటీలో నరమేధానికి పాల్పడిన రష్యన్ బలగాలకు తేడా లేదు. ఇక్కడ స్వయంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మెంబర్ గా ఉన్న దేశమే దారుణాలకు పాల్పడుతోంది. ఉక్రెయిన్ లో జరుగుతున్న దారుణాల గురించి ప్రపంచం ఇంకా పూర్తి స్థాయి నిజాలు తెలుసుకోవాల్సి ఉంది” అని జెలెన్ స్కీ చెప్పారు. 

రష్యా డిప్లమాట్లపై ఈయూ దేశాల బ్యాన్ 

ఉక్రెయిన్​లో రష్యా అరాచకాలకు యూరోపియన్​ యూనియన్​(ఈయూ) దేశాలు గట్టి కౌంటర్​ ఇచ్చాయి. రష్యా డిప్లమాట్​లపై బ్యాన్​ విధించాయి. జర్మనీ 40 మంది రష్యా డిప్లమాట్​లను, ఫ్రాన్స్​ 35 మందిని, ఇటలీ 30 మందిని, డెన్మార్క్ 15 మందిని, స్వీడన్ ముగ్గురిని దేశం నుంచి బహిష్కరించాయి. ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే, ఈ చర్యలను రష్యా ఖండించింది. తాము కూడా చర్యలు తీసుకుంటామని రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రీ మెద్వదేవ్​ హెచ్చరించారు. వెస్టర్న్​ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్​ ఇచ్చారు. రష్యా అప్పుల చెల్లింపులపై అమెరికా ఆంక్షలను విధించింది. సావరిన్ పేమెంట్లను నిలుపుదల చేసింది. డాలర్లలో డబ్బులు చెల్లించకుండా నిషేధం విధించింది. 

బూచాలో జెలెన్​స్కీ

రష్యా మారణకాండకు పాల్పడిందని చెప్తున్న బూచా సిటీకి జెలెన్​స్కీ వెళ్లారు. ప్రజల దీనస్థితిపై చలించిపోయారు. యుద్ధం ముగింపుకు చర్చలొక్కటే దారి అని, కానీ ఇంత దారుణాలకు పాల్పడిన పుతిన్ తో చర్చించలేనన్నారు. అయితే, బూచాలో దారుణాలు అంటూ ఉక్రెయిన్ విడుదల చేసిన ఫొటోలు ఫేక్ అని రష్యా ఖండించింది. 

కొనసాగుతున్న దాడులు

ఉక్రెయిన్ లో బూచా సహా పలు నగరాల్లో రష్యా సేనల  దాడులు ఆగడంలేదు.  ముఖ్యమైన సిటీలన్నింటిపై రష్యా ఎయిర్​స్ట్రైక్స్​చేస్తోంది. చెర్కేసీ, చెర్నివిట్సీ, దినిప్రోపెట్రోవ్స్క్​, ఇవానో ఫ్రాంకోవిస్క్, ఖార్కివ్, ఖెమెల్నిట్స్కీ, కిరోవోహ్రాద్, లవివ్, మైకోలైవ్, ఒడెసా, పోల్టావా, రివ్నే, సూమీ, టెర్నోపిల్, విన్నీట్షియా, వోలిన్, జకర్​పాట్యా, జపోరిఝియా, ఝైటోమిర్ ఓబ్లాస్ట్స్, కీవ్​లపై రాకెట్​లను ప్రయోగిస్తోంది. మైకోలైవ్​ సిటీపై చేసిన రాకెట్ దాడుల్లో 11 మంది పౌరులు చనిపోగా.. 61 మంది గాయపడినట్టు ఉక్రెయిన్​ మానవ హక్కుల ప్రతినిధి ల్యూడిమ్లా డెనిసోవా చెప్పారు. రుబీన్​లో నైట్రిక్​ యాసిడ్​ ట్యాంక్​ను రష్యా బలగాలు పేల్చేశాయని లుహాన్స్​క్​ గవర్నర్​ సెర్హీయ్​ హైదాయి చెప్పారు. ప్రజలెవరూ బాంబ్​ షెల్టర్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.  

పిల్లల వీపులపై వివరాలు

రష్యా చేస్తున్న దాడులతో ఎప్పుడు చనిపోయేది తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తాము చనిపోతే పిల్లలు ఏమైపోతారోనన్న భయంతో తల్లడిల్లిపోతున్నారు. ఒకవేళ తాము చనిపోతే తమ పిల్లలను చూసుకోవాలంటూ చిన్నారుల వీపులపై వివరాలను రాస్తున్నారు. వీపుపై వివరాలున్న ఓ చిన్నారి ఫొటోను అనాస్తాషియా లపాటీనా అనే ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు. ఫొటోను చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ షేర్ చేస్తున్నారు. 

  • కీవ్ - చెన్నిహైవ్ మధ్య డైరెక్ట్ రోడ్డు లింక్ పునరుద్ధరణ
     

ఉక్రెయిన్ నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించిన రష్యా.. చెప్పినట్లే మెల్లగా ఒక్కో ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోతోంది. ఉత్తర ఉక్రెయిన్ నుంచి రష్యా సైనికులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో  ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి చెర్నిహైవ్ మధ్య డైరెక్ట్ లింకు రోడ్డును పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ వియాచెస్లావ్ జాతీయ మీడియా టెలివిజన్ చానల్ లో ప్రకటించారు. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు సురక్షితమని ఉక్రెయిన్ సైన్యం నిర్ధారించే వరకు వేచి ఉండాలని సూచించారు. 
 

మనిషిలో ఉండకూడని లక్షణాలన్నీ రష్యా సైనికుల్లో కనిపిస్తున్నాయి: జెలెన్ స్కీ
 

ఉక్రెయిన్ ప్రజలపై రష్యా చేస్తున్న దాడులు దారుణమని మండిపడ్డారు అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇలాంటి అరాచకాలు రష్యా మరెక్కడా చేయకుండా చేయాలని అన్నారు. మనిషిలో ఉండకూడని లక్షణాలన్నీ రష్యా సైనికుల్లో కన్పిస్తున్నాయని.. వారికి హృదయం లేదని తెలిపారు. రష్యా చేసిన ప్రతి నేరంపైన విచారణ జరిపేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు జెలెన్ స్కీ. యుద్ధ విరమణ ఒప్పందంపై చర్చలకు రష్యా తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. బుచా సిటీలో జరిగిన ఘటనలు చూశాక రష్యాతో చర్చలు జరపడం కష్టమేనని అన్నారు జెలెన్ స్కీ.

రష్యా సైనికులు తిరిగి వెళ్తూ 400 మందిని చంపేశారు: బుచా మేయర్ ఫెడోరుక్

రష్యా సైనికులు తిరిగి వెళ్లే టైమ్ లో 400 వందల మందిని చంపేసినట్లు తెలిపారు బుచా మేయర్ ఫెడోరుక్. చర్చి దగ్గర ఒకే చోట 300 మందికి నైరుతి భాగంలోని చర్చి దగ్గర సాముహిక అంత్యక్రియలు నిర్వహించారు. వీటి శాటిలైట్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఉక్రెయిన్ తో రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి 165 మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం. మరో 266 మంది చిన్నారులు గాయపడినట్లు తెలిపింది.

  • ఉక్రెయిన్కు మరో 100 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన జపాన్

యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో జపాన్ సహా పలు దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలబడుతున్నాయి. ఉక్రెయిన్ కు జపాన్ వంద మిలియన్ డాలర్ల అదనపు సాయం ప్రకటించింది. దీంతో జపాన్ కు ఉక్రెయిన్ అందించిన సాయం ఇప్పటి వరకు 200 మిలియన్ డాలర్లకు చేరింది.

ఉక్రెయిన్ - రష్యా వివాదాల ముగింపు కోసం చైనా ముందడుగు
ఉక్రెయిన్- రష్యా వివాదాల పరిష్కారానికి ముగింపును ఆశిస్తూ ముందడుగు వేసింది చైనా. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దెమిత్రి కులేబాకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఫోన్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా మధ్య సమన్వయం కోసం చైనా ముఖ్య భూమిక పోషిస్తుందని వాంగ్ యీ తెలిపారు. సైనిక చర్యతో సామాన్యుల మృతిపై చైనా స్పందించిన తీరుకు ధన్యవాదాలు తెలిపారు దెమిత్రి.

ఉక్రెయిన్ ఎంపీ లీసా  వాసిలెంకో  ఆరోపణలు

రష్యా నీతి, జాతిలేని నేరస్తుల దేశమంటూ ఉక్రెయిన్ ఎంపీ లీసా వాసిలెంకో తీవ్ర ఆరోపణలు చేశారు. పౌరులను చంపడమే కాకుండా, ఆడవారిపై ఆత్యచారాలు చేశారని, ఈ మారణహోమాన్ని, రష్యా అధ్యక్షుడు పుతిన్​ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మరోవైపు రష్యా బలగాలు వెనక్కు వెళ్లాక కీవ్​కు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న 410 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్​ అధికారులు చెప్పారు. వాళ్లను రష్యా సైనికులు హింసించి అత్యంత కిరాతకంగా చంపారని తెలిపారు. బుచా సిటీలో 21 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. అందులో కొందరినీ చేతులు కట్టేసి కాల్చి చంపారని నిర్ధారించారు. కీవ్​కు పశ్చిమాన ఉన్న మోటీజిన్​లో సిటీ మేయర్, ఆమె భర్త, కొడుకు కళ్లకు గంతలు కట్టి చంపేశారని స్థానికులు తెలిపారు.

రష్యా అరాచకాలపై దర్యాప్తు చేస్తాం: జెలెన్​ స్కీ

యుద్ధంలో రష్యా అరాచకాలపై దర్యాప్తు చేస్తామని ఉక్రెయిన్​అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​స్కీ చెప్పారు. ప్రపంచం ఇప్పటిదాకా ఎన్నో యుద్ధ నేరాలను చూసిందని, తమపై రష్యా సాగిస్తున్న యుద్ధ నేరాలే చివరివి అయ్యేలా ప్రపంచం మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. రష్యా అరాచకాలను విచారించేందుకు ప్రపంచంలోని ముఖ్యమైన జడ్జిలు, లాయర్లతో ప్రత్యేక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. 

అన్నీ అబద్ధాలే: రష్యా

ఉక్రెయిన్ ఆరోపణలన్నింటినీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్​ ఖండించారు. ఉక్రెయిన్​ ప్రజలపై తాము ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని, అవన్నీ అబద్ధాలేనని సోమవారం ఐక్యరాజ్యసమితి స్పెషల్ ఎన్వాయ్ మార్టిన్ గ్రిఫిత్స్​తో సమావేశం సందర్భంగా చెప్పారు. ఇదంతా రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు చేస్తున్న ఆరోపణలనేనని ఆయన అన్నారు. యూఎన్ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరచాలంటూ రష్యా చేసిన విజ్ఞప్తిని.. ప్రస్తుతం భద్రతా మండలి చైర్​లో ఉన్న బ్రిటన్​ తోసిపుచ్చింది. అబద్ధాలు చెప్పేందుకు భద్రతా మండలిని రష్యా వాడుకుంటోందంటూ అమెరికా, బ్రిటన్​ మండిపడ్డాయి.

రెండు తున్కలైన రష్యా హెలికాప్టర్

రష్యన్ ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ ను ఉక్రెయిన్ బలగాలు స్టార్ స్ట్రీక్ లేజర్ గైడెడ్ మిసైల్ తో కూల్చేశాయి. మిసైల్ వచ్చి ఢీకొట్టగానే హెలికాప్టర్ రెండు ముక్కలై కూలిపోతున్న దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్  మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన లుహాన్స్క్ రీజియన్ లో జరిగిందని మీడియా తెలిపింది. బ్రిటన్ అందించిన స్టార్ స్ట్రీక్ మిసైల్ ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంగా దూసుకెళ్లి శత్రు విమానాలు, హెలికాప్టర్లను పేల్చేయగలదు. అలాగే ఇజియూమ్ ప్రాంతంలో రష్యాకు చెందిన సుఖోయ్ 35ఎస్ యుద్ధ విమానాన్ని కూడా నేలకూల్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ ఘటనలో పైలెట్ ఎజెక్షన్ సీటుతో ప్రమాదం నుంచి బయటపడగా, తాము పట్టుకున్నట్లు తెలిపింది.

ఒడెస్సా పోర్ట్ సిటీపై రష్యా క్షిపణి దాడులు 

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లాక్ సీలోని ఉక్రెయిన్ పోర్ట్ సిటీ ఒడెస్సాపై రష్యా మిసైల్ దాడులు జరుపుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ ఇంటీరియర్ మినిస్టర్ ప్రకటించారు. రష్యా క్షిపణి దాడులతో చాలా ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు 10 లక్ష ల జనాభా కలిగిన ఈ పోర్ట్ సిటీ ఇప్పటికి ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది.

శవాల కింద మందుపాతర్లు పెట్టి పోతున్రు

కీవ్: రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర సిటీల నుంచి వెనుదిరుగుతూ.. శవాల కింద మందుపాతర్లు పెట్టి పోతున్నాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. ఎక్కడ ఏ మందుపాతర పేలుతుందో తెలియక.. సాధారణ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. రష్యన్ బలగాలు తూర్పు ఉక్రెయిన్ పై ఫోకస్ పెట్టినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో మైన్​లను వరకు సురక్షితం కాదని ఆయన శనివారం ఓ వీడియో సందేశంలో ప్రజలను హెచ్చరించారు. రష్యన్ బలగాలు తూర్పు దిశగా ఫోకస్ పెడుతుండటంతో రానున్న రోజుల్లో పోరాటం మరింత తీవ్రం కావొచ్చని చెప్పారు. రష్యా బలగాల షెల్లింగ్ పూర్తిగా ఆగేదాకా అందరూ వెయిట్ చేయాలని సూచించారు. మరోవైపు మరియుపోల్ సిటీలో చిక్కుకున్న బాధితులను తరలించేందుకు తాము ప్రయత్నించగా వీలుకావడంలేదని శనివారం రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించింది. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని క్రీమియా నుంచి రష్యాను కలిపే ప్రాంతంలో మరియుపోల్ ను రష్యా అధీనంలోకి తీసుకుంది. 

రష్యా వ్యాపార వేత్త  ప్రైవేటు జెట్ ను అడ్డుకున్న బ్రిటన్

ఇప్పటికే రష్యాకు చెందిన ఓ వ్యాపార వేత్తకు చెందిన రెండు ప్రైవేట్ జెట్ విమానాలను సీజ్ చేసిన బ్రిటన్.. తాజాగా ఇవాళ మరో జెట్ ను అడ్డుకుంది. లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్టులో శనివారం టేకాఫ్ కు సిద్ధమైన ప్రైవేటు జెట్ ను అడ్డుకుని నిలిపేసింది. ఈ విషయాన్ని బ్రిటన్ రవాణాశాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో అనేక మంది అమాయకులు రక్తం చిందిస్తూ ఉంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకారంతో కోట్లు సంపాదించుకున్న వ్యాపారవేత్తలు శాంతియుతంగా స్వేచ్ఛగా గడుపుతుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

 

 

మైకోలైవ్ దాడి ఘటనలో 33కు చేరిన మృతులు
మైకొలైవ్ పట్టణంలోని పరిపాలనా భవనంపై గత మంగళవారం రష్యా జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 33కు చేరింది. రష్యా బాంబుల వర్షం కురిపించి క్షిపణుల దాడులతో విరుచుకుపడడంతో 9 అంతస్థుల ఈ భవన సముదాయం చాలా భాగం ధ్వంసమైంది. సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉద్యోగులు విధులకు హాజరవుతున్న విషయం గమనించిన రష్యా.. దాడి చేయడానికి ముందు భవనంలోకి ఉద్యోగులు వచ్చే వరకు వేచి ఉండి.. ఆ తర్వాతే దాడి చేసిందని ప్రాంతీయ గవర్నర్ ఆరోపించారు.  
 

 

యుద్ధంలో ఇప్పటి వరకు 158 మంది చిన్నారుల మృతి
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి తెరదించేందుకు ఓ వైపు జోరుగా చర్చలు జరుగుతూ ముందడుగు వేస్తున్నా.. రష్యా మాత్రం వెనుకడుగు వేసినట్లే వేస్తూ క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. శిధిల భవనాల్లో, చివరకు శవాల మాటున క్లైమోర్ మైన్స్ ను అమరుస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ పై గత ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 158 మంది చిన్నారులు చనిపోయారని, మరో 254 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన రష్యాపై నమోదు చేసిన కేసులు వివరాలను వెల్లడించారు.

 

ఉక్రెయిన్–రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నయి. ఇన్నాళ్లకు రెండు దేశాల చర్చల్లో పురోగతి వచ్చింది. కీవ్, చెర్నిహివ్ నుంచి తమ బలగాలు ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. కీవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి పిలిపిస్తామని రష్యా రక్షణశాఖ మంత్రి అలెగ్జాండర్ ఫొమిన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. జెనీవా ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని ఉక్రెయిన్ చెప్పిందన్నారు. ఇక.. సమస్య పూర్తిగా సమసిపోయే వరకు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్నారు టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్. త్వరలోను పుతిన్, జెలెన్ స్కీ భేటీ కూడా ఉంటుందన్నారు.

రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్

ఉక్రెయిన్, రష్యా యుద్ధం మరో మలుపు తీసుకుంది. సొంతభూమిపై పుతిన్ సేనల దాడులను దీటుగా ఎదుర్కొంటూ వచ్చిన ఉక్రెయిన్ ఆర్మీ.. తొలిసారి రష్యా భూభాగంపై అటాక్ చేశాయి. బార్డర్ కు 35 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరోద్ లో ఉన్న చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ సైనికులు శుక్రవారం తెల్లవారుజామున హెలికాప్టర్ల ద్వారా బాంబులు కురిపించారు. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్ కోవ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. చమురు కేంద్రం నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని, వాటిని ఆర్పేందుకు 170 మంది సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ దాడిపై వ్యాఖ్యానించేందుకు ఉక్రెయిన్ రక్షణ మంత్రి దిమిత్రో కులేబా నిరాకరించారు. 

పెరిగిన రేడియేషన్.. చెర్నోబిల్ నుంచి రష్యా సైన్యం వెనక్కి..!

ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి. అక్కడ రేడియేషన్ స్థాయిలు పెరగడంతోనే సైన్యం వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారిక విద్యుత్ కంపెనీ ఎనర్జో ఆటమ్ ప్రకటించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తునకు సిద్ధమైనట్లు సమాచారం. 

 

చర్చల విషయంలో రష్యాను నమ్మలేం

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు ముగించేందుకు రాజీ దిశగా చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు మొగ్గుచూపాయి. అయితే చర్చల ద్వారా పాజిటివ్ సంకేతాలు వస్తున్నా.. రష్యాను పూర్తిగా నమ్మలేమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్, చెర్నిహైవ్ సమీపంలో సైనిక కార్యకలాపాలను తగ్గించుకునేందుకు రష్యా చర్చల్లో అంగీకరించింది. అయితే ఇది పూర్తిగా ఉక్రెయిన్ సైనికుల వల్లే సాధ్యపడిందని జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ సైనికుల ధైర్యవంతమైన చర్యల వల్లే రష్యా వెనక్కి తగ్గిందన్నారు. రాజీ అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ  నిర్లక్ష్యంగా ఉండొద్దని, పరిస్థితులు ఇంకా పూర్తిగా మెరుగు పడలేదని అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగించే అవకాశాలున్నాయని, ఉక్రెయినియన్లు ప్రతిఘటనను కొనసాగించాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. దేశ సౌభ్రాతృత్వం, భౌగోళిక సమగ్రతపై ఉక్రెయిన్  ప్రతినిధులు ఎప్పటికీ రాజీ పడబోరని ఆయన స్పష్టం చేశారు.

కోటి మంది వలస.. 20 వేల మంది మృతి

ఉక్రెయిన్​లోకి యుద్ధ ట్యాంకులను నడిపించాలంటూ పుతిన్​ ఆదేశించి నెలరోజులు దాటింది.. కీవ్​ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికులు మిసైళ్ల వర్షం కురిపించారు. రష్యా దాడుల నేపథ్యంలో దాదాపు కోటి మందికి పైగా ఉక్రెయిన్​ ప్రజలు తమ ఇల్లూవాకిలి వదిలి వలస వెళ్లిపోయారు. ప్రెసిడెంట్​ జెలెన్​స్కీ చెప్పిన వివరాల ప్రకారం.. 20 వేల మంది పౌరులు చనిపోయారు. నగరాలన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రష్యా చేసిన ప్రకటన ఉక్రెయిన్​ వాసులకు ఊరట కలిగించింది. యుద్ధం ఆగిపోతుందనే నమ్మకం కలుగుతోందని వాళ్లు అంటున్నారు. కాగా, రష్యా ప్రకటనపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల ప్రెసిడెంట్లతో మాట్లాడతానని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ చెప్పారు. మరోవైపు, రష్యా ప్రకటనతో యురప్​ స్టాక్​ మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. నూనె ధరలు ఐదు శాతానికి పైగా దిగొచ్చాయి. డాలర్​తో రూబుల్​ మారక విలువ 10 శాతం తగ్గింది.  

 

రష్యా పడవను స్వాధీనం చేసుకున్న బ్రిటన్

లండన్ లో నిలిపి ఉంచిన రష్యా వ్యాపారవేత్త పడవ స్వాధీనం చేసుకుంది బ్రిటన్. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన వెంటనే రష్యా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు తీవ్ర హెచ్చరికలు జారీ చేసి ఆపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యాతో అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఆంక్షలను ఆచరణలో చూపేలా తొలిసారిగా రష్యా వ్యాపారవేత్తకు చెందిన విలాసవంతమైన ప్రైవేటు పడవను స్వాధీనం చేసుకున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.

 

శాంతి చర్చల్లో విష ప్రయోగం?

ఉక్రెయిన్​ తరఫున గతంలో రష్యాతో శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యన్​ బిజినెస్​మ్యాన్ రోమన్​ అబ్రామోవిచ్ తో పాటు మరొకరిపై విషప్రయోగం జరిగిందని అధికార వర్గాల సమాచారం. ఈ నెల మొదట్లో జరిగిన శాంతి చర్చల సందర్భంగా ఒబ్రావిచ్​ అనారోగ్యం పాలయ్యారు. శాంతి చర్చల్లో సానుకూల ఫలితాలు రావొద్దనే ఉద్దేశంతో రష్యా తిరుగుబాటుదారులే ఈ పని చేసి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై అబ్రామోవిచ్​ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఇస్తాంబుల్​లో జరిగే శాంతి చర్చలకు ఉక్రెయిన్​జాగ్రత్తలు తీసుకుంది. మీటింగ్​లో ఎలాంటి ఆహార పదార్థాలు, డ్రింక్స్​ కానీ తీసుకోవద్దని తమ ప్రతినిధులను హెచ్చరించింది.

ఉక్రెయిన్‌పై 33 రోజులుగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. పలు సిటీలను స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను మాత్రం కైవసం చేసుకోలేకపోతోంది. రష్యన్ సేనల భీకర దాడులను ఉక్రెయిన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతూ.. రాజధానిని కాపాడుకుంటోంది. అయితే ఓ వైపు యుద్ధం సాగిస్తూన్నా.. శాంతి ప్రయత్నాలనూ ఆపడంలేదు. యుద్ధానికి ముగింపు పలికేందుకు రెండు దేశాల ప్రతినిధులు మరో దఫా సంప్రదింపులకు సిద్ధమయ్యారు. ఇవాళ (మంగళవారం) టర్కీలో ఉక్రెయిన్, రష్యా మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల కోసం ఓ వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాము న్యూట్రల్ గా ఉండేందుకు సిద్ధమని, నాటో సభ్యత్వం కోరబోమని చెబుతున్నా.. రష్యాకు ఆమోదయోగ్యం కాని కొన్ని షరతులనూ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధం ఆపడానికి తన కండిషన్లను చెబుతూ పంపిన లేఖపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించినట్లు వెస్ట్రన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జెలెన్స్కీని వదలబోనని ఆ లేఖ తీసుకెళ్లిన శాంతి దూతతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

జెలెన్స్కీని వదలను.. పుతిన్ వార్నింగ్

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధాన్ని ఆపాలని, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలని జెలెన్ స్కీ పంపిన విజ్ఞప్తికి పుతిన్ ఘాటుగా స్పందించారు. యుద్ధాన్ని ముగించడానికి తన షరతులను తెలుపుతూ జెలెన్ స్కీ స్వయంగా ఓ నోట్ రాసి పుతిన్ కు పంపారు. రష్యాకు చెందిన ఓ శాంతిదూత ద్వారా ఈ లేఖను పుతిన్ దగ్గరకు చేర్చారు. ఈ సందర్భంగా పుతిన్ స్పందిస్తూ.. జెలెన్ స్కీని వదలబోనని, ఉక్రెయిన్ ను అణచివేస్తానని ఘాటుగా బదులిచ్చారని తెలుస్తోంది.

రష్యా డిమాండ్​ను పరిశీలిస్తున్నాం

ఉక్రెయిన్ న్యూట్రల్​గా ఉండాలన్న రష్యా డిమాండ్​ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్​స్కీ వెల్లడించారు. ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్చలు కొనసాగాలని, ఉక్రెయిన్​లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఆదివారం ఆయన రష్యన్​ న్యూస్​ ఏజెన్సీలతో మాట్లాడారు. నెల రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు రెండు దేశాల ప్రతినిధులు మరో దఫా సంప్రదింపులకు సిద్ధం కావడం, ఉక్రెయిన్​ న్యూట్రల్ గా ఉండాలన్న ప్రతిపాదనే సంప్రదింపుల ప్రక్రియలో కీలకంగా ఉండటంతో జెలెన్​స్కీ కామెంట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. మంగళవారం టర్కీలో ఉక్రెయిన్, రష్యా మధ్య మరో దఫా చర్చలు ప్రారంభం కానున్నాయి. రెండు వారాల తర్వాత చర్చల ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కుతోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో పెద్దగా ప్రగతి సాధించలేదని రష్యా వర్గాలు తెలిపాయి. మరోవైపు ఉక్రెయిన్ ను మొత్తంగా కంట్రోల్​లోకి తీసుకోవడంలో విఫలం కావడంతో.. తమ అధీనంలోకి వచ్చిన ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

సొంత సైనికులనూ రష్యా పట్టించుకోవట్లే

చనిపోయిన తమ సొంత సైనికులను కూడా రష్యా పట్టించుకోకపోవడం దారుణమని జెలెన్​స్కీ అన్నారు. ‘‘తమ సొంత మనుషులను రష్యా ఎలా చూస్తోందనేది చాలా కీలకం. రష్యా తీరు చూస్తుంటే చాలా భయమేస్తోంది. సొంత వారినే అలా చూస్తుంటే మిగతా వారిని ఏం పట్టించుకుంటారు. ఇది చాలా క్రూరమైనది, దీని ముగింపు చాలా దారుణంగా ఉంటుంది” అని అన్నారు. వారిని అక్కడే వదిలి పెట్టడమో లేదంటే చెత్త కుప్పల్లో పడేయడమో చేస్తున్నారని చెప్పారు. సైనికుల శవాలను అలా వదిలేస్తుంటే వారి కుటుంబ సభ్యులు ఎలా అంగీకరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘‘మా దేశంలో మేం ఎందుకు పోరాడుతున్నామో మాకు తెలుసు. కానీ, మీ సంగతేంటి. మీ దేశంలో ఏం జరుగుతోంది. అది నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా విషాదకరం. అది మమ్మల్ని దారుణంగా దెబ్బతీస్తోంది”అని తెలిపారు. కాగా, తమ మేయర్లను రష్యన్లు కిడ్నాప్​ చేస్తున్నారని, ఇప్పటికే కొందరిని చంపేశారని జెలెన్​స్కీ ఆరోపించారు. 

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ హత్య కుట్ర భగ్నం

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని హత్య చేసేందుకు రష్యన్ స్పెషల్ సర్వీసెస్ చేసిన కుట్రను ఉక్రెయిన్ బలగాలు భగ్నం చేశాయి. రష్యన్ స్పెషల్ సర్వీసెస్ కు చెందిన 25 మంది మిలిటరీ గ్రూప్ ను అరెస్ట్ చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారని ఆ దేశ మీడియా సంస్థ ది కీవ్ పోస్ట్ పేర్కొంది.

మరో రష్యా జనరల్ యాకోవ్ ను మట్టుబెట్టిన ఉక్రెయిన్ సైన్యం

బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యాను ఉక్రెయిన్ దళాలు అదను చూసి దెబ్బతీస్తున్నాయి. తాజాగా రష్యా లెఫ్టినెంట్ జనరల్ ను హతమార్చి ఎదురుదెబ్బతీశాయి. రష్యా కమ్యునికేషన్ వ్యవస్థల్లోకి చొరబడి లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ కదలికలను పసిగట్టి జరిపిన దాడిలో 49వ కంబైన్డ్ ఆర్మీకి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సేవ్ చనిపోయారు.  లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ తోపాటు 150 మందికిపైగా రష్యా సైనికులు హతమైనట్లు తెలుస్తోంది.

రష్యన్ల నిర్బంధంలో చెర్నిహివ్   

ఉక్రెయిన్​లోని దక్షిణాన ఉన్న మరియుపోల్ సిటీని నాశనం చేసినట్లుగానే... ఉత్తరాన ఉన్న చెర్నిహివ్ నగరాన్ని కూడా రష్యన్ బలగాలు చుట్టుముట్టి, నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో సిటీలో చిక్కుకున్న ప్రజలు తిండి, నీళ్లు, మందులు, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెర్నిహివ్ మరో మరియుపోల్ సిటీలా మారుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెర్నిహివ్ నుంచి కీవ్ వెళ్లే బ్రిడ్జిని ఇదివరకే రష్యన్లు ధ్వంసం చేశారు. దీంతో నగరానికి తిండి, నీళ్లు, మందుల సరఫరా బంద్ అయింది. ఇప్పటివరకు సిటీలో దాదాపు సగం మంది (2.80 లక్షలు) ప్రజలు వెళ్లిపోయారని అధికారులు వెల్లడించారు.

ప్రపంచ దేశాలు మద్దతివ్వాలె: దోహా వేదికపై జెలెన్​స్కీ​

ఉక్రెయిన్​లో రష్యా విధ్వంసానికి పాల్పడుతోందని, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలన్నీ తమకు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ కోరారు. రష్యాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడం కోసం వరుసగా వివిధ దేశాల పార్లమెంట్ లను ఉద్దేశించి వర్చువల్​గా మాట్లాడుతున్న ఆయన.. శనివారం ఖతార్ లో జరిగిన ‘దోహా ఫోరమ్’ సదస్సుకూ వీడియో సందేశం పంపారు. సిరియా యుద్ధంలో అలెప్పో సిటీని నాశనం చేసినట్లే.. తమ దేశంలోని మరియుపోల్ సిటీని, పోర్టులను రష్యా ధ్వంసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై అణుబాంబులు ప్రయోగిస్తామని రష్యా బెదిరిస్తోందని, అదే జరిగితే మొత్తం ప్రపంచానికే ముప్పు తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్ నుంచి గోధుమలు, ఇతర సరుకుల ఎగుమతులు ఆగిపోయి మిడిల్ ఈస్ట్ లోని ఈజిప్ట్, ఇతర దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయని, ఖతార్ సహా మిగతా దేశాలన్నీ చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కోరారు.

నాటోను విభజించడం అసాధ్యం: జో బైడెన్

వార్సా: నాటోను విభజించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టంచేశారు. ‘‘నాటో కచ్చితంగా ఐక్యంగానే ఉంటుంది. మా దృష్టిలో విభజన అనేదే లేదు’’ అని అన్నారు. యూరప్‌‌‌‌ పర్యటనలో ఉన్న బైడెన్‌‌‌‌.. శనివారం వార్సాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌‌‌‌లో పోలెండ్‌‌‌‌ ప్రెసిడెంట్ ఆండ్రేజ్ దుడాతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు.. ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడిని ముగించే లక్ష్యాలను గురించి చర్చించుకున్నారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. అమెరికా, పోలెండ్ సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయని దుడా చెప్పారు. ‘మీ స్వేచ్ఛ మాది’ అని పోలెండ్ ప్రధానితో చెప్పిన బైడెన్‌‌‌‌.. పోలెండ్‌‌‌‌పై రష్యా దాడులు చేస్తే అమెరికా కాపాడుతుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌‌‌‌లో యుద్ధం వల్ల తలెత్తిన శరణార్థుల సంక్షోభ భారాన్ని పోలెండ్ భరిస్తున్నదని అన్నారు. ప్రస్తుత మానవతా సంక్షోభంలో పోలెండ్ ముఖ్యమైన బాధ్యత తీసుకుంటోందని, ఆ దేశంపై పడిన భారాన్ని తగ్గించుకోవడానికి ప్రపంచం సాయం చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత యూరప్ పర్యటన ముగించుకుని వాషింగ్టన్‌‌‌‌కు వెళ్లిపోయారు.

ఉక్రెయిన్ మంత్రితో భేటీ

ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి మొదలైన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్ కీలక నేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ అయ్యారు. పోలెండ్‌‌‌‌లోని వార్సాలో పర్యటిస్తున్న బైడెన్.. శనివారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా, రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌‌‌‌తో సమావేశమయ్యారు.

ఉక్రెయిన్ సైన్యం ఆయుధాల డిపో ధ్వంసం
ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా తాజాగా మరోసారి కాలిబర్ క్షిపణులు ప్రయోగించింది. నల్లసముద్రంలోని నౌకల నుంచి ఉక్రెయిన్ పై కాలిబర్ క్షిపణులు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.కాలిబర్ క్షిపణుల దాడుల్లో  ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక ఆయుధాల డిపో ధ్వంసం అయిందని రష్యా రక్షణశాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. సైనిక చర్య పేరుతో గత ఫిబ్రవరి నెల 24వ తేదీ నుంచి ఉక్రెయిన్ పై భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యా గత 24 గంటల వ్యవధిలో 117 సైనిక లక్ష్యాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. 

ఉక్రెయిన్​లో మానవతా సంక్షోభానికి రష్యానే కారణమని యునైటెడ్​ నేషన్స్​ జనరల్ అసెంబ్లీ తేల్చిచెప్పింది. గురువారం నాటి అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. రష్యా వెంటనే కాల్పుల విరమణ పాటించాలని కోరింది. జనరల్ అసెంబ్లీలో 193 దేశాలు ఉండగా, తీర్మానానికి అనుకూలంగా 140, వ్యతిరేకంగా 5 ఓట్లు వచ్చాయి. ఇండియా సహా 38 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. అంతకుముందు ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై యూఎన్​ భద్రతా మండలిలో రష్యా తీర్మానం వీగిపోయింది. ఒక్క చైనా తప్ప ఏ దేశమూ సపోర్టు చేయలేదు. 15 దేశాల భద్రతా మండలిలో ఇండియా సహా 12 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి.

జీ-20 నుంచి బయటకొచ్చినా నష్టం లేదన్న రష్యా

రష్యా నుంచి  చమురును కొనుగోలు  చేయొద్దని  ఐరోపా దేశాలకు  పదే పదే  చెబుతున్న అమెరికా....  చమురు  సరఫరా విషయంలో  ఐరోపా సమాఖ్యతో  అవగాహనకు వచ్చింది. అందులో భాగంగా  ఈ ఏడాది అదనంగా  15 బిలియన్  క్యూబిక్  మీటర్ల  ద్రవ సహజ వాయువును  ఈయూకి ఎగుమతి  చేస్తామని  తెలిపింది. దీంతో ఐరోపా.. రష్యాపై ఆధారపడటం తగ్గుతుందని  తెలిపారు అమెరికా  అధ్యక్షుడు బైడెన్ . మరోవైపు  మే 9 నాటికి యుద్ధాన్ని ముగించాలని  రష్యా కోరుకుంటున్నట్లు  ఉక్రెయిన్ వర్గాలను  ఉద్దేశించి  చెప్పాయి  మీడియా సంస్థలు. రష్యా తమ  పౌరుల్ని బలవంతంగా  తీసుకెళ్తోందని  ఆరోపిస్తుంది ఉక్రెయిన్. ఇప్పటివరకూ  4 లక్షల 2 వేల  మంది ఉక్రెయిన్  వాసుల్ని వారి  ఇష్టానికి విరుద్ధంగా తరలించిందని  తెలిపింది  ఉక్రెయిన్ ప్రభుత్వం. అందులో  84 వేల మంది  చిన్నారులున్నారని చెప్పింది. 

జీ-20 కూటమి నుంచి  రష్యాను బహిష్కరించేందుకు  సిద్ధమవుతున్నామన్న  అమెరికా వ్యాఖ్యలపై...  స్పందించింది  రష్యా. ప్రస్తుతం  జీ20 నుంచి  బయటకు వచ్చినా  రష్యాకు జరిగే నష్టమేమీ  లేదని  పేర్కొంది. జీ-20  కూటమి  ముఖ్యమైనదే.... కానీ,  ప్రస్తుతం ఇందులోని చాలా  దేశాలు  తమపై  ఆర్థిక ఆంక్షలు  విధించినవే  అని తెలిపారు  క్రెమ్లిన్  ప్రతినిధి. కాబట్టి జీ 20 నుంచి  రష్యాను తప్పించినా  నష్టం ఏమీ లేదన్నారు.

ఉక్రెయిన్ కు సైనిక సాయం అందిస్తామన్న బైడెన్ 

మాస్కోను దీటుగా  ఎదుర్కొనేలా  తమకు యుద్ధ  విమానాలను, ట్యాంకులను, భారీ సైనిక వ్యవస్థలను అందజేయాలని  పాశ్చాత్య దేశాలను కోరుతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. దీనిపై చర్చించేందుకు  అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్, నాటో   దేశాధినేతలు బ్రసెల్స్ లో సమావేశమైన మరుసటిరోజే...  థియేటర్ పై దాడిలో పౌరుల మరణాలకు సంబంధించిన నివేదికను బయటపెట్టారు ఉక్రెయిన్  అధికారులు. ఈ దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఉక్రెయిన్ కు మరింత సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు బైడెన్ . కీవ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న మాస్కో బలగాలు... కీవ్ పరిరక్షణకు కీలకమైన ఇంధన నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి రష్యా సైనిక వర్గాలు.

అమెరికా సహా  పశ్చిమ దేశాలు  తమపై  పూర్తిస్థాయి  హైబ్రీడ్ యుద్ధం  ప్రకటించాయని ఆరోపించారు  రష్యా విదేశాంగ  మంత్రి   సెర్గీ లావ్రోవ్. తమ  ఆర్థిక వ్యవస్థను, రష్యాను సర్వనాశనం  చేయటమే  ఆ దేశాల  లక్ష్యమన్నారు. ఉక్రెయిన్  యుద్ధంలో తమ సైనికులు 1,351 మంది  మృతిచెందారని,  మరో 3,825  మంది గాయపడ్డారని  తెలిపారు  రష్యా సైనిక ఉన్నతాధికారి  కల్నల్ జనరల్  సెర్గీ రుడ్ స్కోయ్.  ఇప్పటి వరకూ  16 వేల మంది రష్యా సైనికులను  మట్టుబెట్టినట్టు  ప్రకటించింది ఉక్రెయిన్  సైన్యం.

అణ్వాయుధాలను రష్యా ప్రేరేపిస్తోందన్న జెలెన్ స్కీ

ఉక్రెయిన్ పై  చేపట్టిన  సైనిక చర్యలో  మొదటి దశ  పూర్తయ్యిందని  తెలిపింది రష్యా రక్షణశాఖ. ప్రస్తుతం ఈస్ట్  ఉక్రెయిన్ లోని   డాన్ బాస్ ప్రాంత  స్వాధీనంపై  రష్యా దృష్టి సారిస్తుందని తెలిపింది. ఉక్రెయిన్ లో  చేపడుతున్న ప్రత్యేక  ఆపరేషన్  విషయంలో 2 ఆప్షన్ లను పరిశీలిస్తున్నామంది  రష్యా రక్షణ శాఖ.  ఒకటి.. డాన్ బాస్ లోని  వేర్పాటువాద ప్రాంతాల్లోనే దాడులు చేయడం.  మరొకటి.. ఉక్రెయిన్  మొత్తానికి  విస్తరించడం అని స్పష్టం చేసింది. 93 శాతం  లుహాన్స్ కు,  54 శాతం డొనెట్స్ కు  రీజియన్ లు  రష్యా నియంత్రణలో ఉన్నాయని తెలిపారు రష్యా సాయుధ  దళాల జనరల్  స్టాఫ్  ప్రతినిధి సెర్గీ.  ఉక్రెయిన్ వైమానిక, నావికా దళాల్లోని  అత్యధిక భాగాన్ని  తమ బలగాలు  నాశనం చేశాయని.. దీంతో  మొదటి దశ సైనిక చర్య విజయవంతంమైందన్నారు.  సైనిక చర్య పేరుతో  ఫిబ్రవరి 24 నుంచి  ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తుంది  రష్యా. అనేక దేశాలు రష్యాను వ్యతిరేకిస్తూ మాస్కోపై కఠిన ఆంక్షలు విధిస్తున్నా పుతిన్  సర్కారు వెనక్కి తగ్గట్లేదు.
 
ఈనెల 16న  మరియుపోల్ లోని   ఓ థియేటర్ పై  రష్యా జరిపిన దాడిలో అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు  300 మంది చనిపోయినట్లు  తెలిపారు ఉక్రెయిన్ అధికారులు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో  టెలిగ్రాం ఛానెల్  ద్వారా  ఈ వివరాలను అందించారు స్థానిక అధికారులు. చాలామంది చిన్నారులు ఈ థియేటర్ లో ఆశ్రయం పొందుతున్నారని... వారిని కాపాండేందుకు  చిల్డ్రన్ అని   రష్యన్ భాషలో  బోర్డుపెట్టామని  తెలిపింది ఉక్రెయిన్ ప్రభుత్వం. దాడుల్లో ఇళ్లు  ధ్వంసమైన  1,300 మంది  కూడా ఇక్కడే  ఉన్నారని... ఈ శిబిరంపై దారుణంగా పుతిన్ సేనలు  దాడులు చేశాయని  ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్  పార్లమెంటుకు చెందిన మానవ హక్కుల  కమిషనర్  లుడ్మిలా డెనిసోవా.

మే 9 నాటికి యుద్ధాన్ని ముగించాలని  రష్యా టార్గెట్

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నెల రోజులగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు సిటీలను స్వాధీనం చేసుకున్న రష్యన్ బలగాలు.. ఆ దేశ రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు శతవిధాలా ప్రయత్నస్తున్నాయి. రాజధానిని తమ చెరలోకి తెచ్చుకుంటే యుద్ధానికి ముగింపు చెప్పొచ్చన్నది రష్యా భావన. అయితే ఇది జరగనీయకుండా చేయాలని ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అయితే తమ లక్ష్యానికి చేరుకుని యుద్ధాన్ని ముగించే విషయంలో రష్యా సేనలకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ డెడ్ లైన్ పెట్టాడని వార్తలు వస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ మే 9 నాటికి ముగియాలని రష్యన్ బలగాలకు టార్గెట్ పెట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందిందని ఆ దేశ మీడియా సంస్థ కీవ్ ఇండిపెండెంట్ పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాజీలపై సాధించిన విజయానికి గుర్తుగా ఆ రోజున రష్యాలో ఏటా ఘనంగా వేడుకలు చేస్తారు. ఈ నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా మరో విజయాన్ని అదే రోజు సాధించినట్లుగా చెప్పుకోవాలన్న ఆలోచనతో రష్యా ఆ రోజును డెడ్ లైన్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

రష్యాపై మరిన్ని ఆంక్షలు 

రష్యాపై మరింత కఠిన వైఖరిని అనుసరించాలని నాటో దేశాలు నిర్ణయించాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇతర ఈయూ దేశాల అధినేతలు పాల్గొన్నారు. రష్యాపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు చెందిన 400 మంది వ్యక్తులు, కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆధ్వర్యంలోని జీ7 దేశాలు, ఈయూ ప్రకటించాయి. 

సైనిక సాయం చేయండి: జెలెన్‌స్కీ
ఎలాంటి ఆంక్షలు లేకుండా తమకు సైనిక సాయం చేయాలని నాటోను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. ‘‘మా ప్రజలను, మా నగరాలను కాపాడుకునేందుకు.. మాకు మిలిటరీ సాయం కావాలి. అదీ ఎలాంటి ఆంక్షలు లేకుండా. ఇదే సమయంలో రష్యా రిస్ట్రిక్షన్లను పట్టించుకోకుండా అన్ని ఆయుధాలను మా మీద ఉపయోగిస్తున్నది’’ అని చెప్పారు. నాటో ప్రతినిధులతో గురువారం వీడియో లింక్‌ ద్వారా ఆయన మాట్లాడారు. రక్షణ పరికరాలను అందించినందుకు కృతజ్ఞతలు చెప్పిన జెలెన్‌స్కీ.. ఎదురుదాడులు చేసేందుకు ఆయుధాలు ఇవ్వాలని కోరారు. ‘‘మీ దగ్గర ఉన్న మొత్తం విమానాల్లో.. మీ దగ్గర ఉన్న మొత్తం ట్యాంకుల్లో ఒక్క శాతం మాకు ఇవ్వండి.. ఒకే ఒక్క శాతం” అని కోరారు. రష్యా తమపై పాస్పరస్ ఆయుధాలను ప్రయోగిస్తున్నదని చెప్పారు. ఈ ఉదయం కూడా తమపై ఆ బాంబులను వేసిందన్నారు.

రష్యా కెమికల్ దాడి చేయొచ్చు: నాటో చీఫ్
ఉక్రెయిన్ లో కెమికల్ వెపన్స్ ప్రయోగించేందుకు రష్యా సాకును సిద్ధం చేసుకుంటోందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ అన్నారు. గురువారం నాటో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా, నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్ బయాలజికల్ వెపన్స్ తయారు చేస్తోందంటూ సాకును చూపి.. 
ఉక్రెయిన్​లో కెమికల్ వెపన్స్​ను ప్రయోగించాలని రష్యా యోచిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కెమికల్ దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై దాడి చేయడం రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన పెద్ద తప్పు అని అన్నారు.

నాటో రెచ్చగొడితే అణుబాంబులేస్తం: రష్యా
నాటో కనుక రెచ్చగొడితే అణు ఆయుధాలు ఉపయోగించే హక్కు రష్యాకు ఉందని యూఎన్​లో రష్యా డిప్యూటీ అంబాసిడర్ దిమిత్రీ పోల్యన్‌స్కీ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలను ఖండించారు. అంతకుముందు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ.. తమకు అస్తిత్వ ముప్పు ఏర్పడినప్పుడే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని చెప్పారు.

యుద్ధం మొదలై నేటికి నెల

గత నెల 24న ప్రారంభమైన రష్యా దండయాత్ర.. మిసైళ్లు, బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్ కు అపారనష్టం జరిగింది. అక్కడి ప్రజలు ప్రాణభయంతో దేశాన్ని వీడి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 35 లక్షల మంది దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. దేశంలోనే చెల్లాచెదురైన వాళ్లు 65 లక్షల మంది ఉన్నారు. ఇండ్లు విడిచి వెళ్లిన వారు దాదాపు కోటి మంది ఉంటారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇక అందమైన నగరాలు బాంబుల దాడికి మొండిగోడలుగా మారాయి. సుమారు 8 లక్షల 42 వేల కోట్లు ఉక్రెయిన్ కు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో 691 మంది పౌరులు చనిపోయారు. గాయపడ్డ వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇటు రష్యా కూడా భారీగా నష్టపోయిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటి వరకు 15 వేల మందికిపైగా రష్యా సేనలను మట్టుబెట్టామని జెలెన్ స్కీ ఆఫీసర్స్ ప్రకటించారు. 

డిమాండ్లపై కాస్త వెనక్కి తగ్గిన ఉక్రెయిన్.... రష్యాను శాంతి చర్చలకు ఆహ్వానిస్తోంది. నేరుగా పుతిన్ తోనే మాట్లాడుతా అంటూ జెలెన్ స్కీ ప్రకటించారు. అయినా రష్యా దూకుడుగా ముందుకెళ్తోంది. యుద్ధనేరాలకు పాల్పడుతున్న రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలు ఆందోళనలు చేయాలని జెలెన్ స్కీ కోరారు. ఈ విపత్కర సమయంలో ఉక్రెయిన్ అండగా ఉండాలని ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు. అమెరికా సహా...నాటో, ఈయూలు కఠిన ఆంక్షలు విధించినా రష్యా దూకుడు తగ్గలేదు. ఉక్రెయిన్ పై మాస్కో దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి, సాధారణ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్ కు చైనా , భారత్ దూరంగా ఉంటూ వస్తున్నాయి. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం అంటూ ఉభయదేశాలు పిలుపునిచ్చాయి. 

రష్యా సహనం నశిస్తోందని.. మరింత బీకరదాడులు చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. రాజధాని కీవ్ ను కొల్లగొట్టి, జెలెన్ స్కీ సర్కార్ స్థానంలో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్ భావిస్తున్నారు. అయితే ఇవేవి సాకరమయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో....ప్లాన్ –బీ ని రష్యా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ దేశాలు-రష్యా పట్ల ఉక్రెయిన్ తటస్థ వైఖరిని అనుసరించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదు. దక్షిణ, తూర్పు భూ భాగాల విషయంలో రష్యా వాదనలను కీవ్ అంగీకరించాలి.. లాంటి డిమాండ్లను ఉక్రెయిన్ ముందు ఉంచింది. 

వాణిజ్య నిషేధం విధించటం ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.... జపాన్ కు విజ్ఞప్తి చేశారు. ఇక నాలుగు రోజుల పర్యటనకు ఐరోపా వెళ్లారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రష్యా దురాక్రమణపై తమ భాగస్వామ్య దేశాల అధినేతలతో చర్చించనున్నారు. ఉక్రెయిన్పై రష్యా రసాయనిక ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని, అదే నిజమైన ముప్పు అని పేర్కొన్నారు బైడెన్.... ఉక్రెయిన్  కాన్సులేట్ ను బెలారస్  మూసివేసింది. తమ దేశం వదిలి వెళ్లిపోవాలంటూ పలువురు ఉక్రెయిన్  దౌత్యవేత్తలకు సూచించింది. ఉక్రెయిన్ పై  దాడిలో రష్యాకు మద్దతుగా బెలారస్ కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశం ఉందని నాటో, అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ పై అణు, రసాయన ఆయుధాల్ని ప్రయోగిస్తామంటూ రష్యా బెదిరిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నాటో అండగా నిలిచింది. అణు, రసాయన దాడుల నుంచి రక్షణపొందేలా సామాగ్రిని సరఫరా చేయనున్నట్టు నాటో సెక్రటరీ జనరల్  తెలిపారు.

ఉక్రెయిన్ పై మాస్కో దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్ కు భారత్ మరోసారి దూరంగా నిలిచింది. యుద్ధాన్ని వెంటనే విరమించాలని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా అన్నారు. 

ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్థం భీకర స్థాయికి చేరింది. ఓ వైపు రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంటే ఉక్రెయిన్ కూడా ప్రతిదాడికి దిగింది. తమ బలగాలు రష్యన్లను తరిమి కొట్టాయని ఉక్రెయిన్​ రక్షణ శాఖ వెల్లడించింది. కాగా బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. రష్యా బలగాలు దాడులు ఆపి తమ దేశానికి తిరిగి వెళ్తే.. నాటో సభ్యత్వ డిమాండ్ ను వదులుకుంటామని జెలెన్ స్కీ ప్రకటించారు. కాగా జెలెన్ స్కీ ప్రకటనను రష్యా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ పై ముప్పేట దాడికి ప్రయత్నాలు చేస్తున్నాయి రష్యా సేనలు. మరియుపోల్  స్వాధీనానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది రష్యా సైన్యం. అజోవ్  సీ నుంచి మరియుపోల్  తీర ప్రాంతం వైపు యుద్ధ నౌకలు వస్తున్నట్లు తెలిపారు యూఎస్  రక్షణ శాఖ అధికార వర్గాలు. మరోవైపు బ్లాక్ సీలో మరో 21 యుద్ధ నౌకలను రష్యా సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది యూఎస్ రక్షణ శాఖ. ఉక్రెయిన్ లోని చెర్నోబిల్  న్యూక్లియర్  పవర్  ప్లాంట్ లోని ల్యాబొరేటరీని ధ్వంసం చేశాయి పుతిన్ సేనలు. దాడులు ప్రారంభించిన తర్వాత చెర్నోబిల్ పవర్  ప్లాంట్ ను తమ ఆధీనంలోకి తీసుకుంది రష్యా. రేడియోయాక్టివ్  వ్యర్థాలను నిర్వహించేందుకు ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. యూరోపియన్ కమిషన్ సహకారంతో 6 మిలియన్ యూరోలతో నిర్మించిన ల్యాబ్ ను 2015 లో ప్రారంభించింది ఉక్రెయిన్ ప్రభుత్వం.

జర్నలిస్టుపై రష్యా క్రిమినల్ కేసు

ఉక్రెయిన్ పై గత నెల 24న రష్యా యుద్ధానికి దిగింది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక సిటీలను రష్యా బలగాలు తమ చేతిలోకి తెచ్చుకున్నాయి. అయితే రాజధాని కీవ్ నగరాన్ని కూడా చుట్టుముట్టినప్పటికీ ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండడంతో రష్యా సైన్యం లక్ష్యం నెరవేరడం లేదు. యుద్ధం మొదలుపెట్టిన సమయంలో తమ టార్గెట్ ఉక్రెయిన్ ను సైనిక రహితంగా చేయమేనని, తాము సైన్యం, సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే పోనుపోనూ ఉక్రెయిన్ లోని ఆస్పత్రులు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, అపార్ట్ మెంట్లపైనా రష్యా ఆర్మీ దాడులు చేస్తోందని, వందల వేల మంది సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలోని సామాన్యులు మొదలు పౌర సంఘాలు, జర్నలిస్టులు కూడా స్వదేశం తీరును ఖండిస్తున్నారు. పుతిన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అలా నిరసనలు చేసిన వారిని అరెస్టు చేస్తూ వచ్చిన రష్యా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యన్ ఆర్మీపై తప్పుడు సమాచారం ప్రచురించినందుకు ఓ జర్నలిస్ట్ పై పుతిన్ సర్కారు క్రిమినల్ కేసు పెట్టింది.

దాడులు ఆపితే నాటో సభ్యత్వానికి నో : జెలెన్ స్కీ

రష్యా తమ దేశంపై దాడులు ఆపితే నాటో సభ్యత్వాన్ని అడగబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. సభ్యత్వం కన్నా ప్రజల ప్రాణాలు తమకు ముఖ్యమని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. తమ దేశానికి నాటో సభ్యత్వం విషయంలో కొన్ని దేశాలు సుముఖంగా లేవన్నారు. అలాంటప్పుడు ఈ రాజీ మార్గమే సరియైనదని జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు. 

రష్యాను ఒంటరి చేసేందుకు అమెరికా వ్యూహం

ఉక్రెయిన్ పై సైనిక చర్యకు పాల్పడుతున్న రష్యాను ఒంటరి చేసేందుకు చూస్తుంది అమెరికా. జీ20దేశాల నుంచి రష్యాను పంపించేయాలని అగ్రరాజ్యం వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దీనికి జీ20లోని మిగతా దేశాల మద్దతు కూడగట్టేందుకు యూఎస్  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి కొన్ని న్యూస్ ఏజెన్సీలు. రష్యా స్థానంలో పోలండ్ ను జీ20లో భాగస్వామిని చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పునకు కొన్ని దేశాల నుంచి మద్దతు లభించినట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్  కూడా జీ20 దేశాల్లో భాగస్వామిగా ఉంది. 

ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, బోరిస్ జాన్సన్ చర్చలు

ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోడీ, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ కాల్ లో చర్చించారు. ఫిబ్రవరి 24న రష్యా యుద్ధానికి దిగడంతో నాటి నుంచి ఉక్రెయిన్ లో రోజు రోజుకీ మారుతున్న పరిస్థితులపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. యుద్ధం నిలిపేసి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మరోసారి ప్రధాని మోడీ అన్నారు. అన్ని దేశాల భౌగోళిక సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను భారత్ ఎప్పుడూ గౌరవిస్తుందని చెప్పారు.

భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైనా మోడీ, జాన్సన్ చర్చించారు. వీలైనంత త్వరగా భారత్ పర్యటనకు రావాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను మోడీ కోరారు. గత ఏడాది జరిగిన వర్చువల్ సదస్సు సందర్భంగా ఇరు దేశాల అధినేతలు ఆమోదం తెలిపిన ఇండియా యూకే రోడ్ మ్యాప్ 2030 అమలవుతున్న తీరు బాగుందని మోడీ అన్నారు.



దేశాల మద్ధతు కూడగట్టే ప్రయత్నంలో బైడెన్

రష్యాకు వ్యతిరేకంగా పలు దేశాల మద్ధతును కూడగట్టేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బెల్జియం రాజధాని బ్రసెల్స్ కు వెళ్లారు బైడెన్. అక్కడ యూరోపియన్  యూనియన్  ప్రతినిధులతో భేటీ కానున్నారు. రష్యాను కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో సమావేశంలో చర్చించనున్నారు. ఈ పర్యటన తర్వాత బైడెన్  పోలండ్  రాజధాని వార్సా వెళ్లి పోలండ్ అధ్యక్షుడితో ఉక్రెయిన్  సంక్షోభంపై చర్చలు జరపనున్నారు.

ఉక్రెయిన్ సంక్షోభంపై యూఎన్ఓ ప్రత్యేక సమావేశం

ఉక్రెయిన్  సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ప్రత్యేక అత్యవసర సమావేశం ఇవాళ ప్రారంభం కానుంది. గత నెల 28న ప్రారంభమై ఈ నెల 2 వరకు ఈ భేటీ కొనసాగింది. దాన్ని పునఃప్రారంభించాల్సిందిగా అమెరికా, బ్రిటన్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ సహా 22 దేశాలు సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ కు లేఖ రాశాయి. దీంతో ఉక్రెయిన్ పై రష్యా దాడి గురించి చర్చించేందుకుగాను అత్యవసర ప్రత్యేక సమావేశాన్నిమళ్లీ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు అబ్దుల్లా. ఈ నెల 2న అత్యవసర ప్రత్యేక భేటీ ముగియడానికి ముందే.. ఉక్రెయిన్  సార్వభౌమత్వాన్ని రష్యా గౌరవించాలని సూచించింది సర్వప్రతినిధి సభ. ఉక్రెయిన్ పై రష్యా దాడిని కూడా ఖండించింది.

రష్యాకు విమాన సర్వీసులను నిషేధించిన వియత్నాం

రష్యా వెళ్లే విమానాలపై వియత్నాం ఎయిర్ లైన్స్ నిషేధం విధించింది. మార్చి 25 నుంచి తమ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. తాము తదుపరి నోటీసు ఇచ్చే వరకు  విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.

మమ్మల్ని చేర్చుకోండి.. లేదా భయమని ఒప్పుకోండి

ఉక్రెయిన్​కు మద్దతు కూడగట్టే చర్యల్లో భాగంగా వివిధ దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ వరుస ప్రసంగాలు ఇస్తున్నారు. మంగళవారం ఇటలీ పార్లమెంట్ లో వర్చువల్​గా మాట్లాడారు. రష్యా దాడులతో మరియుపోల్​ మరుభూమిగా మారిందని, రష్యాకు భయపడి నాటో ఉక్రెయిన్​కు సభ్యత్వం ఇవ్వడంలేదని ఆరోపించారు. ఉక్రెయిన్​కు వెంటనే నాటో సభ్యత్వం ఇవ్వాలని, లేదంటే రష్యా అంటే తమకు భయమని ఒప్పుకోవాలని అన్నారు. అలాకాని పక్షంలో తమకు సభ్యత్వం ఇవ్వకపోయినా తమ భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్​ చేశారు. అప్పుడే యుద్ధానికి ముగింపు దొరుకుతుందని చెప్పారు. రష్యా బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. ‘‘ఖార్కీవ్, మరియుపోల్, కీవ్​ సిటీలను అప్పగించాలని వారు డిమాండ్​ చేయవచ్చు. కానీ అక్కడి జనాలు వారిని రానివ్వరు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడి ప్రజలను చంపాలి. నిర్మానుష్యంగా మారిన సిటీలు వారి పరమవుతాయి”అని స్పష్టం చేశారు.

రష్యాపై చర్యలకు భారత్ వణుకుతోంది

భారత్ పై తొలిసారిగా కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. రష్యా విషయంలో భారత్ కాస్త వణుకుతోందని విమర్శించారు జో బైడెన్. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను శిక్షించే పాశ్చాత్య ఆంక్షలపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం భారత్ 'కొంతవరకు వణుకుతోంది' అని అన్నారు. బిజినెస్ రౌండ్‌టేబుల్ యొక్క CEO క్వార్టర్లీ మీటింగ్‌లో మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒంటరిగా చేసే విషయంలో అమెరికా,ఇతర మిత్రదేశాలలో భారతదేశం ఒక మినహాయింపుగా నిలుస్తుందని బిడెన్ సూచించారు.

రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. భారత్‌లో స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు కనిపించట్లేదని ఆయన చెప్పారు. క్వాడ్ సభ్య దేశాల్లో కూడా భారత్ అలాగే ఉందన్నారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా.. క్వాడ్‌లో సభ్యత్వం గల దేశాలు. ఇందులో భారత్ మినహాయిస్తే- మిగిలిన రెండూ రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయి.

రష్యా-ఉక్రెయిన్  మధ్య సయోధ్యకు ఇజ్రాయెల్ ప్రయత్నం

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై ఇప్పటికి 27 రోజులు గడిచినా పైచేయి రష్యా సాధించలేకపోయింది. మెయిన్ సిటీలపై మిసైల్స్ తో రష్యా దాడులు చేస్తుండగా రష్యా సరఫరా వ్యవస్థల్ని ధ్వంసం చేసేలా జెలెన్ స్కీ సేనలు దాడులకు పాల్పడుతున్నాయి. రెండు దేశాల మధ్య వర్చువల్ గా చర్చలు జరిగినా.... ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు. యుద్ధంలో ఇంతవరకు 902 మంది పౌరులు మృతి చెందినట్లు తెలిపింది ఐక్యరాజ్యసమితి. రష్యా-ఉక్రెయిన్  మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇజ్రాయెల్.మరియుపోల్​ను వదులుకోబోం..

రష్యాపై పోరాటంలో ఆయుధాలను విడువబోమని, మరియుపోల్ నగరాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తెగేసి చెప్పింది. ఆగ్నేయ ఉక్రెయిన్ లోని మరియుపోల్ నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టిన రష్యా.. నగరంపై మూడు వారాలుగా రోజూ బాంబుల వర్షం కురిపిస్తోంది. అయినా.. ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో నగరంలోని ఉక్రెయిన్ సోల్జర్లు ఆయుధాలు వదిలిపెట్టాలని, తెల్లజెండాలతో వచ్చి లొంగిపోతే నగరం నుంచి రెండు కారిడార్ల ద్వారా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని రష్యన్​కర్నల్ జనరల్ మిఖాయిల్ ఆదివారం రాత్రి హెచ్చరించారు. సోమవారం ఉదయం 5 వరకూ గడువు ఇచ్చారు. అయితే, ఆయుధాలు వదలి, లొంగిపోవడం గురించి చర్చలు ఉండబోవని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్చుక్ స్పష్టం చేశారు. 

కొనసాగిన దాడులు 

కీవ్​లోని ఓ షాపింగ్ మాల్​పై రష్యన్ బలగాలు ఆదివారం జరిపిన బాంబు దాడిలో 8 మంది పౌరు లు చనిపోయారు. సోమవారం కూడా పలు అపార్ట్ మెంట్లపై దాడులు జరిగాయి. సుమీ సిటీలోని అమ్మోనియా ప్లాంటుపై కూడా రష్యా బాంబుదాడి చేసింది. ప్లాంట్ లోని 50 టన్నుల ట్యాంక్ పేలిపోవడంతో రెండున్నర కిలోమీటర్ల వరకూ విష వాయువులు వ్యాపించాయి. రెస్క్యూ టీం వెంటనే అక్కడకు చేరుకుని లీకేజీని అరికట్టింది.

2,389 మంది పిల్లల కిడ్నాప్

డాన్ బాస్ ప్రాంతంలో శనివారం ఒక్కరోజే 2,389 మంది పిల్లలను రష్యన్ బలగాలు బలవంతంగా తరలించాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికొలెంకో వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌరులను కిడ్నాప్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, రష్యా తమ పిల్లల జీవితాలను ప్రమాదంలోకి నెడుతోందని ఆయన ఆరోపించారు. యుద్ధం పేరిట రష్యా చేస్తున్న క్రూరమైన నేరాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. 

చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది: జెలెన్ స్కీ

రష్యాతో ఉక్రెయిన్ చర్చలు విఫలమైతే .. పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధాన్ని నివారించడానికి తాము చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ లోని పోర్టులు, ఎయిర్ పోర్టులే కాకుండా నివాస ప్రాంతాలు, హాస్పిటల్స్, స్కూళ్లపైనా దాడులు కొనసాగుతున్నాయి. నిన్న మరియుపోల్ సిటీలోని ఆర్ట్ స్కూల్ పై బాంబు దాడి లాంటివన్నీ యుద్ధనేరాలని జెలెన్ స్కీ ఆరోపించారు. రాబోయే కొన్ని శతాబ్దాల పాటు పీడకలలా అందర్నీ వెంటాడతాయన్నారు జెలెన్ స్కీ. రష్యాతో చర్చలు విఫలమైతే అది మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుందని హెచ్చరించారు.


శుక్రవారం పోలాండ్ వెళ్లనున్న జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం పోలాండ్ వెళ్లనున్నారు. ఉక్రెయిన్ పై రష్యా అక్రమదాడులు, ఉక్రెయిన్ లో మానవ హక్కుల సంక్షోభంపై అమెరికా మిత్రదేశాలతో చర్చించనున్నట్లు తెలిపింది వైట్ హౌస్. ఉక్రెయిన్ కు 70 వేల టన్నుల బొగ్గును ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా. మోల్దోవాకు 30 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనుంది అమెరికా.

కెమికల్ ప్లాంట్ పై రష్యా సేనల దాడి.. అమ్మోనియా గ్యాస్ లీక్

తూర్పు ఉక్రేనియన్ నగరమైన సుమీ శివార్లలోని ఓ కెమికల్ ప్లాంట్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అవుతోంది.  సోమవారం తెల్లవారుజాము నుండి గ్యాస్ లీక్ అవుతున్నట్లు  గుర్తించారు. రష్యా దళాలు నగర శివార్లలోని రసాయన కర్మాగారాన్ని టార్గెట్ చేసి దాడులు చేయడం వల్ల గ్యాస్ లీక్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సుమీ ప్రాంతీయ గవర్నర్ డిమిట్రో జైవిట్‌స్కీ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో గ్యాస్ లీక్ గురించి ప్రకటించారు. గ్యాస్ లీక్ ప్రభావం దాదాపు 2.5 కిమీ (1.5 మైళ్ళు) విస్తీర్ణం వరకు కనిపించిందని పేర్కొన్నారు. గ్యాస్ లీక్ వల్ల ప్రస్తుతానికి  సుమీ నగరానికి  ప్రత్యక్ష ముప్పు లేదని ఆయన తెలిపారు. అయితే గాలి వీస్తున్న దిశలో ఉన్న నోవోసెలీట్యా పట్టణాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

ఇది టెర్రరిజమే.. యుద్ధ నేరంగానే చూస్తం

రష్యా బాంబు దాడులను జెలెన్​స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ప్రశాంతమైన నగరంలో కల్లోలం సృష్టిస్తున్నారు. అక్కడి జనం ఏం తప్పు చేశారు. ఇది నిజంగా టెర్రరిజమే. ఈ దారుణాలను ఉక్రెయిన్ ​ కొన్నేండ్ల పాటు మరిచిపోదు. రష్యా బాలగాల విధ్వంసం చరిత్రలో యుద్ధ నేరాల కింద నిలిచిపోతుం ది” అని జెలెన్​స్కీ చెప్పారు. మరోవైపు రష్యాతో సంబంధాలున్న రాజకీయ పార్టీలను జెలెన్​స్కీ సస్పెండ్​ చేశారు. మొత్తంగా 11 రాజకీయ పార్టీలపై వేటు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒక మార్షల్​లాను అమలులోకి తీసుకొస్తు న్నట్టు జెలెన్​స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్​ పార్లమెంట్లో 44 సీట్లు ఉన్న ప్లాట్​ఫామ్​ ఫర్​ లైఫ్​ పార్టీ వీటిలో అతి పెద్దది. ఆ పార్టీ లీడర్​ విక్టర్ మెద్వెద్చుక్​ కు రష్యా ప్రెసిడెంట్ ​పుతిన్​తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. యువ్​హేని మురయేవ్​ ఆధ్వర్యంలోని నాషీ పార్టీ కూడా ఈ లిస్టులో ఉంది. మురయేవ్​ను ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​గా చేయాలని రష్యా భావిస్తోంది.

400 మంది శరణార్థులున్న బడిపై దాడి

లవీవ్: ఉక్రెయిన్​ లో శరణార్థులు తలదాచుకున్న ఒక ఆర్ట్​ స్కూల్​పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. పోర్ట్ సిటీ మేరియపోల్​ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా మిలిటరీ గత కొన్ని రోజులుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఉక్రెయిన్​ సైన్యాన్నే కాకుండా జనావాసాలను కూడా టార్గెట్​గా చేసుకుని దాడుల తీవ్రత పెంచింది. ఈ క్రమంలో శనివారం మేరియపోల్​లోని ఒక ఆర్ట్ స్కూల్​పై బాంబు దాడులకు తెగబడింది. ఆ స్కూల్​లో సుమారు 400 మంది శరణార్థులు తలదాచుకున్నట్టు ఉక్రెయిన్​ అధికారులు చెప్పారు. బాంబు దాడుల్లో స్కూల్​ బిల్డింగ్​ నేలమట్టమయ్యిందని, చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. గత బుధవారం కూడా పౌరులు తలదాచుకున్న ఓ థియేటర్​పై రష్యా బలగాలు దాడులు చేసింది. మూడు వారాలుగా మరియుపోల్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మారణకాండకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది మరియుపోల్​ సిటీ.. నగరాన్ని నలువైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. తిండి, నీళ్లు అందకుండా అడ్డుకోవడంతో పాటు, కరెంట్​సరఫరాను నిలిపేశాయి. ఇప్పటి దాకారష్యా దాడుల్లో 2,300 మంది ఉక్రెయిన్​ పౌరులు, సైనికులు చనిపోగా.. వేల మంది గాయపడ్డారు.

రష్యా సైన్యంలో 14 మంది టాప్ ఆఫీసర్లు చనిపోయిన్రు

ఉక్రెయిన్​లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్న రష్యాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు ఆర్మీ జనరల్స్ సహా 13  మంది టాప్ ఆఫీసర్లను పోగొట్టుకున్న రష్యాకు మరోసారి షాక్ తగిలింది. తాజాగా రష్యా నేవీ డిప్యూటీ కమాండర్ ను కూడా హతమార్చినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. నల్ల సముద్రంలో రష్యన్ నేవీకి ఫస్ట్ ర్యాంక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమాండర్ ఆండ్రీ పలియ్ (51)ను మేరియపోల్ సిటీ సమీపంలో కాల్చిచంపినట్లు ఆదివారం ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో రష్యన్ బలగాలు ఇప్పటివరకు 14 మంది టాప్ ఆఫీసర్లను కోల్పోయినట్లయింది. అయితే, రష్యన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉక్రెయిన్ లో పని చేయకపోవడంతో అంత సురక్షితం కాని కమ్యూనికేషన్స్ నెట్ వర్క్ ను వాడటం వల్లే టాప్ ఆఫీసర్లు ఉన్న ప్రాంతాలను పసిగడుతూ ఉక్రెయిన్ బలగాలు దాడులు చేస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆండ్రీ పలీయ్ ఉక్రెయిన్​లోని కీవ్ లోనే పుట్టాడు. 1993లో ఉక్రెయిన్ మిలిటరీలో చేరేందుకు వచ్చిన అవకాశాన్ని కాదని రష్యన్ నార్తర్న్ ఫ్లీట్​లో చేరాడు. ఇప్పుడు పుట్టిన దేశంలోనే చనిపోయాడు. మరోవైపు విదేశాల నుంచి ఉక్రెయిన్ వచ్చిన ఫైటర్లు, సోల్జర్లకు జైటోమిర్ రీజియన్ లోని ఓవ్ రుచ్ గ్రామం వద్ద ట్రెయినింగ్ ఇస్తున్న ప్లేస్ పై తాము బాంబు దాడి చేశామని, ఇందులో 100 మందికి పైగా చనిపోయారని రష్యా ప్రకటించింది. 

చనిపోయిన రష్యన్ టాప్ ఆఫీసర్లు వీళ్లే.. 

కెప్టెన్ ఆండ్రీ పలీయ్: రష్యన్ నేవీలో డిప్యూటీ కమాండర్, నల్ల సముద్రంలో రష్యన్ నేవీ యూనిట్ ఫస్ట్ ర్యాంక్ కెప్టెన్. 
కర్నల్ సెర్గీ సుఖరెవ్: 331వ గార్డ్స్ పారాచూట్ అసాల్ట్ రెజిమెంట్ లో కర్నల్.  
మేజర్ జనరల్ ఓలెగ్ మితయేవ్: 150వ మోటారైజ్డ్ రైఫిల్ డివిజన్ కమాండర్. 
మేజర్ జనరల్ ఆండ్రీ కొలెస్నికోవ్: 29వ కంబైన్డ్ ఆర్మీ కమాండర్. 
మేజర్ జనరల్ విటలి గెరాసిమోవ్: 41వ ఆర్మీ యూనిట్ ఫస్ట్ డిప్యూటీ కమాండర్. 
మేజర్ జనరల్ ఆండ్రే సుఖోవెస్కీ: 41వ కంబైన్డ్ ఆర్మీ యూనిట్ డిప్యూటీ కమాండర్. 
కర్నల్ ఆండ్రీ జఖరోవ్: రష్యన్ ఆర్మీలో కర్నల్.  
లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి సఫ్రోనోవ్: రష్యన్ మెరైన్ బ్రిగేడ్ లీడర్. 
లెఫ్టినెంట్ కర్నల్ డెనిస్ గ్లెబోవ్: ఎయిర్ అసాల్ట్ బలగాల లీడర్.    
కర్నల్: కాన్ స్టాంటైన్ జిజెవ్ స్కీ: ఎయిర్ అసాల్ట్ బలగాల లీడర్.      
జనరల్ మాగోమ్డ్ తుషేవ్: చెచెన్ ప్రత్యేక బలగాలకు లీడర్. 
వ్లాదిమిర్ జోంగా: నియో నాజీ స్పార్టా బెటాలియన్ లీడర్. 
జార్జీ డుడోరోవ్: 106వ తులా గార్డ్స్ ఎయిర్ బోర్న్ డివిజన్​లో డిప్యూటీ కమాండర్. 
అలెక్సీ అలెష్కో: పారాట్రూప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్.

14వేల 700మంది రష్యా సైనికులు హతం: ఉక్రెయిన్

రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా తిప్పికొడుతున్నాయి. మరో రష్యా జనరల్ ను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ఇప్పటి వరకు 14 వేల 700 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 476 యుద్ధ ట్యాంకులు, 1487 సాయుధ వాహనాలు, 96 విమానాలను ధ్వంసం చేశామని ప్రకటించారు. 118  హెలికాప్టర్లు, 21 యూఏవీలను నేలకూల్చినట్లు చెప్పారు. రష్యాకు చెందిన ఎయిర్ బోర్న్ రెజిమెంట్ మొత్తాన్ని తమ దళాలు నాశనం చేశాయని ఉక్రెయిన్ ప్రకటించింది.


రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 115 మంది చిన్నారులు మృతి

ఉక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన దాడుల్లో ఇప్పటి వరకు 115 మంది చిన్నారులు చనిపోయారని ఉక్రెయిన్ పార్లమెంట్ ప్రకటించింది. క్రూయిజ్ క్షిపణులతో 400 మంది ఆశ్రయం పొందుతున్న ఓ ఆర్ట్ స్కూల్ పై మాస్కో సేనలు దాడులు చేశాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం.  క్షిపణుల దాడుల్లో కుప్పకూలిన భవన శిథిలాల కింద వందల మంచి చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన యుద్దంలో ఇప్పటి వరకు 115 మంది అమాయక చిన్నారులు కన్నుమూశారని మరో 140మందికిపైగా గాయపడ్డారని ఉక్రెయిన్ పార్లమెంట్ పేర్కొంది. ‘ఇవి సంఖ్యలు కావు.. వందలాది ఉక్రెనియన్ కుటుంబాల తీరని శోకానికి కొలమానం..’ అంటూ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేసింది. 

ఉక్రెయిన్కు ఆస్ట్రేలియా సాయం
రష్యా బాంబు దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ దేశానికి ఆస్ట్రేలియా సాయం ప్రకటించింది. ఉక్రెయిన్ కు మిలటరీతో పాటు..మానవతా సాయం అందిస్తామని తాజాగా ఆస్ట్రేలియా ప్రకటించింది. 21 మిలియన్ డాలర్ల మిలటరీ సాయం.. 21 మిలియన్ డాలర్ల మానవతా సాయం ప్రకటించారు. మరోవైపు రష్యా అల్యూమినియం, బాక్సైట్ ఎగుమతులను ఆస్ట్రేలియా నిలిపివేసింది. 

నల్ల సముద్రంపై నౌకల నుంచి రష్యా దాడులు
ఉక్రెయిన్ పై బాంబులు, క్షిపణులతో రష్యా దాడులు ముమ్మరం చేసింది. ఇటు నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రంలోని నౌకల నుంచి ఉక్రెయిన్ పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది. మరోవైపు పోర్ట్ సిటీ మరియుపోల్ పై బీకరదాడులు కొనసాగుతున్నాయి. 400 మంది ఆశ్రయం పొందుతున్న ఓ ఆర్ట్ స్కూల్ పై మాస్కో సేనలు దాడులు చేశాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద వందల మంచి చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 
 

తొలిసారి హైపర్ సోనిక్ మిసైల్​తో రష్యా దాడి
శుక్రవారం తొలిసారిగా కింజాల్(డ్యాగర్) హైపర్ సోనిక్ మిసైల్​నూ ప్రయోగించింది. నాటో సభ్య దేశం రొమేనియాకు బార్డర్​లో, పశ్చిమ ఉక్రెయిన్ లో ఉన్న ఇవనో ఫ్రాన్కివిస్క్ ఏరియాలోని డెలియటిన్ గ్రామం వద్ద అండర్ గ్రౌండ్ లో మిసైల్స్, పేలుడు పదార్థాలను దాచి ఉంచిన గోడౌన్​ను కింజాల్ క్షిపణితో పేల్చేసినట్లు శనివారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ధ్వని వేగం కంటే 10 రెట్లు స్పీడ్ గా.. గంటకు 12,250 కిలోమీటర్లు దూసుకెళ్లే కింజాల్ క్షిపణులను ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగించడం ఇదే మొదటిసారి అని రష్యన్ మీడియా సంస్థ ఆర్ఐఏ నొవస్తి వెల్లడించింది. కింజాల్ మిసైల్​ను అడ్డుకునే రక్షణ వ్యవస్థలు ప్రస్తుతం ఏ దేశం వద్దా లేవని తెలిపింది. 2011 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసంచేసే కింజాల్ క్షిపణితో అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని,  కానీ శుక్రవారం నాటి దాడిలో సాధారణ వార్ హెడ్ నే ఉపయోగించారని పేర్కొంది.

15 వేల రష్యన్ సోల్జర్లు మృతి? 
యుద్ధంలో ఇప్పటివరకు 15 వేల మంది రష్యన్ సోల్జర్లు చనిపోయారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. అయితే, 7 వేల మంది రష్యన్ సైనికులు చనిపోయి ఉండొచ్చని అమెరికన్ అధికారులు వెల్లడించగా, తమ సైనికులు 500 మందే చనిపోయారని రష్యా చెప్తోంది. శనివారం రష్యాకు చెందిన మరో జనరల్ చనిపోయాడని, దీంతో యుద్ధంలో చనిపోయిన రష్యన్ ఆర్మీ జనరల్స్ సంఖ్య ఐదుకు చేరినట్లు మీడియా తెలిపింది. అయితే, ఉక్రెయిన్ లో చనిపోయిన రష్యన్ సోల్జర్ల మృతదేహాలను అర్ధరాత్రి ట్రెయిన్​లో ఎక్కించి తరలిస్తున్నారని, వారం రోజుల్లోనే 2,500 మృతదేహాలను రష్యాకు పంపారని హోమెల్ సిటీలోని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక ఉక్రెయిన్​లో శుక్రవారం నాటికి  847 మంది పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. కానీ వాస్తవ మృతుల సంఖ్య ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువని భావిస్తున్నారు.

వెంటనే చర్చలకు రావాలె: ఉక్రెయిన్​ ప్రెసిడెంట్
రష్యా ఆలస్యం చేయకుండా వెంటనే శాంతి చర్చలకు ముందుకు రావాలని శనివారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ వీడియో మెసేజ్ లో పిలుపునిచ్చారు. ‘‘శాంతి కోసం, ఉక్రెయిన్ కోసం, మా భద్రత కోసం ఆలస్యం చేయకుండా అర్థవంతమైన, న్యాయమైన చర్చలు జరపాలి. రష్యా తన సొంత తప్పులతో చేసుకున్న నష్టాన్ని తగ్గించుకునేందుకు ఇదొక్కటే మార్గం” అని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్ కు న్యాయం చేయాలి. దేశ భూభాగ సమగ్రతను పునరుద్ధరించాలి. ఇందుకోసం భేటీకి, చర్చలకు ఇదే తగిన సమయం. కాదంటే.. యుద్ధంలో జరిగే నష్టాల నుంచి రష్యా కోలుకునేందుకు ఎన్నో తరాలు పడుతుంది” అని జెలెన్ స్కీ హెచ్చరించారు.

ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్

ఉక్రెయిన్ తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చల విషయంలో ఉక్రెయిన్ తీరు సరిగా లేదని మండిపడ్డారు. చర్చలను జెలెన్స్కీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ అధికారులు చర్చల విషయంలో ఉత్సాహంగా ఉన్నారని.. కానీ ఉక్రెయిన్ వైపు నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదన్నారు. సమస్యకు పరిష్కారం చూపించేందుకు తాము రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. సెక్యూరిటీ కౌన్సిల్ తో భేటీ అయిన ఆయన.. ఉక్రెయిన్ ఆపరేషన్ పై చర్చించారు. మరోవైపు రష్యాకు చైనా సహకరిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. జిన్ పింగ్ తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై దాడులు ఆపేలా పుతిన్ మీద ఒత్తిడి తీసుకురావాలని జిన్ పింగ్ ను ఆయన కోరారు. 

816 మంది పౌరుల మృతి

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో 816 మంది ప్రజలు చనిపోయారని యునైటెడ్ నేషన్స్ శుక్రవారం తెలిపింది. 1,333 మంది గాయపడ్డారని చెప్పింది. రష్యా ప్రయోగించిన మిసైల్స్, బాంబుల దాడిలోనే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చంది. యుద్ధం భీకరంగా జరుగుతున్న మరియుపోల్ లాంటి కొన్ని సిటీల్లో ఎంతమంది చనిపోయారనేది కచ్చితంగా తెలియలేదంది.

బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ

అదనపు మిలిటరీ సాయం చేసినందుకు అమెరి కా అధ్యక్షుడు బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఆ సాయం ఏంటనేది బయటికి చెప్పలేదు. అది రష్యాకు తెలియడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ‘‘ఫిబ్రవరి 24న దాడి మొదలుపెట్టినప్పుడు.. 2014లో క్రిమియాను ఎలాంటి ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్నట్లే ఇప్పుడు కూడా చేసుకోవచ్చని రష్యా అనుకుంది. కానీ రష్యా ఊహించిన దాని కంటే బలమైన రక్షణ వ్యవస్థ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉంది. అయితే మమ్మల్ని మేం రక్షించుకోవడానికి మా దగ్గర ఏం ఉంది? దాడిని ఎదుర్కొనేందుకు మేం ఎలా సన్నద్ధం అయ్యామనేది రష్యాకు తెలియదు” అని చెప్పారు. చర్చల్లో పురోగతి వచ్చినట్లు రష్యా, ఉక్రెయిన్ ప్రకటించగా.. తమ చర్చల వ్యూహాన్ని వెల్లడించబోమని జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ తెలిపారు. ‘‘టెలివిజన్, రేడియో, ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంటే మౌనంగానే ఎక్కువ పని చేస్తున్నా. అదే సరైన మార్గంగా నేను భావిస్తున్నా” అని జెలెన్​స్కీ చెప్పారు.

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ కేంద్రంపై దాడులు

పశ్చిమాన, పోలెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 70 కిలోమీటర్ల దూరంలోని లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిపోయే ప్రజలకు.. దేశంలో ఉన్న వాళ్లకు సాయం చేసేందుకు వచ్చే వారికి, ఉక్రెయిన్ తరఫున పోరాడే వాళ్లు వచ్చేందుకు ఈ సిటీ కీలక కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే మిసైల్ దాడులు జరిగాయి. మిలిటరీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా అటాక్ చేసింది. నల్ల సముద్రం నుంచి మొత్తం 6 మిసైళ్లను ప్రయోగించగా.. ఒకటి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ కేంద్రంపై, మరొకటి బస్ గ్యారేజీపై పడ్డాయి. దీంతో భారీగా నష్టం జరిగింది. ఒకరు గాయపడినట్లు రీజనల్ గవర్నర్ తెలిపారు. సిటీలో ఉదయం 6 గంటల టైంలో పేలుళ్లు సంభవించాయని, పేలుడు ధాటికి దగ్గర్లోని భవనాలు కంపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక బస్సు రిపేర్ చేసే కేంద్రం కూడా డ్యామేజ్ అయినట్లు లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్ అండ్రీ సడోవ్యీ తెలిపారు. 

యుద్ధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ లో ఆహార సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆరోగ్య సంరక్షణ కార్యాలయాలపై జరిగిన దాడుల్లో 12 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. 34 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఉక్రెయిన్ లో తక్షణ కాల్పుల విరమణ, రాజకీయ పరిష్కారం కోసం కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని కోరారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్.. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు రక్షించే ఏకైక ఔషధం..శాంతిచర్చలేనన్నారు. ఉక్రెయిన్ కు తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది డబ్ల్యూహెచ్ వో.. ఇప్పటికే 100 మెట్రిక్ టన్నుల సామాగ్రిని పంపామని తెలిపింది.

రష్యా దాడుల్లో ఉక్రెయిన్ నటి మృతి

రష్యా జరిపిన రాకెట్ దాడుల్లో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్(67) దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం ఉక్రెయన్ రాజధాని కీవ్ నగరంపై రాకెట్ దాడులతో రష్యా విరుచుకుపడింది. ఈ క్రమంలోనే రెసిడెన్షియల్ భవనాలపై రష్యన్ ఆర్మీ రాకెట్ బాంబులు వదిలింది. ఈ దాడిలో నటి ఒక్సానా అక్కడికక్కడే చనిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఒక్సానా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మృతితో సినీ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రష్యా విచ్ఛిన్నానికి పశ్చిమ దేశాల కుట్ర

ఉక్రెయిన్ విషయంలో రష్యా తన లక్ష్యాన్ని సాధించి తీరుతుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించారు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సహించమని హెచ్చరించారు. ఉక్రెయిన్తో చర్చలకు రష్యా సిద్ధంగా ఉందన్న పుతిన్.. సైనిక చర్య మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రష్యాను నాశనం చేసేందుకు కొందరు దేశ ద్రోహులను పశ్చిమ దేశాలు పావులుగా వాడుకుంటున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాను వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులుగా అభివర్ణించిన ఆయన.. అలాంటి వారిని రష్యన్లు తేలికగా గుర్తిస్తారని అన్నారు. రష్యాను విభజించేందుకు పౌరుల మధ్య ఘర్షణలు తలెత్తేలా కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాను నాశనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు.

రష్యా ఆయిల్‌‌ కొనుగోలుకు భారత కంపెనీల టెండర్లు

ఉక్రెయిన్‌‌‌‌పై దాడి చేసినందుకు రష్యాపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ,   ఆ దేశం నుంచి క్రూడ్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ను మాత్రం అగ్గువకే కొనేస్తున్నాం.  తక్కువ రేటుకే దొరుకుతుండడంతో రష్యా ఆయిల్‌ను దేశంలోని ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు కొనసాగుతుండడంతో  రష్యా క్రూడాయిల్ ఉరల్స్‌‌‌‌ రేటు మార్కెట్‌‌‌‌లో తక్కువగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లోని బ్యారెల్ బ్రెంట్‌‌‌‌ క్రూడాయిల్ రేటు కంటే ఉరల్స్ రేటు 20–25 డాలర్లుగా తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని ఆయిల్ కంపెనీలు గత ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి పెట్రోల్‌‌‌‌,డీజిల్ రేట్లను మార్చలేదు. పెరుగుతున్న క్రూడాయిల్ రేట్ల భారాన్ని తగ్గించుకోవాలంటే తక్కువ రేటుకే దొరుకుతున్న రష్యా ఆయిల్‌‌‌‌ను కొనుక్కోవడం మంచిదని కంపెనీలు భావిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌‌‌ (ఐఓసీ)  20 లక్షల బ్యారెళ్ల ఉరల్స్ కోసం  ఆర్డర్లు పెట్టుకుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌ కూడా మే నెల అవసరాల కోసం 10 లక్షల బ్యారెళ్ల రష్యా ఆయిల్ కోసం టెండర్లు వేసిందని అన్నారు. ఈ రెండు కంపెనీలు డైరెక్ట్‌‌‌‌గా రష్యన్ గవర్నమెంట్‌‌‌‌ నుంచి ఆయిల్ కొనకుండా, ఉరల్స్‌‌‌‌ను అమ్మే  కంపెనీ విటల్‌‌‌‌  నుంచి కొనుగోలు చేయడానికి టెండర్లు పెట్టుకున్నాయి. ఓఎన్‌‌‌‌జీసీ సబ్సిడరీ కంపెనీ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్‌‌‌‌ (ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌) కూడా 10 లక్షల  బ్యారెళ్ల ఆయిల్‌‌‌‌ను కొనేందుకు టెండర్లు వేయనుందని వార్తలొస్తున్నాయి.  రష్యా ఆయిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడే కొనుక్కోవాలని కంపెనీలు ఆత్రుత పడుతున్నాయి.  మరోవైపు రష్యన్ ఆయిల్‌‌‌‌ కొనేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌ ఆసక్తి చూపించడం లేదు. ఈ కంపెనీకి యూఎస్‌‌‌‌లో బిజినెస్‌‌‌‌లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో  రష్యన్ ఆయిల్ కొంటే తమపై నెగెటివ్ ప్రభావం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అమెరికా, రష్యా మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులు

తొలిసారి అమెరికా మరియు రష్యా మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులు చోటుచేసుకున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్  సులివాన్  నిన్న రష్యా భద్రతా మండలి కార్యదర్శి తో మాట్లాడినట్టు శ్వేతసౌధం వెల్లడిచింది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. దౌత్యం గురించి రష్యా సీరియస్ గా ఉంటే గనక తక్షణమే ఉక్రెయిన్  నగరాలు, పట్టణాలపై దాడులు మానుకోవాలని అమెరికా సూచించింది. ఇటు యుద్ధంపై స్పందించిన పుతిన్.. ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్ పై ప్రత్యేక ఆపరేషన్  కొనసాగిస్తున్నామని, దానిలో విజయం సాధిస్తామని చెప్పారు. పశ్చిమ దేశాలు మాపై విధిస్తున్న ఆంక్షలు తమపై దురాక్రమణ కిందికి వస్తాయని.. ఇవి మమ్మల్ని ఏమీ చేయలేవన్నారు పుతిన్.
 

అమెరికా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి జెలెన్ స్కీ వర్చువల్ ప్రసంగం
రష్యా తమ నగరాలపైనే కాకుండా తమ విలువలు, స్వేచ్ఛగా జీవించే హక్కులపై కూడా దాడి చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి జెలెన్ స్కీ వర్చవల్ గా ప్రసంగించారు. ప్రపంచానికి పెద్దన్నగా ఉండటం అంటే.. శాంతికి నాయకత్వం వహించడమన్నారు. అది జో బైడెన్ చేస్తున్నారని తెలిపారు. రష్యన్ బలగాలు ఇప్పటికే వెయ్యికి పైగా మిస్సైళ్లను తమ నగరాలపై పేల్చాయని.. తమ పౌరుల్ని ఖాళీ చేయించేందుకు.. ఉక్రెయిన్ ను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని అమెరికాను కోరారు జెలెన్ స్కీ. 

మేరియుపొల్  నుంచి మానవతా కారిడార్ ద్వారా 20వేల మంది తరలింపు
దాదాపు 20,000 మంది పౌరులు మేరియుపొల్  నుంచి మానవతా కారిడార్  ద్వారా తరలివెళ్లారు. 12 పట్టణాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. రష్యా నౌకాదళం కూడా పెద్దఎత్తున దాడులు చేస్తోంది. ఖర్కివ్ లో ప్రవేశించాలన్న రష్యా దళాల ప్రయత్నాలను తిప్పికొట్టామని ఉక్రెయిన్  తెలిపింది. చెర్నిహైవ్ లో ఆహారం కోసం వరసలో నిల్చొన్నవారిలో 10 మందిని రష్యా దళాలు పొట్టనపెట్టుకున్నాయి.

 

ఇప్పటి వరకు 14వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం: ఉక్రెయిన్ అధికారులు
యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 14 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. 430 యుద్ధ ట్యాంకులు, 1375 సాయుధ వాహనాలు, 84 యుద్ధ విమానాలు, 180 హెలికాప్టర్లు, 11 డ్రోన్లను తమ సైన్యం కూల్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. 
 

పోర్ట్ సిటీలో భీకర దాడులు..రష్యాకు చెందిన నాలుగో మేజర్ జనరల్ మృతి
పోర్ట్ సిటీలో జరిగిన బీకర దాడుల్లో రష్యాకు చెందిన నాలుగో మేజర్ జనరల్ చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. రష్యాకు చెందిన రెండు SU-34 సహా.. మూడు యుద్ధ విమానాలు, ఓ చాపర్ ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది.


రష్యాకు వ్యతిరేకంగా భారత న్యాయమూర్తి దల్వీర్ భండారీ ఓటు
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దండయాత్రపై అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రష్యా దళాలు తమ దాడులను నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉన్న ఈ కోర్టులో 13-2 మెజారిటీతో ఈ తీర్పు వెలువడింది. ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారి ఈ తీర్పును వ్యతిరేకిస్తూ రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. అంతర్జాతీయ వేదికలపై యుద్ధంపై ఓటింగ్  భారత్ దూరంగా ఉంటూ వస్తోంది. అయితే నిన్న ఐసీజేలో మాత్రం రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యత ఏర్పడింది. 

అంతర్జాతీయ కోర్టు ఆదేశాలు రష్యా గౌరవించాలి: అమెరికా
ఉక్రెయిన్ దేశంపై బాంబు దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలను అమెరికా స్వాగతిచ్చింది. ఈ ఆదేశాలను రష్యా గౌరవించాలని అమెరికా సూచించింది. వెంటనే యుద్ధాన్ని ఆపేసి బలగాలను వెనక్కి తీసుకోవాలని అమెరికా డిమాండ్ చేసింది. రష్యా ఏకపక్ష దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కు అమెరికా తోపాటు ప్రపంచ దేశాలు అండగా నిలవాలని ఆయన కోరారు. తమ వంతుగా ఆర్ధిక సాయంతోపాటు ఆయుధాలు కూడా అందిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. 
 

దాడుల ఉధృతి పెంచిన రష్యా..కీవ్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు

ఉక్రెయిన్​ డిఫెన్స్​ను కకావికలం చేసేందుకు రష్యా అన్నిరకాలుగా ప్రయత్ని స్తోంది. కీవ్​తో పాటు ప్రధాన నగరాలపై దాడులు పెంచింది. ఉక్రెయిన్​ను స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మూడు వారాలు పూర్తయి నా సాధ్యంకాక పోవడంతో రష్యాలో అసహనం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఓవైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు దాడులు పెంచింది. కీవ్​ సిటీపై బాంబు ల వర్షం కురిపించడంతో 12అంతస్తుల బిల్డింగ్​లో మంటలు చెలరేగా యి. చుట్టుపక్కల బిల్డింగ్​లకూ నిప్పంటుకుంది. కీవ్​ సిటీకి ఇంకా 15 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నట్టు సమాచారం.

ఉక్రెయిన్​కు భారీగా అందుతున్న ఆయుధాలు

యూరప్ దేశాల నుంచి ఉక్రెయిన్​కు భారీగా యాంటీ ట్యాంక్ మిసైల్స్ అందినట్టు మిలిటరీ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రష్యాతో పోరు లో ఈ మిస్సైల్స్ ​కీలకం.. రష్యా బలగాలను అడ్డుకోవడంలో ఉక్రెయిన్​ సేనలకు ఎంతో సహాయం చేస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్​కు అందిన యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ వివరాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

తెరపైకి ‘న్యూట్రల్’​ ప్రతిపాదన

ఉక్రెయిన్​లో మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు స్వీడన్, ఆస్ట్రియా మాదిరిగా ఉక్రెయిన్​కు న్యూట్రల్​ హోదా కల్పించాలనే ప్రతిపాదనపై సంప్రదింపులు జరుగుతున్నాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​ చెప్పారు. ఇది ఒక ఆప్షన్​ మాత్రమే అని, దీనిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, దీనికి ఒప్పుకుంటే రాజీ కుదిరినట్టేనని ఆయన పేర్కొన్నారు.

మా భద్రతకు గ్యారంటీ కావాలె: శక్తి సంపత్తులున్న దేశాలను కోరిన ఉక్రెయిన్

తమ భద్రతకు గ్యారంటీ కల్పించాలని శక్తి సంపత్తులున్న దేశాలను ఉక్రెయిన్​ కోరింది. భవిష్యత్తులో తమపై రష్యా దాడులు చేయకుండా రక్షణ కల్పించాలని డిమాండ్​ చేసింది. ఆస్ట్రియా, స్వీడన్ మాదిరిగా కీవ్​కు న్యూట్రల్​ స్టేటస్​ కల్పించాలంటూ రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్​ తోసిపుచ్చింది. ‘‘ఉక్రెయిన్​ ఇప్పుడు రష్యాతో నేరు గా యుద్ధంలో ఉంది. ఇప్పుడు మాకు చట్టబద్ధంగా నిలబడే సెక్యూరిటీ గ్యారంటీలు కల్పించాలె”అని ఉక్రెయిన్​ నెగోషియేటర్​ మిఖైలో పొడోల్యాక్ వెల్లడించారు.

ఇప్పుడు మీ సాయం అవసరం.. అమెరికాకు జెలెన్​స్కీ విజ్ఞప్తి
వాషింగ్టన్: రష్యాతో యుద్ధంలో తమకు అమెరికా సహాయం ఇప్పుడు మరింత అవసరమని ఉక్రెయి న్​ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ కోరారు. అమెరికన్​ కాంగ్రెస్​ను ఉద్దేశించి బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పెరల్​ హార్బర్, 9/11 ఉగ్రవాద దాడి ఘటనలను ఆయన ప్రస్తావించారు. 

యుద్ధం ఆపండి రష్యాకు అంతర్జాతీయ కోర్టు ఆదేశం
ఉక్రెయిన్​లో మిలిటరీ ఆపరేషన్లన్నింటినీ ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) రష్యాను ఆదేశించింది. ‘‘ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్​ భూభాగంలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్లను రష్యన్​ ఫెడరేషన్​ వెంటనే నిలిపివేయాలి”అని ఐసీజే న్యాయమూర్తులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 13–2 ఓటింగ్​తో ఐసీజే న్యాయమూర్తులు ఆదేశాలిచ్చారు. రష్యా, చైనా న్యాయమూర్తులు ఈ ఆదేశాలతో ఏకీభవించలేదు. ఇది స్పెషల్​ మిలిటరీ ఆపరేషన్​ అని ఐసీజేలో రష్యా సమర్థించుకుంది. ఐసీజే ఆదేశాలను పాటించని దేశాలను యునైటెడ్​ నేషన్స్​ సెక్యూరిటీ కౌన్సిల్​కు రిఫర్​ చేస్తారు.

ఉక్రెయిన్​లోని ప్రధాన నగరాలపై 21 రోజులుగా రష్యా దాడులు  కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌‌‌‌కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా ఆక్రమణలో చిక్కుకున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌కు నాటో సభ్య దేశాలైన చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, పోలెండ్ లీడర్లను పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విషయంలో ఈయూ మద్దతును తెలియజేయడమే తమ పర్యటన లక్ష్యమని చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ట్వీట్ చేశారు. ఈయూ మిషన్‌‌‌‌లో భాగంగా ఆయనతోపాటు స్లొవేకియా ప్రధాని జానెజ్ జాన్సా, పోలెండ్ ప్రధాని మాటెయుస్జ్ మొరావీకి, పోలెండ్ డిప్యూటీ ప్రధాని జార్‌‌‌‌‌‌‌‌స్లా కక్జిన్‌‌‌‌స్కీ తదితరులు వెళ్లనున్నారు. కీవ్‌‌‌‌ను రష్యా చుట్టుముట్టిన నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్లో మరో మేయర్ కిడ్నాప్

కీవ్: ఓ వైపు ఉక్రెయిన్ దేశంపై బాంబు దాడులు విధ్వంసం సృష్టిస్తూ మరో వైపు చర్చలు కొనసాగిస్తున్న రష్యా తాజాగా మరో మేయర్ ను కిడ్నాప్ చేసింది. స్కాడోవ్స్క నగర మేయర్ ఒలెక్సాండర్ యూకోవ్లీవ్ తోపాటు ఆయన డిప్యూటీ యూరి పల్యూఖ్ లను కిడ్నాప్ చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా వెల్లడించారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరినీ కిడ్నాప్ చేస్తోందని.. ఇప్పటి వరకు కిడ్నాప్ చేసిన వారందరినీ సురక్షితంగా విడుదల చేయాలని అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని దిమిత్రో కులేబా ట్వీట్ ద్వారా కోరారు. 

 

 

రష్యా ఆఫర్‌‌.. వాడుకుంటే చరిత్రలో భారత్‌కు ‘చెడ్డ పేరు’!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దానికి దిగడంతో అమెరికా, పలు యూరోపియన్ దేశాలు.. రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టి సతమతం చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా ఆ దేశంతో లావాదేవీలను బంద్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తన వద్ద ఉన్న క్రూడాయిల్‌ చౌకగా అమ్ముతామని భారత్‌కు ఆఫర్ ఇచ్చిందని, ఈ ప్రతిపాదనపై భారత్ పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా స్పందించింది. రష్యా ఇస్తున్న డిస్కౌంట్ ఆఫర్‌‌ను భారత్ వాడుకుని, ఆ దేశం నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తే అదేమీ తాము విధించిన ఆంక్షల ఉల్లంఘన కిందికి రాదని పేర్కొంది.  అయితే ఈ సమయంలో రష్యా ఆఫర్‌‌ను వాడుకుంటే చరిత్రలో భారత్ తప్పు వైపు నిలబడిందన్న చెడ్డ పేరు నిలబడిపోతుందని అభిప్రాయపడింది. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

పుతిన్ యుద్ధ నేరస్థుడు.. అమెరికా సెనేట్ తీర్మానం

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ అమెరికా సెనేట్ తీర్మానం చేసింది. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను యుద్ధ నేరస్థుడంటూ పెట్టిన తీర్మానానికి అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం సమావేశమైన సెనేట్‌లో రిపబ్లికన్‌ సెనేటర్‌‌ లిండ్సే గ్రాహం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ఇటు రిపబ్లికన్లు, అటు డెమోక్రాట్లు రెండు పక్షాలు సమర్థించాయి. ఉక్రెయిన్ ప్రజలపై రష్యన్ బలగాలు చేస్తున్న దురాగతాలకు పుతిన్ జవాబుదారీ వహించాలని, ఆయనను యుద్ధ నేరస్థుడిగా ఇంటరాగేట్ చేయాలని సెనేట్‌లోని ప్రతినిధులంతా అభిప్రాయపడ్డారని డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ చుక్ షూమర్ అన్నారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఉక్రెయిన్‌‌‌‌కు మద్దతుగా ఈయూ కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌‌‌‌కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా ఆక్రమణలో చిక్కుకున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌కు నాటో సభ్య దేశాలైన చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, పోలెండ్ లీడర్లను మంగళవారం పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విషయంలో ఈయూ మద్దతును తెలియజేయడమే తమ పర్యటన లక్ష్యమని చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ట్వీట్ చేశారు. ఈయూ మిషన్‌‌‌‌లో భాగంగా ఆయనతోపాటు స్లొవేకియా ప్రధాని జానెజ్ జాన్సా, పోలెండ్ ప్రధాని మాటెయుస్జ్ మొరావీకి, పోలెండ్ డిప్యూటీ ప్రధాని జార్‌‌‌‌‌‌‌‌స్లా కక్జిన్‌‌‌‌స్కీ తదితరులు వెళ్లనున్నారు. కీవ్‌‌‌‌ను రష్యా చుట్టుముట్టిన నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఉక్రెయిన్​కు ఆయుధాలిస్తం: బైడెన్

వాషింగ్టన్​: రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్​కు అండగా నిలుస్తామని అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్​ స్పష్టం చేశారు. రష్యాను నిలువరించేందుకు ఆయుధాలను అందజేస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్​ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డబ్బు, ఆహారం పంపించడంతో పాటు అక్కడి నుంచి వచ్చే శరణార్థులను అక్కున చేర్చుకుంటామని బైడెన్​ స్పష్టం చేశారు. కిందటేడాది ఉక్రెయిన్​కు 1.2 బిలియన్​డాలర్ల రక్షణ సాయం చేసినట్లు వివరించారు.

ఉక్రేనియన్ల కోసం పిల్లాడి సాయం

యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రేనియన్లకు సాయం చేసేందుకు ఐదేండ్ల పిల్లాడు ముందుకొచ్చాడు. గల్లా పెట్టెలో దాచుకున్న రూ.1500 ఇచ్చాడు. లియామ్ మూర్ ది కెనడాలోని అంటారియో. నర్సరీ చదువుతున్నాడు. ఉక్రేనియన్లకు ఆర్థిక సాయం చేసేందుకు గాను స్కూల్​లో ఫండ్ రైజింగ్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మూర్.. తన గల్లా పెట్టె పట్టుకొని స్కూల్​కు వెళ్లాడు. అందులోని డబ్బులన్నీ తీసిచ్చేశాడు. మూర్ పెద్ద మనసుకు అందరూ ఫిదా అయ్యారు. ఐదేండ్ల పిలగాడు ఉక్రేనియన్ల కష్టాన్ని అర్థం చేసుకున్నాడని ఏడో తరగతి స్టూడెంట్ గౌవ్స్ వెల్ అన్నాడు. ఈ ఫండ్​ రైజింగ్​ పోగ్రాంలో 2,000 యూఎస్ డాలర్లు పోగుచేశామని చెప్పాడు.

ఉక్రెయిన్ - రష్యా మధ్య చర్చలు పునః ప్రారంభం

ఉక్రెయిన్ - రష్యా మధ్య మంగళవారం నాలుగో విడత చర్చలు పునః ప్రారంభం అయ్యాయి. కాల్పుల విరమణ కోసం ఇరు దేశాల విదేశాంగ మంత్రివర్గ ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. కాల్పుల విరమణతోపాటు ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా  దళాలు వెనక్కి వెళ్లాలనే అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ప్రకటించారు. ఆన్ లైన్ వేదికగా నిన్న జరిగిన చర్చలు.. విరామం తర్వాత ఇవాళ మళ్లీ ప్రారంభం అయ్యాయని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ట్వీట్ చేశారు

రాజధాని కీవ్ నగరంపై రష్యా సేనల ముప్పేట దాడి

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే దిశగా దాడులు ముమ్మరం చేసింది రష్యా. ఉదయం స్వియాటోషిన్ స్కీ డిస్ట్రిక్ లోని 16 ఫ్లోర్ల బిల్డింగ్ పై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారంది ఉక్రెయిన్ ప్రభుత్వం. మరో 27 మందిని రక్షించామన్నారు అధికారులు. సోమవారం స్థానికంగా ఓ నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు చనిపోయారంది ఉక్రెయిన్ అత్యవసర సేవావిభాగం. పది మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. మరోవైపు దాడుల కారణంగా కీవ్ సమీపంలోని అంటోనోవ్  ఏవియేషన్  ఇండస్ట్రీ పార్క్  మంటల్లో చిక్కుకుంది.

రష్యా బలగాల ఆధీన ప్రాంతంలో 9మానవతా కారిడార్లు ఏర్పాటు

రష్యా బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి పౌరుల తరలింపునకు 9 మానవతా కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్ చుక్. మరియుపోల్ కు సహాయ సామగ్రి చేరవేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. రివ్నే ప్రాంతంలో టీవీ టవర్ పై రష్యా జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 19కి చేరిందన్నారు స్థానిక గవర్నర్ విటాలి కోవల్.

ఉక్రెయిన్లో మరో 30రోజులు మార్షల్ లా

ఉక్రెయిన్ లో మరో 30 రోజులపాటు మార్షల్ లా పొడగించేలా బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్షుడు జెలెన్ స్కీ. మార్చి 26 నుంచి ఈ చట్టాన్ని మరోసారి పొడగించాలని బిల్లులో పేర్కొన్నట్లు తెలిపాయి స్థానిక మీడియా సంస్థలు. రిజర్వ్ బలగాల కోసం 18 నుంచి 60 ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ వదిలి వెళ్లేందుకు అనుమతి లేదని ప్రకటించారు జెలెన్ స్కీ.

ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై దాడులు ముమ్మరం చేసిన రష్యా

ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై ఇష్టమొచ్చినట్లు దాడులు చేస్తున్నాయి రష్యా సేనలు. బాంబులు, మిసైల్స్ తో నివాస భవనాలపై దాడులు చేస్తూ... సామాన్యులను చంపేస్తున్నారు. కీవ్ లోని మెట్రో స్టేషన్ పై బాంబుల వర్షం కురిపించింది రష్యా సైన్యం. పేలుళ్లలో లుక్యానివ్స్కా స్టేషన్ దెబ్బతిందని ట్వీట్ చేసింది కీవ్ మెట్రో నెట్ వర్క్స్. రష్యాకు చెందిన 4 హెలికాప్టర్లు, ఒక విమానం, క్రూయిజ్ క్షిపణిని తమ బలగాలు కూల్చివేశాయని తెలిపింది ఉక్రెయిన్. 

రష్యాలో ఫైజర్ పెట్టుబడులు బంద్

ఉక్రెయిన్ పై పోరుతో అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై 2,700లకు పైగా ఆంక్షలు విధించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది. తాజాగా.. ఉక్రెయిన్ పై రష్యా దాడులతో అమెరికాకు చెందిన ప్రముఖ మెడిసిన్ కంపెనీ ఫైజర్  కీలక ప్రకటన చేసింది. రష్యాలో కొత్తగా క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించబోమని, జరుగుతున్న ట్రయల్స్ కోసం ఎవర్నీ నియమించుకోబోమని... స్పష్టం చేసింది. రష్యాలో పెట్టుబడులు నిలిపివేస్తున్నట్లు ఫైజర్ తెలిపింది. కానీ హ్యుమానిటీతో.. రష్యాకు మెడిసిన్ సప్లై చేస్తామంది. రష్యా యూనిట్ నుంచి వచ్చే లాభాలన్నింటినీ ఉక్రెయిన్ ప్రజల సాయం కోసం విరాళంగా ఇస్తామని తెలిపింది. అక్కడ కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ ను రష్యా బయట నిర్వహించేందుకు యూఎస్  ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఇతర రెగ్యులేటర్  సంస్థలతో కలిసి పని చేస్తామని పేర్కొంది.

శాంతి చర్చలు.. ఇయ్యాల్టికి వాయిదా

రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగో రౌండ్ శాంతి చర్చలు మంగళ వారానికి వాయిదా పడ్డాయి. ఆయా అంశాలపై ఇరుదేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున చర్చలను నిలిపివేశామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ సలహాదారు మిఖాయిలో పొడోల్యాక్ వెల్లడించారు. సోమవారం నాలుగో రౌండ్ చర్చల్లో ఉక్రెయిన్ ప్రతినిధులు తమ రాజధాని కీవ్ నుంచే వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. అయితే, పలు అంశాలపై వివరణ ఇచ్చేందుకు, ఇరువైపులా కొంత కసరత్తు చేయాల్సి ఉన్నందున చర్చలను ఆపామని, తిరిగి మంగళవారం చర్చలు కొనసాగుతా యని పొడొల్యాక్ ట్వీట్ చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంప్రదింపులను ‘క్లిష్టమైన చర్చలు’ అని జెలెన్ స్కీ సోమవారం ఉదయం అభివర్ణించారు. అందరూ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారని, చర్చల ఫలితాన్ని సాయంత్రం వెల్లడిస్తామని మీడియాకు చెప్పారు. 

దమ్ముంటే నాతో పోటీ పడు.. గెలిచినోళ్లకే ఉక్రెయిన్

టెస్లా, స్సేస్​ ఎక్స్ చీఫ్​ ఎలాన్​ మస్క్.. రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​కు చాలెంజ్​ విసిరారు. సింగిల్​ కాంబాట్​ఫైట్(ద్వంద్వ యుద్ధం) చేద్దామని, గెలిచిన వారికే ఉక్రెయిన్​ సొంతమవుతుందంటూ సోమవారం ఒక ట్వీట్​ చేశారు. ఉక్రెయిన్, పుతిన్​ పేర్లను రష్యన్​ అక్షరాల్లో పోస్ట్​ చేశారు. మరికొద్దిసేపటికే ఇంకో ట్వీట్​ చేసిన మస్క్.. ఫైట్​కు సిద్ధమేనా? అంటూ రష్యా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్​ ఖాతాను ట్యాగ్ చేశారు. దీనిని పూర్తిగా రష్యాన్​ అక్షరాల్లోనే పోస్ట్ చేశారు. మస్క్​ ఫాలోవర్​ ఒకరు ఈ చాలెంజ్​విషయంలో సీరియస్ గా ఉన్నారా? అని ప్రశ్నించగా.. తాను ఈ విషయంలో చాలా సీరియస్​గా ఉన్నానని మస్క్ స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలైన తర్వాత.. ఇంటర్నెట్​ సమస్యలు తలెత్తడంతో మస్క్ తన స్టార్లింక్ శాటిలైట్​ ద్వారా అక్కడి ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్‌‌ నుంచి వచ్చిన స్టూడెంట్ల లోన్లు మాఫీ చేయండి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి మన దేశానికి వెనక్కి వచ్చిన మెడికల్ స్టూడెంట్లు.. ఇక్కడి వర్సిటీల్లో వైద్య విద్య పూర్తిచేసేందుకు అవకాశం కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఆయా విద్యార్థులు తీసుకున్న ఎడ్యుకేషన్‌‌ లోన్‌‌ను మాఫీ చేయాలని కోరా రు. సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ విషయాన్ని సభ్యులు చర్చించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చెర్నోబిల్​ ప్లాంట్ కు మళ్లీ కరెంట్​ కట్

ఉక్రెయిన్​లోని చెర్నోబిల్ న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​కు మరోసారి పవర్ కట్​ అయ్యింది. రష్యా బాంబు దాడుల్లో హై వోల్టేజ్​ పవర్​ లైన్​ దెబ్బతిన్నట్టు గ్రిడ్​ ఆపరేటర్ సోమవారం ప్రకటించారు. బుధవారం జరిపిన బాంబు దాడుల్లోనే ప్లాంట్​కు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అయితే మరమ్మతులు చేసి కరెంట్​ సరఫరాను పునరుద్ధరించారు. మరోసారి రష్యా జరిపిన బాంబు దాడుల్లో హై వోల్టేజ్​ పవర్​ లైన్​ దెబ్బ తింది.  కాగా, ఉక్రెయిన్​పై దాడుల కోసం మిలిటరీ సహాయం అందించాలని చైనాను రష్యా కోరిందని అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను చైనా తోసిపుచ్చింది. అమెరికా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందంటూ మండిపడింది.

ప్రాణాలు కోల్పోయిన నిండు గర్భిణి

మరియుపోల్​లోని మెటర్నిటీ హాస్పిటల్​పై బుధవారం రష్యా జరిపిన బాంబు దాడిలో గాయపడిన నిండు గర్భిణీ సోమవారం కన్నుమూసింది. మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా జరిపిన దాడిలో గాయపడిన ఓ గర్భిణిని సహాయక సిబ్బంది కాపాడి, మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఆమె ప్రాణాలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే తుంటి భాగం దెబ్బతినడంతో కడుపులోని శిశువు చనిపోయినట్టుగా డాక్టర్లు గుర్తించారు. మృత శిశువును బయటికి తీసేందుకు డాక్టర్లు ప్రయత్నించగా.. ఆ విషయం తెలిసిన బాధితురాలు ‘‘నన్ను కూడా వెంటనే చంపేయండి’’ అంటూ ఏడుస్తూ డాక్టర్లను వేడుకుంది. సిజేరియన్​ చేసి శిశువును బయటకు తీసినా.. శిశువులో ఎలాంటి కదలికా లేదని సర్జన్లు చెప్పారు. ఆ తర్వాత తల్లిని 
కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

రష్యా-ఉక్రెయిన్ చర్చలకు టెక్నికల్ బ్రేక్.. రేపు కంటిన్యూ

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య నాలుగో విడుత ఇవాళ జరిగిన చర్చలకు సాంకేతిక కారణాలతో విరామం తీసుకున్నారు. స్పష్టత కోసం చర్చలను రేపు కూడా కొనసాగించాలని ఇరుపక్షాల అధికారులు నిర్ణయించారు. చర్చల ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామని ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పోడోల్యాక్ స్పష్టం చేశారు. 

రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగో దఫా చర్చలు 

రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగో దఫా చర్చలు జరిగాయి. ఇప్పటికే మూడు సార్లు ఫిజికల్ గా జరిగినా.. ఈ సారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు దేశాల అధికారులు భేటీ అయ్యారు. ఇవాళ కొన్ని అంశాలపై చర్చించినా.. ఏకాభిప్రాయం రాకపోవడంతో రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. మరోవైపు ఉక్రెయిన్ పై దాడికి ఆయుధాలు కావాలని రష్యా.. చైనాను అడిగిందన్న వార్తలు ఉద్రిక్తతను మరింత పెంచాయి. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని రష్యా, చైనా ప్రకటించాయి. దీనిపై అమెరికా అబద్దాలు ప్రచారం చేసిందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
 

ఉక్రెయిన్లో 2500 దాటిన చేరిన మృతుల సంఖ్య

ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించుకునేందుకు యుద్ధం మొదలుపెట్టిన రష్యా విచక్షణా రహితంగా క్షిపణులు, బాంబు దాడులను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ముఖ్య నగరాలు స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు దేశ రాజధాని కీవ్ పై ముప్పేట దాడులు చేస్తోంది. అలాగే మేరియుపోల్ నగరంలో నివాస భవనాలపై జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 2500కు చేరిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా ప్రకటించారు. 

ఉక్రెయిన్లో మానవత్వం మరచి దాడులు (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

అపార్ట్‌మెంట్‌పై రష్యా అటాక్స్.. ఇద్దరు మృతి

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. 19 రోజులుగా హోరాహోరీ జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై పట్టు కోసం రష్యా విఫలయత్నం చేస్తోంది. ఎంతటి దాడులనైనా తిప్పికొట్టి.. తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్నారు. ఇందు కోసం సామాన్య పౌరులు సైతం ఆయుధాలు పట్టి రష్యన్ బలగాలను ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఎలానైనా కీవ్ ను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని దాడుల తీవ్రతను పెంచుతోంది. ఆఫీసులు, అపార్ట్‌మెంట్లపైనా బాంబుల దాడులకు పాల్పడుతోంది. ఇవాళ కీవ్ లోని 9 అంతస్తుల బిల్డింగ్ పై రష్యా షెల్ దాడులు చేసింది. దీంతో బిల్డింగ్ అంతటా మంటలు వ్యాపించాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. వేగంగా ఆ బిల్డింగ్ లో చిక్కుకున్న వారిని సేఫ్ ప్లేస్ కు తరలించారు. అయితే అప్పటికే మంటల్లో తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 63 మందిని సేఫ్ గా కాపాడామని, 12 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

ఉక్రెయిన్, రష్యా మధ్య మరో దఫా చర్చలు

ఉక్రెయిన్, రష్యా మధ్య 19 రోజులుగా యుద్ధం సాగుతోంది. ఓ వైపు చర్చలు అంటూనే రష్యా దండయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిగినా సానుకూల ఫలితం రాలేదు. యుద్ధ భూమి నుంచి విదేశీయులు, ఉక్రెయిన్ పౌరులు సేఫ్‌గా బయటపడేందుకు హ్యుమానిటేరియన్ కారిడార్లు ఏర్పాటు చేయడం, ఆయా సమయాల్లో కాల్పుల విరమణ పాటించడం మినహా సాధించిందేమీ లేదు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి రెండు దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారని రష్యన్ వార్తా సంస్థ సుత్నిక్ పేర్కొంది.

చైనాను ఆయుధ సాయం కోరిన రష్యా

ఉక్రెయిన్, రష్యాల మధ్య 19 రోజులుగా భీకర యుద్ధం సాగుతూనే ఉంది. సరిహద్దులు దాటుకుని ఉక్రెయిన్ సిటీలను ఆక్రమించుకుంటూ దూసుకెళ్తున్న రష్యా సేనలకు రాజధాని కీవ్ లో ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తమ రాజధాని నగరాన్ని కాపాడుకునేందుకు సామాన్య పౌరులు సైతం ఆయుధాలు చేతపట్టి పోరాడుతున్నారు. ఎంతగా శ్రమిస్తున్నా.. కీవ్ ను రష్యా తమ చేతిలోకి తెచ్చుకోలేకపోతోంది. అమెరికా, నాటో దేశాల నుంచి మిస్సైల్స్, ఇతర ఆయుధాలు అందుతుండడంతో వెనక్కి తగ్గేదేలేదంటూ ఉక్రెయిన్ పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో రష్యా కూడా ఆయుధ సాయం కోసం ప్రయత్నిస్తోందని అమెరికా అధికారి ఒకరు చెబుతున్నారు. చైనా నుంచి మిలిటరీ ఎక్యూప్ మెంట్ సాయంగా కోరినట్లు తెలిపారు. రష్యా యుద్ధం, ఆ దేశంపై ఆర్థిక ఆంక్షల ద్వారా ఒత్తిడి లాంటి అంశాలపై ఇవాళ రోమ్ లో అమెరికా, చైనా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో రష్యా ఆయుధ సాయం కోరినట్లు వార్తల రావడం మరింత టెన్షన్ కు కారణమవుతోంది. రష్యాకు చైనా తమ ఆయుధ సాయం చేయకున్నా.. ఆర్థికంగా అండగా నిలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పినట్లుగా ప్రస్తావిస్తూ దీనికి సంబంధించిన వార్తలు ఫైనాన్షియల్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల్లో వచ్చాయి.

కీవ్​ను పూర్తిగా నేలమట్టం చేసినంకే: జెలెన్​స్కీ

పిల్లల్ని కూడా రష్యన్ సోల్జర్లు కాలుస్తున్నారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌‌‌‌స్కీ ఆరోపించారు. పుతిన్ దళాలు కీవ్‌‌‌‌ను పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాతే.. ఆ సిటీ వారికి దక్కుతుందని అన్నారు. ‘‘ఈ రీజియన్ చరిత్రను, కీవన్ రస్ చరిత్రను, యూరప్ చరిత్రను చెరిపేయాలనుకుంటే, మమ్మల్ని అందరినీ నాశనం చేయాలని అనుకుంటే.. వారు కీవ్‌‌‌‌లోకి రాగలరు. అదే వారి గోల్ అయితే.. వాళ్లను రానివ్వండి. కాకపోతే.. వాళ్లు మాత్రమే ఇక్కడ జీవిస్తరు” అని స్పష్టం చేశారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

శరణార్థులకు ఆశ్రయమిస్తే నెలకు 35 వేలు

ఉక్రెయిన్ నుంచి భారీగా వలసలు పెరిగాయి. ఇప్పటి వరకు 20 లక్షల మందికిపైగా దేశాన్ని వీడారు. రెండో వరల్డ్ వార్ కంటే అత్యధిక మంది ఉక్రెయిన్ ను వీడినట్లు తెలుస్తోంది. సరిహద్దు దేశాలైన పోలాండ్ 10 లక్షల మంది.. హంగేరికి రెండు లక్షల మంది వెళ్లారు...ఇక రష్యాకు వెళ్లిన లక్షా 6 వేల మందిలో  91 శాతం మంది డాన్ బాస్ జనాలుగా గుర్తించారు. మొత్తం 596 మంది పౌరులు ఇప్పటి వరకు చనిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్​లో ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించే ఫ్యామిలీలకు నెలకు రూ.35 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ‘‘హోమ్స్ ఫర్ ఉక్రెయిన్” స్కీమ్ ను ప్రవేశపెట్టింది. 

యుద్ధంతో రష్యా జనానికీ తిప్పలే

సెంట్రల్​ డెస్క్​, వెలుగు: ఉక్రెయిన్​ మీద రష్యా ఆయుధ బలగంతో దండెత్తి పెను విధ్వంసమే సృష్టిస్తోంది. స్కూళ్లు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, ఫ్యాక్టరీలు, జనాల ఇండ్లపై బాంబులు వేసి నాశనం చేస్తోంది. దేశాన్ని మసిగొట్టుకుపోయిన శ్మశానంలా మార్చేసింది. కట్టుబట్టలతో పిల్లలను వెంటబెట్టుకుని.. ప్రజలు వేరే దేశానికి వలసకట్టేలా చేసింది. ఇలాంటి పరిస్థితులేవీ ప్రస్తుతం రష్యాలో లేవు. కానీ, ఆ  యుద్ధంతో రష్యా ప్రజలూ లెక్కలేనన్ని సమస్యలతో అల్లాడిపోతున్నారు. కష్టంగా కాలాన్ని దాటుతున్నారు. కారణం, ఉక్రెయిన్​పై దండయాత్రకు ప్రతిగా.. చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. వ్యాపారాలను తెంచేసుకున్నాయి. డబ్బులను ట్రాన్స్​ఫర్​ చేయలేకుండా పీటముడిని బిగించాయి. ఫలితంగా కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా రష్యాలో వ్యాపారాలను బంద్​పెట్టాయి. డబ్బులకు కటకట ఏర్పడింది. ఎగుమతులు, దిగుమతులు బంద్​ అయ్యాయి. తిండి ధరలు పెరిగాయి. జాబ్​లు ఊడిపోయాయి. రూబుల్​ విలువ దారుణంగా పడిపోయింది. యుద్ధం మొదలైనప్పట్నుంచి స్టాక్​ మార్కెట్లు బంద్​ కావడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. రష్యా ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. ఒక్కటేమిటి పైకికనిపించకపోయినా యుద్ధం ఎఫెక్ట్​.. రష్యాపైనా, ఆ దేశ ప్రజలపైనా భారీగానే పడింది.  (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఉక్రెయిన్ పై దాడులను నిరసిస్తూ రష్యాలో ప్రజల ర్యాలీ

ఉక్రెయిన్ పై రష్యా దాడులపై సొంత దేశంలోనే జనం వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినా పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. రష్యాలోని కొన్ని పట్టణాల్లోప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. 

రష్యా ఈ నరమేధాన్ని ఆపాలి: పోప్ ప్రాన్సిస్

రష్యా ఈ నరమేధాన్ని ఆపాలని మరోసారి పిలుపునిచ్చారు పోప్ ప్రాన్సిస్. దాడుల్లో అమాయకప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలపై దాడి చేసి సాధించేదేం లేదన్నారు పోప్.  ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ లివివ్ లోని మిలిటిరీ బేస్ పై జరిపిన స్ట్రైక్ లో 35 మంది చనిపోయారు. 130 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే.. ఇతరదేశాలకు చెందిన ఇన్ స్ట్రక్టర్లు బేస్ లో ఉన్న సమయంలో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మైకోలాయివ్ లో ఎయిర్ స్ట్రైక్ లో తొమ్మిది మంది చనిపోయారు. చెర్నిహివ్ లో రష్యా విసిరిన బాంబు పేలకుండా ఓ అపార్ట్ మెంట్ లో పడిపోయింది. దాన్ని గుర్తించిన స్థానిక బలగాలు జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించాయి. ఘటనలపై పోప్ స్పందించి నరమేధాన్ని ఆపాలంటూ మరోసారి విజ్ఝప్తి చేశారు. 

ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా జర్నలిస్ట్ మృతి

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దంలో ఓ జర్నలిస్ట్ బలయ్యాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఇర్పిన్ పట్టణంలో జరిగిన కాల్పుల్లో అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ మేకర్ బ్రెంట్ రెనాడ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి పాల్పడింది రష్యన్ బలగాలేనని ఉక్రెయిన్ నేతలు, అధికారులు ఆరోపిస్తున్నారు. ఇర్పిన్ లో రష్యా చేసిన కాల్పుల్లో  బ్రెంట్ రెనాడ్ అక్కడికక్కడే మరణించాడని, మరో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఉక్రెయిన్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారని ఏఎఫ్పీ వార్తా సంస్థ పేర్కొంది.

పోలాండ్ సరిహద్దుల్లో రష్యా ఎయిర్ స్ట్రైక్స్

ఉక్రెయిన్ లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్, పోలాండ్ సరిహద్దుల్లో రష్యా సైనికులు విరుచుకుపడ్డారు. లివివ్లోని మిలిటరీ బేస్ వద్ద ఎనిమిది మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 57మందికి తీవ్ర గాయాలయ్యాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇండియన్ ఎంబసీ.. పోలాండ్ తరలింపు

ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీని తాత్కాలికంగా పొరుగున ఉన్న పోలాండ్కు తరలించింది. భద్రతా కారణాలు, రోజు రోజుకు పెరుగుతున్న బాంబు దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. త్వరలో పరిస్థితులను సమీక్షించి మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఎట్లనైనా నవీన్ డెడ్ బాడీ తీసుకురావాలె

దేశ భద్రత, సన్నద్దతపై కేబినెట్ కమిటీతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ వ్యవహరించాల్సిన విధానంపైనా చర్చించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో పరిస్థితులను, ఆపరేషన్ గంగా వివరాలను ప్రధానికి ఉన్నతాధికారులు వివరించారు. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో జరిగిన దాడుల్లో మరణించిన కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ ఆదేశించారు. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

ఉక్రెయిన్ లో మరో మేయర్ కిడ్నాప్ 

ఉక్రెయిన్ దేశంలో యధేచ్చగా దాడులకు పాల్పడుతున్న రష్యా మరో మేయర్ ని కిడ్నాప్ చేశారు. రెండ్రోజుల క్రితం మెలిటోపోల్ మేయర్ ను కిడ్నాప్ చేసిన రష్యన్ దళాలు.. ఇవాళ ద్నిప్రోరుడ్నే మేయర్ యెవ్ హన్ మాత్వేయెవ్ ను కిడ్నాప్ చేశాయని ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. స్థానికులు లొంగిపోతారనుకుంటే తిరగబడుతుండడంపై అసహనంతో ఉన్న రష్యా దళాలు మరో మేయర్ ను కిడ్నాప్ చేశాయని ఆరోపిస్తూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ట్విట్ చేశారు. ఉక్రెయిన్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడేందుకు రష్యా హింసను నిలువరించేలా చూడాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చారు. 
 

86 మంది ఉన్న మసీదుపై దాడి.. 

ఉక్రెయిన్‌‌ రాజధాని కీవ్‌‌ దాకా రష్యన్ బలగాలు చేరుకున్నాయి. కీవ్ లో ఎయిర్ రెయిడ్ సైరన్లు మారుమోగాయి. కీవ్ చుట్టుపక్కల తీవ్ర పోరాటం కొనసాగుతోంది. ఖార్కివ్‌‌ను మొత్తం చుట్టుముట్టగా, మికోలైవ్ సిటీపై దాడులను తీవ్రం చేసింది. కీవ్‌‌కు 33 కిలోమీటర్ల దూరంలోని మోస్‌‌చన్ టౌన్‌‌లో భారీగా గన్నులతో కాల్పులు జరిపారు. ఈ పట్టణంలోని ఇండ్లన్నీ మంటల్లో చిక్కుకున్నాయి. మరియుపోల్ సిటీలో పౌరులు తలదాచుకుంటున్న మసీదుపై రష్యా షెల్లింగ్ చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ చెప్పింది. ఆ మసీదులో 34 మంది చిన్నారులు సహా 86 మంది టర్కీ పౌరులు ఉన్నట్లు టర్కీలోని ఉక్రెయిన్ ఎంబసీ వెల్లడించింది. అయితే ఎంతమంది చనిపోయారనేది తెలియరాలేదు. మరోవైపు కీవ్ రీజియన్‌‌లోని వాసిల్కివ్ టౌన్‌‌లో ఎయిర్‌‌‌‌బేస్‌‌పై రష్యా రాకెట్ దాడులు జరిపింది. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్! సౌత్ ఉక్రెయిన్‌‌లోని మెలిటోపోల్‌‌లోకి చొచ్చుకెళ్లిన రష్యన్ దళాలు.. సిటీ మేయర్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నాయి. ‘‘మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడొరోవ్‌‌ను 10 మందితో కూడిన ఆక్రమణదారుల టీమ్ కిడ్నాప్ చేసింది” అని ఉక్రెయిన్ పార్లమెంట్ ట్వీట్ చేసింది. తమ మేయర్‌‌‌‌ను రిలీజ్ చేయాలని లోకల్ ప్రజలు డిమాండ్ చేశారు.  

మరో జనరల్‌‌ను చంపినం: ఉక్రెయిన్

మరో రష్యా జనరల్‌‌ను చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మరియుపోల్‌‌లో రష్యన్ మేజర్ జనరల్ ఆండ్రీ కోలెస్నికోవ్ చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అయితే కోలెస్నికోవ్ డెత్‌‌పై రష్యా ఇంకా స్పందించలేదు.  ఇప్పటిదాకా ముగ్గురు రష్యా జనరల్స్‌‌ను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆఫీసర్లు చెబుతున్నారు.

యుద్ధం వల్ల 25 లక్షల మంది వలస: యూఎన్

ఉక్రెయిన్‌‌లో జరుగుతున్న అర్థం లేని యుద్ధం వల్ల 25 లక్షల మందికి పైగా ప్రజలు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇప్పటిదాకా 564 మంది పౌరులు చనిపోయారని, అందులో 41 మంది పిల్లలు ఉన్నారని పేర్కొంది. 

రష్యా బార్డర్లలో 12 వేల ట్రూప్స్: బైడెన్

రష్యా బార్డర్లలోని లాట్వియా, ఎస్టోనియా, లిథువేనియా, రొమేనియా దేశాల్లో 12 వేల ట్రూప్స్‌‌ను మోహరించినట్లు యూఎస్​ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. యుద్ధంలో పుతిన్ గెలవబోరన్నారు. తాము యుద్ధానికి దిగబోమని, దిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ఆయన అన్నారు. హౌస్ డెమోక్రటిక్ కాకస్ సభ్యులను ఉద్దేశించి శుక్రవారం  బైడెన్ మాట్లాడారు. నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని తాము పూర్తిగా రక్షించుకుంటామని స్పష్టం చేశారు.

మా మేయర్‌ను రష్యా కిడ్నాప్ చేసింది.. విడిపించండి

ఉక్రెయిన్ సిటీ మెలిటొపోల్ మేయర్ ఇవాన్ ఫెదొరోవ్‌ను రష్యన్ బలగాలు కిడ్నాప్ చేశాయని, ఆయనను విడిపించేందుకు సాయపడాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ... జర్మనీ, ఫ్రాన్స్ దేశాధినేతలను కోరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. రష్యా దురాక్రమణను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని తాము చర్చించామని జెలెన్స్కీ తెలిపారు. తమ దేశ పౌరులపై దాడులు చేసి, సామాన్యుల ప్రాణాలు తీస్తూ రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా మాట్లాడుకున్నామని చెప్పారు. మెలిటొపోల్ మేయర్ ఇవాన్ ను రష్యన్ బలగాల చెర నుంచి విడిపించేందుకు సాయం చేయాలని ఈ రెండు దేశాధినేతలను కోరినట్లు తెలిపారు. అంతా కలిసికట్టుగా రష్యా దురాక్రమణను అడ్డుకోవాలని జెలెన్స్కీ అన్నారు.

యుద్ధంలో మా వాళ్లు 1300 మంది మృతి

ఉక్రెయిన్, రష్యాల మధ్య 17 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ లోని పలు సిటీలను రష్యన్ బలగాలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాయి. అయితే రాజధాని కీవ్ సిటీని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకోలేకపోతున్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ తమ రాజధానిని కాపాడుకునేందుకు శాయశక్తులూ ఒడ్డుతోంది. సైనికులతో పాటు సామాన్య పౌరులు సైతం ఆయుధాలు చేతబట్టి కొట్లాడుతున్నారు. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 1,300 మంది ఉక్రెయినియన్లు మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. ఫిబ్రవరి 24న యుద్దం మొదలైనప్పటి నుంచి తమ వారి మరణాలపై జెలెన్స్కీ స్పందించడం ఇదే తొలిసారి.  (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మోడీకి థాంక్స్ చెప్పిన నేపాల్ ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా. ఉక్రెయిన్ నుంచి నలుగురు నేపాలీ జాతీయుల్ని క్షేమంగా తమ దేశానికి చేర్చినందుకు గాను మోడీకి థాంక్స్ చెప్పారు. నలుగురు నేపాలీ జాతీయులు ఉక్రెయిన్ నుంచి భారత్ మీదుగా నేపాల్ చేరుకున్నారు. ఆపరేషన్ గంగా ద్వారా నేపాలీ జాతీయులను స్వదేశానికి రప్పించడంలో సహాయం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.. నేపాల్ ప్రధాని. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మీ పిల్లల్ని యుద్ధానికి పంపకండి

రష్యా సైనికచర్యతో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారింది. రష్యన్ బలగాలు వేస్తున్న బాంబులు, పేలుస్తున్న తుపాకుల శబ్దాలతో ప్రజలు ప్రాణభయంతో పొరుగు దేశాలకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తాజాగా రష్యా ప్రజలను ఉద్దేశించి కీలక అభ్యర్థన చేశారు. రష్యన్ సైనికుల తల్లులు తమ కొడుకులను యుద్ధానికి పంపొద్దని ఆయన కోరారు. ‘రష్యన్ తల్లులకు మరోసారి విన్నవిస్తున్నా.. మీ పిల్లల్ని యుద్ధానికి పంపకండి. మీ కుమారులు ఎక్కడ ఉన్నారో చెక్ చేస్కోండి. ఒకవేళ మీ కొడుకులను ఉక్రెయిన్ లోని యుద్ధ రంగానికి పంపిస్తున్నారనే అనుమానం వస్తే వెంటనే అడ్డుకోండి. వారు ప్రాణాలతో ఉండాలంటే అడ్డుకోండి’ అని పొరుగు దేశం మహిళల్ని జెలెన్స్కీ అభ్యర్థించారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మేయర్ ను కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు

మెలిటొపోల్ సిటీ మేయర్ ను రష్యా బలగాలు కిడ్నాప్ చేశారని ఆరోపించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. రష్యన్ సేనల వైఖరి ఐసిస్ ఉగ్రవాదుల చర్యలా ఉందని మండిపడ్డారు. మేయర్ ఇవాన్ ఫెదొరోవ్ ను రష్యన్ బలగాలు తీసుకెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉక్రెయిన్ అధికారి. రష్యన్లు మేయర్ ను అపహరించి యుద్ధ నేరానికి పాల్పడ్డారంది ఉక్రెయిన్ విదేశాంగ శాఖ. 

రష్యాకు వీటో అధికారం రద్దు చేస్తామన్న బైడెన్!

ఉక్రెయిన్ పై యుద్ధంలో రసాయన ఆయుధాల వినియోగానికి రష్యా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్ లో రష్యాపై అమెరికా యుద్ధం చేయబోదన్నారు. నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్నారు. ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి పోరాడతామన్నారు.  యునైటెడ్ స్టేట్స్ పూర్తి శక్తితో నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటామన్నారు బైడెన్. ఉక్రెయిన్ లో రష్యా ఎప్పటికీ విజయం సాధించదన్నారు. పోరాటం లేకుండానే ఉక్రెయిన్ పై ఆధిపత్యం చెలాయించాలని రష్యా చూసిందన్నారు. ప్రజాస్వామ్య దేశాలన్నీ ఏకతాటిపై ఉన్నాయన్నారు. రష్యాకు వీటో అధికారాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు బైడెన్.

ఢిల్లీకి చేరుకున్న మరో 242 మంది విద్యార్థులు

ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమంగా దిగ్విజయంగా కొనసాగుతోంది.ఇవాళ కూడా పోలాండ్ నుంచి ప్రత్యేక విమానంలో 242 మంది విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చారు. స్వదేశానికి చేరుకున్న విద్యార్థులకు ఎయిర్ పోర్టులో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇండియన్ ఎంబసీ సకాలంలో స్పందించి తమను క్షేమంగా తీసుకువచ్చిందని చెబుతున్నారు విద్యార్థులు. ఇండియాకు సేఫ్ గా తీసుకుచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.

దాడుల వల్ల రష్యాకే దెబ్బ: జెలెన్‌స్కీ 

రష్యా లీడర్లను కోర్టుకు లాగడం, ప్రజలు వారిని ద్వేషించేలా చేయడం ద్వారా వారికి ఎదురుదెబ్బ తగులుతుందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌ స్కీ అన్నారు. తమ దేశంపై దాడులు చేసినందుకు వారు తప్పకుండా విచారణ ఎదుర్కొంటారని గురువారం విడుదల చేసిన వీడియో స్కీ తెలిపారు. ‘‘మా దేశంపై దాడులు కొనసాగిస్తున్న రష్యాపై వెస్ట్‌ దేశాలు కఠినమైన, ఆర్థికపరమైన ఆంక్షలు పెడుతున్నాయి. దాని పర్యవసానాలను రష్యన్లు తప్పకుండా అనుభవిస్తారు. కొన్నేండ్లుగా మీ చేతుల్లో మోసపోతున్న, అవకాశాలు కోల్పోతున్నారు. దీంతో రష్యా లీడర్లను ఆ దేశ సిటిజన్లు ద్వేషిస్తారు” అని స్కీ అన్నారు.

ఉక్రెయిన్ ఇప్పటి వరకు లొంగిపోలేదు.. లొంగిపోదు కూడా

రష్యా దౌర్జన్యంగా చేస్తున్న దురాక్రమణను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పి కొడుతుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్పష్టం చేశారు. కాల్పుల విరమణ కోసం టర్కీలో రష్యా విదేశాంగ శాఖ మంత్రులతో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా, ప్రతినిధులు పాల్గొన్నారు. 24గంటలపాటు కాల్పుల విరమణ కోసం మేం చర్చించినా.. రష్యా విదేశాంగ మంత్రి అంగీకరించలేదు. మానవతా కారిడార్ల ఏర్పాటు పై నైనా సానుకూల స్పందన వస్తుందనుకుంటే ఆ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఎలాంటి హామీ రాలేదు. దీన్ని బట్టి ఉక్రెయిన్ పై రష్యా దాడుల విషయంలో మరింత మంది నిర్ణయాధికారాలున్న వారు రష్యాలో ఉన్నారని అర్థమైంది. రష్యా ఎన్ని దాడులు చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని.. ఉక్రెయిన్ ఇప్పటి వరకు లొంగిపోలేదు.. లొంగిపోదు కూడా అని ఆయన స్పష్టం చేశారు. 
 

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌, యూరప్​ దేశాలకు 13.6 బిలియన్లు
ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌, యురోపియన్‌‌‌‌‌‌‌‌ మిత్రదేశాలకు అమెరికా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 13.6 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు ఇచ్చేందుకు అమెరికా సెనేట్ సభ్యులు ఆమోదం తెలిపారు. 1.5 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్​లో భాగంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు.. రష్యా చేతిలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ కు ఈ సాయం ప్రకటించింది అమెరికా. 1.5 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లలో 13.6 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు తక్కువే అయినప్పటికీ.. రష్యా మెరుపు దాడులను ఎదుర్కొనేందుకు ఈ సాయం ప్రకటించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. దీంతో పాటు యూరప్‌‌‌‌‌‌‌‌ శరణార్థుల కోసం కూడా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ శతాబ్దాన్ని ఇండియా డిసైడ్ చేస్తది
ఉక్రెయిన్ యువ ఎంపీ యురాష్ 
ఈ శతాబ్దపు తలరాతను డిసైడ్ చేసే దేశాల్లో ఇండియా కూడా ఒకటని ఉక్రెయిన్ యంగెస్ట్ ఎంపీ స్వియటోస్లావ్ యురాష్​అన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీతో మాట్లాడినందుకు ప్రధాని మోడీకి ఆయన ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ లో థ్యాంక్స్ చెప్పారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్​లో అవస్థలు పడుతున్న వాళ్ల కోసం మానవత్వంతో సాయం చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇండియా, రష్యా మధ్య గట్టి స్ట్రాటజిక్ పార్ట్​నర్​షిప్​ ఉందని, కానీ ఇప్పుడు రష్యా తీరుపై ఇండియా మళ్లీ ఆలోచన చేసుకోవాలని కోరారు. గత 20 ఏండ్లుగా పుతిన్ హయాంలో రష్యా తీరు పూర్తి గా మారిపోయిందన్న విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. రష్యా యుద్ధం చేసినంతకాలం తాము పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు.

రష్యాను టెర్రరిస్ట్ దేశంగా గుర్తించాలె
రష్యాను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్​ స్కీ బ్రిటన్​ను కోరారు. ఉక్రెయిన్ ఎయిర్​ స్పేస్ భద్రంగా ఉండేలా ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని బ్రిటిష్ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన వర్చువల్​గా మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్​స్కీకి మద్దతుగా ఎంపీలంతా లేచి నిలబడి సంఘీభావం తెలిపారు. ‘‘మేము ఐరోపా దేశాల సాయం కోరుతున్నం. మీ సాయం కోసం ఎదురుచూస్తున్నం. ఇప్పటివరకు మీరెంతో సాయం చేశారు. థ్యాంక్స్. దయచేసి రష్యాను టెర్రరిస్ట్ దేశంగా గుర్తించి కఠిన ఆంక్షలు పెట్టండి. మీరు చేయాల్సినంత చేయండి” అని జెలెన్ స్కీ.. బ్రిటన్ ప్రధాని జాన్సన్ బోరిస్​ను కోరారు.

చివరిదాకా పోరాడుతం
బ్రిటన్ యుద్ధ సమయంలో ప్రధానిగా ఉన్న విన్​స్టన్​ చర్చిల్ మాటలను జెలెన్​ స్కీ సభలో ప్రస్తావించారు. రష్యా దళాలతో నింగి, నేల, సముద్రంలో పోరాడుతామని చెప్పారు. చివరిదాకా కొట్లాడుతామని, ఎన్నటికీ ఓడిపోబోమని అన్నారు. ‘‘మేం ఓడిపోము. ఓడిపోము. చివరిదాకా పోరాడుతాం. మా భూమి కోసం సముద్రంలో, గాలిలో పోరాడుతాం. అడవులు, వీధుల్లో పోరాడుతాం” అని జెలెన్​స్కీ ఉద్వేగభరితంగా అన్నారు. రష్యా దాడుల గురించి కూడా ప్రస్తావించారు. యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, కోరుకోలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు పోరాడక తప్పడంలేదని జెలెన్​స్కీ అన్నారు. అనంతరం జాన్సన్ బోరిస్ మాట్లాడారు. ‘‘జెలెన్​స్కీ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించారు”అని అన్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ముందుకెళ్తామని బోరిస్ హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్​లో జీవాయుధాల తయారీ!
ఉక్రెయిన్​లో జీవ ఆయుధాలను తయారు చేస్తున్నారని రష్యా ఆరోపించింది. దీనికి అమెరికా సహాయం ఎందుకు చేస్తోందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. బుధవారం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ లో జీవ ఆయుధాలు (శత్రుదేశాలపై ప్రయోగించేందుకు తయారు చేసే విషపూరిత కెమికల్స్ లేదా ప్రమాదకర వైరస్ ల వంటివి) తయారు చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయని ఆరోపించారు. జీవ ఆయుధాల తయారీ కోసం ఉక్రెయిన్ లో మిలిటరీ బయోలజికల్ ప్రోగ్రాంను చేపట్టారని, యుద్ధం ప్రారంభం కావడంతో ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. అమెరికా రక్షణ శాఖ నిధులు, సహకారంతోనే ఈ ప్రోగ్రాంను చేపట్టినట్లు తేలిందని, దీనిపై అమెరికా రక్షణ శాఖ, ప్రెసిడెంట్ ఆఫీస్ అధికారులు అధికారికంగా ప్రపంచానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సైంటిఫిక్ రీసెర్చ్ లో భా గంగా ఇలాంటి ప్రయోగాలు చేసుకోవచ్చని, కానీ మిలిటరీ ప్రోగ్రాం కింద వీటిని తయారు చేయడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అయితే, తాము ఎలాంటి బయోలజికల్ వెపన్స్ ను తయారు చేయడంలేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. రష్యా ఆరోపణలు అర్థంలేనివని అమెరికా రక్షణ శాఖ కూడా ఖండించింది. 

12 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినం

ఉక్రెయిన్, రష్యా మధ్య కొన్ని రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నా సరే రష్యా తలొగ్గకుండా దండయాత్ర చేస్తూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు సిటీలను రష్యన్ బలగాలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాయి. అయితే రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ సైనికులు దీటుగా ఎదుర్కొంటున్నారు. రష్యా సేనలను తాము తిప్పికొడుతున్నామని, రష్యాపై తమదే పైచేయి అని ఉక్రెయిన్ చెబుతోంది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 12,000 మందికిపైగా రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యాకు చెందిన 317 ట్యాంకులు, 49 యుద్ధ విమానాలు, 28 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్ వ్యవస్థలు, 81 హెలికాప్టర్లు, 1070 ఆర్మర్డ్ వెహికల్స్, 7 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

అణు యుద్ధానికి దారి తీయొద్దనే చెర్నోబిల్‌ ఆక్రమణ

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం 14 రోజులగా సాగుతోంది. ఈ భీకర పోరులో ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతాలపై పట్టు సాధించామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. చెర్నోబిల్, జపొరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పింది. ఉక్రెయిన్ అణు యుద్ధానికి దిగే ప్రమాదం ఉండకూడదనే ముందస్తు చర్యల్లో భాగంగా వాటిపై తాము పట్టు సాధించామని స్పష్టం చేసింది.

యుద్ధానికి మరోసారి బ్రేక్

ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. పౌరుల తరలింపు దృష్ట్యా కీవ్ , చెర్నిహెవ్, సుమీ, ఖార్కివ్ , మరియుపోల్ లో యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది. విదేశీయులతో పాటు ఉక్రెయిన్ పౌరుల తరలింపు కోసం సేఫ్ కారిడార్ల ఏర్పాటులో భాగంగా కాల్పులకు విరామం ప్రకటించినట్లు పేర్కొంది. ఎన్నిసార్లు కాల్పుల విరమణ ప్రకటించినా.. హ్యూమన్ కారిడార్లకు విఘాతం కలుగుతోందని ఉక్రెయిన్, రష్యా ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్న టైమ్ లో.. మరోసారి యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే ఈ దఫాలో పౌరుల తరలింపు జరుగుతున్న రూట్లను ఉక్రెయిన్ ముందుగా స్పష్టం చేస్తే ఆ మార్గాల్లో దాడులను నిలిపేస్తామని రష్యా చెప్పినట్లు రష్యన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరోసారి శాంతి చర్చలు: రేపు రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ

రష్యా, ఉక్రెయిన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో టర్కీ నెరిపిన రాయబారం విజయవంతంగా ఒక అడుగు ముందుకు పడింది. ఓ వైపు హోరాహోరీగా యుద్దం జరుగుతుండగా.. మరోవైపు రెండు దేశాల విదేశాంగ మంత్రులను శాంతి చర్చలకు కూర్చోబెట్టబోతోంది. రేపు టర్కీలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులెబా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భేటీ అయ్యేందుకు రెండు వైపుల నుంచి అంగీకారం వచ్చింది. దీంతో టర్కీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది.

రష్యా దాడుల్లో ఉక్రెయిన్ యువ నటుడు పాషా లీ మృతి

ఉక్రెయిన్ పై రష్యా సైన్యం జరుపుతున్న బాంబు దాడుల్లో ఉక్రెయిన్ యువనటుడు పాషా లీ (33) కన్నుమూశారు. రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే అధ్యక్షుడు జెలన్ స్కీ పిలుపునకు స్పందించిన పాషా లీ సైన్యంలో చేరారు. ఇర్ఫిన్ నగర శివారు ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులతో కలసి రష్యా సేనలను నిలువరించే విధులు నిర్వహిస్తుండగా రష్యా దళాల కాల్పుల్లో తుదిశ్వాస విడిచారు. చనిపోవడానికి కొద్ది గంటల ముందు తన ఫోటోను పాషా లీ షేర్ చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు నావంతు పోరాడుతున్నా.. గత 48గంటలుగా ఇక్కడ విధుల్లో ఉన్న నాకు ఒక ఫోటో తీసుకునే విరామం దొరికింది.. మా దేశం కోసం మేం ఏమైనా చేయగలం.. అందుకే నవ్వుతున్నాం ’ అంటూ సైనిక దుస్తుల్లో ఫోటో దిగి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.  రష్యా సేనల కాల్పుల్లో పాషా లీ చనిపోయినట్లు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ధ్రువీకరించింది.

ఉక్రెయిన్కు అండగా నిలుస్తాం.. నిధులు అందిస్తాం

రష్యా దాడులతో దెబ్బతిన్న ఉక్రెయిన్ దేశానికి అమెరికా అండగా నిలుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్ దేశానికి అండగా నిలిచి వారికి అవసరమైన నిధులు, మానవత్వ సేవలు అందిస్తామని తెలిపారు. అమెరికా తీసుకున్న నిర్ణయాలతో రానున్న రోజుల్లో రష్యన్ సైనిక వ్యవస్థ, మిలిటరీ బలహీనం అవుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రష్యా నాయకుల విలాస భవనాలు, ప్రైవేటు జెట్ విమానాలు సహా ఇతర ఆస్తులు స్థంభించేలా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో సగం వాటా కలిగిన 30 దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయని బైడెన్ వైట్ హౌస్ లో మీడియా సమావేశం పెట్టి వెల్లడించారు. 
 

రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం

ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అగ్రరాజ్యం అమెరికా కఠినంగా వ్యవహరించే దిశలో అడుగులు వేస్తోంది.  రష్యా ను ఆర్ధికంగా కోలుకోలే విధంగా దెబ్బతీసే ఆంక్షల్లో భాగంగా చమురు దిగుమతులను నిషేధించింది. అంతేకాదు ప్రపంచ దేశాలతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యూహాత్మంగా వ్యవహరిస్తోంది. రష్యా ఆర్ధికంగా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అమెరికా వైట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశం పెట్టి ఆంక్షల వివరాలు.. రష్యాపై ప్రపంచ దేశాల ముప్పేట ఒత్తిళ్ల గురించి వివరించారు. ప్రపంచ చరిత్రలో లేనంతగా ఆంక్షలు విధించడంతో రష్యా ఇతర దేశాలతో వ్యాపారం చేసే సామర్థ్యాన్ని కోల్పోయిందన్నారు. రష్యా కరెన్సీ ఎందుకూ పనికి రాకుండా పోతోందని.. రూబుల్ పెన్నీ పాటి విలువ కూడా చేయదని బైడెన్ తెలిపారు. 

నాటో సభ్యత్వం అక్కర్లే

‘‘చర్చలకు రెడీ. కానీ మేం సరెండర్ కాబోం. ఎందుకంటే ఇది నా ఒక్కడి గురించిన సమస్య మాత్రమే కాదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు సంబంధించినది. ఉక్రెయిన్‌‌ను తమ సభ్య దేశంగా అంగీకరించేందుకు నాటో సిద్ధంగా లేదు. వివాదాస్పద విషయాలకు, రష్యాతో ఘర్షణకు ఈ కూటమి భయపడుతోంది. అందుకే నాకు నాటో మీద ఆసక్తి పోయింది” అని జెలెన్‌‌స్కీ చెప్పారు. నాటో సభ్యత్వం విషయంలో జరుగుతున్న జాప్యంపై స్పందిస్తూ.. ‘‘మోకాళ్లపై కూర్చుని అడుక్కునే దేశంగా ఉండటానికి ఉక్రెయిన్ ఇష్టపడదు. ఉక్రెయిన్ అలాంటి దేశం కాబోదు. నేను అలాంటి అధ్యక్షుడిని కావాలనుకోలేదు’’ అని తేల్చి చెప్పారు.

టాయిలెట్లలో పుతిన్ ఫొటో

ఉక్రెయిన్​పై సైనిక దాడిని వ్యతిరేకిస్తున్న దేశాల్లో ప్రజలు రకరకాలుగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. రష్యా చర్యలను వ్యతిరేకిస్తూ లండన్​లో ఉన్న ఓ పబ్  టాయిలెట్​లో పుతిన్ ఫొటోను పెట్టారు. ఇన్​స్టాగ్రామ్ లో ఫొటో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. పుతిన్ ఫొటో మీద టాయిలెట్ చేస్తూ అక్కడివాళ్లు నిరసన తెలియజేస్తున్నారు. అయితే, అంతకుముందువరకు అక్కడ యూఎస్ మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఫొటో ఉండేదని తెలిపారు. ఇప్పటికే లండన్​లోని ఎన్నో సూపర్ మార్కెట్లు రష్యా ఉత్పత్తుల అమ్మకాలను బ్యాన్ చేశాయి. యూఎస్, కెనడా దేశాల్లోనూ చాలా సూపర్ మార్కెట్లలో రష్యన్ వోడ్కా అమ్మకాలను బ్యాన్ చేశారు.

గాలి, నీరు, నేలపై పోరాటం కొనసాగిస్తం
‘‘ఈ యుద్ధాన్ని మేం మొదలుపెట్టలేదు. మేం కోరుకోలేదు కూడా. ఇదే సమయంలో మా దేశానికి చెందిన దేన్నీ మేం వదులుకోబోం” అని జెలెన్‌‌స్కీ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌‌ను ఉద్దేశించి జెలెన్‌‌స్కీ వర్చువల్‌‌గా హిస్టారిక్‌‌ స్పీచ్ ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటన్ ప్రధాని చర్చిల్ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మేం వాళ్లతో సముద్రంలో, గాలిలో, అడవుల్లో, పొలాల్లో, వీధుల్లో.. పోరాడుతం. ఎట్టి పరిస్థితుల్లోనూ సరెండర్ కాబోం” అని స్పష్టం చేశారు. 13 రోజులుగా రష్యా తమపై సాగిస్తున్న విధ్వంసకాండ గురించి బ్రిటన్ ఎంపీలకు వివరించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి తాము నిద్రపోవడం లేదని, క్రూయిజ్ మిసైళ్లతో తమపై దాడులు చేస్తున్నారని, తమ దేశం కోసం పోరాడుతున్నామని తెలిపారు. రష్యాపై ఆంక్షలను పెంచాలని, ఉగ్ర దేశంగా ప్రకటించాలని, ఉక్రెయిన్ గగనతలాన్ని భద్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రసంగం సందర్భంగా స్క్రీన్‌‌పై జెలెన్‌‌స్కీ కనిపించగానే.. ప్రధాని బోరిస్ జాన్సన్ సహా ఎంపీలందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లతో మద్దతు ప్రకటించారు. ఆయన స్పీచ్‌‌ను వినేందుకు సభ చాంబర్‌‌‌‌లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఉక్రెయిన్​లో కాల్పులు ఆగినంక నవీన్ డెడ్​బాడీ తెస్తం
రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్​లో చనిపోయిన నవీన్ శేఖరప్ప(21) డెడ్​బాడీ ఖార్కివ్​లోని మార్చురీలో ఉందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. షెల్లింగ్ ఆగిన తర్వాత అతని మృతదేహాన్ని మన దేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ తెలియజేశారని చెప్పారు. పోయినవారంలో ఖార్కివ్​లోని ప్రభుత్వ బిల్డింగ్​పై రష్యా జరిపిన దాడిలో కర్నాటకకు చెందిన నవీన్ శేఖరప్ప చనిపోయాడు. ‘‘నవీన్ డెడ్​బాడీ కుళ్లిపోకుండా ఉక్రెయిన్​లోని మార్చురీలో భద్రంగా ఉంచినట్లు జై శంకర్​ చెప్పారు. అక్కడ షెల్లింగ్ ఆగిన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకువస్తాము”అని బొమ్మై మంగళవారం విలేకరులకు తెలిపారు.

సుమీపై 500 కిలోల బాంబు
సుమీ నగరంలోని ఇండ్లపై రష్యా 500 కిలోల భారీ బాంబు వేసింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది పౌరులు చనిపోయారు. మొన్న చెర్నిహివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నివాసా ప్రాంతాలపై 500 కిలోల బాంబు వేశారు. అది పేలలేదు. బాంబుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రష్యన్ బలగాలు వద్ద 3 లక్షల మంది బందీలు

రష్యా తాత్కాలికంగా కాల్పుల విమరణ ప్రకటించినా.. ఉక్రెయిన్ లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఐదు నగరాల్లో కాల్పులు విరమించినట్లు ప్రకటించినా.. పౌరుల తరలింపును రష్యా  అడ్డుకుంటోందని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి డిమిత్రో కులెబా  ఆరోపించారు. రష్యన్ బలగాలు తమ వద్ద 3లక్షల మందిని బందీలుగా చేసుకున్నాయని అన్నారు. ఒక్క మరియూపోల్ లోనే ఇంత భారీ సంఖ్యలో పౌరులను బంధించిందని చెప్పారు. ICRC మధ్యవర్తిత్వంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ  పౌరుల  తరలింపును రష్యా అడ్డుకోవడం దారుణమని కులెబా ట్వీట్ చేశారు.నిన్న ఓ చిన్నారి డీహైడ్రేషన్ తో చనిపోయిందని అన్నారు. రష్యా కావాలనే వార్ క్రైమ్స్ చేస్తోందని, అన్ని ప్రపంచ దేశాలూ ఇప్పటికైనా ప్రజలను సేఫ్ గా వెళ్లనివ్వాలని రష్యాను డిమాండ్ చేయాలని కోరారు.

ప్రజల్ని సేఫ్ ప్లేస్‌కు తరలిస్తున్న బస్సుపై అటాక్

ఉక్రెయిన్, రష్యా మధ్య 13 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ సిటీలపై రష్యా నిత్యం క్షిపణులు, బాంబు దాడులకు పాల్పడుతోంది. దీంతో తమపై ఎక్కడ ఏ బాంబులు వచ్చిపడుతాయోనని ఉక్రెయిన్ ప్రజలతో పాటు విదేశీయులు.. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ లో రిస్క్ ఉన్న కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలనూ ఆ దేశ ప్రభుత్వం సేఫ్ ప్లేస్ లకు తరలిస్తోంది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను బస్సుల్లో తరలిస్తుండగా.. రష్యా షెల్ దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కీవ్ రీజియన్ లోని పలు గ్రామాలపైనా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ముగ్గురు సామాన్యులు గాయపడినట్లు తెలిపారు.

ఉక్రెయిన్ కు అండగా నాటో దళాల ఎంట్రీ

రష్యా ముప్పేట దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కు అండగా నాటో దళాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ సాయం కోరిన తర్వాత రోమేనియా, పోలాండ్, జర్మనీ, గ్రీస్ లో మరో 500 మంది బలగాలు మోహరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇప్పటికే 40 వేల మంది సైనికులు, ఫ్రాన్స్ రఫెల్ విమానాలు, నాలుగు ఫైటర్ జెట్లు పోలాండ్ కు చేరుకున్నాయి. నాటో దేశాల ఎంట్రీతో ఉక్రెయిన్ బలం పెరిగింది. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఐఫోన్లు వదిలి ‘అయ్యా’కు మారండి

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాకు  ప్రముఖ మొబైల్ కంపెనీలు యాపిల్‌, శాంసంగ్‌ షాక్ ఇచ్చాయి. రష్యాకు తమ ఉత్పత్తుల సప్లై నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా ఈ కంపెనీలకు దీటుగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘అయ్యా టీ1’గా చెబుతున్నఈ మొబైల్ ఐఫోన్‌కు ఏమాత్రం తీసిపోద‌ట‌. అయ్యా టీ1ను ర‌ష్యాకు చెందిన స్కేల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌కు అనుబంధంగా ప‌నిచేస్తున్న స్మార్ట్ ఎకోసిస్టమ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఐఫోన్‌కు దీటుగా పనిచేసే ఈ స్వదేశీ మొబైల్ ను వినియోగించాల‌ని తమ పౌరుల‌కు ర‌ష్యా పిలుపునిచ్చింది. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రష్యాలో కార్యకలాపాలు నిలిపేసిన ఐబీఎం

రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఐబీఎం ప్రకటించింది.రష్యా, బెలారస్ లపై మూడో దఫా ఆంక్షల వివరాలను జపాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రష్యాకు చెందిన 20 మంది, రెండు సంస్థలు, బెలారస్ కు చెందిన 12 మంది, 12 సంస్థలపై నిషేధం విధించారు. రష్యా నుంచి దిగుమతి అయ్యే చమురుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా ప్రకటించింది.

నేనెక్కడికీ పారిపోలే.. కీవ్లోనే ఉన్నా: జెలెన్ స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కొద్దిసేపటి ఒక వీడియో విడుదల చేశారు. తాను దేశం విడిచి వెళ్లినట్లు..  పారిపోయినట్లు.. తాను చనిపోతే ప్రత్యామ్నాయాలు ఏర్పాట్లు చేసినట్లు.. రకరకాల వార్తలు వస్తుండడం గమనించి నిజాలు ప్రపంచానికి తెలియజేసేందుకు వీడియో విడుదల చేశారు. సోమవారం రాత్రి సమయంలో ఈ వీడియోను తీసినట్లు కనిపిస్తోంది. తాను కీవ్ నగరంలోని తన కార్యాలయంలోనే సురక్షితంగా ఉన్నానని జెలెన్ స్కీ సెల్ఫీ వీడియోతో నగర వీధులను అద్దాల్లో  నుంచి చూపుతూ.. తన కార్యాలయంలోని సీట్లో ఆసీనమై మాట్లాడే వీడియోను పోస్టు చేశారు. పాతది అనుకునే అవకాశం లేకుండా.. కొన్ని గంటల క్రితం జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ మట్లాడారు. 

ఉక్రెయిన్ లో మరోసారి కాల్పుల విరమణ

ఉక్రెయిన్ లో మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా.. మాస్కో టైమ్ ప్రకారం ఉదయం 12.30 గంటల నుంచి కాల్పులకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. కీవ్, ఖార్కీవ్, మారియపోల్, సుమీ నగరాల్లో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు రష్యా ఛాన్స్ ఇచ్చింది. గడిచిన 24 గంటల్లో రెండో సారి రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. ప్రాణభయంతో ఇప్పటికే లక్షల మంది ఉక్రెయిన్ ను విడిచి వెళ్లారు. అయితే ప్రస్తుతం సుమీలో 700 మంది భారతీయులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన తమిళనాడు యువకుడు

రష్యా సైనికచర్యతో ఉక్రెయిన్ అట్టుడుకుతోంది. రష్యన్ బలగాలు కురిపిస్తున్న బాంబుల వర్షం ధాటికి రాజధాని కీవ్ తోపాటు ఖర్కీవ్, మరియుపోల్, సుమీ వణుకుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపై మోడీ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఇండియన్లను ప్రత్యేక విమానాల ద్వారా భారత్ కు తీసుకొచ్చింది. అయితే తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మాత్రం భారత్ కు ఇంకా చేరుకోలేదు. ఖర్కీవ్ లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో చదువుకుంటున్న 21 ఏళ్ల సైనికేశ్ రవిచంద్రన్ కు.. ఉక్రెయిన్ వీడటానికి మనసు రాలేదు. కష్టకాలంలో ఆ దేశం తరఫున పోరాడాలని నిర్ణయించుకున్న సైనికేశ్.. రష్యాతో ఫైట్ చేస్తున్న ఉక్రెయిన్ పారామిలిటరీ ఫోర్సెస్ లో జాయిన్ అయ్యాడు. 

1.68 లక్షల మంది పౌరులు తరలింపు

ఇప్పటి వరకు లక్షా 68 వేల మంది పౌరులు రష్యాకు వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తెలిపింది. నిన్న ఒక్కరోజే 5 వేల550 మంది వలస వెళ్లినట్లు తెలిపింది. ఉక్రెయిన్ నుంచి వస్తున్న శరణార్థుల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు రష్యా తెలిపింది. మొత్తం 16 లక్షల మందికిపై ఉక్రెయిన్ వీడారని అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్ ఎదురుదాడుల్లో రష్యా మేజర్ జనరల్ మృతి

రష్యా బాంబు దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ అదను చూసి ప్రతిదాడులకు దిగుతోంది. రష్యా దళాల ఆధిపత్యంలోకి వెళ్లిన కీవ్ నగర సమీపంలో  ఉక్రెయిన్ దళాలు ఊహించని రీతిలో విరుచుకుపడ్డాయి. ఎదురు కాల్పులు చూసి ఉలిక్కిపడ్డ రష్యా దళాలు తేరుకునేలోపే భారీ మూల్యం చెల్లించుకున్నాయి. రష్యా 41వ ఆర్మీ బెటాలియన్ తో కాపు కాసిన డిప్యూటీ కమాండర్, మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ తోపాటు మరికొందరు సైనికులు చనిపోయారు. ఇంకొందరు తీవ్రంగా గాయపడడంతో మిగిలిన సైనికులు వారిని ఉక్రెయిన్ దళాలకు దూరంగా వెనక్కు  తీసుకెళ్లిపోయారు. తమ దళాల చేతుల్లో రష్యా మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ చనిపోయాడని ఉక్రెయిన్ ప్రకటించింది. 

సుమీలోని ఇండియన్ల తరలింపునకు బ్రేక్

ఉక్రెయిన్​లోని సుమీలో చిక్కుకుపోయిన 700 మంది ఇండియన్ల తరలింపుకు బ్రేక్ పడింది. శనివారం నుంచి తరలింపు కోసం ఎదురుచూస్తున్న మన స్టూడెంట్లు ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు. ఇదే క్రమంలో బాంబు దాడులు కొనసాగుతుండటంతో వాళ్లను బార్డర్ దాటించాలన్న ప్రయత్నం నిలిచిపోయిందని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. మన వాళ్లందరినీ భద్రంగా తరలించేందుకు సహకరించాలని రష్యాను కోరింది. కీవ్ నుంచి బెలారస్​కు, ఖార్కివ్ నుంచి రష్యాకు స్టూడెంట్ల తరలింపుకు సాయం చేస్తామని రష్యా  అంగీకరించింది. 

ఉక్రెయిన్ నుంచి మరో 3వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం

ఉక్రెయిన్ నుంచి 16వేల మందికి పైగా విద్యార్థులను భారత్ కు తీసుకొచ్చామన్నారు.. కేంద్రమంత్రి మురళీధరన్. మరో మూడు వేల మంది విద్యార్థులను తరలించాల్సి ఉందన్నారు. విద్యార్థుల తరలింపునకు భారత విదేశాంగశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.

 

ఖార్కివ్లో తిండి, నీళ్లు దొరక్క అలమటించాం.. బతుకుతామా లేదా అని భయపడ్డాం

ఖార్కివ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు భారత్ చేరుకున్న విద్యార్థులు. ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు. భవనాలు, స్టోర్లు పూర్తిగా నేలమట్టమయ్యాని..తిండి, నీళ్లు దొరకని పరిస్థితులున్నాయని.. ప్రస్తుతం భారత్ చేరుకున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు.

పుతిన్ కు మోడీ ఫోన్ 

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు.దాదాపు 50 నిమిషాల పాటు వీరిద్దరి  మధ్య సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఉక్రెయిన్, రష్యా బృందాల మధ్య చర్చల స్థితిగతులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీకి వివరించారు.

రష్యాలో సేవలు నిలిపేసిన టిక్ టాక్

రష్యా ఆంక్షల కారణంగా కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్లు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తమ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ సహా... కొత్తగా వీడియోలు చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్. ఇటీవల ప్రభుత్వం ఫేక్ న్యూస్ చట్టం తేవడంతో... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది టిక్ టాక్. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, యాప్ స్టోర్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

భారతీయుల తరలింపు.. చివరి బ్యాచ్‌ వచ్చేసిన కేంద్ర మంత్రి

హంగేరిలో ఉన్న కేంద్ర మంత్రి హర్‌‌దీప్‌ సింగ్ పూరీ ఇవాళ స్వదేశానికి తిరిగొచ్చారు. ఉక్రెయిన్ నుంచి హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ చేరుకున్న భారతీయుల చివరి బ్యాచ్‌తో స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌‌ ద్వారా వెల్లడించారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అమ్మ ఇచ్చిన చీటీతో ఒంటరిగా వెయ్యి కిలోమీటర్ల జర్నీ

ఉక్రెయిన్‌, రష్యా మధ్య 12 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్‌ సిటీలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలపై దాడులు చేయబోమంటూనే.. అపార్ట్‌మెంట్లు, నివాస ప్రాంతాలపైనా రష్యా క్షిపణి దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లో ఎటు చూసినా భీతావహ వాతావరణమే కనిపిస్తోంది. సుదరంగా ఉన్న నగరాలు బాంబు దాడులతో ధ్వంసమైపోయాయి. హాయిగా పిల్లాపాపలతో గడుపుతున్న కుటుంబాలు చల్లాచెదురైపోయాయి. ఎవరు ఎక్కడకు వెళ్లాలో.. వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు దేశం విడిచి వలస పోతుంటే.. మరికొందరు మాతృభూమిని వదలలేకపోతున్నారు. యుద్ధం అందరినీ చిన్నాభిన్నం చేసేసిన.. ఈ కష్ట సమయంలో 11 ఏళ్ల చిన్నారి.. సొంత దేశాన్ని.. కుటుంబాన్ని వదిలి ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అమ్మానాన్న తోడు లేకుండానే వెయ్యి కిలోమీటర్లు జర్నీ చేసి పొరుగు దేశంలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. (పూర్తి వార్త కోసం క్లిక్ ఇక్కడ చేయండి)

జెలెన్స్కీకి మోడీ ఫోన్ కాల్ 

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ఇరు నేతలు చర్చించారు. అలాగే అక్కడ చిక్కుకున్న భారతీయులు, వారి తరలింపు గురించి మాట్లాడారు. ఉద్రిక్తతల తగ్గింపునకు సంబంధించి రష్యాతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న చర్చలపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జెలెన్స్కీని ఆయన అభినందించారు. ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి పంపడంలో జెలెన్స్కీ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 35 నిమిషాల పాటు జెలెన్స్కీ, మోడీ మధ్య చర్చలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల తెలిపాయి.  

యుద్ధానికిి మరోమారు బ్రేక్

ఉక్రెయిన్‌పై కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా మరోమారు కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్ తోపాటు ఉక్రెయిన్ లోని ఖర్కీవ్, మరియుపోల్, సుమీ నగరాల్లో కాల్పులను ఆపుతున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయేల్ మక్రాన్ రిక్వెస్ట్ చేయడంతో ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల నుంచి (ఇండియన్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి) కాల్పులను తాత్కాలికంగా నిలిపేశామని పేర్కొంది. దీంతో ఆయా నగరాల్లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. 

పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ

ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకరంగా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు చనిపోతే.. ఏం చేయాలో ప్లాన్ రెడీ

యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరణిస్తే.. ఏం చేయాలన్న దానిపై ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. తాను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, అనుకోనిది ఏదైనా జరిగితే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారని అన్నారు. ఈ వివరాలను తాను ఇప్పుడు బయటకు చెప్పలేనన్నారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఉక్రెయిన్‎కు ప్రపంచ దేశాల నుంచి సాయం

ఉక్రెయిన్‎కు ప్రపంచ దేశాల నుంచి సాయం అందుతోంది. యుద్ధంలోకి నాటో దేశాలు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రొమేనియా నుంచి 40 వేల మంది సైనికులు, ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు, 4 ఫైటర్ జెట్‎లు... బ్రిటన్ నుంచి అత్యాధునిక యుద్ధ సామాగ్రితో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్‎కు చేరుకున్నాయి. 

ఐఎస్ఎస్ నుంచి రష్యా మాడ్యుల్ కట్!
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి తమ మాడ్యూల్ ను వేరు చేసుకుంటామని గతంలోనే ప్రకటించిన రష్యా.. ఇంకా ఐఎస్ఎస్ నుంచి విడిపోనప్పటికీ.. తమ మాడ్యూల్ విడిపోయినట్లుగా ఓ వీడియోను తయారు చేసి వదిలింది. ఇలా రష్యన్ కాస్మోనాట్లు ఐఎస్ఎస్ కు అటాచ్ అయి ఉన్న తమ మాడ్యూల్ ను డిటాచ్ చేసుకుని దూరమవుతుండగా.. రష్యన్ స్పేస్ ఏజెన్సీ సైంటిస్టులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా వీడియోను రూపొందించారు. ఉక్రెయిన్ పై యుద్ధం.. రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలోనే రాస్ కాస్మోస్ ఇలా ముందస్తుగానే వీడియోను రిలీజ్ చేసింది.

చెర్నిహివ్‌‌‌‌పై 500 కిలోల బాంబు.. 

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌కు మరింత దగ్గరగా వచ్చిన రష్యా సైన్యం.. బుచా, ఇర్పిన్ వంటి పట్టణాలపైనా విరుచుకుపడుతోంది. చెర్నిహివ్ పై దాదాపు 500 కిలోల బాంబును వేయగా, పేలలేదు. ఆ ఫొటోను అధికారులు షేర్ చేశారు. వరుసగా రెండో రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందం అమలు కాలేదు. మరియుపోల్ నుంచి ప్రజల తరలింపు ప్రక్రియ మరోసారి విఫలం అయింది.  రష్యా దళాలు ఉక్రెయిన్‌‌‌‌లోని జనావాసాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయని బ్రిటిష్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చెప్పింది. ఉక్రెయిన్ సైన్యం బలంగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా చాలా నెమ్మదిగా  కదులుతున్నదని తెలిపింది.

ఏటీఎంలలో పైసలు నిల్ 

స్విఫ్ట్ నెట్ వర్క్ నుంచి రష్యన్ బ్యాంకులను తొలగించడంతో.. విదేశీ సెంట్రల్ బ్యాంకుల్లో రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు స్తంభించిపోయాయి. రూబుల్స్ ను విదేశీ కరెన్సీగా మార్చుకోలేకపోతున్నారు. చెల్లింపు వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. ఏటీఎంలలో డబ్బులు రావడంలేదు. కార్డులు పనిచేయడం లేదు. డిపాజిట్ లూ కష్టంగానే మారింది. రూబుల్ విలువ పడిపోతుండటంతో వీలైనంత త్వరగా తమ సొమ్మును విదేశీ కరెన్సీలోకి మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 1998 తర్వాత తలెత్తిన అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇదే. ఆహారం కోసం ఐఎంఎఫ్ ను ఆశ్రయించే పరిస్థితి రష్యాకు రావచ్చని అంటున్నారు. మరోవైపు రష్యా.. ట్విటర్, ఫేస్ బుక్, బీబీసీ యాప్ స్టోర్ సేవల్ని బ్లాక్ చేసింది. రష్యా దాడుల గురించి ఉక్రెయిన్, ఇతర ప్రాంతాల నుంచి సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇండియాలో అడ్మిషన్లు ఇవ్వండి

ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తున్న భారత విద్యార్థులకు ఇక్కడి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం వేలాది మంది విద్యార్థులను మానసికంగా కుంగదీసిందన్నారు. ఆ దేశం నుంచి ఇండియా వచ్చేసిన వారి కోసం నిబంధనలు సడలించి వారికి వెంటనే ప్రవేశాలు కల్పించాలని కోరారు.

76 ఫ్లైట్లలో ఇండియాకు చేరిన 15,920 మంది

ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ చేపడుతోంది. ఆ దేశంలోని వేర్వేరు సిటీల్లో ఉన్న వారు సరిహద్దులకు చేరుకుంటే.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా భారత్ కు తీసుకొస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 76 విమానాల్లో 15,920 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఎన్నెన్ని ఫ్లైట్లలో ఎంత మందిని భారత్ కు తీసుకొచ్చామన్నది వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. రొమేనియా నుంచి 31 ఫ్లైట్లలో 6,680 మందిని, పోలాండ్ నుంచి 13 ఫ్లైట్స్ లో 2,822 మందిని, హంగేరి నుంచి 26 ఫ్లైట్స్ లో 5,300 మందిని, స్లొవేకియా నుంచి 6 విమానాల్లో 1,118 మందిని ఇండియాకు చేర్చామని ఆయన పేర్కొన్నారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఉక్రెయిన్‌లో బుల్లెట్ గాయాలైన విద్యార్థి రేపు భారత్‌కు

ఉక్రెయిన్ యుద్ధ కల్లోలం నుంచి  బయటపడే ప్రయత్నంలో బుల్లెట్ గాయాలపాలైన ఇండియన్ స్టూడెంట్ హర్జోత్ సింగ్ ను రేపు స్వదేశానికి  తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కీవ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు వైపు ప్రయాణిస్తుండగా అతడిపై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో అతడికి బుల్లెట్ గాయాలతో పాటు ఫ్యాక్చర్స్ కూడా అయినట్లు హర్జోత్ వీడియో ద్వారా తెలిపాడు. ఇప్పుడు అతడిని సేఫ్ గా  స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలాండ్ లో ఉన్న మన కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చెప్పారు. హర్జోత్ సింగ్ పై కాల్పులు జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు కంగారులో తన పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్నాడని, అయితే అతడికి అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసి రేపు తమతో పాటు ఇండియాకు తీసుకొస్తున్నామని వెల్లడించారు. అతడు స్వస్థలానికి చేరుకున్నాక తల్లిదండ్రుల కేర్, ఇంటి ఫుడ్ తో త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి అన్నారు.

రష్యాపై వీసా, మాస్టర్ కార్డు కంపెనీల ఆంక్షలు

రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలు ప్రకటించాయి. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో తమ సేనలను ఆపేస్తామని రష్యాను హెచ్చరించాయి. దీంతో ఈ రెండు కంపెనీలకు ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖెలో ఫెదొరోవ్ థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు రష్యాలోని అన్ని స్టోర్లలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు పూమా కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే రష్యాకు షిప్మెంట్ల సరఫరా నిలిపేసినట్లు పేర్కొంది.


మూడో న్యూక్లియర్ ప్లాంట్ దిశగా కదులుతున్న రష్యా దళాలు

ఇప్పటికే రెండు అణువిద్యుత్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకున్న రష్యన్ సేనలు..మూడో న్యూక్లియర్ ప్లాంట్ దిశగా వేగంగా కదులుతున్నాయి. మైకోలేవ్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుజ్నౌక్రైన్స్ అణువిద్యుత్ కేంద్రానికి ముప్పు పొంచి ఉందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే జప్రోజియా,చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యన్ దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

15 లక్షల మంది శరణార్థులు ఉక్రెయిన్ విడిచి వెళ్లారు: ఐక్య రాజ్యసమితి

ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. రాకెట్లు, బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి రష్యన్ సేనలు. ఇప్పటి వరకు 15 లక్షల మంది శరణార్థులు ఉక్రెయిన్ ను వీడి వెళ్లారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం ఇదేనని పేర్కొన్నారు. మాల్దోవాకు శరణార్థులు ఎక్కువగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌కు అలెర్ట్

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలై 11 రోజులవుతోంది. ఓ వైపు శాంతి చర్చల ప్రయత్నాలు.. మరో వైపు భీకర యుద్ధం సాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో బాంబులతో, క్షిపణులతో దాడులకు పాల్పడుతున్న రష్యా ఇప్పటికే పలు సిటీలను హస్తగతం చేసుకుంది. అయితే ఈ కల్లోల పరిస్థితుల మధ్య చిక్కుకుపోయిన ఇండియన్స్ ను కేంద్ర ప్రభుత్వం వేగంగా తరలిస్తోంది. ప్రతి ఒక్క భారత పౌరుడిని, విద్యార్థులను అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ గంగ’ పేరుతో యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోంది. ఉక్రెయిన్ లో మన వాళ్లు సుమారు 20 వేల మంది వరకూ ఉండగా.. అందులో దాదాపు 13,500 మందిని ఇప్పటికే భారత్ కు చేర్చింది. మరో నాలుగైదు వేల మందికి పైగా ఉక్రెయిన్ సరిహద్దు దాటి పొరుగు దేశాలకు చేరుకున్నారు. అయితే ఇంకా ఆ యుద్ధ కల్లోలం మధ్య నుంచి బయటపడలేక అక్కడే చిక్కుకున్న భారత పౌరులు ఎవరైనా ఉంటే తక్షణం వారి వివరాలతో గూగుల్ ఫామ్ ను ఫిల్ చేయాల్సిందిగా ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ కోరింది. ఈ గూగుల్ ఫామ్ ను ఎంబసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు 

రష్యా దాడులతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. భీకర బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. చిన్న పిల్లలను వెంటబెట్టుకుని దేశం విడిచి వెళ్లిపోతున్నారు. మరోవైపు రష్యా సైనికులకు ధీటుగా ప్రాణాలను లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడుతున్నారు ఉక్రెయిన్ బలగాలు. ఈ క్రమంలో రష్యా జనావాసాలనే లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తుందని యూకే ఇంటెలిజెన్స్ తెలిపింది. రష్యాను ఆశ్చర్యపరిచేలా ఉక్రెయిన్ సేనలు కూడా ప్రతిఘటిస్తున్నాయని పేర్కొంది. రష్యా సేనలు ఖార్కివ్, చెర్నిహివ్, మారియూపోల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందని  బ్రిటీష్ ఇంటెలిజెన్స్ తెలిపింది. 

ప్రతి ఒక్కరినీ సేఫ్​గా పంపుతం: రష్యా 

ఉక్రెయిన్ లోని కీవ్, ఖార్కివ్, సుమీ సిటీల నుంచి ఇండియన్ స్టూడెంట్లను, ఇతర దేశీయులను తరలించేందుకు 130 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రష్యా తెలియజేసింది. బార్డర్ వద్ద చెక్ పాయింట్లు పెట్టామని, అక్కడ స్టూడెంట్లకు ఫుడ్, మందులు వంటివి సిద్ధం చేశామని చెప్పింది. వీళ్లందరినీ రష్యాలోని బెల్గార్డ్​కు తీసుకెళ్లి, అక్కడి నుంచి వారి వారి దేశాలకు విమానాల్లో పంపుతామని పేర్కొంది. శుక్రవారం జపొరిజియా అణు విద్యుత్ కేంద్రంపై దాడి తర్వాత 15 దేశాలతో కూడిన భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో రష్యన్ అంబాసిడర్ వసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ బలగాలు 3,700 మంది ఇండియన్ లు, ఇతర దేశాలకు చెందిన అనేక మందిని సిటీల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటు న్నారని చెప్పారు. తాము మాత్రం ఇండియన్, ఇతర దేశాల స్టూడెంట్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

రష్యాపై ఆంక్షలంటే.. యుద్ధం ప్రకటించడమే

‘నో ఫ్లై జోన్’ ప్రకటిస్తే.. యుద్ధంలోకి దిగినట్లే: పుతిన్

రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం అంటే.. యుద్ధం ప్రకటించడం వంటిదేనని రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ లో ‘నో ఫ్లై జోన్’ను ప్రకటించడమన్నా.. యుద్ధంలోకి దిగినట్లేనని హెచ్చరించారు. శనివారం మాస్కోలో మీడియాతో పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్ ను డీమిలిటరైజేషన్, డీనాజిఫికేషన్ చేయడం ద్వారా ఆ దేశాన్ని తటస్థంగా మార్చాలని, తద్వారా ఉక్రెయిన్ లోని రష్యన్ మాట్లాడే ప్రజలకు రక్షణ కల్పించాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మిలటరీ ఆపరేషన్ లో ప్రొఫెషనల్ సోల్జర్లు మాత్రమే పాల్గొంటున్నారని, ఇతర ఎలాంటి గ్రూపులూ పాల్గొనడంలేదన్నారు. అంతా అనుకున్న ప్రకారమే జరుగుతోందని, తాము లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రష్యాలో మార్షల్ లా లేదా ఎమర్జెన్సీ విధిస్తారన్న వార్తలను పుతిన్ కొట్టిపారేశారు. అయితే, ఉక్రెయిన్​పై మిలిటరీ ఆపరేషన్ చేపట్టేందుకు పుతిన్ చేస్తున్న వాదనలు అర్థంలేనివని ఇదివరకే ఉక్రెయిన్, వెస్ట్రన్ కంట్రీస్ కొట్టిపారేశాయి. మరోవైపు ఉక్రెయిన్​లో నో ఫ్లై జోన్ ను ప్రకటించాలన్న జెలెన్ స్కీ వినతిని కూడా నాటో దేశాలు ఇదివరకే తిరస్కరించాయి.

5 గంటలు కాల్పులు ఆపి.. మళ్లీ దాడులు
భీకర యుద్ధంలో కొంచెం గ్యాప్ ఇచ్చింది రష్యా. ఉక్రెయిన్‌‌లోని మరియుపోల్‌‌, వోల్నోవాఖాలోని ప్రజలను సిటీల నుంచి బయటికి తరలించేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకుంది. దీనికోసం హ్యూమన్ కారిడార్లను తెరుస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ శనివారం తెలిపింది. మాస్కో టైం ప్రకారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్పులు జరపబోమని చెప్పింది. కానీ రష్యా తన మాట నిలబెట్టుకోలేదని, షెల్లింగ్‌‌ను నిరంతరం కొనసాగించిందని ఉక్రెయిన్ ఆఫీసర్లు ఆరోపించారు.

10 వేల మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్

తమ దేశంపై దాడులకు పాల్పడుతున్న రష్యన్ ఆర్మీకి చెందిన 10 వేల మంది రష్యన్ సైనికులు తమ సైనికుల ఎదురు దాడిలో మరణించినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. అదేవిధంగా భారీగా ఆయుధాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 105 ఆర్టిలరీ వ్యవస్థలు, 50 మల్టీపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌లు, 39 యుద్ధ విమానాలు, 269 ట్యాంకులు, 40 హెలికాప్టర్లు, 945 సాయుధ పోరాట వాహనాలు, ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

రష్యాపై సింగపూర్ ఆంక్షలు

ఉక్రెయిన్ పై రష్యా సైనికచర్యను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. పుతిన్ తీరును విమర్శిస్తూ ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ కోవలోకి తాజాగా సింగపూర్ చేరింది. రష్యన్ సెంట్రల్ బ్యాంకుతోపాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలపై పరిమితి విధిస్తామని సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా ఎగుమతుల పైనా నియంత్రణ విధిస్తామని ప్రకటించింది. అలాగే యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు, ప్రమాదకరమైన సైబర్ కార్యకలాపాలకు వినియోగించే వస్తువులను ఇకపై రష్యాకు ఎగుమతి చేయబోమని సింగపూర్ స్పష్టం చేసింది. వాటిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నామని తేల్చిచెప్పింది. సైనికులు ఉపయోగించే వస్తువులు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లతోపాటు రష్యాకు తాము పంపే పలు దిగుమతులపై బ్యాన్ వేస్తున్నామని పేర్కొంది. దీంతో గతంలో సింగపూర్, రష్యా చేసుకున్న పరస్పర ఒప్పందాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. 

తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

ఉక్రెయిన్‌లో దాడులకు దిగుతున్న రష్యా తాజాగా కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. భారత కాలమానం ప్రకారం.. ఈరోజు ఉదయం 11.30 గంటలకు కాల్పులను ఆపేసినట్లు రష్యా వెల్లడించింది. ఐదున్నర గంటల పాటు ఎలాంటి దాడులు జరపమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించడంతో పాటు దేశ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విరామం ప్రకటించినట్లు వెల్లడించింది.

నేను పారిపోయానని ఎవరన్నారు?

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులు కూడా వెనక్కి తగ్గకుండా దీటుగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు భయపడి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ పారిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. రాజధాని కీవ్ సిటీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు కీవ్ లోని తన ఆఫీసులో తీసిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేను కీవ్ లోనే ఉన్నా. ఇక్కడే ఉండి నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. నేను చేయాల్సిన పనులు చేస్తున్నా. ఎవ్వరూ పారిపోలేదు’ అని  జెలెన్స్కీ పేర్కొన్నారు.

ఇంకో వెయ్యి మంది అక్కడ్నే..

తూర్పు ఉక్రెయిన్​లోని ఖార్కివ్ సిటీపై రష్యా కంటిన్యూగా బాంబుదాడులు చేస్తుండటంతో ఇండియన్ స్టూడెంట్లు వెంటనే ఆ సిటీని వదిలివెళ్లాలని బుధవారం కేంద్రం సూచించింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని పిసోచిన్ సిటీకి చేరుకున్న సుమారు వెయ్యి మంది ఇండియన్ స్టూడెంట్లు తినడానికి తిండి, తాగడానికి నీళ్లులేక అలమటిస్తున్నారు. అక్కడ మైనస్ టెంపరేచర్ల ఉష్ణోగ్రతలతో తీవ్రంగా మంచు కురుస్తోందని, తమను త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. తమను అక్కడి నుంచి పశ్చిమ బార్డర్​లో ఉన్న లీవ్ సిటీకి బస్సులో తరలించేందుకు కాంట్రాక్టర్లు 500 నుంచి 700 డాలర్లు(రూ. 38 వేల నుంచి రూ. 53 వేల వరకు) డిమాండ్ చేస్తున్నారని కొందరు స్టూడెంట్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎంబసీ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 

మెడికల్ కోర్సుల కంప్లీట్​పై ఎన్ఎంసీ ఫోకస్

ఉక్రెయిన్​లో మెడికల్ కోర్సు లు చదువుతున్న మన స్టూడెంట్లు యుద్ధం కారణంగా నష్టపోకుండా చూసేందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర హెల్త్ మినిస్ట్రీ, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఫోకస్ పెట్టాయి. ఎన్ఎంసీ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్) రెగ్యులేషన్స్, 2021లో నిబంధనలను సడలించడం లేదా ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్లు మన దేశంలో లేదా ఇతర దేశాల్లో కోర్సును కంప్లీట్ చేసేందుకు అనుమతించడం వంటి ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై త్వరలోనే కేంద్ర హెల్త్ మినిస్ట్రీ, విదేశాంగ శాఖ, ఎన్ఎంసీ, నీతి ఆయోగ్ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పుతిన్​ను చంపి పుణ్యం కట్టుకోండి

ఉక్రెయిన్​పై దాడులకు తెగబడుతున్న పుతిన్​ను చంపాలని అమెరికా సీనియర్​ సెనేటర్​లిండ్సే గ్రాహమ్ రష్యా పౌరులకు పిలుపునిచ్చారు. ఉద్రిక్తత ముగిసేలా లేదు.. పుతిన్​ను అంతం చేసేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందేనంటూ గురువారం ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్​ చేశారు. ఇంటర్వ్యూ తర్వాత కూడా వరుస ట్వీట్లలో స్పందించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితిని సరిదిద్దగల వ్యక్తులు రష్యా ప్రజలు మాత్రమే అన్నారు. రోమన్​చక్రవరి జూలియస్​ను చంపిన వాళ్లలో ఒకరైన బ్రూటస్​ను గుర్తు చేస్తూ..‘రష్యాలో బ్రూటస్ ఉన్నాడా?’ అంటూ ప్రశ్నించారు. 1944లో హిట్లర్‌‌ను చంపేందుకు ప్రయత్నించి విఫలమైన జర్మన్ అధికారిని ఉటంకిస్తూ.. రష్యా సైన్యంలో ‘కల్నల్ స్టాఫెన్‌‌బర్గ్’ ఉన్నారా లేరా అన్నారు. పుతిన్​ను చంపడం ద్వారా మీరు మీ దేశానికి, తద్వారా ప్రపంచానికి గొప్ప సేవ చేసినవారవుతారంటూ పిలుపునిచ్చారు.

జెలెన్​స్కీని చంపాలని మూడుసార్లు కుట్ర

గత వారం రష్యా మిలిటరీ దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్​అధ్యక్షుడు జెలెన్​స్కీ మూడు సార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. ఆయన సెక్యూరిటీ ఆఫీసర్లు అలర్ట్​గా ఉండటం వల్లే ఈ ముప్పు తప్పిందని పలు రిపోర్టులు వెల్లడించాయి. వ్యాగనర్, చెచెన్​రెబల్స్​రెండు గ్రూపులు జెలెన్​స్కీని చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆయనను చంపేందుకు బయలుదేరిన ప్రత్యేక దళాల యూనిట్ గురించి రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఉక్రేనియన్లను అప్రమత్తం చేసిందని ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. కాగా హత్యాయత్నానికి ప్రయత్నించిన గ్రూపులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ డిఫెన్స్​ కౌన్సిల్ ​సెక్రటరీ తెలిపినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. రష్యా ఫెడరల్ ​సెక్యూరిటీ సర్వీస్ ​ఇన్​పుట్స్​తోనే శనివారం ఉక్రెయిన్​ స్పెషల్​ ఫోర్సెస్ ఆ గ్రూపులను అంతం చేసినట్లు డానిలోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్​పై యుద్ధం జరగడం రష్యా ఫెడరల్​ సెక్యూరిటీ సర్వీస్ లోనూ చాలా మందికి ఇష్టం లేదన్నారు. 

రష్యన్ ఆర్మీపై ఫేక్ న్యూస్ పెడితే జైలు 

ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా సైట్లపై ఆంక్షలు పెట్టిన రష్యన్ ప్రభుత్వం తాజాగా ఆర్మీకి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ పెడితే జైలుకు పంపుతామని ప్రకటించింది. ఇందుకోసం శుక్రవారం రష్యా పార్లమెంటు ఓ చట్టాన్ని ఆమోదించింది. ఆర్మీకి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. ఫైన్ లు, గరిష్టంగా 15 ఏండ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో ప్రతిపాదించారు. రష్యాపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చినా, ఫైన్ లు, జైలు శిక్ష వేసేలా రూల్స్ తెచ్చారు. అమెరికాకు చెందిన సోషల్ మీడియా సైట్లను వెపన్స్ గా వాడుకుంటున్నారని, అవి కావాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని రష్యన్ పార్లమెంటు తప్పుపట్టింది.

ఉక్రెయిన్​లో మేం అడుగుపెట్టం

ఉక్రెయిన్​లో సాధారణ ప్రజల ఇండ్లు, భవనాలపై, చివరకు అణు విద్యుత్ కేంద్రంపై కూడా రష్యా బాంబుదాడులు చేస్తున్నందున నాటో బలగాలు తమ దేశంలోకి వచ్చి ‘నో ఫ్లై జోన్’ను ప్రకటించాలన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ వినతిని నాటో దేశాలు తిరస్కరించాయి. ఉక్రెయిన్ లోకి తమ యుద్ధవిమానాలు ప్రవేశిస్తే.. అది యూరప్​లో భారీ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. శుక్రవారం బ్రస్సెల్స్​లో నాటో దేశాల విదేశాంగ మంత్రులు, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ సమావేశమయ్యారు. ‘‘రష్యా దాడుల్లో ఉక్రెయిన్ ప్రజలకు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్​లో జరుగుతున్న విధ్వంసం చాలా బాధను కలిగిస్తోంది’’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. కానీ తమ బలగాలను ఉక్రెయిన్​లోకి పంపబోమన్నారు. నాటో ట్రీటీలోని ఆర్టికల్ 5 ప్రకారం.. సభ్య దేశాలపై దాడి జరిగితే లేదా నాటో ప్లేన్లను కూల్చివేస్తే సభ్యదేశాలన్నీ డిఫెన్స్​కు ముందుకు వస్తాయన్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ లో నో ఫ్లై జోన్​ను తేవాలంటే నాటో ఫైటర్ ప్లేన్లను పంపాల్సి ఉంటుందని, అందుకు తాము సిద్ధంగా లేమన్నారు.

9,200 రష్యన్లు హతం.. 
ఉక్రెయిన్ బలగాలు కూడా ఎక్కడికక్కడ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. శుక్రవారం వోల్నోవఖా సిటీ సమీపంలో రష్యాకు చెందిన రెండు జెట్ ఫైటర్లను ఉక్రెయిన్ సోల్జర్లు కూల్చేశారు. హాస్టోమెల్, బ్రోవరీ సిటీల వద్ద పలు యుద్ధట్యాంకులను పేల్చివేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున రష్యన్ సోల్జర్లు చనిపోయారని, అనేక వెహికల్స్ ధ్వంసం అయ్యాయని చెప్తున్నారు. ఇప్పటివరకూ 9,200 మంది రష్యన్ సోల్జర్లను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది. వందలాది యుద్ధట్యాంకులను, దాదాపు వెయ్యి ఆర్మర్డ్ వెహికల్స్ ను, పదులకొద్దీ హెలికాప్టర్లు, జెట్​లను పేల్చివేశామని వెల్లడించింది.

 

300 మిసైల్స్ తో 280 ట్యాంకులు ఔట్ 
అమెరికా 2018లో అందించిన జావెలిన్ మిసైల్స్ ఉక్రెయిన్ బలగాలకు ఇప్పుడు బాగా కలిసి వస్తున్నయి. జవాన్లు భుజాలపై మోసుకుపోతూ ట్యాంకులను పేల్చేసే వీలుండటం తో వీటిని యుద్ధంలో బాగా ఉపయోగిస్తున్నారని అమెరికన్ జర్నలిస్టు జాక్ మర్ఫీ చెప్పారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ సైనికులు 300 మిసైల్స్ ప్రయోగించి.. 280 రష్యన్ యుద్ధట్యాంకులను పేల్చేశారని తెలిపారు. జావెలిన్ మిసైల్స్ 93% కిల్ రేట్​ను సాధించాయన్నారు. ట్యాంకుల పైభాగం నుంచి దాడిచేయడంవల్లే ఈ మిసైల్స్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందన్నారు.

అత్యవసర సమావేశానికి ఐరాస భద్రతా మండలి సన్నాహాలు
జాపోరిషియా అణువిద్యుత్ ప్లాంట్ పై రష్యా దాడి చేసి స్వాధీనం చేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. చెర్నోబిల్ విపత్తును పునరావృతం చేయాలని రష్యా ప్రయత్నిస్తోందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతుండడంతో కార్యాచరణ కోసం ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

దేశం విడిచి వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ?
ఉక్రెయిన్ పై దాడులు అంతకంతకూ పెంచుతున్న రష్యా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని హతమార్చేందుకు ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించి రెండు మూడుసార్లు విఫలయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ  పోలండ్ కు వెళ్లినట్లు రష్యా మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. 
 

వచ్చే 24గంటల్లో  ఉక్రెయిన్ కు 16 విమానాలు
ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను వెనక్కి తీసుకు వచ్చేందుకు వచ్చే 24 గంటల్లో 16 విమానాలను నడుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత అధికారులు ఇస్తున్న సూచనలతో దాదాపు 20 వేల మందికి పైగా భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులను దాటారని సమాచారం. రాబోయే రోజల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారంనాడు మీడియాకు వెల్లడించారు. 

కాల్పుల విరమణ ప్రకటించండి: రష్యా-ఉక్రెయిన్ లకు భారత్ విజ్ఘప్తి 
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ ప్రకటించాలని ఉక్రెయిన్, రష్యాలను భారత్ కోరింది. ప్రతిరోజూ ప్రత్యేక విమానాల్లో తిరిగొస్తున్నప్పటికీ ఇంకా అనేక మంది ఉక్రెయిన్ లోనే చిక్కుకుని ఉన్న విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగొచ్చేందుకు ఎదరుచూస్తున్న  మనవారిలో భయాన్ని తొలగించి క్షేమంగా తిరిగొస్తామనే నమ్మకాన్ని కలిగించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించాలని భారత ఉన్నతాధికారులు రష్యా, ఉక్రెయిన్ దేశాలకు విజ్థప్తి చేశారు. 

రష్యాపై పోరాటం కొనసాగిస్తాం.. పుతిన్ దూకుడు అడ్డుకోవడానికి సాయం అందించండి
ఏకపక్షంగా యుద్ధం చేస్తున్న రష్యాపై తాము పోరాటం కొనసాగిస్తామని.. అయితే ఉక్రెయిన్ పరిస్థితిని సిరియా లాగ మార్చడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా ఆరోపించారు. పరిస్థితి మరింత విషమించకముందే నాటో తరపున సాయం అందించాలని ఆయన కోరారు. నాటో సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశం అనంతరం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా వీడియో సందేశాన్ని  సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 


ఉక్రెయిన్ లో భారతీయులకు సోనూసూద్ టీమ్ సేవలు

కరోనా లాక్ డౌన్ కాలంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుని దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సోనూసూద్ ఉక్రెయిన్ లో రష్యా బాంబు దాడుల సమయంలోనూ తన టీమ్ ను రంగంలోకి దింపారు. ఉక్రెయిన్ లో భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ కార్యక్రమం పేరుతో ఏర్పాట్లు చేయగా.. సోనుసూద్ కూడా తనవంతుగా సాయం అందించే బృందాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఉక్రెయిన్ లో చిక్కుకుని స్వదేశానికి రావడానికి ఇబ్బందులుపడుతున్న వారిని గుర్తించి అవసరమైన సహాయం అందిస్తున్నారు. 

రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ హోస్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఫార్ములా వన్..అదే బాటలో మరిన్ని సంస్థలు

ఉక్రెయిన్ పై యుద్ధం దృష్ట్యా మరోవైపు రష్యాపై పలు సంస్థలు, ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ ని హోస్ట్ చేసే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపింది ఫార్ములా వన్. రష్యాలో తన సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది మేజర్ కన్ స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ సాఫ్ట్ వేర్ డెవలర్ ఆటో డెస్క్. ఓలిగార్చ్ లపై ఆంక్షలు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు బైడన్. సెన్సార్ షిప్ డిమాండ్ పెరగడంతో... రష్యాలో అన్ని యాడ్ సేల్స్ ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. రష్యా, బెలారస్ కు సంబంధించిన అన్ని రకాల వ్యాపార లావాదేవీలు సస్పెండ్ చేసినట్లుతెలిపింది ద ఏషియన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంక్.
 

భారతీయుల తరలింపునకు 130 బస్సులు సిద్ధం చేసిన రష్యా

ఉక్రెయిన్ లోని ఖార్కివ్, సుమీ ప్రాంతాల్లో చిక్కుకున్న భారత్, ఇతర దేశాల విద్యార్థుల తరలింపునకు ఏర్పాట్లు చేసింది రష్యా. తరలింపు కోసం 130 రష్యన్ బస్సులు సిద్ధంగా ఉంచామని రష్యన్ నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ హెడ్ కల్నల్ మైఖెల్ మిజెన్సివ్ ప్రకటించింది. ఉక్రెయిన్ పై సైనిక చర్య మొదలైనప్పటి నుంచి లక్షా 67 వేల మంది ఉక్రెయిన్లు తమ దేశంలోకి ప్రవేశించారని వెల్లడించారు రొమేనియా బార్డర్ పోలీసులు. నాలుగు చెక్ పోస్టులతో పాటు మాల్డోవా నుంచి రొమేనియాకు చేరుకున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ కు అంబులెన్స్ ల రూపంలో సాయం అందిస్తామన్నారు స్థానిక అధికారులు.

అణు పదార్థాలతో చెలగాటం ఆడుతున్న రష్యా
ఉక్రెయిన్ ను వీలైనంత వేగంగా లొంగదీసుకునేందుకు అణుపదార్థాలతో చెలగాటమాడుతోంది రష్యా. ఐరోపాలోనే అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపోరిజియా పై బాంబుల వర్షం కురిపించారు రష్యా సైనికులు. న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర మంటలు చెలరేగడంతో.. ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశాయి. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంటు రష్యా ఆధీనంలోకి వెళ్లినట్లు ప్రకటించింది ఉక్రెయిన్ ప్రభుత్వం. దాడులు జరిగిన కొన్ని గంటలకే న్యూక్లియర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. న్యూక్లియర్ ప్లాంటు దగ్గర రేడియేషన్ స్థాయి పెరగలేదని తెలిపింది ఉక్రెయిన్.

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. పవర్ ప్లాంట్ పై దాడుల గురించి అమెరికా, బ్రిటన్, కెనడా ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడు బైడన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడారు. న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి వల్ల ఐరోపా ఖండానికే ముప్పుం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు బ్రిటన్ ప్రధాని. న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి దారుణమన్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.

రష్యా ఇప్పటి వరకు 470 క్షిపణులను ప్రయోగించింది: అమెరికా
ఉక్రెయిన్ పై మిసైల్స్, రాకెట్లతో దాడి కొనసాగిస్తోంది రష్యా. తొమ్మిది రోజుల నుంచి ఇప్పటివరకు రష్యా మొత్తం 470 క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది అమెరికా. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో రష్యా సక్సెస్ అయినా... ఉత్తర ప్రాంతాలో రష్యా సేనలను దీటుగా ఎదుర్కొంటుంది ఉక్రెయిన్ సైన్యం. మొత్తం మిసైల్స్ లో 230... ఉక్రెయిన్ లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా ప్రయోగించినట్లు తెలిపింది. రష్యా భూభాగం నుంచి 150, బెలారస్ నుంచి 70, బ్లాక్ సీ నుంచి నౌకల ద్వారా మరిన్ని ప్రయోగించినట్లు తెలిపింది. రష్యా దాడులను ఉక్రెయిన్ క్షిపణి విధ్వంసంక దళాలు దీటుగా ఎదుర్కొన్నాయంది అమెరికా.

 

ఉక్రెయిన్ పరిస్థితులపై మోడీ ఉన్నతస్థాయి సమీక్ష

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని భార‌త్ కు త‌ర‌లించేందుకు విమానాల సంఖ్య‌ను పెంచాల‌ని ప్ర‌ధాని మోడీ అధికారుల‌ను ఆదేశించారు.  ఉక్రెయిన్ పరిస్థితులపై మోడీ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై ఆయన అధికారులతో చర్చించారు. ఇప్పటికే  ఆపరేషన్ గంగ పేరుతో భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్నారు.  ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయులను తరలిస్తున్నారు. తాజాగా కీవ్ లో గాయపడిన భారతీయ విద్యార్థి ఘటనపై కూడా చర్చించినట్లు సమాచారం. అత్యంత వేగంగా భారతీయులను తరలించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 9 వేల మందిని తరలించారు. మరో ఐదు వేల మంది వరకూ భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 

కుక్కలేనిదే ఉక్రెయిన్ వీడనన్న భారతీయ విద్యార్థి

ఉక్రెయిన్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. అయితే డెహ్రాడూన్ కు చెందిన రిషబ్ కౌశిక్ అనే యువకుడు మాత్రం ఇండియాకు రావడానికి మొండికేశాడు. తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క లేకుంటే ఉక్రెయిన్ ను వీడనన్నాడు. మొత్తానికి కుక్కను తీసుకునే భారత్ కు తిరిగొచ్చాడు. హంగేరి మీదుగా స్వదేశానికి చేరుకున్న రిషబ్.. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఓ వీడియోను రూపొందించాడు. పెంపుడు జంతువులను తమ వెంట తీసుకొచ్చేందుకు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ వీడియోలో ప్రస్తావించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

రష్యా ఆర్మీ గురించి ఫేక్ న్యూస్ రాస్తే 15ఏళ్ల జైలు శిక్ష

Vladimir Putin looks on as Russia flexes its military muscles | Euronews

విదేశీ ఆంక్షల ఎంకరేజ్ మెంట్ ను నేరంగా పరిగణించే బిల్లును రష్యా చట్టసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రష్యా స్టే డూమా ఆమెదించింది. ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం చేశారు.  రష్యా ఆర్మీ గురించి తప్పుడు సమాచారాన్ని నేరంగా భావిస్తూ.. రష్యా స్టేట్ ఆఫ్ డూమాలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆర్మీపై ఫేక్ న్యూస్ రాస్తే.. 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా ఉన్న బిల్లుకు ఆమోదం తెలిపింది రష్యా స్టేట్ ఆఫ్ డూమా.


ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును ప్రశంసించిన సుప్రీంకోర్టు


ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని ప్రశంసించింది సుప్రీం కోర్టు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి తరలింపునకు కేంద్రం గొప్ప చర్యలు చేపట్టిందంది. భారతీయుల తరలింపు, సాయం కోసం హెల్ప్ డెస్కు ఏర్పాటు చేయాలన్న పిటిషన్ పై విచారణ చేపట్టింది సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు బాధపై ఆందోళన వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం. ఇప్పటివరకు 17 వేల మందిని ఉక్రెయిన్ సరిహద్దులు దాటించినట్టు తెలిపారు అటార్నీ జనరల్ వేణుగోపాల్. వైద్య విద్యార్థుల తరలింపులో ఏజీ వేణుగోపాల్ కృషి చేశారంది సుప్రీం కోర్టు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి తరలింపులో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.


ఫేస్ బుక్ , ట్విట్టర్, యాప్ స్టోర్లను బ్లాక్ చేసిన రష్యా
ఫేస్ బుక్ , ట్విట్టర్, యాప్ స్టోర్లను బ్లాక్ చేసింది రష్యా. కీలక సమాచారాన్ని సెన్సార్ చేస్తున్నారనే ఆరోపణలపై రష్యా ప్రభుత్వం ఇటీవలే ఫేస్ బుక్ పై పరిమితులు విధించింది. దీంతో... ఫేస్ బుక్ మెటా, గూగుల్, యూట్యూబ్ లు.. తమ ప్లాట్ ఫామ్ లలో ఆదాయాన్ని పొందకుండా నిషేధం విధించింది రష్యా స్టేట్ మీడియా.

ఇన్వెస్టర్లకు ప్రతికూలంగా రష్యన్ స్టాక్ మార్కెట్లు

మరోవైపు కఠిన ఆంక్షల వల్ల రష్యన్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు ప్రతికూలంగా మారాయి. దీంతో వరుసగా ఐదో రోజు అక్కడి క్యాపిటల్ మార్కెట్లు మూతపడ్డాయి. విదేశీ స్టాక్ ఎక్స్చేంజీలో రష్యా ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్స్ విలువ కూడా తగ్గిపోయింది.

 

రష్యా చేతిలోకి జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్

ఉక్రెయిన్ ను వీలైనంత వేగంగా లొంగదీసుకునేందుకు రష్యా  అణుపదార్థాలతో చెలగాటమాడుతోంది. యూరప్ లోనే అతి పెద్దదైన జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై బాంబుల వర్షం కురిపించారు. న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర మంటలు చెలరేగడంతో.. ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశాయి. అయితే జపోరిజియా న్యూక్లియర్ ప్లాంటును రష్యన్ బలగాల తమ ఆధీనంలోకి తీసుకున్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్లాంట్ లోపలికి రష్యా సైనికులు వెళ్లారని తెలిపింది. దాడులు జరిగిన కొన్ని గంటలకే న్యూక్లియర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి న్యూక్లియర్ ప్లాంటు దగ్గర రేడియేషన్ స్థాయి పెరగలేదని వెల్లడించింది.

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన మరో 630 మంది

ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరో 630 మంది భారత పౌరులు ఈ రోజు ఉదయం ఢిల్లీ సమీపంలో హిండన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యారు. రొమేనియా, హంగేరిల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల నుంచి నిన్న రాత్రి బయలుదేరిన మూడు సీ17 విమానాలు ఈ ఉదయం హిండన్ చేరుకున్నాయి. వీటిలో 630 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు ఆర్పేసినం 

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ సిటీలపై రష్యన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో గురువారం అర్ధరాత్రి జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బాంబులు వేసింది. దీంతో యూరప్ లోనే అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన దీనిపై రష్యా అటాక్స్ తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో న్యూక్లియర్ ప్లాంట్ లో పేలుడు జరిగితే భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని, ఆ మంటల ఆర్పేందుకు ఫైర్ సిబ్బందిని వెళ్లనివ్వాలని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిత్రో కులెబా రష్యాను కోరారు. దీంతో రష్యన్ బలగాలు ఆ ప్రాంతాలో దాడులను నిలిపేయడంతో ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది న్యూక్లియర్ ప్లాంట్ లోకి వెళ్లి మంటలను ఆర్పేశారు. రష్యా దాడులతో న్యూక్లియర్ ప్లాంట్ లోని ట్రైనింగ్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయని, వాటిని ఈ రోజు ఉదయం ఆర్పామని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ విభాగం వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.

ఉక్రెయిన్‌లో మరో ఇండియన్ పై దాడి

ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో మరో భారత విద్యార్థి ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీ నుంచి బయటకు పడేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇండియన్ స్టూడెంట్ పై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ గాయాలైన ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ ధ్రువీకరించారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యుద్ధం జరుగుతున్న చోట సేఫ్​గా ఎట్లుండాలె?

ఉక్రెయిన్​లో దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో సేఫ్​గా ఎట్లుండాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తోంది. ఆర్మీ అధికారులను, ఎక్స్​పర్ట్​లను దూరదర్శన్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియోలను ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్​లలో విడుదల చేస్తోంది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా మాట్లాడుతూ.. ఒక ప్రాంతంలో యుద్ధం జరుగుతోందంటే అక్కడ సమాచారం కట్​ అయిపోతుందని, అలాంటపుడు బంకర్లలో, అండర్​గ్రౌండ్లలో, షెల్టర్లలో ఉండటం మంచిదని సూచించారు. సెల్​ఫోన్​ బ్యాటరీ స్టోరేజీ సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యమని, ఫుడ్, నీళ్లను పద్ధతిగా వాడుకోవాలని మరొక రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుధాకర్ సూచించారు. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్నోళ్లు వీలైనంతవరకు గుంపులుగా ఉండాలని, సైనికుల క్యాంపుల దగ్గర అస్సలు ఉండకూడదని చెప్పారు.

ఈయూ తాత్కాలిక పర్మిట్లు

యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ దేశాల్లోకి వస్తున్న శరణార్థులకు తాత్కాలిక పర్మిట్లు ఇస్తామని ఈయూ కమిషన్ వెల్లడించింది. ఈయూలోని 27 దేశాల్లో చదువుకునేందుకు, పని చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది.

వారంలో 10 లక్షల మందికిపైగా దేశం విడిచిన్రు

రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచిపెడుతున్నరు. తల దాచుకునేందుకు పొరుగు దేశాలకు పోతున్నరు. గడిచిన వారం రోజుల్లోనే 10 లక్షల మందికిపైగా దేశం వదిలి వెళ్లిపోయారని యూఎన్​  గురువారం తెలిపింది. ఇప్పటివరకు దేశ జనాభాలో 2% కంటే ఎక్కువమంది తమ ఇండ్లను వదిలిపెట్టాల్సివచ్చిందని ప్రకటించింది. ‘‘ఒక్క ఖార్కివ్​లోనే 15 లక్షల జనాభా ఉంది. దాడుల వల్ల వాళ్లలో కొందరు ఇప్పటికే బార్డర్లకు చేరుకున్నరు. ఇంకొందరు బంకర్లు, అండర్​గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకున్నారు” అని తెలిపింది.

227 మంది ఉక్రెయిన్ సిటిజన్లు మృతి

వారం నుంచి జరుగుతున్న రష్యా సైనికుల దాడుల్లో 227 మంది ఉక్రెయిన్ సిటిజన్లు చనిపోయారని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కార్యాలయం వెల్లడించింది. మరో 525 మంది గాయపడ్డారని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవన్నీ అధికారికంగా ధృవీకరించినవి మాత్రమేనని చెప్పింది. ఉక్రెయిన్​లోని కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే సమాచారం ఉందని, ఇంకా లెక్క తేలని మరణాల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని విచారం వ్యక్తం చేసింది. రాకెట్ లాంచర్ల దాడుల్లో ఎంతోమంది చనిపోయారని హ్యూమన్ రైట్స్ ఆఫీస్ తెలిపింది.

రెండ్రోజుల్లో 7,400 మంది రాక

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. గురువారం 4 విమానాల్లో 798 మందిని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ కు తీసుకొచ్చింది. ఇందుకోసం బుధవారం సీ17 మిలటరీ ట్రాన్స్ పోర్ట్ విమానాలను పంపింది. ‘‘ఫస్ట్ ఫ్లైట్ రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో బుధవారం అర్ధరాత్రి 1:30 గంటలకు చేరుకుంది. రెండో ఫ్లైట్ హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 210 మందితో గురువారం ఉదయం ల్యాండ్ అయింది. ఆ తర్వాత మూడో ఫ్లైట్ పోలాండ్ నుంచి 208 మందితో, నాలుగో ఫ్లైట్ బుకారెస్ట్ నుంచి 180 మందితో వచ్చింది. చివరి ఫ్లైట్ లో ఎక్కువ మంది స్టూడెంట్లు ఉన్నారు” అని ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. వీళ్లకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారని తెలిపింది. గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 15 విమానాల్లో 3 వేల మందిని తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘‘ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 30 విమానాల్లో 6,400 మందిని తీసుకొచ్చినం. రానున్న 24 గంటల్లో మరో 18 విమానాలు రానున్నాయి” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. యుద్ధం జరుగుతున్న ఖార్కివ్, సుమీ సిటీల నుంచి మనోళ్లను తరలించేందుకు ఉక్రెయిన్, రష్యా అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. కాగా, రానున్న రెండ్రోజుల్లో స్పెషల్ ఫ్లైట్లలో 7,400 మందిని ఉక్రెయిన్ నుంచి తీసుకురానున్నట్లు ఏవియేషన్ మినిస్ట్రీ చెప్పింది. శుక్రవారం 3,500 మంది, శనివారం 3,900 మంది వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఇండియన్ స్టూడెంట్లను తరలిస్తం: రష్యా 

ఉక్రెయిన్ లోని ఖార్కోవ్, సుమీ సిటీల్లో చిక్కుకున్న ఇండియన్, ఇతర దేశాల స్టూడెంట్లను రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతానికి తరలిస్తామని రష్యన్ నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ హెడ్ కల్నల్ జనరల్ మిఖాయిల్ చెప్పారు. ఇందుకోసం 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్టూడెంట్లను బెల్గోరోడ్ నుంచి విమానాల్లో సొంత దేశాలకు పంపిస్తామన్నారు. 

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనిక జనరల్ హతం!

ఉక్రెయిన్ ప్రధాన నగరాలను చేజిక్కించుకునేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా దాడులు చేస్తున్న రష్యా సేనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా సైనిక మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ ఉక్రెయిన్ దాడుల్లో చనిపోయినట్లు తూర్పు యూరప్ కు చెందిన అతిపెద్ద మీడియా సంస్థ నెక్ట్సా ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ పై రష్యా సేనలు దండయాత్ర ప్రారంభించిన తర్వాత... జనరల్ స్థాయి అధికారి చనిపోవడం ఇదే మొదటి సారి.

కోట విద్యార్థిని పేరెంట్స్‌తో ఫోన్‌లో మాట్లాడిన విదేశాంగ మంత్రి

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం సేఫ్ గా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు 6 వేల మందికి  పైగా క్షేమంగా వారి తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఇలా స్వదేశానికి చేరిన కొంత మంది విద్యార్థుల ఇండ్లకు వెళ్లిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. వారిపేరెంట్స్ ను పరామర్శించారు. అలాగే ఇంకా ఉక్రెయిన్ నుంచి రావాల్సిన వారి విషయంలోనూ భయం వద్దని పేరెంట్స్ కు చెప్పారు. ప్రతి ఇండియన్ పౌరుడిని క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కృషి చేస్తోందని అన్నారు.  రాజస్థాన్ లోని తన సొంత నియోజకవర్గమైన కోటలో ఇద్దరు విద్యార్థుల ఇండ్లకు ఓం బిర్లా వెళ్లారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి పేరెంట్స్ తో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ను ఫోన్ లో మాట్లాడించారు. తమ కుమార్తెను సేఫ్ గా భారత్ కు తీసుకొచ్చినందుకు ఆ విద్యార్థిని పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పారు. పోలండ్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ సీ17లో తమ బిడ్డ ఇవాళ ఢిల్లీ చేరుకుందని, కేంద్ర ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామని అన్నారు. ప్రభుత్వం ఎంతో శ్రమించి ఉక్రెయిన్ లో చిక్కుకున్న బిడ్డలను స్వదేశానికి తీసుకొస్తోందని, ఎంత త్వరగా వాళ్లను ఇండియాకు చేరిస్తే.. ఆందోళన చెందుతున్న పేరెంట్స్ కుదుటపడుతారని అన్నారు.

ఆపరేషన్ గంగ: ఢిల్లీ చేరుకున్న నాలుగు ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమంగా వేగంగా కొనసాగుతోంది. అత్యధిక సామర్ధ్యం కలిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యారియర్ సీ-17 ద్వారా కేంద్ర ప్రభుత్వం మన పౌరులను స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటి వరకు నాలుగు సీ-17 వైమానిక విమానాల్లో 798 మంది ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ కు  చేరుకున్నారు. పోలాండ్ లోని రెస్జో నుంచి ఎయిర్ బేస్ కి ఉదయం సీ-21 విమానం వచ్చింది. రోమేనియాలోని బుకారెస్టు నుంచి వచ్చిన ఫ్లైట్ లోని వారికి కేంద్రమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. స్వదేశానికి వచ్చిన భారతీయులతో కేంద్రమంత్రి అజయ్ భట్ మాట్లాడారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సేఫ్ గా ఇండియాకు తీసుకొస్తామని చెప్పారు.

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌తో స్నేహ బంధాన్ని చాటుకున్న రష్యా

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం ఆపాల‌ని అమెరికా,బ్రిట‌న్ , జ‌పాన్ వంటి దేశాలు ఆంక్ష‌ల‌ విధిస్తున్నాయి. అయితే.. ఇండియాతో ర‌ష్యాకి మంచి స్నేహ‌బంధం ఉంద‌ని నిరూపిస్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రష్యా అంతరిక్ష ప్ర‌యోగ రాకెట్‌పై ఉన్న యూఎస్, యూకే, జపాన్ జెండాలను తొల‌గించిన ర‌ష్యా.. భార‌త్ జెండాను మాత్రం ట‌చ్ చేయ‌లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రత‌ ఇప్పుడు అంతరిక్షంలోకి చేరుకుంది, రష్యా త‌న అంతరిక్ష ప్ర‌యోగ రాకెట్‌పై ఉన్నఅమెరికా, బ్రిట‌న్‌, జ‌పాన్ జెండాల‌ను తొల‌గించింది. అయితే, రష్యన్లు రాకెట్‌లో భారత జెండాను అలాగే ఉంచారు. రష్యా అంతరిక్ష సంస్థ ROSCOSMOS రాకెట్‌కు మళ్లీ రంగులు వేస్తోంది. కొన్ని జెండాలు లేకుండా రాకెట్ ‘మరింత అందంగా’ కనిపిస్తుంద‌ని తెలిపింది.

వీడియో చూసేందుకు ఇక్కడి క్లిక్ చేయండి

రష్యాకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వార్నింగ్

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది. క్షిపణులు, బాంబు దాడులతో విచుకుపడుతూ రష్యన్ బలగాలు.. ఒక్కో సిటీని తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాయి. అయితే దాదాపు ఐదారు రోజులుగా రాజధాని కీవ్ సిటీని మాత్రం రష్యన్ సైనికులు స్వాధీనపరుచుకోలేకపోతున్నారు. ఉక్రెయిన్ ఆర్మీ తమ రాజధానిని కాపాడుకునేందుకు భీకరంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో రష్యాకు మరోసారి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశం వదిలి వెళ్లిపోవాలని రష్యన్ సైనికులకు సూచించారు. ‘‘మీ డెడ్ బాడీలతో మా దేశం నిండిపోవాలని నేను కోరుకోవడం లేదు. తక్షణం ఉక్రెయిన్ విడిచి.. మీ ఇండ్లకు వెళ్లిపోండి’’ అని హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిది వేల మంది రష్యన్ సైనికులను హతమార్చామని జెలెన్సీ చెప్పారు. ఇంకా మరింత మంది తమ చేతుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. 

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యుద్ధం ఆపాలని పుతిన్​ను మేం ఆదేశించగలమా?

యుద్ధం ఆపాలని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్​ను తాము ఆదేశించగలమా? అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్​లో చిక్కుకున్న మనోళ్లను తీసుకురావాలని ఫైల్ అయిన పిటిషన్​పై విచారణలో ఈ కామెంట్ చేశారు. ‘‘నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశా. చీఫ్ జస్టిస్ ఏం చేస్తున్నారని అంటున్నారు. యుద్ధం ఆపాలని పుతిన్​కు నేను ఆదేశమివ్వగలనా?”అని సీజేఐ ప్రశ్నించారు. బెంగళూర్​కు చెందిన ఫాతిమా అహానా ఒడెస్సాలో మెడిసిన్ చదువుతోంది. యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయింది. అహానాతో పాటు మిగతా స్టూడెంట్లను తీసుకురావాలని దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

స్టూడెంట్లను బందీలుగా మార్చుకోలేదు: విదేశాంగ శాఖ

భారత విద్యార్థులను ఉక్రెయిన్ సైనికులు బందీలుగా మార్చుకున్నారన్న వార్తలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అలాంటి సమాచారమేమీ తమకు అందలేదని చెప్పింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఎంబసీ అధికారులు అందుబాటులో ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటించారు.

చర్చలపై నో క్లారిటీ

రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలపై క్లారిటీ రాలేదు. బుధవారం జరగాల్సిన రెండో రౌండ్ చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా తొలుత ప్రకటించింది.  అయితే, రష్యా దాడులు కొనసాగుతుండటంతో, ఉక్రెయిన్ వైపు నుంచి చర్చలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

తర్వాతి టార్గెట్ ఖార్కివ్? 
అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రష్యా ముందుకే సాగుతున్నది. ఉక్రెయిన్‌‌‌‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో ఇండ్లు, ప్రభుత్వ భవనాలు ఉన్న ఏరియాలను టార్గెట్ చేసుకుని బాంబులేస్తోంది. ఈ క్రమంలో స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ కోరింది. బుధవారం కీలకమైన ఖెర్సన్ సిటీని స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌‌‌‌ సిటీపై కొన్ని రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తోంది. బుధవారం కూడా దాడులు కొనసాగాయి. సిటీ కౌన్సిల్ బిల్డింగ్‌‌‌‌పై క్రూయిజ్ మిసైల్‌‌‌‌ను రష్యా ప్రయోగించింది. ప్రాంతీయ పోలీసు, నిఘా కార్యాలయంపై స్ర్టైక్స్ చేసింది. దీంతో బిల్డింగ్ రూఫ్ పేలిపోయింది. టాప్ ఫ్లోర్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. పేలుడు ధాటికి ఐదంతస్తుల భవనం శిథిలాలు పక్కనే ఉన్న వీధుల్లో పడ్డాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసు రిలీజ్ చేసింది. పలువురు గాయపడ్డట్లు వెల్లడించింది. బుధవారం జరిగిన దాడుల్లో నలుగురు చనిపోయారని, 9 మంది గాయపడ్డారని, 10 మందిని కాపాడామని తెలిపింది. రష్యా రెండు రోజులుగా నిరంతరం షెల్లింగ్ చేస్తోందని చెప్పింది. ఈ దాడులతో ఖార్కివ్‌‌‌‌ సిటీలో 12 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం దాకా ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది.

రష్యాపై ఆంక్షలు పెట్టం: చైనా

అమెరికా, యూరప్ దేశాల మాదిరి రష్యాపై ఆంక్షలు విధించబోమని చైనా ప్రకటించింది. ‘‘ఏకపక్షంగా విధించిన ఆంక్షలను అంగీకరించబోం. ఎందుకంటే వాటికి చట్టపరమైన ఆధారాలు లేవు’’ అని చైనా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గువో షూఖింగ్ అన్నారు.

ఆరు వేల మందిని తీసుకొచ్చినం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లలో 6 వేల మందిని తీసుకొచ్చామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న స్టూడెంట్ల పేరెంట్స్ ను బుధవారం మహారాష్ట్రలోని పుణెలో ఆయన కలిశారు. పిల్లలను సేఫ్ గా తీసుకొస్తామని వాళ్లకు హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్ లో దాదాపు 20 వేల మంది ఇండియన్లు చిక్కుకున్నారు. ఫిబ్రవరి 24కు కంటే ముందు 4 వేల మందిని తీసుకొచ్చినం. ఆ తర్వాత ‘‘ఆపరేషన్ గంగ’’లో భాగంగా మంగళవారం వరకు 2 వేల మందిని తీసుకొచ్చినం. మిగిలిన వాళ్లందరినీ సేఫ్ గా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నం” అని మురళీధరన్ చెప్పారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, పోలాండ్, హంగరీ, స్లోవేకియాల సహకారంతో మన స్టూడెంట్లను అక్కడి నుంచి తరలిస్తున్నామని పేర్కొన్నారు. గత 24 గంటల్లో 6 విమానాలు మనోళ్లను తీసుకొచ్చాయని, వాటిల్లో 1,377 మంది వచ్చారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. కాగా, రానున్న రోజుల్లో మరో 6,300 మంది మనోళ్లను ఉక్రెయిన్ నుంచి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ‘‘ఆపరేషన్ గంగ’’లో భాగంగా ఈ నెల 2 నుంచి 8 వరకు 31 విమానాలను నడపనున్నట్లు చెప్పాయి. రొమేనియాలోని బుకారెస్ట్, హంగరీ, పోలాండ్, స్లోవేకియా నుంచి మనోళ్లను తరలించనున్నట్లు పేర్కొన్నాయి.

జనాన్ని చంపలేక.. రష్యా సోల్జర్లు ఏడుస్తున్నరు
కనిపించినోళ్లందరినీ కాల్చి పడేయాలంటూ పై నుంచి ఆదేశాలు రావడం.. అమాయక ప్రజలను కాల్చి చంపేందుకు మనసొప్పకపోతుండటంతో రష్యన్ సోల్జర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నరు. మామూలు జనంపై దాడులు చేయలేక ఏడ్చేస్తున్నారు. చివరకు పై అధికారులు ఇచ్చే ఆదేశాలను బేఖాతర్​ చేస్తున్నారు. ప్రజలను చంపలేక తమ సొంత యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వెహికల్స్​ను ధ్వంసం చేస్తున్నరు. ఈ మేరకు అమెరికా సైనికాధికారి ఒకరు చెప్పిన వివరాలతో న్యూయార్క్​ టైమ్స్​కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం రష్యా సైన్యంలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని, వారికి సరైన శిక్షణ కూడా లేదని, పూర్తి స్థాయి యుద్ధానికి వారిని సిద్ధం చేయలేదని ఆ అధికారి చెప్పారు.  తిండి, ఇంధనం వంటి వనరులనూ సరిపడా ఇవ్వలేదన్నారు. దీంతో సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోందన్నారు. ఈ క్రమంలోనే సొంత యుద్ధ ట్యాంకులనే వాళ్లు ధ్వంసం చేస్తున్నారని వివరించారు. ఆ కథనాన్ని బలపరిచేలా రష్యా సైనికులు, ఉన్నతాధికారులకు మధ్య జరిగిన సంభాషణల టేప్​ను బ్రిటన్​ నిఘా సంస్థ షాడోబ్రేక్​ ఇంటెల్ విడుదల చేసింది. జనాలను ఖాళీ చేయించే వరకు టౌన్లపై దాడులు చేయబోమంటూ కొందరు సైనికులు ఆఫీసర్లకు తేల్చి చెప్పడం ఆ ఆడియోల్లో రికార్డయింది.

17 వేల మంది ఇండియన్స్.. ఉక్రెయిన్ బార్డర్ దాటేసిన్రు

 రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు భారీ సంఖ్యలో భారతీయులు వెనక్కి వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. జనవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 17,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు చెప్పింది. రానున్న 24 గంటల్లో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందుకు 15 ఫ్లైట్లు పంపనున్నట్లు ప్రకటించారు.  కీవ్లోని భారత ఎంబసీని తాత్కాలికంగా లివివ్కు తరలించాలని సూచించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని బాగ్చీ వెల్లడించారు. ఉక్రెయిన్లో పరిస్థితిపై ప్రధాని మోడీ పలు దేశాల నేతలతో నిరంతరం చర్చిస్తున్నారని అన్నారు. రష్యా దాడుల కారణంగా భారత పాస్పోర్టులు పోగొట్టుకున్న వారికి ఎమర్జెన్సీ సర్టిఫికేట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు బాగ్చీ వెల్లడించారు.

ఢిల్లీకి చేరిన మరో ఫ్లైట్.. విద్యార్థులకు కిషన్ రెడ్డి స్వాగతం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులతో మరో స్పెషల్ ఫ్లైట్ ఇండియా చేరుకుంది. హంగేరి రాజధాని బుదాపెస్ట్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి స్పైస్ జెట్ విమానంలో మన విద్యార్థులను ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన అందులో వచ్చిన వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులతో ఆయన మాట్లాడి.. ధైర్యం చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి ఒక్క విద్యార్థినీ సేఫ్ గా తీసుకొస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తరఫున.. విద్యార్థులకు స్వాగతం చెబుతన్నానని అన్నారు. ఈ కష్ట సమయంలో అక్కడ చిక్కుకున్న మన పౌరులు చూపిన తెగువ ఎంతో గొప్పదని, ఈ విద్యార్థులు, వారి కుటుంబసభ్యులను చూసి దేశం గర్విస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. వార్ జోన్ నుంచి మన పౌరులను తీసుకొచ్చేందుకు ధైర్యంగా తమ వెళ్తున్న ఫ్లైట్ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

పుతిన్.. యుద్ధ నేరస్తుడు

ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై  ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ దర్యాప్తునకు సిద్ధమైంది. ఈ విషయంపై  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన చేశారు. యూకే పార్లమెంటులో మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యుద్ధ నేరస్తుడని అని అన్నారు. పుతిన్ నాయకత్వంలోని రష్యా... ఉక్రెయిన్ లో ఇప్పటికే పలు యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. అమాయక ప్రజలపై  బాంబులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తునకు అన్ని బ్రిటన్ చట్టసభల సభ్యులందరూ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

కాలి నడకనైనా ఖర్కివ్‌ నుంచి బయటపడండి

ఇండియన్స్.. ఖర్కివ్ ను ఖాళీ చేసి తక్షణం వచ్చేయాలని ఉక్రెయిన్ లోని మన ఎంబసీ ఎమర్జెన్సీ గైడ్ లైన్స్ జారీ చేసింది. కొద్ది సేపటి క్రితమే ఖర్కివ్ నుంచి దాటి రావాలని ఎంబసీ ప్రకటన చేసింది. అంతలోనే మరోసారి సెకండ్ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఖర్కివ్ లో ఉన్న భారత పౌరులు వేగంగా ఆ సిటీ నుంచి బయటపడాలని ఇండియన్ ఎంబసీ ఆదేశించింది. పిసోచిన్,  బబాయ్, బెజ్లియుడోవ్కాల్లో ఏదో ఒక చోటికి రావాలని సూచించింది. బస్సు, ట్రైన్ ఏది దొరికితే అందులో బయలుదేరాలని, ఏ వెహికల్ దొరకని పక్షంలో కాలి నడకనైనా ఖర్కివ్ నుంచి బయటపడాలని సెకండ్ అడ్వైజరీలో పేర్కొంది. ఖర్కివ్ నుంచి పిచోచిన్ కు 11 కిలోమీటర్లు, బబాయ్ కు 12 కిలోమీటర్లు, బెజ్లియుడోవ్కాకు 16 కిలోమీటర్లు దూరం ఉంటుందని, ఈ పరిస్థితుల్లో సేఫ్టీ, సెక్యూరిటీ దృష్టా ఎలాగోలా ఆ ప్రాంతాలకు చేరుకోవాలని ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్ టైమ్ ప్రకారం సాయంత్రం 6 గంటల్లోపు (ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 9.30 గంటలు) ఎలాగైనా సరే ఖర్కివ్ దాటాలని నొక్కి మరీ చెప్పింది.

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉక్రెయిన్‌లో మరో విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల చందన్ జిందాల్... అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకర దాడులతో కొందరు భారత విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్నవారి పరిస్థితి దయనీయంగా  మారింది. ఈ   క్రమలోనే పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన చందన్‌ జిందాల్ (21) ఇవాళ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అతనికి రక్తం గడ్డ కట్టడంతో  వెంటనే సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఖర్కివ్ నుంచి బయటపడండి

ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా రెండ్రోజులుగా దూకుడు మరింత పెంచింది. ఉక్రెయిన్‌లో ఒక్కో సిటీని హస్తగతం చేసుకునే పనిలో పడిన రష్యన్ బలగాలు.. కీవ్, ఖర్కివ్ సిటీలపై టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే మన దేశానికి చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖర్కివ్‌లోని భారత పౌరులంతా తక్షణం ఆ సిటీ నుంచి బయటపడాల్సిందిగా సూచించింది. భారత పౌరుల సేఫ్టీ, సెక్యూరిటీ దృష్ట్యా వారిని వేగంగా ఖర్కివ్ విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ  పేర్కొంది. ఉక్రెయిన్ టైమ్ ప్రకారం ఆరు గంటల్లోపు (ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 9.30 గంటలు) పెసోచిన్, బబాయే, బెజ్లియుడోవ్కాల్లో ఏదో ఒక ప్రాంతానికి చేరుకోవాలని కోరింది.

పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

నేనిక్కడే ఉంటా: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య

రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్న భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అక్కడ మన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరినీ ఇండియాకు చేరుస్తామని భరోసా ఇచ్చారు. తాను అక్కడే ఉండి భారతీయులందరినీ ఉక్రెయిన్‌ నుంచి సేఫ్‌గా ఇండియాకు చేర్చేందుకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని చెప్పారు.

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీన్ మృతిపై రష్యా దర్యాప్తు

ఉక్రెయిన్లోని ఖార్కివ్లో జరిగిన క్షిపణి దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందడంపై రష్యా స్పందించింది. నవీన్ మృతిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు భారత్లో రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌  ప్రకటించారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయులందరికీ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్ ఎఫెక్ట్: బేర్మన్న ఇండియన్ స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రష్యా దాడులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చన్న అంచనాలు, బ్యారెల్ క్రూడాయిల్ ధర 110 డాలర్లకు దాటడం ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం కూడా దేశీయ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. ఉదయం 55,629.30 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో 55,755.09పాయింట్లు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి. ఒకదశలో 55,020.10 పాయింట్లు కనిష్ఠ స్థాయికి పతనమైన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 778.38 పాయింట్ల నష్టంతో 55,468.90 వద్ద ముగిసింది. మారుతి సుజుకీ షేర్లు 6శాతంపైగా నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా షేర్లు భారీగా లాసయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 187.95పాయింట్ల నష్టంతో 16,605.95 వద్ద ముగిసింది.

రష్యాపై ఆంక్షలు విధించబోం

రష్యాపై ఆంక్షలు విధించే అంతర్జాతీయ దేశాల లిస్టులో తాము చేరడం లేదని మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది. అన్ని దేశాలతోనూ శాంతియుతంగా ఉంచేందుకు యత్నిస్తున్నామని ఆదేశ అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌ తెలిపారు. అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నామని, ఎలాంటి ఆర్థిక ప్రతీకార చర్యలను తీసుకోబోమన్నారు. తటస్థంగా ఉండటంతో.. విబేధాలు ఉన్నదేశాలతో చర్చలు జరిపేందుకు తమకు అవకాశం లభిస్తుందని అన్నారు. అంతేకాదు.. రష్యా ఏరోప్లాట్‌ విమానాల కోసం మెక్సికో సిటీ తమ దేశ గగనతలాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

మూడో ప్రపంచ యుద్ధం వస్తే మిగిలేది అణు విధ్వంసమే!

ఉక్రెయిన్‌తో రెండో దశ చర్చలకు రష్యా సిద్ధంగానే ఉందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి లవ్‌రోవ్ చెప్పినట్లు రష్యన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్టీ న్యూస్ చానెల్‌ పేర్కొంది. ‘‘ఉక్రెయిన్‌తో చర్చలకు మేం సిద్ధమే. కానీ తమ పక్షాన అమెరికాను తెచ్చుకునేందుకు సమయం కోసమే ఉక్రెయిన్ చర్చల పేరుతో  నాటకాలు ఆడుతోందనిపిస్తోంది” అని లవ్‌రోవ్ అన్నారు. అయితే ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వరకు వెళ్తే మిగిలేది అణు విధ్వంసమేనని ఆయన చెప్పారు. అయితే పరిస్థితి అంతవరకూ రానివ్వబోమని, ఉక్రెయిన్‌ను అణ్వాయుధాలు సమీకరించుకోనివ్వబోమని అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంపైనా లవ్‌రోవ్ స్పందించారు. తమపై ఆంక్షల విషయంలో రష్యా ముందు నుంచే సిద్ధంగా ఉందని, అయితే తమ దేశ అథ్లెట్స్, జర్నలిస్టులు, కళాకారులు, కల్చరల్ విభాగాలకు సంబంధించిన ప్రతినిధులపై ఆంక్షలు ఉండవని భావించామన్నారు.

చర్చలకు ముందు కొన్ని కండిషన్స్

చర్చలకు ముందు బాంబు దాడుల్ని ఆపేయాలన్నారు  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఇవాళ( బుధవారం) రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా  మాట్లాడిన  జెలెన్స్కీ .. రష్యా వైమానిక దళాన్ని నిలువరించేందుకు నో ఫ్లై జోన్‌ విధించాలని నాటో సభ్యుల్ని కోరారు.  ఈ ఆంక్షలు విధించడంతో.. నాటో దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నాయన్న  అర్థం కాదని, అది కేవలం నివారణ చర్య అని అన్నారు. వాస్తవానికి రష్యా కారణంగానే ప్రతి ఒక్కరు ఈ యుద్ధంలోకి రావాల్సి వచ్చిందని అన్నారు. అలాగే ఉక్రెయిన్‌ను నాటోలో చేరకుండా ఉండడం కోసం ఒక కండిషన్ పెడుతున్నామని జెలెన్స్కీ చెప్పారు.

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆపరేషన్ గంగ.. మన స్టూడెంట్స్ కోసం ఉక్రెయిన్‌కు 50 ఫ్లైట్స్

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్రం. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటివరకు 14 విమానాల్లో భారతీయులు, పౌరులను తరలించారు. ఇవాళ ఐదు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఉదయం ఇస్తాంబుల్ నుంచి 220 మంది  ఢిల్లీకి వచ్చారు. ఎయిర్ పోర్టులో విద్యార్థులకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు. పోలాండ్ నుంచి 2 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి భారతీయులు వచ్చారు. పోలాండ్ నుంచి ఫ్లైట్ లో వచ్చిన విద్యార్థులకు.... ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఉక్రెయిన్ లోని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా...ఎప్పటికప్పుడు కేంద్రమంత్రులు అక్కడున్న భారతీయ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈనెల 8 వరకు మొత్తం 50 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఈ ఫ్లైట్ సర్వీసులపై మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

పాక్ విద్యార్థులను కాపాడిన భారత జెండా

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ చదువుకుంటున్న వివిద దేశాలకు చెందిన  విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాలు తమ విద్యార్థుల కోసం ఉక్రెయిన్ ప్రభుత్వంతో పాటు చుట్టు పక్కల ఉన్న దేశాలతో కూడా మంతనాలు సాగిస్తున్నాయి. ఈ తరహాలోనే భారత ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‎లో ఉన్న భారత విద్యార్థులను తరలించడానికి చుట్టు పక్కల దేశాలను ఉపయోగించుకుంటోంది. యుద్ధం వల్ల చిక్కుకుపోయిన విద్యార్థులను రొమానియాకు బస్సుల ద్వారా తరలించి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తరలిస్తున్నారు. అయితే యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో పలు దేశాలు తమ పౌరులను ఇప్పుడే తరలించడం రిస్క్ అని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలా అయినా ముందు ఉక్రెయిన్ నుంచి బయట పడాలని నిర్ణయించుకున్న పాక్ విద్యార్థులు కొందరు మన జాతీయ జెండా సాయంతో సేఫ్‌గా ఆ దేశ సరిహద్దు దాటగలిగారు. 

అదెలా అన్న పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాక్యూమ్ బాంబులతో రష్యా దాడులు

వాషింగ్టన్: రష్యా తమపై క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులతో దాడి చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ‘‘రష్యా ఈరోజు వాక్యూమ్ బాంబు వేసింది. ఉక్రెయిన్ లో అది సృష్టించాలనుకుంటున్న విధ్వంసం చాలా పెద్దది” అని సోమవారం అమెరికాలోని ఉక్రెయిన్ అంబాసిడర్ ఒక్సానా మార్కరోవా ఆరోపించారు. రష్యా తీరును ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సహా వివిధ అంతర్జాతీయ సంస్థలు ఖండించాయి. నిషేధించిన ఆయుధాలను యుద్ధంలో వాడుతోందని మండిపడ్డాయి. ఈశాన్య ఉక్రెయిన్ లోని స్కూల్ లో తలదాచుకున్న ప్రజలపై దాడి చేసిందని పేర్కొన్నాయి. రష్యా వాక్యూమ్ బాంబులను వాడినట్లయితే, అది యుద్ధ నేరమవుతుందని అమెరికా ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అన్నారు.

అసలేంటీ వ్యాక్యూమ్ బాంబులు.. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

అండర్ గ్రౌండ్‌లోకి పుతిన్ ఫ్యామిలీ

రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏడు రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే వేల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు మరణించారు. అయితే ఈ సమయంలో తన కుటుంబం రక్షణపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యుల్ని రహస్య ప్రాంతానికి తరలించినట్టు బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. ఒకవేళ అణుయుద్ధం జరిగినా సురక్షితంగా ఉండేలా సైబీరియా ప్రాంతంలో ఓ బంకర్‌ని ఏర్పాటు చేసినట్టు  పేర్కొంది. అట్లయ్‌ పర్వత ప్రాంతంలో అత్యాధునిక వసతులతో రూపొందించిన బంకర్‌కు పుతిన్‌ తన కుటుంబ సభ్యుల్ని తరలించారని బ్రిటన్‌ మీడియా తన కథనంలో తెలిపింది.

రష్యా వశమైన ఖేర్సన్ సిటీ

ఉక్రెయిన్పై రష్యా దాడులు తీవ్రం చేసింది.రాజధాని కీవ్పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న సైన్యం.. ఇతర నగరాలను హస్తగతం చేసుకుంటోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని రెండో  అతిపెద్ద సిటీ అయిన ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది.

6 వేల మంది రష్యా సైనికుల మట్టుబెట్టినం

కీవ్‌: ర‌ష్యా దాడులకు ఉక్రెయిన్ దీటుగా బ‌దులిస్తోంది. సరిహద్దు నగరాలను స్వాధీనం చేసుకుంటున్న రష్యా బలగాలను ఆ దేశ ఆర్మీ ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో రష్యాకు చెందిన వేల మంది సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొల్డోమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. గత గురువారం నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు జరుపుతుండగా.. ప్రతిదాడిలో 6వేల మంది రష్యా సైనికులను చంపినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ దాడుల్లో ఇప్పటి వరకు తమ సైన్యంలో ఎంత మంది చనిపోయారన్న విషయంపై రష్యా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

ఖేర్సన్ సిటీలోకి రష్యన్ బలగాలు

ఉక్రెయిన్‎పై ఏడో రోజు రష్యా సేనలు దాడి కొనసాగిస్తున్నాయి. సౌత్ ఉక్రెయిన్‎లోని ఖేర్సన్ సిటీలోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఖేర్సన్ సిటీలోని రైల్వే స్టేషన్, రివర్ పోర్ట్‎ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఖేర్సన్ మేయర్ తెలిపారు. తూర్పు ఉక్రెయిన్‎లోని ఖార్కివ్‎లోకి రష్యా బలగాలు ఎంటర్ అయ్యాయి. ఖార్కివ్‎లోని స్థానిక హాస్పిటల్‎పై దాడి చేశారు. నిన్నటి నుంచి ఖార్కివ్ సిటీలో రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

విద్యార్థుల కోసం 3 రోజుల పాటు 26 విమానాలు

ఉక్రెయిన్‎లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ముమ్మరం చేసింది. విద్యార్థుల తరలింపు కోసం 3 రోజుల పాటు 26 విమానాలు నడిపించబోతున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా.. ఎయిర్ ఫోర్స్‎కు చెందిన సీ- 17 విమానం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని హిందాన్ ఎయిర్ బేస్ నుంచి ఉదయం 4 గంటలకు రోమేనియాకు బయల్దేరి వెళ్లినట్లు తెలిపారు. ఉక్రెయిన్‎లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఫుడ్, వాటర్ బాటిళ్లతో ఆ విమానం వెళ్లింది. ఉక్రెయిన్ నుంచి 24 గంటల వ్యవధిలోనే మరో 6 విమానాలు భారత్ కు రానున్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఆ విమానాల ద్వారా   1377 మంది ఇండియాకు వస్తున్నారన్నారు. 

డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఉక్రెయిన్ కు వెళ్లి కష్టాలు పడుతున్న తెలుగు విద్యార్థులు

డాక్టర్​కావాలనే లక్ష్యంతో ఈ మధ్యనే ఉక్రెయిన్​కు పోయిన తెలుగు స్టూడెంట్లు యుద్ధం మొదలవడంతో కష్టాలు పడ్తున్నారు. కాలేజీల్లో చేరేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండడంతో 50 మందికిపైగా స్టూడెంట్లు అక్కడకు వెళ్లారు. అందులో హైదరాబాద్​కు చెందినవాళ్లే పది మందికిపైగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కాలేజీల్లో చేరగా.. మరికొందరు ఇంకా చేరాల్సి ఉంది. ఉక్రెయిన్​లో మెడిసిన్​ చదువుకు ఫీజు తక్కువగా ఉండడంతో చాలామంది కన్సల్టెన్సీల ద్వారా అక్కడికి వెళ్తుంటారు. వాస్తవానికి యుద్ధ పరిస్థితులు ఏర్పడడంతో పలువురు తర్వాత వెళ్దామని అనుకున్నా.. జాయిన్​ అయిన వెంటనే  రావాలంటూ కన్సల్టెన్సీలు బలవంతపెట్టడంతో అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ఇరుక్కుపోయారు. ఎప్పుడు ఏమవుతుందోనని భయపడుతున్నారు. కొందరు సీనియర్​స్టూడెంట్లు ధైర్యం చెప్తున్నా.. లోలోపల టెన్షన్​పడుతున్నారు. తాము ఇబ్బంది పడ్తున్నట్టు ఇంట్లో తెలిస్తే పేరెంట్స్​భయపడతారన్న ఉద్దేశంతో చాలామంది పేర్లు చెప్పేందుకు కూడా వెనుకాడుతున్నారు. తమ పిల్లలు ఎట్లున్నరోనని ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

యూనివర్సిటీ కింద బంకర్లలో 500 మంది తెలుగు స్టూడెంట్స్ 
ఉక్రెయిన్​ రాజధాని కీవ్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో చాలామంది స్టూడెంట్లు అక్కడి అండర్​గ్రౌండ్ బంకర్లలో దాక్కున్నారు. ఓ యూనివర్సిటీ కింద ఏర్పాటు చేసిన బంకర్​లో దాదాపు 500 మంది దాకా ఉన్నట్లు తెలుగు స్టూడెంట్లు చెప్తున్నారు. తిండి కూడా సరిగ్గా దొరకట్లేదని, ఇన్​స్టంట్​ఫుడ్​తో మాత్రమే కడుపు నింపుకొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. కేవలం బార్డర్​ ఏరియాలో ఉంటున్నోళ్లనే తీస్కపోయేందుకు చర్యలు తీసుకుంటున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భయానక పరిస్థితి

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లో పరిస్థితి పూర్తి భయానకంగా ఉందని, ఎప్పుడు ఏ మిస్సైల్​ వచ్చి పడుతుందో తెలియని దుస్థితి నెలకొందని అక్కడ చిక్కుకుపోయిన సికింద్రాబాద్​కు చెందిన మెడిసిన్​ స్టూడెంట్​అనీలా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ‘వెలుగు’తో ఆన్​లైన్​లో మాట్లాడారు. రోజురోజుకు కీవ్​లో పరిస్థితి చేయి దాటిపోతోందని, బాంబులతో దద్దరిల్లుతోందన్నారు. దాంతో తను మరో 20 మంది ఇండియన్ ​స్టూడెంట్స్​కలిసి 800 కి.మీ. దూరంలోని హంగేరీ బార్డర్ దగ్గరున్న సిటీకి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ట్రెయిన్​లో తర్వాత కొద్ది దూరం బస్సులో జర్నీ చేస్తున్నామని చెప్పారు. అక్కడ కొద్ది రోజులుండి, పరిస్థితులు చక్కబడ్డాక, హంగేరి వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వస్తామన్నారు.

మీ బిల్డింగ్​లపై మార్కింగ్​ ఉందేమో చూడండి: ఉక్రెయిన్​ ప్రజలకు అధికారుల సూచన
కీవ్: రష్యా దాడుల దృష్ట్యా ప్రజలు బిల్డింగ్​లపై ఏమైనా మార్కింగ్​ట్యాగ్స్​ఉన్నాయో లేదో చెక్​చేసుకోవాలని ఉక్రెయిన్ ​అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో ఎత్తయిన బిల్డింగ్​లు, గ్యాస్​పైపులు ఇతర నిర్మాణాలపై రెడ్​కలర్​లో మార్కింగ్ ​లేదా ట్యాగ్​ వేస్తున్నారని, దాన్ని టార్గెట్​చేసుకొనే రష్యా ​సైనికులు బాంబు దాడులు చేస్తున్నారని అధికారులు సోషల్​మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. దాడుల దృష్ట్యా ప్రజలు తమ బిల్డింగ్​ల పైకి ఎక్కి చెక్ ​చేయాలని, ఎదైనా మార్కింగ్​ కనిపిస్తే దాన్ని చెరిపేయాలని పశ్చిమ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లోని రివ్నే సిటీ మేయర్ అలెగ్జాండర్ ట్రెట్యాక్ తన అధికారిక ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు.

మరింత దూకుడుగా ఉక్రెయిన్‌‌‌‌పై ఉరుముతున్న రష్యా

ఒకవైపు ఆంక్షలతో విరుచుకుపడుతున్న అగ్రదేశాలు! మరోవైపు ముప్పేట చుట్టుముట్టి దాడులతో భయపెడుతున్నా తలొగ్గని ప్రత్యర్థి! వెరసి రష్యా.. మరింత దూకుడుగా ఉక్రెయిన్‌‌‌‌పై ఉరుముతోంది. కీలకమైన రాజధాని కీవ్, రెండో పెద్ద సిటీ ఖార్కివ్‌‌‌‌లను చేజిక్కించుకునేందుకు భారీగా సైన్యాన్ని నడిపిస్తోంది. రోడ్డుపై ఒకటీ రెండు కాదు.. ఏకంగా 64 కిలోమీటర్ల మేర రష్యా మిలటరీ కాన్వాయ్‌‌‌‌ వరుస కట్టి.. ఉక్రెయిన్ రాజధాని వైపు దూసుకుపోతున్నది. దారిలో కనిపించిన ఇండ్లను కాలబెడుతున్నది. ప్రభుత్వ, మిలటరీ బిల్డింగులను టార్గెట్ చేసుకున్నది. ముందుగా మార్క్ చేసుకుని, టార్గెట్ ఫిక్స్ చేసుకుని, మిసైళ్ల వర్షం కురిపిస్తున్నది. మంగళవారం ఖార్కివ్‌‌‌‌లో జరిగిన మిసైల్ దాడిలో ఇండియన్ స్టూడెంట్‌‌‌‌ చనిపోయాడు. ఇప్పటిదాకా 14 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ చెప్పింది. వేలాది మంది పౌరులు కీవ్, ఇతర సిటీల్లో మెట్రోస్టేషన్లు, షెల్టర్లు, బేస్‌‌‌‌మెంట్లు, కారిడార్లలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. బుధవారం బెలారస్‌‌‌‌లో రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.

రష్యా సైనికులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న ఉక్రెయిన్
గత గురువారం నాడు రష్యా యుద్ధం మొదలుపెట్టగా.. ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌‌‌‌ దిశగా వస్తున్న రష్యన్ సైనికులను ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. మొన్నటి నుంచి రష్యాకు వరుసగా ఓటములు ఎదురుకావడంతో.. నెత్తుటి విజయం సాధించేందుకు మధ్య యుగం నాటి వ్యూహాలను పుతిన్ ఉపయోగిస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపించింది. సిరియాలో చేసినట్లుగా.. ఇక్కడ కీవ్ నగరాన్ని చుట్టుముట్టి, బాంబు దాడులు చేయాలని భావిస్తున్నదని చెప్పింది. ‘‘ప్రధాన నగరాలకు జరిగే సరఫరాలను ఆపేసి, ఆహార సంక్షోభం సృష్టించేందుకు రష్యన్ దళాలు ప్రయత్నించవచ్చు. ఇప్పటికే కీవ్‌‌‌‌లోని సూపర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఆహారం అందుబాటులో ఉండేలా చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్‌‌‌‌లో ఉక్రెయిన్ అంబాసిడర్ వాదిమ్ ప్రిస్టయ్‌‌‌‌కో చెప్పారు. ముట్టడి వ్యూహాలను రష్యా ఇప్పటికే మరియుపోల్‌‌‌‌లో అమలు చేస్తోంది. స్కూళ్లు, ఇండ్లతోపాటు పౌరులు ఉన్న అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఫిరంగుల ద్వారా నిరంతరం షెల్లింగ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పిల్లలు సహా ఎంతో మంది చనిపోయారు. ఈ సిటీకి ఇప్పటికే పవర్ కట్ చేశారు. మరియుపోల్‌‌‌‌ ప్రస్తుతం ఉక్రెయిన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌లోనే ఉంది. ఖెర్సన్ సిటీలోనూ ఇలానే రష్యా దాడులు చేస్తున్నది. శివార్లలో ప్రజలు ఉన్న బిల్డింగులపై మిసైల్ దాడులు జరుగుతున్నాయి. వీధుల గుండా దళాలు లోనికి చొచ్చుకెళ్తున్నాయి.

ఉక్రెయిన్ ఎంతకూ లొంగడం లేదని ఇండ్లపై బాంబులు, రాకెట్ల వర్షం కురిపిస్తున్న రష్యా

యుద్ధం మొదలయ్యాక మిలటరీ బేస్‌‌‌‌లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌ స్ట్రిప్‌‌‌‌, బారక్‌‌‌‌లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసింది. తొలి మూడు నాలుగు రోజులు ఇలానే నడిచింది. కీవ్‌‌‌‌లోకి చిన్న గ్రూపులను పంపింది. కానీ ఉక్రెయిన్ ఎంతకీ లొంగకపోవడంతో ఇప్పుడు దాడులను విస్తరించింది. సిటీల్లో ఇండ్లపై బాంబులు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. పెద్ద సంఖ్యలో దళాలను కీవ్, ఖార్కివ్ దిశగా నడిపిస్తోంది. చాలా ఏరియాల్లో ప్రజల ఇండ్ల మధ్య ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఇండ్లను కూడా బాంబులు తాకుతున్నాయి. సైనికులు భారీగా రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో.. ఇకపై గగనతలం నుంచి జరిగే దాడులు తగ్గిపోయే అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి కీవ్‌‌‌‌ ను చుట్టుముట్టి స్వాధీనం చేసుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది.

చెర్నిహివ్‌‌‌‌ సిటీలోకి ఎంటర్ బెలారస్ దళాలు
తమపై బెలారస్ దళాలు కూడా దాడి చేస్తున్నయని ఉక్రెయిన్ చెప్పింది. చెర్నిహివ్‌‌‌‌ వైపు ఆ దేశం సోల్జర్లు కదులుతున్నారని తెలిపింది. ‘మంగళవారం ఉదయం బెలరాస్ దళాలు చెర్నిహివ్‌‌‌‌ సిటీలోకి ఎంటర్ అయ్యాయి. తన మనుషులు యుద్ధంలోకి దిగారన్న విషయాన్ని బెలారస్ నియంత అలెగ్జాండర్ లుకాషెంకో అంగీకరించలేదు’ అని ఉక్రెయిన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

రష్యన్ సైనికుడా.. ఇంటికి వెళ్లు!
కీవ్‌‌‌‌లోకి ఎంటర్ అవుతున్న రష్యన్లకు ఉక్రేనియన్లు బిల్ బోర్డులు, బస్ స్టాప్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మెసేజ్‌‌‌‌లు పెడుతున్నారు. కొందరు రష్యా సైనికులను బూతులు తిడుతుంటే.. మరికొందరు వేడుకుంటున్నారు. ‘‘రష్యా సైనికుడా.. ఆగు! నీ కుటుంబాన్ని గుర్తుచేసుకో. స్వచ్ఛమైన మనస్సాక్షితో ఇంటికి వెళ్లు’’ అని ఒకచోట ప్రదర్శించారు.

కీవ్‌‌‌‌కు ఉత్తరాన.. 64 కిలోమీటర్ల పొడవునా..దారిలో ఇండ్లను కాల్చుకుంటూ పోతున్న రష్యా
కీవ్ సిటీకి ఉత్తరాన రష్యన్ ఆర్మీ భారీగా వరుస కట్టింది. దాదాపు 64 కిలోమీటర్ల పొడవునా సాయుధ కాన్వాయ్ ముందుకు కదులుతోంది. ఇవాంకివ్ సిటీకి ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో దారిలో కనిపించిన ఇండ్లను కాల్చుకుంటూ పోతున్నది. ఇందుకు సంబంధించిన శాటిలైట్​ ఇమేజ్‌‌‌‌లు బయటికి వచ్చాయి. కాన్వాయ్‌‌‌‌లో వందలాది ట్యాంకులు, ఫిరంగులు వస్తున్నాయి. ఆంటోనోవ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి ప్రైబిర్స్క్ పట్టణం దాకా రోడ్డుపై ఈ కాన్వాయ్‌‌‌‌ విస్తరించి ఉంది. అంతకుముందు రోడ్డుపై దాదాపు 27 కిలోమీటర్ల మేర కాన్వాయ్ విస్తరించి ఉండగా.. సోమవారం నాటికి 64 కిలోమీటర్లకు పెరిగింది.

మిలటరీ బేస్‌‌‌‌పై దాడి.. ఆయిల్ డిపో పేల్చివేత..70 మంది మృతి
కీవ్, ఖార్కివ్‌‌‌‌కు మధ్య ఉన్న ఓఖ్‌‌‌‌టిర్కా సిటీ మిలటరీ బేస్‌‌‌‌పై రష్యా దాడి చేసిందని.. ఈ ఘటనలో 70 మందికి పైగా సోల్జర్లు చనిపోయారని ఈ రీజియన్ హెడ్ దిమిత్రో ఝివిట్స్‌‌‌‌కీ చెప్పారు. ఈ దాడిలో మిలటరీ యూనిట్ మొత్తం ధ్వంసమైందని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని, డెడ్ బాడీలను వెలికి తీస్తున్నామని తెలిపారు. అంతకుముందు సుమీలో ఆయిల్ డిపోను రష్యన్లు పేల్చేశారు.

ఇయ్యాల మరోసారి చర్చలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య బుధవారం రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఈ విషయాన్ని రష్యా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సోమవారం జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో మరోసారి సమావేశం కావాలని రెండు దేశాలు నిర్ణయించాయి. తొలి విడత చర్చలు బెలారస్‌‌లోని గోమెల్‌‌లో దాదాపు 5 గంటలపాటు జరిగాయి.  ‘‘రెండు దేశాల ప్రతినిధులు కొన్ని విషయాలపై అంగీకారానికి వచ్చారు. ఇప్పుడు ఇంకో రౌండ్ చర్చల కోసం వచ్చే ముందు తమ ప్రభుత్వ పెద్దలను సంప్రదిస్తారు’’ అని రష్యా టుడే మంగళవారం పేర్కొంది.

ఉక్రెయిన్ లో మోగుతున్న బాంబుల మోత

ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతూనే ఉంది. రష్యా చేస్తున్న బాంబు దాడుల్లో తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా రాన్ బెన్నూర్ మండలం చలగేరి గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఖార్కియెవ్‌లో ఈరోజు ఉదయం జరిగిన బాంబు దాడిలో మృతిచెందాడు.  ఒక పక్క బాంబుల మోత మోగుతుండగానే.. మరో పక్క బెలారస్ బార్డర్ లో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు షురువయ్యాయి. బెలారస్ విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ మకేయి ఆధ్వర్యంలో సోమవారం చెర్నోబిల్ ఎక్స్ క్లూజన్ జోన్ కు సమీపంలో బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎలాంటి షరతులు లేకుండానే చర్చలు జరుపుతామని తొలుత ప్రకటన వచ్చినా.. చర్చలకు వెళ్లడానికి ముందే రెండు దేశాలు తమ తమ డిమాండ్లను ప్రకటించాయి. ఉక్రెయిన్ ను వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేర్చుకోవాలని, రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, బలగాలను వెనక్కి తీస్కోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. ఈయూలో చేరబోమని ఉక్రెయిన్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని రష్యా డిమాండ్ చేసింది. అయితే, ఏమీ తేలకుండానే రెండు దేశాల మధ్య ఫస్ట్ రౌండ్ చర్చలు ముగిశాయని సోమవారం రాత్రి రష్యన్ మీడియా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. రెండు దేశాల ప్రతినిధులు తమ రాజధానులకు తిరిగి వెళ్లారని, తమ తమ ప్రభుత్వాలతో సంప్రదింపుల తర్వాత పోలాండ్– బెలారస్ బార్డర్ లో రెండో రౌండ్ చర్చలు ఉంటాయని తెలిపింది.

నవీన్ మృతిపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సంతాపం

ఉక్రెయిన్ లోని ఖర్కివ్ సిటీలో రష్యా చేసిన బాంబు దాడుల్లో భారత విద్యార్థి నవీన్ మృతి చెందడంపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. అమాయక ప్రజలపై సైతం రష్యా విచక్షణా రహితంగా చేస్తున్న దాడుల్లో భారత విద్యార్థి మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశానని చార్లెస్ తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు యూరోపియన్ దేశాలు మనస్ఫూర్తిగా తమ వంతు సాయం చేస్తున్నాయని ప్రధాని మోడీతో చెప్పినట్లు పేర్కొన్నారు.

పుతిన్‌ బ్లాక్ బెల్ట్ రద్దు చేసిన తైక్వాండో

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు ఆయ‌న బ్యాంకు ఖాతాల‌ను ఫ్రీజ్ చేస్తే.. క్రీడారంగం నుంచి పుతిన్‌కు వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన వ‌ర‌ల్డ్‌ తైక్వాండో ఫెడ‌రేష‌న్.. ర‌ష్యా అధ్య‌క్షుడి హోదాలో పుతిన్‌కు ఇచ్చిన గౌర‌వ తైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది.

నవీన్ మృతి పట్ల మోడీ సంతాపం

ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారతీయ వైద్యా విద్యార్థి నవీన్ తండ్రికి ప్రధాని నరేంద్ర మోడీ కాల్ చేశారు. నవీన్ తండ్రితో ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఇప్పటికే కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై కూడా నవీన్ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు. నవీన్ కటుంబాన్ని ఓదార్చురు. నవీన్ భౌతిక కాయం త్వరగా భారత్‌కు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అతని కుటుంబానిక అండగా ఉంటామని తెలిపారు.

ఈయూ పార్లమెంట్‌లో జెలెన్స్కీ ఎమోషనల్ స్పీచ్

ఉక్రెయిన్ ను ఒంటరిని చేయొద్దని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలను రిక్వెస్ట్ చేశారు. రష్యా దురాక్రమణను ఆరు రోజులుగా నిలువరించి తమ శక్తిని రుజువు చేసుకున్నామని, తాము కూడా యూరోపియన్ యూనియన్ లోని దేశాలతో సమానమైన వాళ్లమేనని గుర్తించాలని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈయూ పార్లమెంట్ లో ప్రసంగించారు. జెలెన్స్కీ ఎమోషనల్ గా చేసిన ప్రసంగానికి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులంతా చలించిపోయారు. ఆయన మాట్లాడడం పూర్తవగానే అందరూ లేని నిలబడి.. చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ఆపరేషన్ గంగ: స్లొవేకియా వెళ్లిన కేంద్ర మంత్రి రిజిజు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించే ‘ఆపరేషన్ గంగ’ పర్యవేక్షణ కోసం కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఇవాళ సాయంత్రం ఉక్రెయిన్ పొరుగు దేశమైన స్లొవేకియాకు వెళ్లారు. ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి మన పౌరులను సేఫ్‌గా తీసుకురావడమే తమ టాప్ ప్రయారిటీ అని రిజిజు చెప్పారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దాటి స్లొవేకియాలోకి అడుగుపెట్టే ఇండియన్స్‌కు వీసా సహా ఇతర ఇబ్బందులు రాకుండా స్లొవేకియా ప్రభుత్వ సహకారం తీసుకుంటామని ఆయన అన్నారు. భారత పౌరులు, విద్యార్థుల తరలింపు సాఫీగా సాగేలా స్లొవేకియాలో ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని అన్నారు.

స్లొవేకియా ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన మోడీ

స్లొవేకియా ప్రధాని ఎడ్వర్డ్‌ హేగర్‌‌తో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. భారత పౌరులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను అనుమతించడంతో పాటు ఇతర సహాకారం అందిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇండియన్స్‌ తరలింపు పూర్తయ్యే వరకూ ఈ సహకారాన్ని కొనసాగించాలని కోరారు. తన ప్రతినిధిగా కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు స్లొవేకియాకు చేరుకుని తరలింపును పర్యవేక్షిస్తారని కూడా ఎడ్వర్డ్‌కు మోడీ తెలిపారు.

ఎలన్ మస్క్‌కు ఉక్రెయిన్ థ్యాంక్స్

స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించిన టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కు ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖెలో ఫెదొరోవ్ థ్యాక్స్ చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ వ్యవస్థలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ ప్రభుత్వం స్టార్ లింక్ సేవలు అందించాలని, అందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను పంపాలని ఎలన్ మస్క్ కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన మస్క్.. ఉక్రెయిన్ దేశంలో ఇంటర్నెట్ సేవలకు చేయూతనిచ్చారు. తమ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ లో వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన టెర్మినల్ పరికరాలను ఉక్రెయిన్ కు అందించారు.  మస్క్ పంపించిన శాటిలైట్ ఇంటర్నెట్ టెర్మినల్స్ తో కూడిన ట్రక్కు ఫొటోను ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖెలో ఫెదొరోవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కష్టకాలంలో ఆదుకున్నందుకు ఎలన్ మస్క్ కు ఫెదొరోవ్ కృతజ్ఞతలు తెలిపారు. మోస్ట్ వెల్కమ్ అంటూ మస్క్ ట్విట్టర్ లో బదులిచ్చారు. 

నోట మాటలు రావడం లేదు

నవీన్ మృతిపై కర్ణాటక బీజేపీ ఎంపీ పీసీ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో  ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ మృతి వార్త తెలిసి బాధతో తన నోట మాట రాలేదంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసిందని అన్నారు. ఈ బాధను తట్టుకునే శక్తిని నవీన్ కుటుంబానికి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పీసీ మోహన్ అన్నారు.

విషాద వార్త అందింది: రాహుల్ గాంధీ

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి నవీన్ ప్రాణాలు కోల్పోయిన విషాద వార్త తనకు అందిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. నవీన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఆయన సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సురక్షితమైన తరలింపు కోసం GOIకి వ్యూహాత్మక ప్రణాళిక అవసరమన్నారు. ప్రతి నిమిషం విలువైనదే అన్నారు రాహుల్ గాంధీ. 

షాపుకు వెళ్తుండగా నవీన్ మృతి: 

ఉక్రెయిన్‌లో నవీన్ శేఖరప్ప దురదృష్టకర మరణాన్ని అధికారికంగా ధృవీకరించారు కర్నాటక కమిషనర్ మనోజ్ రాజన్. నవీన్‌ది  హవేరి జిల్లాలోని చలగేరి గ్రామమని తెలిపారు. ఏదో కొనడానికి సమీపంలోని దుకాణానికి బయలు దేరగానే... అక్కడ బాంబు దాడి జరిగింన్నారు. నవీన్ చనిపోయాడని అతని స్నేహితుడికి స్థానిక అధికారి నుండి కాల్ వచ్చిందని మనోజ్ రాజన్ తెలిపారు.

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌లో భారత వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఖర్కివ్‌లో ఈరోజు ఉదయం జరిగిన రష్యా బాంబు దాడిలో ఒక ఇండియన్ స్టూడెంట్ చనిపోయాడు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ అరిందం బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. మృతుడిని కర్ణాటకలోని హవేరి జిల్లా చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్పగా గుర్తించారు. నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం సూపర్‌ మార్కెట్‌ ముందు నవీన్ ఉండగా బాంబు దాడి జరిగింది. తీవ్రగాయాలతో నవీన్‌ మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. రెండ్రోజులుగా ఖార్కివ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇంకా ఖర్కివ్‌లోనే పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. రష్యన్ బలగాల దాడితో భారతీయ విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఖార్కివ్‌లో 4వేల మంది భారతీయ వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. వారంతా ప్రాణ భయంతో బంకర్లలోనే తలదాచుకున్నారు.  కాగా, ఈ ఘటనపై ఢిల్లీలో ఉన్న ఉక్రెయిన్, రష్యా రాయబారులను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పిలిపించుకుని మాట్లాడనున్నట్లు బాగ్చి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్క భారతీయుడినీ అత్యంత వేగంగా ఇండియాకు చేర్చాలన్న డిమాండ్‌ను ఆ రెండు దేశాల రాయబారుల ముందు ఉంచనున్నట్లు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌లలో ఉన్న భారత రాయబారులు కూడా ఈ విషయంపై అక్కడి విదేశాంగ శాఖను డిమాండ్ చేస్తారని అన్నారు.

ఉక్రెయిన్ నుంచి ఇండియాకు మరో 434 మంది

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతుండడంతో అక్కడ చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం వేగంగా స్వదేశానికి తీసుకొస్తోంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో కమర్షియల్ ఫ్లైట్స్‌కు ఎయిర్ స్పేస్‌ను మూసేయడంతో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సరిహద్దు దేశాలైన హంగేరి, రొమేనియాలకు తరలించి స్పెషల్ ఫ్లైట్స్‌తో తీసుకొస్తోంది. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఈ తరలింపును యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఇప్పటికే ఏడు ఫ్లైట్లలో 1,578 మంది భారతీయులను ఇండియాకు తీసుకురాగా.. ఇవాళ మధ్యాహ్నం మరో రెండు ఫ్లైట్స్ ఢిల్లీ చేరుకున్నాయి. హంగేరిలోని బుడాపెస్ట్, రొమేనియాలోని బుకారెస్ట్‌ల నుంచి ఒక ఫ్లైట్‌లో 216 మందిని, మరో ఫ్లైట్‌లో 218 మందిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చింది. వీరికి కేంద్ర మంత్రులు ఆర్కేసింగ్, మన్‌సుఖ్ మాండవీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సేఫ్‌గా స్వస్థలాలకు చేరుస్తామని అన్నారు. ఈ తరలింపు ఆపరేషన్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నలుగురు కేంద్ర మంత్రులను ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లాలని ఆదేశించారని చెప్పారు. 

భారత పౌరులంతా తక్షణమే కీవ్ ను వీడండి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్నితక్షణమే వదిలి వెళ్లాలని ఆ నగరంలోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం కోరింది. శాటిలైట్ ఇమేజెస్  అనుసరించి 64 కిలోమీటర్ల వరకు రష్యా సైన్యాలు ఉక్రెయిన్‌ వైపు కదులుతున్నట్లు స్పష్టమైంది. దీంతో భారత దౌత్య కార్యాలయం దీనికి సంబంధించి  అత్యవసర ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయటపడాలని సూచించింది. కీవ్‌లో ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు తక్షణమే రాజధాని నగరాన్ని వీడాలని, రైళ్లు, అందుబాటులో ఉన్న ఇతర రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయట పడాలని  ఆ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతంవైపునకు వెళ్లేందుకు కీవ్‌లో రైళ్లు సిద్ధంగా ఉన్నాయని సోమవారం ఎంబసి సమాచారం ఇచ్చింది. రైల్వే స్టేషన్ల దగ్గరకు భారీగా జనాలు రావొచ్చని, ఆ సమయంలో భారతీయ పౌరులంతా సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. దేశం వీడేందుకు తగిన పత్రాలు, నగదు వెంట ఉంచుకోవాలని చెప్పింది.

కీవ్ వైపు 64.కి.మీ పొడవున రష్యా సాయుధ కాన్వాయ్

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని ఆక్రమించుకోవడం... లక్ష్యంగా రష్యా సేనలు ప్లాన్స్ చేస్తున్నాయి. కీవ్ వైపు రష్యా బలగాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. కీవ్ వైపుకు వెళ్తున్న ఓ భారీ సాయుధ కాన్వాయ్ ను శాటిలైట్ ఫొటోలు గుర్తించాయి. కాన్వాయి పొడవు 64 కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ లోని నగరాల్లో ఉదయం నుంచి ఎయిర్ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్ తో పాటు పశ్చిమ నగరాలైన టెర్రోపిల్, రివ్నే ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు వినిపిస్తున్నాయి.

ఉక్రెయిన్ పౌరులపై రష్యా దాడి

ఉక్రెయిన్ ప్రజలపై రష్యా సేనలు దాడి చేస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ పై రష్యా దాడుల దృష్ట్యా నిర్వహించిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రతినిధి మాట్లాడారు. అమాయకులపై దాడులు చేస్తున్న ఆధారాలు చూపించారు. అమాయకులను టార్గెట్ చేస్తున్నట్లు ఉక్రెయిన్ లోని తన తల్లికి రష్యాకు చెందిన సైనికుడు ఫోన్ లో పంపిన మెసేజ్ అని చదివి వినిపించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఆపేందుకు.. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఐక్యరాజ్యసమితిలో కోరారు ఉక్రెయిన్ ప్రతినిధి.

70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి

తూర్పు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ సమీపంలోని మిలిటరీ బేస్ లక్ష్యంగా రష్యా సేనలు దాడులు చేశాయి. ఈ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. రష్యా సరిహద్దు నుంచి 50 కిలో మీటర్ల దూరంలోని ఓఖ్ టిర్కా నగరంలోని మిలిటరీ బేస్ క్యాంపుపై సోమవారం మధ్యాహ్నం క్షిపణి దాడి చేసింది రష్యా సైన్యం. ఈ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మిలిటరీ యూనిట్ ధ్వంసమవ్వగా.. ఆ శిథిలాల కింద సైనికుల మృతదేహాల వెలికితీసినట్లు తెలిపాయి మీడియా ఏజెన్సీలు.

ఉక్రెయిన్ నుంచి ముంబైకి చేరిన ఏడో ఫ్లైట్

ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపును వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.  లేటెస్ట్ గా 182 మంది విద్యార్థులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఏడో విమానం ముంబైకి చేరుకుంది.కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఎయిర్ పోర్ట్ లో విద్యార్థులను పరామర్శించారు. ఇదిలావుండగా, 216 మంది భారతీయ పౌరులతో కూడిన ఎనిమిదో విమానం హంగేరీలోని బుడాపెస్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరగా, తొమ్మిదవ విమానం 218 మంది భారతీయులను ఎక్కించుకుని బుకారెస్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్  తెలిపారు. ఇప్పటి వరకు 7  విమానాల్లో 1,578 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి భారత్ కు తీసుకొచ్చారు

36 దేశాల విమానాలపై రష్యా బ్యాన్

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించడాన్ని నిరసిస్తూ ప్రపంచ దేశాలు తనపై ఆంక్షలు విధిస్తుండడంతో రష్యా  కూడా చర్యలు తీసుకుంటోంది. తమ గగనతలంలోకి రాకుండా 36 దేశాలకు చెందిన విమానాలపై బ్యాన్​ విధించింది. ఇందులో బ్రిటన్, జర్మనీ సహా పలు యురోపియన్​ దేశాలు ఉన్నాయి. ఈమేరకు సోమవారం రష్యా సివిల్​ ఏవియేషన్​ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా దేశాలకు చెందిన విమానాలు రష్యా ఎయిర్​స్పేస్​లోకి రావాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని సూచించింది.

ఉక్రెయిన్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత

వేలాది ప్రాణాలకు ముప్పుందని డబ్ల్యూహెచ్ వో ఆందోళన

రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కు కొరత ఏర్పడింది. కొన్ని ఆస్పత్రుల్లో ఇప్పటికే ఆక్సిజన్ అయిపోగా, మరికొన్ని ఆస్పత్రుల్లో 24 గంటల్లో అయిపోనుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ వో) తెలిపింది. దీంతో వేలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఉక్రెయిన్​లో మెడికల్ ఆక్సిజన్ అయిపోతంది. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ప్లాంట్ల నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్ సప్లై కావడంలేదు. కొన్ని ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ఉత్పత్తికి అవసరమైన జియోలైట్ రవాణా నిలిచిపోవడమే ఇందుకు కారణం” అని చెప్పింది. కరెంట్ కొరత కారణంగానూ ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడుతోందంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్​కు సాయం చేస్తున్నట్లు పేర్కొంది.

రష్యాపై  క్రీడా ప్రపంచం వార్‌‌‌‌

ఉక్రెయిన్‌‌‌‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై  క్రీడా ప్రపంచం వార్‌‌‌‌ను ప్రకటించింది. రష్యాలో ఎలాంటి ఇంటర్నేషనల్‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌ను ఏర్పాటు చేయొద్దని అన్ని క్రీడా సమాఖ్యలను అంతర్జాతీయ ఒలింపి క్‌‌‌‌ కమిటీ (ఐవోసీ) కోరింది. అలాగే రష్యా, బెలారస్‌‌‌‌ అథ్లెట్లను, అధికారులను రాబోయే  వరల్డ్​ ఈవెంట్లలో పాల్గొనకుండా బ్యాన్​ చేయాలని పిలుపునిచ్చింది. ‘క్రీడా పోటీల సమగ్రతను కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే అన్ని ఈవెంట్ల నుంచి రష్యాను బహిష్కరించండి. ఆ దేశ జెండాను వాడొద్దు. జాతీయ గీతాలను ఆలపించొద్దు’ అని ఐవోసీ ఎగ్జిక్యూటివ్​ బోర్డు ఓ ప్రకటన చేసింది. మరోవైపు ఈ ఏడాది జరిగే సాకర్​ వరల్డ్​ కప్ నుంచి రష్యాను తప్పించినట్టు ఫిఫా ప్రకటించింది. తదుపరి నోటీసులు ఇచ్చేదాకా అన్ని ఇంటర్నేషనల్​ ఫుట్​బాల్​ ఈవెంట్లలో పాల్గొనకుండా రష్యా ​జట్లు, క్లబ్స్​ను సస్పెండ్​ చేసింది.

రష్యా సెంట్రల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌పై మరిన్ని ఆంక్షలు..

యూఎస్‌‌‌‌, మరికొన్ని దేశాలు రష్యాపై విధించే ఆంక్షలు కొన్ని బ్యాంకులకు మాత్రమే పరిమితమయ్యేటట్టు కనిపిస్తున్నాయి. స్విఫ్ట్‌‌‌‌ను ఏయే రష్యన్ బ్యాంకులు వాడకూడదనే లిస్టు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రష్యాలో స్బెర్‌‌‌‌‌‌‌‌బ్యాంక్ అతిపెద్దది. యూఎస్‌‌‌‌ ఆంక్షల లిస్టులో ఈ బ్యాంకు ఉంటే మాత్రమే రష్యా ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  రష్యాలోని రెండో అతిపెద్ద బ్యాంక్ వీటీబీపై కూడా యూఎస్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు రష్యా కరెన్సీ రూబుల్‌‌‌‌కు సపోర్ట్ ఇవ్వడానికి అదనంగా ఫారెక్స్ నిల్వలను ఆ దేశ ప్రభుత్వం సేకరిస్తోంది. దీన్ని నియంత్రించడానికి అదనంగా మరిన్ని ఆంక్షలను పెడతామని యూకే ట్రెజరీ డిపార్ట్‌‌‌‌మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌‌‌‌లు ప్రకటించాయి.

రష్యన్ కరెన్సీ పతనం..

స్విఫ్ట్ గ్లోబల్‌‌‌‌ పేమెంట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను రష్యన్‌‌‌‌ బ్యాంకులు వాడడాన్ని నియంత్రించడంతో ఆ దేశ కరెన్సీ రూబుల్ డాలర్ మారకంలో సోమవారం భారీగా క్రాష్ అయ్యింది. సోమవారం ఒక్క సెషన్‌‌‌‌లోనే డాలర్ మారకంలో రూబుల్ విలువ 26 % తగ్గింది. దీంతో ఒక డాలర్ విలువ 84 రూబుల్ నుంచి 105.27 రూబుల్‌‌‌‌కు పడింది.  అంతేకాకుండా మొత్తం 600 బిలియన్ డాలర్ల విలువైన ఫారిన్ కరెన్సీని వాడకుండా ఉండేలా యూఎస్, మిత్ర దేశాలు ఆంక్షలు పెట్టాయి. దీంత డాలర్ మారకంలో రష్యన్ కరెన్సీ భారీగా పడింది. వెస్ట్రన్ కంట్రీస్ నియంత్రణలు ఎదుర్కొనేందుకు రష్యా గవర్నమెంట్  కీలక రేట్లను ప్రస్తుతం ఉన్న 9.5 % నుంచి 20 శాతానికి పెంచింది. దీంతో రూబుల్‌‌‌‌పై ప్రెజర్‌‌‌‌‌‌‌‌ పడుతోంది. దీంతో రష్యాలో రూబుల్ వాల్యూ పడిపోవడంతో పాటు, ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెరుగుతోంది. 

నాటో దేశాల నుంచి వెపన్స్
ఉక్రెయిన్ కు నాటో దేశాల నుంచి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లు, యాంటీ ట్యాంక్ వెపన్స్, ఇతర ఆయుధాలు అందనున్నాయని నాటో చీఫ్​స్టోల్టెన్ బర్గ్ వెల్లడించారు. యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు వెపన్స్ అందిస్తూ  తమ పట్ల శత్రువుల్లా ప్రవర్తిస్తున్నాయని, ఉక్రెయిన్ ను డీమిలిటరైజ్ చేయాలన్న తమ ప్రయత్నం సరైనదేనని చెప్పకనే చెప్తున్నాయని రష్యా కామెంట్ చేసింది. కాగా, ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచీ రష్యా 350 మిసైల్స్ ను ప్రయోగించిందని అమెరికా డిఫెన్స్ అధికారి ఒకరు చెప్పారు. వీటిలో కొన్ని మిసైల్స్ ప్రజల ఇండ్లు, ఆస్తులను ధ్వంసం చేశాయన్నారు.

రష్యాకు ఇంటా, బయటా నిరసనలు 
ఉక్రెయిన్ పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ రష్యాతో సహా అనేక దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాలో గురువారం నుంచే 6 వేల మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక జర్మనీ, జపాన్, బ్రిటన్, తదితర దేశాల్లోని సిటీల్లోనూ వేలాది మంది రష్యాకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్నారు.  

యుద్ధ రంగంలోకి బెలారస్? 
చర్చల ఫలితాలను బట్టి రష్యాకు మద్దతుగా బెలారస్ కూడా యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. అయితే రష్యా అనుకున్నంత ఈజీగా ఉక్రెయిన్‌పై ఆధిపత్యం సాధించలేక పోతోందని అమెరికన్ ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. రష్యన్ బలగాలు కీవ్ కు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో గుమిగూడాయని, సిటీలోకి ఎంటర్ కాకుండా ఉక్రెయిన్ సోల్జర్లు అడ్డుకుంటు న్నారని బ్రిటన్ రక్షణ శాఖ పేర్కొంది. 
ఉక్రెయిన్‌‌ నుంచి వచ్చిన స్టూడెంట్లకు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ
హైదరాబాద్‌‌, వెలుగు: ఉక్రెయిన్‌‌ నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న స్టూడెంట్లకు టీఎస్‌‌ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయొచ్చని సంస్థ తెలిపింది. హైదరాబాద్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌ నుంచి రాష్ట్రంలోని ఎక్కడికైనా ప్రయాణించొచ్చని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
 

మోడీ మరో హైలెవల్ మీటింగ్

ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ వరుస మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. మోడీ అధ్యక్షతన మరోసారి హైలెవల్ మీటింగ్ ప్రారంభమైంది.  ఈ సమావేశానికి  విదేశాంగ మంత్రి జయశంకర్, హోమంత్రి అమిత్ సా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ పలువురు అధికారులు హాజరయ్యారు ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతుందనేదానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఇవాళ మధ్యాహ్నం జరిగిన హైలెవల్ మీటింగ్ లో   ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులతో సహా భారత పౌరులను తరలించే ప్రక్రియపై సమన్వయం చేయడానికి నలుగురు కేంద్రమంత్రులకు బాద్యతలు అప్పగించారు. నిన్న( ఆదివారం )కూడా అధికారులతో హైలెవల్ మీటింగ్  నిర్వహించారు మోడీ. 

రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలం

రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. బెలారస్ సరిహద్దులోని గోమెల్లో ఇరు దేశాల ప్రతినిధులు దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిపినా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. షరతులు, డిమాండ్ల విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు సమాచారం.

ఢిల్లీకి చేరిన ఆరో ఫ్లైట్

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను  స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఐదో ఫ్లైట్ ఇండియాకు చేరగా..లేెటెస్ట్ గా  ఆరో ఫ్లైట్  భారత్ కు చేరుకుంది.  ఆరో ఫ్లైట్ లో 240 మంది భారత పౌరులు ఢిల్లీకి చేరారు.  బుకారెస్ట్  నుంచి నాలుగు విమానాలు, హంగేరి నుంచి రెండు విమానాలు వచ్చాయని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 1,400 మంది భారత పౌరులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చామని చెప్పారు. మిగిలిన వారిని సాధ్యమైనంత త్వరగా భారత్ కు రప్పిస్తామన్నారు.  తాము సూచనలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 వేల మంది ఉక్రెయిన్  ను విడిచి వెళ్లారన్నారు.   ఉక్రెయిన్ సరిహద్దుగా ఉన్న 4 దేశాలకు భారత ప్రతినిధులను పంపేందుకు నిర్ణయించామన్నారు. కేంద్రమంత్రులు జోతిరాధిత్య సింధియా రొమేనియాకు, కిరణ్ రిరీజు స్లోవాక్ రిపబ్లిక్ కు, హర్ దీప్ పురి హంగేరికి, పోలాండ్ కు వీకే సింగ్ వెళ్తారన్నారు.  ఉక్రెయిన్  సరిహద్దులకు చేరుకునే భారత పౌరులను సేఫ్ గా స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యతను కేంద్రప్రభుత్వం వీరికి అప్పగించిందన్నారు

రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు

ఉక్రెయిన్ - రష్యా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.  ఉక్రెనియన్  బెలారసియన్ సరిహద్దులోని గోమెల్ సిటీలో ఇరు దేశాల అధికారులు భేటీ జరుగుతోంది. రష్యాకు విదేశీ, రక్షణ వ్యవహారాలు, అధ్యక్ష కార్యాలయ అధికారులు, ఉక్రెయిన్ బృందంతో చర్చలు జరుపుతోంది. భేటీలో ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యా భావిస్తోంది. మరోవైపు కాల్పుల విరమణ, ఉక్రెయిన్ లో రష్యా సేనల ఉపసంహరణ ప్రధాన లక్ష్యంగా చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్ ఇప్పటికే ప్రకటించింది. 

ప్రాణాలు కావాలంటే ఉక్రెయిన్ వదిలివెళ్లండి

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. తమ దేశాన్ని వెంటనే వదిలివెళ్లాలని రష్యన్ బలగాలను ఆయన హెచ్చరించారు. ‘తక్షణమే ఉక్రెయిన్ ను వదలిపోండి.. మీ ప్రాణాలను కాపాడుకోండి’ అని రష్యా సైనికులను ఉద్దేశించి జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యాకు తమ దేశానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 4,500 మంది రష్యన్ జవాన్లు చనిపోయారని తెలిపారు. రష్యాతో వార్ లో పోరాడేందుకు తమ దేశ జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆర్మీలో పని చేసిన అనుభవం, యుద్ధంలో ఫైట్ చేసేందుకు ఆసక్తి ఉన్న ఖైదీలను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

రష్యా భయపడింది

ఉక్రెయిన్ పై ఈ నెల 24న సడన్ గా యుద్ధం ప్రకటించి.. ఆ దేశ రాజధాని కీవ్ వరకూ చొచ్చుకొళ్లిన రష్యా ఇవాళ తమ అటాక్ తీవ్రతను, వేగాన్ని తగ్గించింది. రాజధాని వరకు రాగలిగిన రష్యన్ బలగాలకు.. కీవ్ నరగంలోకి ఎంటరయ్యాక మాత్రం తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఒక వైపు ఉక్రెయిన్ బలగాలు రష్యా సైన్యంపై క్షిపణులు, యుద్ధ ట్యాంకర్లతో దాడి చేస్తుంటే.. మరోవైపు ఉక్రెయిన్ ప్రజలు సైతం ఒక్కో యోధుడిలా తిరగబడుతున్నారు. ఆడామగ, చిన్నా పెద్ద అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయుధాలను చేపట్టి.. దేశాన్ని, రాజధాని నగరాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు. కొంత మంది పౌరులు తమ వాహనాల్లోని ఫ్యూయల్ తీసి.. పెట్రోల్ బాంబులు తయారు చేసి.. రష్యన్ యుద్ధ ట్యాంకర్లపై దాడి చేస్తున్నారు. దీంతో రష్యన్ ఆర్మీకి ఆ దేశం ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. సైనికుల ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరిగినట్లు ఉక్రెయిన్ మీడియా చెబుతోంది. దీంతో రష్యాలో భయం మొదలైందని, ఆ దేశ బలగాలు దాడి తీవ్రతను, వేగాన్ని తగ్గించాయని ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. 

తమ దేశంలో మిలిటరీ, సివిలియన్ ఏరియాల్లో రష్యన్ బలగాలు దాడులకు పాల్పడ్డాయని, కానీ దురాక్రమణ ఆలోచనతో రష్యా చేసిన మిలిటరీ ఆపరేషన్ ఫెయిల్ అయిందని జనరల్ స్టాఫ్ ఆఫ్ ఉక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఆర్మీ తక్కువ ఫోర్సెస్ తోనే రష్యా బలగాలను పెద్ద దెబ్బ తీసిందని, ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరగడంతో రష్యా నైతిక స్థైర్యం కోల్పోయిందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో రష్యన్ సైనికులు పోరాటానికి విముఖత చూపిస్తున్నారని పేర్కొన్నారు. శత్రుదేశం ఇప్పటికైనా రియాలిటీని గుర్తించిందని, ఉక్రెయిన్ ను చూసి రష్యా భయపడుతోందని అన్నారు.

ఇండియన్స్ తరలింపులో మరో కంపెనీ

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తరలించే స్పెషల్ ఆపరేషన్ లో భాగమయ్యేందుకు మరో ఎయిర్ లైన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ఎయిరిండియా మాత్రమే స్పెషల్ ఫ్లైట్స్ లో ఇండియన్స్ ను తీసుకొస్తోంది. హంగేరి, రొమేనియా సరిహద్దులకు చేరుకున్న భారతీయులను ఇప్పటికే ఐదు ఫ్లైట్స్ లో 1156 మందిని స్వదేశానికి చేర్చింది. ఇవాళ సాయంత్రం లోపు మరో 240 మందిని బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి తీసుకురానుంది. అయితే ఇప్పుడు ఈ తరలింపు ఆపరేషన్ ను మరింత వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భారతీయులను తీసుకొచ్చేందుకు స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ కూడా రంగంలోకి దిగుతోంది. హంగేరిలోని బుడాపెస్ట్ కు ఇవాళ సాయంత్రం ఒక ఫ్లైట్ ను పంపనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. రేపు తెల్లవారు జామున 3.30 గంటలకు తొలి ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంటుందని స్పైట్ జెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ తరలింపు ఆపరేషన్ కోసం మరిన్ని స్పెషల్ ఫ్లైట్స్ నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

మాట తప్పిన బెలారస్, రష్యా

యుద్ధాన్ని ఆపేందుకు శాంతి చర్చలు జరగడం కోసం ఉక్రెయిన్ కు ఇచ్చిన కీలకమైన హామీ విషయంలో బెలారస్ మాట తప్పింది. శాంతి చర్చలకు బెలారస్ ను వేదికగా చేసుకుందామని నిన్న ఉదయం రష్యా ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ నో చెప్పింది. బెలారస్ నుంచి రష్యా మిస్సైల్స్ ను ప్రయోగిస్తోందని, తమ దేశంపై దాడి చేసేందుకు వాడుకుంటున్న ప్రాంతంలో చర్చలకు వచ్చేది లేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. దీంతో బెలారస్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలు జరిపింది. తమ దేశం నుంచి రష్యా క్షిపణులను ప్రయోగించకుండా అడ్డుకుంటామని బెలారస్ హామీ ఇచ్చింది. దీంతో శాంతి చర్చలకు జెలెన్స్కీ ఓకే చెప్పారు. కానీ 24 గంటలు గడవకుండానే బెలారస్ మాట తప్పింది. బెలారస్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉక్రెయిన్ లోని ఝిటోమిర్ ఎయిర్ పోర్టుపై రష్యా క్షిపణి దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ కు చెందిన కీవ్ ఇండిపెండెంట్ మీడియా సంస్థ పేర్కొంది. శాంతి చర్చలు సాఫీగా జరిగేందుకు బెలారస్ భూభాగం నుంచి క్షిపణి దాడులు చేయకుండా చూడాల్సిన బెలారస్ ప్రభుత్వం, రష్యా రెండూ మాట తప్పాయి.

ఇండియన్స్ తరలింపు కోసం ఉక్రెయిన్ స్పెషల్ ట్రైన్స్

ఉక్రెయిన్ లో హోరా హోరీ యుద్దం జరుగుతుండగానే.. కేంద్ర ప్రభుత్వం మన పౌరులను తరలింపు కోసం ‘ఆపరేషన్ గంగ’ చేపడుతోంది. ఉక్రెయిన్ లోని వెస్ట్రన్ భాగంలో ఉన్న వారిని ముందుగా సరిహద్దుల్లోని హంగేరి, రొమేనియా దేశాలకు చేర్చి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తీసుకొస్తోంది. అయితే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భీకరంగా యుద్దం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడం ఇబ్బందికరంగా మారింది. ఎక్కడి వారిని అక్కడే ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. అయితే కీవ్ పై ఉక్రెయిన్ తమ పట్టును నిలుపుకొని దీటుగా నిలవడంతో ఆ దేశంలో ఇప్పటి వరకు ఉన్న కర్ఫ్యూను ఎత్తేసింది. దీంతో కీవ్ సిటీలో ఉన్న భారత పౌరులను, విద్యార్థులను ఆ ప్రాంతం నుంచి పశ్చిమ సరిహద్దుకు చేరుకోవాల్సిందిగా ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ సూచించింది. వారు కీవ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటే అక్కడి నుంచి ఉక్రెయిన్ ప్రత్యేక రైళ్లలో తరలించనుందని తెలిపింది.

మరి కొద్ది గంటల్లో శాంతి చర్చలు

ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ముగింపు దిశగా వెళ్తోంది. ఇరు దేశాల మధ్య బెలారస్ లో శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల కోసం ఇటు రష్యా, అటు ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు బెలారస్ చేరుకున్నాయి. మరి కొన్ని గంటల్లోనే చర్చలు ప్రారంభం కానున్నాయని రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఆర్టీ పేర్కొంది. మరోవైపు శాంతి చర్చల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బెలారస్ విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ మకీ తెలిపారు.

మా వాళ్ల దగ్గరకు వెళ్తాం

ఉక్రెయిన్, రష్యా మధ్య ఐదు రోజులగా హోరా హోరీగా యుద్ధం జరుగుతోంది. జనావాసాలపై దాడులు చేయడంలేదని, కేవలం ఆర్మీ, స్ట్రాటజిక్ పాయింట్లనే టార్గెట్ చేస్తున్నామని రష్యా చెబుతున్నా.. పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ దేశంలో కొన్ని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, బిల్డింగ్స్ పై రష్యన్ బలగాలు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఉక్రెయిన్ ప్రజల రక్షణపై ఆందోళన నెలకొంది. దీంతో ఇతర దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ పౌరులు తమ స్వస్థలాలకు వెళ్లి కష్ట సమయంలో తమ వారితో ఉండాలని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీని ఆ దేశానికి చెందిన పౌరులు ఆశ్రయించారు. తమను ఉక్రెయిన్ తీసుకెళ్లాలని, లేదంటే కనీసం ఉక్రెయిన్ కు పొరుగున ఉన్న ఏదొక దేశం పంపాలని కోరుతున్నారు. 

బెలారస్ చేరుకున్న ఉక్రెయిన్ ప్రతినిధులు

ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు ఓ అడుగు ముందుకేశాయి. బెలారస్ వేదికగా శాంతి చర్చలు జరిపేందుకు నిన్న (ఆదివారం) సాయంత్రం అంగీకారానికి వచ్చాయి. దీంతో ఈ చర్చల కోసం ఉదయం ఉక్రెయిన్ ప్రతినిధులు బెలారస్ చేరుకున్నారు.

ఉక్రెయిన్ పొరుగు దేశాలకు మన కేంద్ర మంత్రులు

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థుల వేగంగా తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం డిల్లీలో హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని పొరుగు దేశాల సరిహద్దులకు తీసుకొచ్చి అక్కడి నుంచి విమానాల్లో తరలిస్తున్న నేపథ్యంలో అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని కేంద్ర మంత్రులను మోడీ ఆదేశించారు. తరలింపు ఆపరేషన్ ను అక్కడి ఎంబసీలతో కో ఆర్డినేట్ చేసుకునేందుకు కేంద్ర మంత్రులు హరదీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సిందియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ లను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లాలని సూచించారు.

 

రష్యాపై ఆంక్షలు విధిస్తున్న ఐరోపా దేశాలు

ఉక్రెయిన్ పై రష్యా దాడుల దృష్ట్యా... రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి ఐరోపా దేశాలు. రష్యా విమానాలకు తమ గగన తలంలో ప్రవేశంపై నిషేధం విధించాయి 27 దేశాల ఐరోపా యూనియన్. ఉక్రెయిన్ కోసం ఆయుధాల కొనుగోలు, సరఫరాకు నిధులు కూడా అందించనున్నట్లు ప్రకటించాయి. రష్యాకు మద్దతిస్తున్న బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోపైనా కొత్త గా ఆంక్షలు విధించేంకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది యూరోపియన్ కమిషన్.

రష్యాతో ఫుట్బాల్ మ్యాచులను బహిష్కరించిన ఇంగ్లాండ్

భవిష్యత్ లో రష్యాతో ఫుట్బాల్ ఆడేదిలేదని తెగేసి చెప్పింది ఇంగ్లాండ్. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి నిరసనగా, ఉక్రెయిన్ కు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లాండ్ ఫుట్బాల్ అసోసియేషన్ తెలిపింది. సీనియర్, జూనియర్, పారా.. ఇలా ఏ స్థాయి ఫుట్బాల్ మ్యాచులైనా సరే రష్యాతో ఆడబోయేదిలేదని ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. ఇప్పటికే పోలాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్ దేశాలు రష్యాతో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచులు ఆడబోమని స్పష్టం చేశాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంగ్లాండ్ కూడా చేరింది. రష్యాలో ఎలాంటి ఫుట్బాల్ టోర్నీలు నిర్వహించేది లేదని ఫిఫా ప్రకటించింది. ఇక నుంచి రష్యా ఏ టోర్నీలో పాల్గొన్నా.. ఆ దేశ జెండాను కానీ, జాతీయ గీతాలపనను కానీ అంగీకరించేది లేదని ఫిఫా తెలిపింది.


249 మందితో ఢిల్లీ చేరుకున్న  మరో విమానం

'ఆపరేషన్ గంగ'లో భాగంగా ఇవాళ ఉదయం ఉక్రెయిన్ యుద్ధ భూమి నుంచి మరో విమానం వచ్చింది. రొమోనియా నుంచి ఢిల్లీ చేరుకున్న ఈ విమానంలో 249 మంది భారతీయులు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు భారత్ చేరుకున్న 5 విమానాల్లో కలిపి మొత్తం 1,156 మంది భారతీయులు స్వదేశానికి తిరిగివచ్చారు.

 

ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో ఫ్లైట్.. రష్యా దాడుల్లో ధ్వంసం

రష్యా వైమానిక దాడుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఏఎన్ 225 మ్రియా ధ్వంసంమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్ పోర్టు వద్ద మ్రియా క్రాష్ అయ్యింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ధ్రువీకరించారు. ఉక్రెయిన్ భాషలో మ్రియా అంటే.. కల అని అర్థం. మ్రియాను ఉక్రెయిన్ ఎరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ తయారు చేసింది. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని రష్యా కీవ్ సమీపంలో క్రాష్ చేసింది. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కలను నెరవేరుస్తామని... ఉక్రెయిన్ అధికార ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. వారు అతి పెద్ద విమానాన్ని తగులబెట్టారు. కానీ మా మ్రియా ఎప్పటికీ నశించదని రాసి.... ప్లేన్ ఉన్న పిక్చర్ ను పోస్టు చేశారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో.

ఐజేఎఫ్ నుంచి పుతిన్ సస్పెన్షన్
ఉక్రెయిన్‌‌‌‌పై యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్(ఐజేఎఫ్) ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించారు. జూడో పాలక మండలి ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌‌పై రష్యా దాడిని వివరించడానికి ఐజేఎఫ్ ‘యుద్ధం’ అనే పదాన్ని ఉపయోగించింది. ఒలింపిక్ స్పోర్ట్స్ బాడీలు ఈ పదాన్ని వాడటం అరుదు.  పుతిన్​ జూడోలో బ్లాక్​ బెల్ట్​ సాధించారు.
 

సిటీల్లో రష్యన్ సోల్జర్లకు ఝలక్  
కీవ్​తో పాటు ఇతర కీలక సిటీల వద్దకు ఈజీగా చేరుకున్న రష్యన్ బలగాలకు అనేక సిటీల్లో ఉక్రెయిన్ బలగాలు, వాలంటీర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వరుసగా మూడో రోజూ కీవ్​లో రష్యన్ సోల్జర్లను అడ్డుకున్నామని, కీవ్ అంతా తమ కంట్రోల్ లోనే ఉందని ఉక్రెయిన్ ప్రకటించింది. అలాగే దేశంలో రెండో అతిపెద్దదైన ఖార్కీవ్ సిటీని మొదట రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకున్నా, సిటీని తిరిగి ఉక్రెయిన్ సోల్జర్లు కంట్రోల్​లోకి తీసుకున్నారు. రష్యన్ సోల్జర్లను తరిమేశామని ఖార్కీవ్ మేయర్ ఓలెగ్ సైన్ గుబోవ్ ప్రకటించారు. 
3.68 లక్షల రెఫ్యూజీలు 
ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 3.68 లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లారని యునైటెడ్ నేష న్స్ శరణార్థుల సంస్థ వెల్లడించింది. పోలాండ్, హంగరీ, రొమేనియా బార్డర్లకు చేరుకుంటున్న రెఫ్యూజీల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. 
4,300 రష్యన్ సోల్జర్లు మృతి: ఉక్రెయిన్ 
యుద్ధంలో ఇప్పటివరకూ 4,300 మంది రష్యన్ సోల్జర్లను హతమార్చామని ఆదివారం ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాల్యార్ ప్రకటించారు. రష్యాకు చెందిన 146 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని, 27 విమానాలను, 26 హెలికాప్టర్లను కూల్చివేశామని వెల్లడించారు.
దేశం కోసం రిటర్న్ వస్తున్రు 
యుద్ధం భయంతో లక్షలాది మంది ఉక్రెయినియన్లు దేశం విడిచి వెళ్లిపోతుంటే.. మరోవైపు వేలాది మంది ఉక్రెయిన్ మహిళలు, పురుషులు సొంత దేశాన్ని కాపాడుకోవటం కోసం రిటర్న్ వస్తున్నరు. ఒక్క పోలాండ్ బార్డర్ ద్వారానే గురువారం నుంచి 22 వేల మంది ఉక్రెయిన్ పౌరులు దేశంలోకి తిరిగి వచ్చారని అధికారులు వెల్లడించారు. దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఖైదీలను కూడా జైళ్ల నుంచి విడిచిపెడుతోందని మీడియా వెల్లడించింది. సైన్యంతో కలిసి పోరాడేందుకు విదేశాల నుంచి వాలంటీర్లు రావాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. తాను కీవ్​లోనే ఉన్నానని, సిటీ పూర్తిగా ఉక్రెయిన్ కంట్రోల్​లోనే ఉందని ఆయన ప్రకటించారు.  
రష్యాను ఐసీజే బోనులో నిలబెడ్తం: జెలెన్ స్కీ 
ఉక్రెయిన్ పై దాడులకు తెగబడిన రష్యా నరమేధానికి పాల్పడుతోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మండిపడ్డారు. దేశంలోని సాధారణ ప్రజల ఇండ్లపైనా రష్యన్ దళాలు బాంబులు వేస్తున్నాయని ఆరోపించారు. రష్యాను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్​జస్టిస్ (ఐసీజే)లో దోషిగా నిలబెడతామని చెప్పారు. ఐసీజేలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ అప్లికేషన్ అందజేసిందని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. రష్యా వెంటనే మిలటరీ దాడులు ఆపేలా ఆదేశించాలని కోరామని, త్వరలోనే విచారణ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. 
‘స్విఫ్ట్’ నుంచి రష్యా ఔట్ 
అమెరికా, బ్రిటన్, జర్మనీ తాజాగా మరిన్ని ఆంక్షలు ప్రకటించాయి. స్విఫ్ట్ గ్లోబల్ పేమెంట్ సిస్టం నుంచి రష్యాను దూరం పెట్టేందుకు అమెరికా, యూరోపియన్ కమిషన్, బ్రిటన్, కెనడా తదితర దేశాలు ఓకే చెప్పాయి. ప్రపంచ బ్యాంకింగ్ మెసేజింగ్ సర్వీస్ సంస్థ ‘స్విఫ్ట్’ నెట్ వర్క్ నుంచి రష్యన్ బ్యాంకులను బహిష్కరించాలని నిర్ణయించాయి. అలాగే రష్యా ఫారిన్ రిజర్వ్ లను వాడుకోకుండా చూసేందుకు రష్యన్ సెంట్రల్ బ్యాంకుపైనా ఆంక్షలు విధించేందుకు ఓకే చెప్పాయి. 200 దేశాల్లో 11 వేల బ్యాంకులు, సంస్థలు అనుసంధానమైన ఉన్న స్విఫ్ట్ నుంచి రష్యాను దూరం పెట్టడంతో ఆ దేశానికి ఆర్థికంగా గట్టి దెబ్బ తగులుతుందని నిపుణులు చెప్తున్నారు.

నాలుగోరోజూ భీకర దాడులు 
ఉక్రెయిన్​లో నాలుగో రోజూ రష్యన్ బలగాలు మిసైల్స్, రాకెట్, బాంబు దాడులు కొనసాగించాయి. కీవ్ సిటీలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో రష్యా అన్ని వైపుల నుంచీ దాడులను తీవ్రం చేసింది. దేశంలోని ఇతర కీలక సిటీలు, పట్టణాలపైనా దాడులు చేసింది. క్రీమియా, సెవస్టపోల్ సిటీలకు తాగునీటిని అందించే నీపర్ నదినీ రష్యన్ సోల్జర్లు పూర్తిగా కంట్రోల్​లోకి తీసుకున్నారు.  
 

ఒక్కో ఫ్లైట్​కు గంట ఖర్చు 8 లక్షలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్​ నుంచి ఇండియన్లను తీసుకొస్తున్న విమానాల ఖర్చు గంటకు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా అవుతోందని ఎయిరిండియా అధికారి చెప్పారు. విమాన సిబ్బంది, ల్యాండింగ్​, పార్కింగ్​ ఖర్చులు, ఇంధనం, నావిగేషన్​ వంటివన్నీ కలుపుకుని టైంను బట్టి ఒక్క విమానం పోయిరావడానికి రూ.కోటీ పదిలక్షలకుపైగా ఖర్చు అవుతుందని తెలిపారు. ఒక్కో విమానంలో రెండు గ్రూపుల సిబ్బంది డ్యూటీ చేస్తున్నారని చెప్పారు.
ఉక్రెయిన్‌‌కు జర్మనీ మిసైల్స్
బెర్లిన్: రష్యాను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్​కు అండగా ఉంటామంటూ ఒక్కో దేశం ముందుకొస్తోంది. యాంటీ ట్యాంక్ వెపన్స్, మిస్సైళ్లను పంపనున్నట్లు జర్మనీ ప్రకటించింది. వెయ్యి యుద్ధ ట్యాంకులు, 500 స్టింగర్ మిసైళ్లను అందిస్తామని జర్మనీ తెలిపింది. 14 సైనిక వాహనాలు, 10 వేల టన్నుల ఫ్యూయల్ పంపుతామని ప్రకటించింది. 7,500 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది. డిఫెన్సివ్ ఎక్విప్ మెంట్​ను పంపేందుకు ఇటలీ ముందుకొచ్చింది. మెషిన్ గన్స్, రైఫిల్స్ పంపిస్తామని చెక్ రిపబ్లిక్ ప్రకటించింది. అలాగే నెథర్లాండ్స్ 400 యాంటీ ట్యాంక్ వెపన్లను పంపుతామని చెప్పింది.

వాళ్లను వదిలి రాలేను..ఉక్రెయిన్​లో మన సైనికుడి బిడ్డ
మెడిసిన్​ చదవడానికి ఉక్రెయిన్​ వెళ్లిన ఓ స్టూడెంట్​అక్కడ తనకు ఆశ్రయమిచ్చి న కుటుంబాన్ని వదిలిరావడానికి ఇప్పుడు ఇష్టపడడంలేదు. అక్కడే ఉంటే ప్రాణాలు పోవచ్చని తెలిసీ రానంటుందా అమ్మాయి. ఇంటి ఓనర్​ వాలంటరీగా సైన్యంలో చేరితే.. ముగ్గురు పిల్లలతో ఆయన భార్య ఏమైపోతుందోనని టెన్షన్​ పడుతోంది. హర్యానాకు చెంది న ఆ స్టూడెంట్​ పేరు నేహ. ఆమె తండ్రి ఇండియన్​ ఆర్మీకి సేవలందిస్తూ ఇటీవలే కన్నుమూశారు. మెడిసిన్​ ఫైనల్​ ఇయర్​ పూర్తి చేయడానికి కిందటేడాదే నేహ ఉక్రెయిన్​ తిరిగివెళ్లింది. హాస్టల్​లో సీటు దొరకకపోవడంతో కీవ్​లో ఓ రూమ్​ రెంట్​కు తీసుకుని ఉంటోంది.ప్రస్తుతం.. ఉక్రెయిన్​ సైన్యానికి మద్ధతుగా ఆమె ఉంటున్న ఇంటి ఓనర్​ కూడా సైన్యంలో చేరిండు. దీంతో ఆయన భార్యా పిల్లల తో కలిసి నేహ అండర్​గ్రౌండ్​ బంకర్​లో ఉంటోంది. పరిస్థితులు చక్కబడేదాకా, ఆ పిల్లల తండ్రి తిరిగొచ్చేదాక ఇండియా కు రాలేనని తన తల్లికి ఫోన్లోచెప్పింది నేహ. బయట బాంబుల మోత వినిపిస్తు న్నా ఇప్పటికైతే తాము క్షేమంగానే ఉన్నామని చెప్పింది.
 

సైన్యంలో చేరేందుకు సిద్ధమైన తాత 
రష్యా సైనికులను ఎదురించడానికి నేను కూడా రెడీ అంటూ వచ్చిండీ  80 ఏండ్ల తాత.. ఓ చిన్న బ్యాగులో రెండు టీ షర్టులు, ఒక జత ప్యాంటు, బ్రష్షుతో పాటు మధ్యాహ్నం తినడానికి శాండ్​ విచ్​ పెట్టుకుని వచ్చిండు. నా మనవలు, మనవరాండ్లను కాపాడుకోవడానికి ఉక్రెయిన్​ సైన్యంలో చేరుతా, రష్యన్లతో ఫైట్​ చేస్తా.. నాకూ ఓ గన్​ ఇవ్వండంటూ సైనిక అధికారులను అడుగుతున్నడు. సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఈ ఫొటోను మొదట కాథెరినా యుశ్చెంకో ట్వీట్​ చేశారట.

వెళ్లిపోతవా? రెండు తగిలించనా?

రష్యా సైనికుడితో 12 ఏండ్ల అమ్మాయి
కీవ్: రోడ్డుపై తుపాకులతో పహారా కాస్తున్న రష్యా సైనికుడిని ఓ 12 ఏండ్ల అమ్మాయి నిలదీసింది. ‘‘ఎందుకొచ్చావు మా దేశానికి? మీ దేశానికి వెళ్లిపోండి.. పోతరా?  రెండు తగిలించాల్నా?” అంటూ పిడికిలి బిగించి దాడి చేసేందుకు ప్రయత్నించిన ఆ అమ్మాయిని చూసి రష్యా సైనికుడు విస్తుబోయాడు. ఏమాత్రం భయం లేకుండా తన మీదమీదకు వస్తున్న అమ్మాయికి దూరంగా వెళ్లిపోయాడు ఆ సైనికుడు. రష్యా సైనికుడిపై కోపంతో.. ఆవేదనతో ఆ పాప ఎదిరించడాన్ని కొందరు వీడియో తీసి షేర్ చేయడంతో .. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండియన్​ జెండాలను చూసి ఏమన్లేదు
ఉక్రెయిన్​లోని ఇండియన్​ ఎంబసీ అధికారులు తమను ఇండియాకు పంపించేందుకు ఎంతో కృషి చేశారని తిరిగి వచ్చిన విద్యార్థులు చెప్పారు. పోలెండ్​, హంగరీ, రుమేనియా ప్రభుత్వాలతో జరిపిన చర్చల వల్లే తాము ప్రాణాలతో రాగలిగామని అన్నారు. రష్యా, ఉక్రెయిన్​ దేశాల సైనికులు ఇండియన్లకు చాలా ప్రాధాన్యం ఇచ్చారనిచ, ఇండియా జెండా ఉన్న వాహనాలను అడ్డుకోలేదని చెప్పారు. తాము ప్రయాణించిన బస్సులకు ముందు, వెనకా కొన్ని వెహికల్స్​ రక్షణగా వచ్చాయన్నారు.
 

రష్యన్లతో పోరాడుతున్న ఉక్రెయిన్​ సిటిజన్లు
రష్యా సైనికులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ సిటిజన్లు సిద్ధమవుతున్నారు. తలా ఓ గన్ను పట్టుకుని ఉన్నామని సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. కీవ్ ను ఆక్రమించుకోవాలని వచ్చే రష్యా సైనికులకు పీడకలలే మిగుల్తాయని బెదిరిస్తున్నరు. ఉక్రెయిన్ కేపిటల్ సిటీ కీవ్​ను ఆధీనంలోకి తీసుకునేందుకు శివార్లలో రష్యా బలగాలు గుమిగూడుతున్నాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సైనికుల​తో పాటు అక్కడి లోకల్​ వాళ్లు కూడా గన్స్​ పట్టుకుని పోరాడేందుకు ముందుకొస్తున్నారు. ‘‘వాళ్లిక్కడికి వస్తే చచ్చిపోతారు. మేమిక్కడ చాలామందిమి గన్స్​తో రెడీగున్నం. ప్రతి గల్లీలో వాళ్లను ఎదిరిస్తం”అని కీవ్​లోని ఓ స్థానికుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉక్రెయిన్‌‌కు అండగా ఎలన్‌‌ మస్క్‌‌
రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌‌కు అండగా నిలిచారు ఎలన్ మస్క్. స్టార్‌‌ లింక్‌‌ శాటిలైట్‌‌ బ్రాడ్‌‌బ్యాండ్‌‌ సేవలను ప్రారంభించి  ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరిన్ని టెర్మినల్స్ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌‌లో ఇంటర్నెట్ సేవలు కట్​ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు సమాచారం చేరవేయాలంటే ఇంటర్నెట్ చాలా ముఖ్యం. లేదంటే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని ఉక్రెయిన్​ మంత్రి మైఖెలో ఫెదొరోవ్​ చేసిన రిక్వెస్ట్​కు మస్క్​ స్పందించి, 10 గంటల్లోనే ఉక్రెనియన్లకు ఇంటర్నెట్ అందేలా ఎలన్​ మస్క్​ ఏర్పాట్లు చేశారు.
 

ఆనందం.. ఉద్వేగం 
పిల్లల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం భావోద్వేగాలతో నిండిపోయింది. తమ పిల్లలు క్షేమంగా తిరిగొచ్చారని కొందరు తల్లిదండ్రులు ఆనందపడుతూ వారిని దగ్గరకు తీసుకుంటే.. మరికొందరు తల్లిదండ్రులు వచ్చినోళ్లలో తమ పిల్లలు లేరని కళ్లనిండా నీళ్లు తీస్కున్నారు. పిల్లలు ఎక్కడున్నరో..ఎట్లున్నరోనన్న ఆవేదనలో మునిగిపోయారు. ఉక్రెయిన్​లోని ఇతర సిటీలతో పోలిస్తే పడమరవైపున్న సిటీల్లో పరిస్థితులు కొంత బాగానే ఉన్నాయని ఇండియాకు వచ్చిన స్టూడెంట్లు చెప్పారు.

 

రష్యాను ఐసీజే బోనులో నిలబెడ్తం: జెలెన్ స్కీ 

ఉక్రెయిన్ పై దాడులకు తెగబడిన రష్యా నరమేధానికి పాల్పడుతోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మండిపడ్డారు. దేశంలోని సాధారణ ప్రజల ఇండ్లపైనా రష్యన్ దళాలు బాంబులు వేస్తున్నాయని ఆరోపించారు. రష్యాను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్​జస్టిస్ (ఐసీజే)లో దోషిగా నిలబెడతామని చెప్పారు. ఐసీజేలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ అప్లికేషన్ అందజేసిందని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. రష్యా వెంటనే మిలటరీ దాడులు ఆపేలా ఆదేశించాలని కోరామని, త్వరలోనే విచారణ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. 

పుతిన్ ప్రకటనను తప్పు పట్టిన నాటో సెక్రెటరీ జనరల్

అణ్వాయుధ దళాలను అప్రమత్తం చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను నాటో కూటమి తప్పు పట్టింది. ఓ వైపు ఏకపక్షంగా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూ.. అణ్వాయుధ దళాలను అప్రమత్తం చేస్తున్నట్లు చేసిన ప్రకటన చాలా ప్రమాదకరమని నాటో సెక్రెటరీ జనరల్ స్టోలెన్ బర్గ్ అన్నారు. పుతిన్ చాలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

అణ్వాయుధ దళాలను అప్రమత్తం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ 

ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. తమ దాడులు.. విధ్వంసానికి ఎదురు లేకపోవడంతో రెచ్చిపోతోంది. ప్రపంచ దేశాల స్పందనను గమనిస్తున్న ఆయన కొద్దిసేపటి క్రితం అణ్వాయుధ దళాలను అప్రమత్తం చేస్తూ ప్రకటన చేశారు. దీంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. పుతిన్ తీరు ఆమోద యోగ్యంగా లేదని అభ్యతంరం ప్రకటించగా.. మరికొన్ని దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

చర్చలపై మనసు మార్చుకున్న జెలెన్ స్కీ.. బెలారస్ వేదికగా చర్చలకు సరే 

కీవ్: బెలారస్ వేదికగా శాంతి చర్చలకు నో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ కొన్ని గంటల్లోనే మనసు మార్చుకున్నారు. రష్యా ప్రతిపాదించిన బెలారస్ వేదిక నుంచే రష్యా క్షిపణి దాడులు చేస్తోందని ఆరోపించిన ఆయన కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బెలారస్ వేదికగానే చర్చలకు సిద్ధమని అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటన చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

 

జైళ్ల నుంచి యుద్ధంలోకి ఖైదీలు..

యుద్ధం భయంతో లక్షలాది మంది ఉక్రెయినియన్లు దేశం విడిచి వెళ్లిపోతుంటే.. మరోవైపు వేలాది మంది ఉక్రెయిన్ మహిళలు, పురుషులు సొంత దేశాన్ని కాపాడుకోవటం కోసం రిటర్న్ వస్తున్నరు. ఒక్క పోలాండ్ బార్డర్ ద్వారానే గురువారం నుంచి 22 వేల మంది ఉక్రెయిన్ పౌరులు దేశంలోకి తిరిగి వచ్చారని అధికారులు వెల్లడించారు. దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఖైదీలను కూడా జైళ్ల నుంచి విడిచిపెడుతోందని మీడియా వెల్లడించింది. సైన్యంతో కలిసి పోరాడేందుకు విదేశాల నుంచి వాలంటీర్లు రావాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. తాను కీవ్​లోనే ఉన్నానని, సిటీ పూర్తిగా ఉక్రెయిన్ కంట్రోల్​లోనే ఉందని ఆయన ప్రకటించారు.

భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొస్తం : రాజ్నాథ్ 

ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వీలైనంత తొందరగా స్వదేశానికి తీసుకొస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

నేను అధ్యక్షుడిగా ఉండింటేనా: ట్రంప్

తాను అమెరికా  అధ్యక్షుడి  స్థానంలో ఉండి ఉంటే  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదన్నారు అమెరికా మాజీ  ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్ పై  రష్యా దాడి చేయడం అత్యంత భయంకమన్నారు. ఇవాళ ఫ్లోరిడాలో  జరిగిన కన్జర్వేటివ్  పొలిటికల్  యాక్షన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ట్రంప్ ఉక్రెయిన్ పై యుద్ధం చేయడాన్ని ప్రస్తావించి  బైడెన్ సర్కార్ పై  విరుచుకుపడ్డారు. రష్యా మానవాళిపై  దాడి చేస్తోందని అన్నారు. దీనికి కారణం బైడెన్  నేతృత్వంలోని  అమెరికన్ అడ్మినిస్ట్రేషనేనని  ఆరోపించారు. మరోవైపు అసమాన ధైర్యసాహసాలు  ప్రదర్శిస్తున్న  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు.

రష్యా సైనికులపై తిరగబడుతున్న మహిళలు, పిల్లలు
రష్యా బలగాలకు  తలొగ్గేది లేదని   ఒకవైపు ఉక్రెయిన్  ప్రెసిడెంట్ చెప్తుండగా.. లోకల్స్ కూడా అందుకు తగ్గట్లే   వ్యవహరిస్తున్నారు. తమ దగ్గర  ఉండే వస్తువులతో.. రష్యన్స్ ను  అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.   పెద్ద పెద్ద  ఇనుపరాడ్లతో  రోడ్లపై బారీకేడ్లు  ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రష్యన్ యుద్ధ  ట్యాంకులపై  విసిరేందుకు.. పెట్రోల్  బాంబులు తయారు చేస్తున్నారు.

‘స్విఫ్ట్’ నుంచి రష్యా ఔట్ 

అమెరికా, బ్రిటన్, జర్మనీ తాజాగా మరిన్ని ఆంక్షలు ప్రకటించాయి. స్విఫ్ట్ గ్లోబల్ పేమెంట్ సిస్టం నుంచి రష్యాను దూరం పెట్టేందుకు అమెరికా, యూరోపియన్ కమిషన్, బ్రిటన్, కెనడా తదితర దేశాలు ఓకే చెప్పాయి. ప్రపంచ బ్యాంకింగ్ మెసేజింగ్ సర్వీస్ సంస్థ ‘స్విఫ్ట్’ నెట్ వర్క్ నుంచి రష్యన్ బ్యాంకులను బహిష్కరించాలని నిర్ణయించాయి. అలాగే రష్యా ఫారిన్ రిజర్వ్ లను వాడుకోకుండా చూసేందుకు రష్యన్ సెంట్రల్ బ్యాంకుపైనా ఆంక్షలు విధించేందుకు ఓకే చెప్పాయి. 200 దేశాల్లో 11 వేల బ్యాంకులు, సంస్థలు అనుసంధానమైన ఉన్న స్విఫ్ట్ నుంచి రష్యాను దూరం పెట్టడంతో ఆ దేశానికి ఆర్థికంగా గట్టి దెబ్బ తగులుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఉక్రెయిన్ కు మద్దతుగా ప్రపంచదేశాల నిరసనలు

ఉక్రెయిన్ మద్దతుగా  ప్రపంచ దేశాల్లో  నిరసనలు కంటిన్యూ  అవుతున్నాయి. రష్యా రాజధాని మాస్కోలో ఆందోళనలు  ఉద్రిక్తంగా మారాయి. పుతిన్ చర్యలకు వ్యతిరేకంగా  మాస్కో నగరంలో పెద్దఎత్తున   ప్రజలు వచ్చి నిరసనలకు  దిగడంతో.. భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి.  ఒమాహా , బెర్న్, టిబిలిసి,  మెల్ బోర్న్ నగరాల్లో  తీవ్ర నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఉక్రెయిన్ కు  మద్దతుగా ఆ దేశ   జెండాలతో ర్యాలీలు  తీస్తున్నారు. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో రష్యా  ఎంబసీ అధికారులపై  ఉక్రెయిన్ మద్దతుదారులు దాడికి దిగారు.

4,300 మంది రష్యా సైనికుల్ని హతమార్చిన ఉక్రెయిన్

రష్యా ఆర్మీకి చెందిన 4,300 మందిని హతమార్చినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాల్యార్ ప్రకటించారు. రష్యాకు చెందిన 146 యుద్ధ ట్యాంకులు, 27 యుద్ధ విమానాలు, 26 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ కు చెందిన  471మంది సైనికులను బంధీలుగా మార్చినట్లు రష్యా ప్రకటించింది. ఆ దేశానికి చెందిన 8 ఫైటర్ ప్లేన్లు, 7 హెలికాప్టర్లతో పాటు 11 డ్రోన్లను నేలకూల్చినట్లు చెప్పింది. 

బెలారస్‌ వేదికగా రష్యాతో శాంతి చర్చలకు నో: జెలెన్ స్కీ
తమపై ఏకపక్షంగా యుద్ధం ప్రారంభించిన రష్యాతో శాంతి చర్చలకు సానుకూలత వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ.. బెలారస్‌ వేదికగా రష్యాతో శాంతి చర్చలకు నో చెప్పారు. బెలారస్ రష్యా అనుకూల ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని రష్యా తమ దండయాత్రకు లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బెలారస్ నుండి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోందని, తన దేశం పట్ల దూకుడు ప్రదర్శించని ప్రదేశాలలో మాత్రమే చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ‘క్షిపణులు ఎగరని ఏ దేశంలోనైనా చర్చలకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు.

మరో రెండు పెద్ద సిటీలు.. రష్యా చేతిలోకి

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నాలుగో రోజు కూడా భీకరంగా కొనసాగుతోంది. రాజధాని నగరం కీవ్ లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని గ్యాస్, చమురు నిక్షేపాలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో పలు నగరాల్లో భారీ పేలుళ్ల మోతమోగుతోంది. తాజాగా మరో రెండు పెద్ద నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దక్షిణ, ఆగ్నేయ ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఉన్న రెండు పెద్ద సిటీలను తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా ప్రకటించుకుంది. 

ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల ఆయుధ సాయం

ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సైనిక బలం ఉన్న దేశాల్లో ఒకటైన రష్యాను ఒంటరిగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ కు అండగా నిలిచేందుకు ఒక్కో దేశం  ముందుకొస్తోంది. యుద్ధంలో ఏ మాత్రం చలించని ధైర్యంతో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుల్లో మరింత బలాన్ని నింపేందుకు జర్మనీ ముందుకొచ్చింది. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తమ వంతు సాయంగా ఆయుధాలను పంపుతామని ప్రకటించింది. వెయ్యి యుద్ధ ట్యాంకులు, 500 సర్ఫేస్ టు ఎయిర్ స్టింగర్ క్షిపణులను వీలైనంత త్వరగా ఉక్రెయిన్ చేరవేస్తామని జర్మనీ చాన్సెలర్ కార్యాలయం వెల్లడించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురి చేస్తోందని జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. రష్యా తీరు అన్ని దేశాలను బెదిరించేలా ఉందని, ఈ పరిస్థితుల్లో పుతిన్ దురాక్రమణను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ కు మన వంతు సాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అలాగే 14 ఆర్మ్డ్ వెహికల్స్, పది వేల టన్నుల ఫ్యూయల్ పంపుతామని జర్మనీ ఎకానమీ మంత్రి ప్రకటించారు. 

మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్ కు సుమారు రూ.7,500 కోట్ల ఆర్థిక సాయాన్ని చేస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధంలో అవసరమయ్యే డిఫెన్సివ్ ఎక్విప్ మెంట్ ను ఉక్రెయిన్ కు పంపేందుకు ఇటలీ ముందుకొచ్చింది. రష్యా యుద్ధోన్మాదాన్ని అడ్డుకోవడానికి 8.6 మిలియన్ డాలర్ల మెషిన్ గన్స్, ఆటోమెటిక్, స్నిపర్ రైఫిల్స్, పిస్టల్స్, మందు గుండు సామాగ్రిని పంపిస్తామని చెక్ రిపబ్లిక్ ప్రకటించింది. అలాగే నెథర్లాండ్స్ 400 యాంటీ ట్యాంక్ వెపన్స్ ను ఉక్రెయిన్ కు సాయంగా పంపుతామని తెలిపింది. ఫ్రాన్స్ కూడా ఆయుధ సాయం చేసే ప్రతిపాదనపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ దేశం యుద్ధానికి ముందే వందల మిలియన్ల విలువ చేసే ఆయుధాలను పంపింది.

హైదరాబాద్ చేరుకున్న తెలుగు విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి 20 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో 250 మంది భారత విద్యార్థులు ఢిల్లీలో ల్యాండయ్యారు. వీరిలో తెలంగాణకు చెందిన వివేక్ , శ్రీహరి, తరుణ్, నిదిష్, లలిత, దేవి, దివ్య, మనీషా, రమ్య, ఐశ్వర్య, మాన్య, మహిత, ప్రత్యూష, గీతిక  , లలిత, తరిణి అనే విద్యార్థులున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ విద్యార్థులను రిసీవ్ చేసుకున్నారు.

దేశం కోసం గన్ పట్టిన ఎంపీ

‘‘రష్యాపై, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌‌పై నాకు చాలా కోపంగా ఉంది. మా దేశ ఉనికిని, హక్కులను ఆయన ఎందుకు కాలరాస్తున్నాడో అర్థం కావడం లేదు. ఊరు విడిచి వెళ్లిపోవాలని నన్ను, నా కుటుంబాన్ని రష్యా సైనికులు బెదిరించారు”అని ఉక్రెయిన్‌‌ ఎంపీ కైరా రూడిక్‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎదో ఒక పని చేసుకొని మాకు బతుకు మేము బతుకుంటే శత్రువులు మా దేశంలోకి వచ్చారు. మేము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. మా నుంచి శత్రు దేశం ఏమీ తీసుకుపోలేరు. మా దేశం కోసం మేము పోరాడుతాం. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నేను నా భర్త, స్నేహితులు ఫస్ట్‌‌ టైమ్‌‌ ఆయుధాలు పట్టాం. దేశంలోని చాలా మంది మహిళలకు ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇచ్చారు. నా తోటి ఎంపీలు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.ఉక్రెయిన్‌‌ కోసం దేశ ప్రజలంతా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు”అని తెలిపారు.

నడిచి పక్క దేశాలకు పోతున్రు

వార్సా: రష్యా దాడులతో ఉక్రెయిన్ అల్లాడుతోంది. బాంబు మోతలతో అక్కడి ప్రజలు భయభయంగా గడుపుతున్నారు. ఏం జరుగుతుందో తెలియక చంటి పిల్లలు హడలిపోతున్నారు. ఇళ్లను వదిలి బంకర్లలో, అండర్ గ్రౌండ్లలో దాక్కుంటున్నారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వీడుతున్నారు. పిల్లలతో, సామాన్లతో, కన్నీళ్లతో పుట్టిన నేలను వీడుతున్నారు. ఇప్పటికే 1,20,000 మంది వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ అనుబంధ సంస్థలు వెల్లడించాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగొచ్చని ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ ప్రతినిధి షబియా మంటూ తెలిపారు. పరిస్థితి మరింత దిగజారితే 4 మిలియన్ల మంది ఉక్రేనియన్లు పారిపోవచ్చని అంచనా వేశారు. చాలా మంది పొరుగున ఉన్న పోలాండ్, మోల్డోవా, హంగేరీ, రొమేనియా మరియు స్లోవేకియాకు వెళుతున్నారని, మరికొందరు బెలారస్‌‌లోకి వెళుతున్నారని మంటూ చెప్పారు. అత్యధిక సంఖ్యలో పోలాండ్‌‌కు చేరుకున్నట్లు తెలిపారు. 

ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడిన జెలెన్స్కీ

ఉక్రెయిన్ లో వెంటనే హింసను ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పిలుపునిచ్చారు. శాంతి దిశగా ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శనివారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో ప్రధాని ఈ మేరకు ఫోన్ లో మాట్లాడినట్లు ప్రధాన మంత్రి కార్యాలం (పీఎంవో) వెల్లడించింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంలో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరుగుతుండటం పట్ల ప్రధాని మోడీ ఆందోళన ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొంది.  ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న పరిణామాలను జెలెన్ స్కీ ఈ సందర్భంగా మోడీకి వివరించారని తెలిపింది. కాగా, ‘‘మా దేశంలోకి లక్ష మందికిపైగా రష్యన్ సోల్జర్లు చొరబడ్డారు. జనవాసాలు, ఇండ్లపైనా కాల్పులు జరుపుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాకు మద్దతు ఇవ్వాలని ఇండియాను కోరాం. అందరం కలిసి దురాక్రమణను అడ్డుకుందాం” అని జెలెన్ స్కీ ట్వీట్ చేశారు.

 


రష్యా యుద్ధ ట్యాంకులను నిలువరించడానికి ఒకే ఒక్కడు ఏం చేశాడంటే..
రియల్ హీరో విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్‌

ఉక్రెయిన్ పై హఠాత్తుగా యుద్ధాన్ని ప్రారంభించి.. ప్రపంచ దేశాలను నివ్వెరపరచింది రష్యా.. ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంటే.. రంగంలోకి దిగి సాయం చేస్తాయనుకున్న నాటో దళాలు, అగ్రరాజ్యం అమెరికా..  చివరకు ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు.. ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం ఉక్రెయిన్ కు షాక్ కు గురిచేసింది. అయినప్పటికీ దేశాధ్యక్షుడి స్ఫూర్తితో సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారు. రోజు రోజుకూ.. దూకుడు పెంచుతున్న రష్యా దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ వీరోచిత పోరాటం చేస్తున్నారు. ఉక్రెయిన్ సైనికుల పోరాట తీరుకు నిదర్శనంగా చెప్పుకోవడానికి ఒకే ఒక్క ఘటన ఇది. 

క్రిమియా మరియు ఉక్రెయిన్ ప్రధాన భూభాగాలను కలిపే కీలకమైన వ్యూహాత్మకమైన హెనిచెస్క్ బ్రిడ్జి వేళ్ల మీద లెక్కించే స్థాయిలో ఉక్రెయిన్ సైనికులు కాపలా గా ఉన్నారు. మిస్సైళ్లు, రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడుతున్న రష్యా దళాల దూకుడు అంతకంతకూ పెరుగుతుంటే.. ఉక్రెయిన్ సైనికుల వీరోచిత పోరాటం పై   ప్రపంచ దేశాలన్నీ దృష్టి కేంద్రీకరించాయి. ఈ పరిస్థితుల్లో ఒళ్లు గగుర్పాటు కలిగించే ఘటన జరిగింది. 

క్రిమియా మరియు ఉక్రెయిన్ ప్రధాన భూభాగాన్ని గనులతో కలిపే కీలకమైన వ్యూహాత్మకమైన బ్రిడ్జి వైపు రష్యా యుద్ధ ట్యాంకులు చొచ్చుకు వస్తున్నాయి. ఉక్రెయిన్  రక్షణకు ఎంతో కీలకమైన ఈ మార్గంలో బ్రిడ్జిని కూల్చేస్తే తప్ప రష్యా ట్యాంకులను అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్ సైనికుడు విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్‌ ఫ్యూజ్ ను అమర్చేందుకు ప్రయత్నిస్తుండగా రష్యా దళాలు పరిగెత్తుకుంటూ రావడం గమనించాడు. ఫ్యూజ్ ను అమర్చి తాను సురక్షితంగా బయటపడే అవకాశం లేదని గుర్తించిన సైనికుడు విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్‌ రష్యన్ బలగాలను ఉక్రెయిన్ లోకి ప్రవేశించడాన్ని అడ్డుకునేందుకు తనను తాను పేల్చుకున్నాడు. 

రియల్ హీరో విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్‌

రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలిచి తనను తాను పేల్చేసుకున్న ఉక్రెయిన్ సైనికుడు విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్‌ ను ఉక్రెయిన్ సైన్యం రియల్ హీరోగా అభివర్ణించింది. అతని త్యాగం ఎంతో గొప్పదని కొనియాడుతూ ఉక్రేనియన్ మిలిటరీ ఫేస్‌బుక్‌లో రాసింది. రష్యన్ దళాలు తనవైపు పరుగెత్తడంతో, ఫ్యూజ్‌ని అమర్చడానికి మరియు సురక్షితంగా బయటపడటానికి తనకు తగినంత సమయం లేదని సైనికుడు గ్రహించాడు. కాబట్టి, అతను తనను తాను పేల్చేసుకుని వంతెనను ధ్వంసం చేశాడు.. విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్ సహచరులు అతనిని "ప్రధాన శత్రువు రష్యా సైనికులు ముందుకు రావడాన్ని అడ్డుకునేందుకు.. రష్యా పురోగతిని గణనీయంగా మందగించేలా చేసిన త్యాగం అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది. 

198 ఉక్రెయిన్ పౌరులు మృతి

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో రష్యా దాడుల్లో 198 మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు,1115 మందికి గాయలయ్యాయని ఉక్రెయిన్ ప్రకటించింది. మరో వైపు 3500 మంది రష్యా సైనికులను హతమార్చామని ఉక్రెయిన్
 

ఉక్రెయిన్‌కు అండగా పోలాండ్

ఉక్రెయిన్ పై రష్యా దాడిని అనేక దేశాలు ఖండిస్తున్నాయి. తాజాగా పోలాండ్ మరియు ఇతర దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. EU మరియు ఇతర సంస్థలు రష్యాపై ఆంక్షలు విధించాయని భారతదేశంలోని పోలాండ్ రాయబారి ఆడమ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా చేసిన దూకుడు చర్య తమ పౌరులకు కూడా పెద్ద సమస్యను సృష్టించిందన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల నుంచి తప్పించుకున్న భారతీయులు, పోలాండ్‌లోకి వెళ్లేందుకు వారికి సహాయం చేస్తున్నామన్నారు. పోలాండ్ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తోందన్నారు. రష్యా దురాక్రమణను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉక్రేనియన్లు తమ దేశం కోసం పోరాడుతున్న గొప్ప దేశభక్తులు అని ఆడమ్ కొనియాడారు. మరోవైపు పోలాండ్ వచ్చేనెల ఆడాల్సిన ఫుట్ బాల్ మ్యాచ్ ను కూడా రద్దు చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా పోలాండ్  2022 ప్రపంచ కప్ ప్లే ఆఫ్ రష్యాతో మార్చి 24న మాస్కోలో ఆడబోదని పోలిష్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు శనివారం పేర్కొన్నారు.

రొమేనియా నుంచి ముంబై బయల్దేరిన తొలి విమానం

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.రొమేనియా నుంచి మొదటి విమానం ముంబై బయల్దేరిందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రకటించారు.విమానంలో మొత్తం 219 మంది ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, తాను స్వయంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నానని స్పష్టం చేశారు.రొమేనియా నుంచి బయల్దేరిన విమానం సాయంత్రం ఆరున్నరకు ముంబైలో దిగనుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులందరినీ తరలిస్తున్నామన్నారు అధికారులు. అక్కడ చిక్కుకున్న భారతీయులతో మాట్లాడుతున్నామని, వారిని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు రొమేనియాలోని భారత రాయబారి రాహుల్ శ్రీ వాస్తవ.

ఓ వైపు బాంబుల మోత.. మరో వైపు గర్భిణి పురిటి నొప్పులు

బంకర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకున్న ఉక్రెయిన్ ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. బంకర్లో తలదాచుకుంటున్న ఓ 23 ఏళ్ల గర్భిణికి ఇవాళ పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. ఉక్రెయిన్ పోలీసులు స్పందించి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. బాంబుల మోతల మధ్య గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యుద్ధ సమయంలో పుట్టిన ఈ పసిపాపకు హోప్ (HOPE).. అనే పేరుపెట్టాలని సూచిస్తున్నారు. హోప్ అంటే ఆంగ్ల భాషలో ఆశ అనే అర్థం. పుట్టిన పాప యుద్ధానికి ముగింపు పలికి శాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే దేశంలోని చాలా మంది విదేశాలకు తరలివెళ్లారు. ఇప్పటికీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయేందుకు తహతహలాడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం సుమారు 50 లక్షల మంది ఉక్రెయిన్ విడిచిపెట్టి ఇతర దేశాలకు, స్వదేశాలకు వెళ్లిపోయారని అంచనా. 

రష్యా గుప్పెట్లోకి మరో ఉక్రెయిన్ సిటీ

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా మూడో రోజూ తన దాడిని కొనసాగిస్తోంది. ఇప్పటికే దాదాపు పదికి పైగా సిటీలను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న రష్యన్ బలగాల.. తాజాగా మరో సిటీపై పట్టు సాధించాయి.   ఉక్రెయిన్ లోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ సిటీని ఆక్రమించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఎయిర్, షిప్ బేస్డ్ మిస్సైల్స్ తో దాడులు చేసి ఉక్రెయిన్ లోని మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది

మా సైనికులు ఎవరూ చనిపోలేదు

మరో వైపు రష్యా సైనిక చర్యలను దీటుగా ఎదుర్కొంటున్నామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. దాదాపు 3500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ట్వీట్ చేసింది. 200 మంది సైనికులు బందీలుగా ఉన్నారని తెలిపింది. 14 విమానాలను, 8 హెలికాప్టర్లను కూల్చామని ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి. 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని చెప్పారు. అయితే తమ సైనికులు ఎవరూ చనిపోలేదని రష్యా ప్రకటించింది. 

అమెరికా ఆఫర్.. నో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ పై రష్యా మూడు రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తోంది. దాదాపు 13 నగరాలపై పట్టు సాధించిన రష్యన్ ఆర్మీ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి కూడా ఎంటరైంది. యుద్ధంలో పట్టుసడలుతున్నా.. ఉక్రెయిన్ ప్రెసిండెంట్ జెలన్స్కీ మాత్రం తన గుండె ధైర్యాన్ని వీడలేదు. సైనికుల్లో ఒకరిగా మెలుగుతూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. నైతిక బలాన్ని రెట్టింపు చేస్తూ.. శత్రు సైన్యం పోరాటంలో ముందుకు ఉరికిస్తున్నారు. భయంతో తలవంచేది లేదని, దేశం కోసం ప్రాణ త్యాగానైనా సిద్ధమని జెలెన్స్కీ స్పష్టం చేస్తున్నారు. రాజధాని కీవ్ లోకి రష్యా సైన్యం చొచ్చుకురావడంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా చేయి అందించేందుకు ముందుకొచ్చింది. జెలెన్స్కీని కాపాడి.. సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆయనకు చెప్పింది. తన చుట్టూ శత్రు సైన్యం కమ్ముకొస్తోందని తెలిసినా అగ్ర రాజ్యం ఇచ్చిన ఆఫర్ ను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తిరస్కరించారు.

భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఫ్లైట్స్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సేఫ్ గా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రం చేసింది.  ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీతో కలిసి ఏర్పాట్లు చేస్తోంది. మన వాళ్లు తమ సమాచారం ఇచ్చి, ప్రయాణానికి సిద్ధమయ్యేలా 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ నుంచి హంగేరి, రుమేనియా దేశాల మీదుగా ఇండియాకు తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం ఎయిరిండియాకు చెందిన రెండు ప్రత్యేక విమానాలు రుమేనియాకు వెళ్లనున్నాయి. 

తొలి ఫ్లైట్ సాయంత్రం 4 గంటలకే..

భారత ప్రభుత్వ సూచనలతో ఇప్పటికే ఉక్రెయిన్ బార్డర్లకు మన స్టూడెంట్స్ చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి సుసీవా బార్డర్ ను దాటి రొమేనియాలోకి వందల సంఖ్యలో చేరుకుంటున్నారు. వీరిని బుకారెస్ట్ ఎయిర్ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి పోరుబ్నే సిరత్ దగ్గర బార్డర్ దాటి సుమారు 400 మందికి పైగా విద్యార్థులు రుమేనియా చేరుకున్నారని కీవ్ లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. రుమేనియా సరిహద్దుకు చేరుకుంటున్న భారతీయులందర్నీ బుకెరెస్ట్ కు తరలించి, అక్కడ్నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్ కు తరలిస్తామని పేర్కొంది. వారిని తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం AI-1942 బయలుదేరి వెళ్లింది. ఈ విమానం ఇవాళ అర్ధ రాత్రి 1.50 గంటల సమయానికి భారత పౌరులతో ఇండియా చేరుకోనుంది. అలాగే  మరో విమానం AI-1939 సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీ నుంచి  బయలుదేరనుంది. ఈ విమానం రేపు ఉదయం 7.40 గంటలకు తిరిగి ఢిల్లీకి రానుంది. ఈ రెండు విమానాల్లో కలిపి 490 మంది విద్యార్థులు భారత్ కు చేరుకోనున్నారు. ఇప్పటికే రుమేనియా వెళ్లిన మరో ఫ్లైట్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముంబైలో ల్యాండ్ అవ్వనుంది. ఇందులో 240 మంది స్వదేశానికి చేరుకోనున్నారు. వీరిని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ రిసీవ్ చేసుకుంటారు.

మరో వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

తమ దేశ రాజధానిని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీ ముఖ్య నాయకులతో కలిసి ప్రమాణం చేశారు.  ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ  శుక్రవారం సెంట్రల్ కైవ్ నుంచి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా తమ రాజధానిని రక్షించుకుంటామని ఆయన ఆ వీడియోలో తెలిపారు. ‘మేమంతా ఇక్కడే ఉన్నాం. మా మిలిటరీ ఇక్కడే ఉంది. సమాజంలోని పౌరులు ఇక్కడ ఉన్నారు. మనమందరం మన స్వాతంత్ర్యం, మన దేశాన్ని కాపాడుకుందాం’ అని జెలెన్ స్కీ ప్రెసిడెన్సీ భవనం ముందు నిలబడి అన్నారు. ఆలివ్ ఆకుపచ్చ మిలిటరీ తరహా దుస్తులు ధరించిన జెలెన్ స్కీ.. తన ప్రధాన మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఇతర సీనియర్ సహాయకులతో కలిసి పుతిన్‎పై ఒత్తిడి పెంచెలా మాట్లాడారు. కాగా.. మాస్కోలో మీడియాతో మాట్లాడిన పుతిన్..  జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల బానిసలు, నియో నాజీల ముఠా’తో పోల్చారు. పైగా.. ఉక్రేనియన్ మిలిటరీని ఆ దేశ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని కోరారు. పుతిన్ ప్రకటించిన యుద్ధాన్ని ప్రతిఘటించాలంటూ.. జెలెన్ స్కీ అనేక దేశాల నాయకులను కోరారు. తమ దేశం ఒంటరై పోయిందని ఆయన అన్నారు.