కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య: సింగరేణి మాజీ ఉద్యోగిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి మరీ చంపేశారు

కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య: సింగరేణి మాజీ ఉద్యోగిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి మరీ చంపేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఇంట్లో నుంచి లాక్కెళ్లి మరీ సింగరేణి విశ్రాంత ఉద్యోగిని కిరాతకంగా హత్య చేశారు దుండగులు. వివరాల ప్రకారం.. గుబ్బల రామ్మోహన్ రావు (60) సింగరేణి విశ్రాంత ఉద్యోగి. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ఏరియాలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో సోమవారం (సెప్టెంబర్ 22) రాత్రి ఇంట్లో భోజనం చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు రామ్మోహన్ రావు ఇంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. అనంతరం ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి సుత్తితో తలపై దాడి చేశారు. దుండగుల దాడిలో రామ్మోహన్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. 

కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ నేతృత్వంలో త్రీ టౌన్ పోలీసులు ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో సీసీ ఫుటేజ్ ఆధారాలను సేకరిస్తున్నారు. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ దారుణ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నడి వీధిలో దారుణ హత్య జరగడంతో స్థానిక కాలనీవాసులకు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.