- సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటయ్య
కోల్బెల్ట్, వెలుగు: 28ఏళ్లుగా పెన్షన్ పెరగకపోవడంతో బొగ్గు గని రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని సింగరేణి రిటైర్డు ఎంప్లాయీస్ అసిసోయేషన్ జిల్లా ప్రెసిడెంట్ గజెల్లి వెంటకయ్య అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మినగర్లో సింగరేణి రిటైర్డు ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెన్షన్ పెంపుదల, ఇతర సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సింగరేణి రిటైర్డు ఉద్యోగుల పెన్షన్ పెంచాలంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకరావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
పెన్షన్ పెంపుదలకు ఈ నెల 30న న్యూఢిల్లీలోని జంతరమంతర్ వద్ద ఆందోళన నిర్వహించే బొగ్గు గనుల పెన్షనర్లుకు మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని రిటైర్డు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రాజన్న, జనరల్సెక్రటరీ నర్సయ్య, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.
