బీజేపీ పవర్​లోకొస్తే.. సింగరేణి కార్మికులకు నో ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌ : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

బీజేపీ పవర్​లోకొస్తే..  సింగరేణి కార్మికులకు నో ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌ : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

గోదావరిఖని, వెలుగు:  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులపై ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌‌‌ భారం పడకుండా సంస్థనే భరించేలా చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌‌‌‌ వెంకటస్వామి తెలిపారు. ఈ అంశంపై పార్టీ మీటింగ్‌‌‌‌లో చర్చిస్తామని, కార్మికులపై ఆర్థిక భారం పడకుండా చూడడమే బీజేపీ లక్ష్యమన్నారు. గురువారం సింగరేణి రామగుండం రీజియన్‌‌‌‌ పరిధిలోని జీడీకే 11వ గనిపై నిర్వహించిన గేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి పరిరక్షణకు తమ తండ్రి వెంకటస్వామి ఎంతో కృషి చేశారని, లక్షా 25 వేల మంది పనిచేస్తున్న సంస్థ మూతపడకుండా ఉండేందుకు ఎన్టీపీసీ నుంచి లోన్‌‌‌‌ ఇప్పించి బీఐఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ నుంచి తప్పించారని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం, వారి మంచి కోసం తమ కుటుంబం ఎల్లప్పుడు పాటుపడుతుందన్నారు. సింగరేణి తెలంగాణలోనే నంబర్‌‌‌‌ 1 కంపెనీగా ఉందనీ, ఐదేండ్ల కింద 50 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థ నేడు 75 మిలియన్‌‌‌‌ టన్నులకు చేరడం గొప్ప విషయమని తెలిపారు. 

ఇదంతా సంస్థలో పనిచేస్తున్న కార్మికుల శ్రమఫలితమన్నారు. కార్మికుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత సింగరేణి సంస్థదేనని, వారి అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బొగ్గు గని కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో అవినీతి లేని ప్రభుత్వాలు రావాలని, అప్పుడే పాలన సరిగ్గా సాగుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి, పాలనలో ప్రపంచంలోనే 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నదని, రాబోయే మూడేండ్లలో మూడో స్థానంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. జాతీయ రహదారుల విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు.

సింగరేణి ప్రైవేటైజేషన్​పై బీఆర్ఎస్​ అబద్ధాలు

మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌‌‌‌ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటైజేషన్ అంటూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికే సంస్థపై ఆజమాయిషీ ఉందని, సింగరేణిని ప్రైవేటైజ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటన చేసినా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.

 వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. తర్వాత సుందిళ్ల గ్రామంలోని పురాతన లక్ష్మి నర్సింహస్వామి దేవాలయంలో వివేక్‌‌‌‌ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్‌‌‌‌, పార్లమెంట్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌ పి.మల్లికార్జున్‌‌‌‌, పిడుగు కృష్ణ, సోమారపు అరుణ్‌‌‌‌ కుమార్‌‌‌‌, వీరయ్య, వడ్డేపల్లి రాంచందర్‌‌‌‌, దుబాసి మల్లేశ్‌‌‌‌, కోదాటి ప్రవీణ్‌‌‌‌, రాచకొండ కోటేశ్వర్లు, కిషన్‌‌‌‌ రావు, సునీల్‌‌‌‌కుమార్‌‌‌‌, నర్సింగ్‌‌‌‌ దొర, మల్లేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌, తిప్పారపు మధు, గడ్డం మధు తదితరులు పాల్గొన్నారు.