చెన్నై: తమిళనాడులో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించడంపై ఆలోచిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని రాజకీయ పార్టీలు కోరాయని, ఎన్నికల షెడ్యూల్ వచ్చాక దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శుక్రవారం చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడారు. తమిళనాడులో ఇటీవలే నిర్వహించిన సర్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందన్నారు.
నిరుడు బీహార్లో జరిగిన ఎన్నికల కన్నా తమిళనాడులో మరింత మెరుగ్గా ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల నిర్వహణలో తమిళనాడు రికార్డు సృష్టించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75 వేల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. కాగా.. వీవీప్యాట్ కౌంటింగ్ తప్పనిసరిగా జరుగుతుందని సీఈసీ చెప్పారు. కౌంటింగ్ తరువాత కూడా అభ్యర్థులు ఏడు రోజుల్లోపు ఫీజు చెల్లించి వీవీప్యాట్తో వారి ఈవీఎంను చెక్ చేసుకోవచ్చన్నారు.
