ప్రతి రూపాయిని ప్రజల కోసమే వినియోగించాలి : సిరిసిల్ల రాజయ్య

ప్రతి రూపాయిని ప్రజల కోసమే వినియోగించాలి : సిరిసిల్ల రాజయ్య
  • స్థానిక సంస్థల బలోపేతంతోనే గ్రామీణాభివృద్ధి
  • రాష్ట్ర ఫైనాన్స్ ​కమిషన్​ చైర్మన్​సిరిసిల్ల రాజయ్య

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతమవుతేనే గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్​ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య అన్నారు. బుధవారం ఆదిలాబాద్​కలెక్టరేట్‌ లో కమిషన్‌ సభ్యుడు రమేశ్, కార్యదర్శి కాత్యాయిని దేవి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు, డీసీసీబీ చైర్మన్‌ భోజారెడ్డి, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిధుల వినియోగం పారదర్శకంగా, సమర్థంగా చేపట్టాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రజల ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సంక్షేమ ఫలాలను సామాన్యలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో, సమగ్ర ప్రణాళికతో పనిచేస్తేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

అనంతరం ఉమ్మడి జిల్లా పరిధిలోని పంచాయతీల ఆదాయం, వ్యయాల స్థితి, పన్నుల వసూళ్లు, నిధుల వినియోగం, పేదరిక నిర్మూలన, గ్రామీణ గృహ నిర్మాణం, విద్యుత్‌, తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై కలెక్టర్లు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కుమార్‌ దీపక్, వెంకటేశ్​థోత్రే, స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్లు సోమ రాజేశ్వర్‌, ఫైజాన్‌ అహ్మద్‌, దీపక్‌ తివారీ, ఆర్డీవో స్రవంతి, పంచాయతీ రాజ్‌, శాఖ అధికారులు పాల్గొన్నారు.