ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో అమరుల ప్రాణత్యాగాలు వెలకట్టలేనివని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సిరిపురం యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ ఎన్సీసీ గేటు వద్ద చైర్మన్ తాటికొండ వెంకట రాజయ్య అధ్యక్షతన అమరుడు యాదయ్య వర్ధంతి సభ జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం, స్వామి గౌడ్, దేశపతి శ్రీనివాస్, దేవి ప్రసాద్, కర్ణాకర్ పాల్గొని యాదయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ గేటు వద్ద అమరుడు సిరిపురం యాదయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర సాధన, చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. సిరిపురం ఉపేందర్, వీరమల్లు యాదవ్, శంకర్ గారి నర్సింగరావు, పగిడి మర్రి హరి, పుట్ట పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘట్ కేసర్, వెలుగు: సిరిపురం యాదయ్య చేసిన ఆత్మత్యాగంతోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ అన్నారు. ఘట్కేసర్ మున్సిపల్ ఎన్ఎఫ్సీనగర్లోని పిట్టల ఆర్గానిక్ ఆవరణలో సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం ఆధ్వర్యంలో సిరిపురం యాదయ్య 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అందెశ్రీ, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి యాదయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఓయూ ఎన్సీసీ గేటుకు యాదయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మారావు, సహకార సంఘం డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.