
ఫాంహౌస్ కేసులో ఏసీబీ కోర్టు మెమో రిజెక్ట్ చేయడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) హైకోర్టును ఆశ్రయించింది. కేసును ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, పోలీసులు, సిట్ కు ఆ అధికారం లేదన్న కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ దాఖలు చేసిన ఈ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణకు హైకోర్టు అనుమతించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు జస్టిస్ నాగార్జున బెంచ్ దీనిపై విచారణ జరపనుంది.
ఫాం హౌస్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు మంగళవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్ను నిందితులుగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం సిట్కి లేదని ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి జి.రాజగోపాల్ తేల్చి చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్(పీసీ యాక్ట్) గ్రౌండ్లో సిట్ దాఖలు చేసిన మెమోను తిరస్కరించారు. పీసీ యాక్ట్ కేసుల్లో ఏసీబీకి మాత్రమే దర్యాప్తు అధికారం ఉందని, లా అండ్ ఆర్డర్ పోలీసులకుగానీ, సిట్కుగానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలంటూ గత నెల 22న సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేయగా.. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు ఆ మెమోను రిజెక్ట్ చేసింది.