టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ కు నోటీసులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ కు నోటీసులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. బండి సంజయ్ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో  కోరారు. ఈ నెల 24వ తేదీన తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ఇంట్లో అందుబాటులో లేరని సంజయ్ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వాచ్మెన్ కు చెప్పి ఇంటి గోడ కు నోటీసులు అంటించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు వ్యవహారంలో బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలకు తగిన ఆధారాలు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే దర్యాప్తు బృందానికి ఇవ్వాలని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

బండి సంజయ్ కామెంట్స్..

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ బాధ్యుడని బండి సంజయ్ ఆరోపించారు. గ్రూప్ 1 పేపర్  లీకేజీలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో ఒకే మండలం నుంచి50 మందికిపైగా.. క్వాలిఫై అయ్యారని చెప్పారు.  ఓ చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నియమించిన సిట్ దీనిపై విచారిస్తుందా అని అడిగారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. అటు నిరుద్యోగుల  నోట్లో మట్టి కొట్టి.... తన ఇంటికే ఐదు ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ఇచ్చుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువత జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు.  గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తుంటే.... టీఎస్పీఎస్సీ స్కామ్ .. అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోందన్నారు.  బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ లో  క్వాలిఫై చేసినట్టు తెలుస్తోందన్నారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో  ఒకే మండలం నుంచి 50 మందికి పైగా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని.. మంచి మార్కులు తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఏవైనా ఉంటే, సమర్పించాలంటూ సిట్ అధికారులు రేవంత్ రెడ్డిని కోరారు.