హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు మంత్రులకు పరాభవం తప్పలేదు. కేబినెట్లో కేసీఆర్ సహా 18 మంది మంత్రులు ఉండగా, ఇందులో ముగ్గురు మంత్రులు ఎన్నికల్లో పోటీ చేయలేదు. మిగిలిన 15 మందిలో ఆరుగురు ఓడిపోయారు. ఈ లిస్ట్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి ఉన్నారు. పాలకుర్తిలో అత్యంత పిన్న వయస్కురాలు, కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని, రాజకీయాల్లో 30 ఏండ్లకుపైగా అనుభవమున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును సుమారు 40 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి 50,703 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర్రావు.. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను సుమారు 41,664 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ను, కాంగ్రెస్ లీడర్ అడ్లూరి లక్ష్మణ్ సుమారు 22,039 ఓట్ల మెజార్టీతో ఓడించారు. గత ఎన్నికల్లో 441 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన కొప్పుల, ఈసారి ఏకంగా భారీ ఓట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు. మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి, మంత్రి శ్రీనివాస్గౌడ్ను 18,738 ఓట్ల తేడాతో ఓడించారు. వనపర్తిలో 25,320 ఓట్లతో కాంగ్రెస్ క్యాండిడేట్ మేఘా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని ఓడించారు.
మంత్రుల మెజారిటీకి గండి
మేడ్చల్లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి 33,419 ఓట్ల మెజారిటీ తో, కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్పై గెలిచారు. ఎమ్మెల్యేగా మల్లారెడ్డికి ఇది రెండో విజయం. బాల్కొండలో ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి 4533 ఓట్లతో, కాంగ్రెస్ క్యాండిడేట్ ముత్యాల సునీల్ కుమార్పై గెలిచారు. సిద్దిపేటలో హరీశ్రావు, సిరిసిల్లలో కేటీఆర్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజార్టీతో గెలిచిన హరీశ్, ఈసారి 82,308 మెజార్టీతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పూజాల హరికృష్ణ 23,206 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. సిరిసిల్ల నుంచి గత ఎన్నికల్లో 89,009 ఓట్ల మెజార్టీతో గెలిచిన కేటీఆర్, ఈసారి 29,687 ఓట్లతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి 59,557 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి 18,328 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
అయితే ఒకట్రెండు రౌండ్ల వరకూ కేటీఆర్ కంటే, మహేందర్రెడ్డి లీడ్లో ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్పడ్డారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై మంత్రి గంగుల కమలాకర్ 326 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి మరోసారి గెలిచారు. 26,187 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ను సబితా ఓడించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్లో మరోసారి గెలుపొందారు. బీజేపీ క్యాండిడేట్ మర్రి శశిధర్రెడ్డిపై 41,827 ఓట్ల భారీ మెజార్టీతో తలసాని విజయం సాధించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ గెలిచినప్పటికీ, మంత్రి జగదీశ్రెడ్డి మాత్రం సూర్యాపేట నుంచి 4606 వేల మెజార్టీతో విన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కామారెడ్డిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కేసీఆర్, గజ్వేల్లో మాత్రం విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (గజ్వేల్, హుజురాబాద్) రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గజ్వేల్లో కేసీఆర్పై, హుజురాబాద్లో పాడి కౌశిక్రెడ్డిపై ఈటల ఓడిపోయారు. ఇక మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, మహమూద్ అలీ, పట్నం మహేందర్రెడ్డి ఎన్నికల బరిలో లేరు.