
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని యమునా నదిలో మునిగి ఆరుగురు బాలికలు మృతి చెందారు. ఆగ్రాలోని సికంద్ర ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన బాలికలు నది పక్కనే ఉన్న తమ పొలంలో మధ్యాహ్నం వరకు పనిచేశారు. అనంతరం ఎండ వేడికి తట్టుకోలేక నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. మొదట నది ఒడ్డున నీటిలో కాసేపు ఫొటోలు, రీల్స్ తీసుకున్నారు. తర్వాత కొద్దిగా నది లోపలికి వెళ్లగా, లోతు ఎంత ఉందో తెలియక ఆరుగురు బాలికలు ప్రమాదవశాత్తు మునిగిపోయారు.
ఇది గమనించిన స్థానికులు బాలికలను కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆరుగురిలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరిని కాపాడి, వెంటనే హాస్పిటల్కు తరలించారు. వారు చికిత్స పొందుతూ మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బాలికలు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్ట్మార్టం అనంతరం డెడ్బాడీలను పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు.