వాషింగ్టన్: బ్యూటీ పార్లర్లు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. తక్కువ టైంలో మెరుగైన సేవలందించేందుకు పోటీపడుతున్నాయి. ఇందుకోసం అత్యాధునిక మెషిన్లను వాడుతున్నాయి. గోళ్లకు వేసే రంగు (నెయిల్ పాలిష్) ను తొందరగా ఆరబెట్టేందుకు డ్రైయింగ్ ల్యాంప్ వాడుతున్నాయి. ఈ మెషిన్ల నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్(అతినీలలోహిత) కిరణాలతో రంగు తొందరగా ఆరిపోతుంది. నెయిల్ పాలిష్ వేశాక.. ఆ వేళ్లను యూవీ డ్రైయింగ్ ల్యాంప్ కింద పెడితే సెకన్ల వ్యవధిలోనే పాలిష్ గట్టిపడిపోతుంది. ఇక్కడి దాకా అంతా ఓకే.. అయితే, ఈ యూవీ డ్రైయర్ల వాడకం వల్ల ఏర్పడే రిస్క్గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. యూవీ డ్రైయింగ్ ల్యాంప్ల నుంచి 340 నుంచి 395 నానోమీటర్ల ఫ్రీక్వెన్సీ కలిగిన యూవీ కిర ణాలను వాటిపై ప్రసరింపచేస్తారు. వీటివల్ల చర్మంలోని కణాలపై పడుతున్న ప్రభావాన్ని గుర్తించేందుకు 2 రకాల మనుషుల కణాలు.. కెరాటినోసైట్స్, ఫోర్ స్కిన్ఫైబ్రో బ్లాస్ట్స్ లతో పాటు ఎలుకలకు చెందిన ఎంబ్రయోనిక్ ఫైబ్రో బ్లాస్ట్ కణాలపైన వర్సిటీ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు.
20 నిమిషాలలో 30% కణాలు నాశనం
ఈ కణాలపై 20 నిమిషాల పాటు యూవీ కిరణా లు పడేలా చేశారు. ఆపై వాటిని పరీక్షించగా.. దాదాపు 30% చర్మ కణాలు చనిపోయినట్లు గుర్తించారు. దీంతో పాటు మిగతా చర్మ కణాల డీఎన్ఏ డ్యామేజ్ అయినట్లు సైంటిస్టులు తెలిపా రు. ఈ మార్పులతో చర్మ కణాలు పెరిగిపోయి, ఇది క్యాన్సర్కు దారితీస్తుందని హెచ్చరించారు.