పూణేలో జరిగిన రెండో టీ–20 మ్యాచ్ లో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. శ్రీలంక, టీమిండియా మధ్య జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక విక్టరీ సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే శ్రీలంక కెప్టెన్ శనక చివరి ఓవర్లో కేవలం నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో టీమిండియాపై శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లంక గెలవడంతో మూడు టీ–20 సిరీస్లో రెండు జట్లు చెరో పాయింట్తో సమమంగా నిలిచాయి.
ఈ మ్యాచ్ లోఅక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటతీరుతో జట్టును లక్ష్యానికి చేరువగా తీసుకువచ్చారు. అయితే జట్టు స్కోరు 148 పరుగుల వద్ద సూర్యకుమార్ వెనుదిరిగాడు. సూర్య 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత శివమ్ మావి అండతో అక్షర్ పటేల్ తన దూకుడు కొనసాగించాడు. అయితే చివరి ఓవర్లో అక్షర్ ఓ ఫుల్ టాస్ ను కొట్టబోయి లాంగాన్ లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత్ ఆశలు అడుగంటాయి. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 3 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. శివమ్ మావి 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేశాడు.