హైదరాబాద్, వెలుగు: కరోనా తెచ్చిన మార్పులతో గల్లీలోని చిన్నచిన్న కిరాణా షాపులు కూడా ఆన్లైన్ కాబోతున్నాయి. ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రావడాన్ని తగ్గించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ‘ఈ– స్టోర్ ’ను ప్రారంభించింది. ప్రజలకు తమ దగ్గరలో ఉన్న దుకాణాల వివరాలు తెలిసేలా దీన్ని రూపొందించారు. ప్రజల అవసరాలకు తగినట్లుగా దుకాణాల నిర్వాహకులు దీంట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం ఉన్న వారు ఏదైనా ఆర్డర్ చేసేందుకు పోర్టల్ ను ఓపెన్ చేస్తే.. వారికి దగ్గర్లోని షాపుల పేర్లు డిస్ ప్లే అవుతాయి. సరుకులు ఆర్డర్ ఇచ్చిన వారికి ఇంటి దగ్గరికి వెళ్లి సప్లయ్ చేస్తారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాలను ఈ ప్రత్యేక పోర్టల్ కిందకు తీసుకురావాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. దుకాణాల ఓనర్లు ‘కిరాణ లింకర్’లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కిరాణా లింకర్ను ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన చోట వినియోగదారులు, వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.
తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ నెట్వర్కింగ్ పోర్టల్తోపాటు, ది కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) సహకారంతో ‘కిరాణ లింకర్’ ను డెవలప్ చేయాలని పరిశమల శాఖ నిర్ణయించింది. ‘కిరాణ లింకర్’ పోర్టల్లో పల్లెలు, పట్టణాలు, నగరాలలో ఉన్న గల్లీలలోని కిరాణా దుకాణాల యజమానులు, ఇతర నిత్యావసర సరుకుల వ్యాపారులు వారి వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ పేమెంట్స్, ఇతర పరిష్కారాల వంటివి ఇందులో ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నో, వారణాసి, గోరఖ్పూర్, ప్రయాగ్రాజ్లో ‘కిరాణ లింకర్’ పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణలో దీన్ని ఆచరణలోకి తేవాలని సీఏఐటీ కోరుతోంది. ‘ఈ-–స్టోర్’లను నిత్యావసర సరుకుల వ్యాపారానికే పరిమితం చేయకుండా భవిష్యత్తులో ఇతర వ్యాపారాలకు విస్తరించే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు చెప్పారు.