- రెండు నెలల్లో రూ.1,000 కోట్ల సేకరణ
- మరిన్ని పబ్లిక్ ఇష్యూలు వచ్చే చాన్స్
న్యూఢిల్లీ: స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్(ఎస్ఎంఓ)లు స్టాక్ మార్కెట్ల ద్వారా భారీ ఎత్తున నిధులను సేకరిస్తున్నాయి. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఫిబ్రవరి 29 నాటికి) మొత్తం 30 ఎస్ఎంఈ ఐపీఓలు రూ. 1,024 కోట్లు సేకరించాయి. తమ ఖాతాల్లోకి భారీగా నిధులు రావడం వల్ల ఇవి మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని, సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోగలుగుతాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటికే 21 కంపెనీలు ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫారమ్లో లిస్టింగ్ని ఎంచుకున్నాయి. మరో 9 బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫారమ్ను ఎంచుకున్నాయి. దీనిని బట్టి చూస్తే మూలధన మార్కెట్ పర్యావరణ వ్యవస్థపై ఎస్ఎంఈలకు విపరీతమైన ఆసక్తి ఉన్నట్టు చెప్పవచ్చు. సగటు టికెట్ సైజు దాదాపు 30 శాతం వరకు పెరిగింది. గత సంవత్సరం డేటాతో పోల్చితే, 180 కంపెనీలు రూ. 4,900 కోట్లను సేకరించాయి.
యావరేజ్ టికెట్సైజు రూ. 27 కోట్లు ఉంది. ప్రస్తుత సగటు టికెట్సైజు రూ. 34 కోట్లకు పెరిగింది. పబ్లిక్ ఇష్యూకు వెళ్ళిన 30 కంపెనీలలో, 17 క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ) నుంచి గణనీయంగా నిధులను సేకరించాయి. మొత్తం ఐపీఓలలో క్యూఐబీలకు దాదాపు 56శాతం వాటా ఉంది. ఎస్ఎంఈలలో సంస్థాగత పెట్టుబడిదారులకు పెరుగుతున్న ఆసక్తికి ఈ సంఖ్యలు నిదర్శనం. ఎస్ఎంఈలకు భవిష్యత్ బాగుంటుందన్న నమ్మకమే ఈ భారీ పెట్టుబడులకు కారణమని చెప్పవచ్చు.
మాక్స్పోజర్ లిమిటెడ్ ఐపీఓ ఏకంగా వెయ్యి రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్అయింది. ఈ రూ. 20 కోట్ల ఐపీఓకు రూ. 20 వేల కోట్ల విలువైన బిడ్స్ వచ్చాయి. ఎస్ఎంఈ ఐపీఓ ఓవర్ సబ్స్క్రిప్షన్లో మాక్స్పోజర్ కొత్త రికార్డును నెలకొల్పింది. ఎస్ఎంఈ ఐపీఓ మార్కెట్ విస్తరిస్తున్నందున, మరిన్ని చిన్న మధ్య తరహా సంస్థలు తమ వృద్ధి ఆశయాలను సాధించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.