గోవాలో ఎలాంటి బార్ నడపట్లేదని క్లారిటీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె చుట్టూ వివాదం చెలరేగింది. ఆమెకు గోవాలో ఓ బార్ ఉందని, దానిని అక్రమంగా నడుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని, తన కూతురుకు ఎలాంటి బార్ లేదని స్మృతి ఇరానీ స్పష్టంచేశారు.
స్మృతిని పదవి నుంచి తొలగించాలి: కాంగ్రెస్
స్మృతి కూతురు జోయిష్ ఇరానీ గోవాలో రెస్టారెంట్ నడుపుతున్నారని, అందులో ఫేక్ లైసెన్స్తో బార్ కూడా ఉందని కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా ఆరోపించారు. ప్రధాని మోడీ.. స్మృతి ఇరానీని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 2021లో చనిపోయిన వ్యక్తి పేరిట బార్ లైసెన్స్ ఉందని, 2022 జూన్లో ఈ లైసెన్స్ తీసుకున్నారని చెప్పారు. చనిపోయిన వ్యక్తి పేరిట లైసెన్స్ ఉండటం చట్టవిరుద్ధమన్నారు. గోవాలో ఉన్న నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్కు ఒక లైసెన్సే ఉండాలని, కానీ దీనికి రెండు లైసెన్సులు ఉన్నాయన్నారు. అయితే ఈ ఆరోపణలను జోయిష్ ఇరానీ తరఫు న్యాయవాది కిరత్ నాగ్రా కొట్టిపారేశారు. స్మృతి ఇరానీ కూతురు కావడంవల్లే ఆమెపై రాజకీయ దురుద్దేశంతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
రాహుల్కు మరోసారి ఓటమి తప్పదు: స్మృతి
గాంధీ కుటుంబానికి తాను వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే తన కూతురిని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని స్మృతి ఇరానీ మండిపడ్డారు. కేంద్రమంత్రి కూతురు కావడమే ఆమె శాపమా? అని ప్రశ్నించారు. తన కూతురు కాలేజీలో చదువుకుంటోందని చెప్పారు. ఈ విషయంపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. అమేథీలో రాహుల్ను ఓడించిన కారణంగానే తన కుటుంబాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందన్నారు. అమెథీ నుంచి పోటీ చేస్తే రాహుల్ను మరోసారి ఓడిస్తానని చెప్పారు.