OTT Thriller: హైదరాబాద్ క్రైమ్ కథతో శోభిత మూవీ.. డైరెక్ట్ ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్!

OTT Thriller: హైదరాబాద్ క్రైమ్ కథతో శోభిత మూవీ.. డైరెక్ట్ ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్!

నాగ చైతన్య వైఫ్, టాలెంటెడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ నటించిన లేటెస్ట్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. 2022లో అడివి శేష్ నటించిన ‘మేజర్’ తర్వాత, శోభిత నుంచి వస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మేకర్స్ ఈ చిత్రానికి ‘చీకటిలో’ (Cheekatilo) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయగా, తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.

గురువారం (జనవరి 8) విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శోభితా ధూళిపాళ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. థియేటర్లను పూర్తిగా పక్కనపెట్టి డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కావడం ఆడియన్స్‌కు స్పెషల్ ట్రీట్‌గా మారింది. ఈ సినిమా జనవరి 23 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో మాత్రమే కాకుండా, హిందీ, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

చీకటిలో కథ ఇదే..!

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ ‘సంధ్య’ అనే పాత్రలో నటించింది. వృత్తిరీత్యా ఆమె ఒక ట్రూ క్రైమ్ పోడ్‌కాస్టర్. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఈ కథలో నగరాన్ని కుదిపేసే భయంకరమైన, మిస్టీరియస్ క్రైమ్‌ల వెనుక ఉన్న నిజాన్ని సంధ్య ఎలా వెలికి తీసింది? చీకటిలో దాగి ఉన్న నిజాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? అన్నదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మెయిన్ థీమ్.

ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలాక్షి, ఈషా చావ్లా కీలక పాత్రల్లో నటించగా, సీనియర్ నటీమణులు ఝాన్సీ, ఆమని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై ఈ మూవీ ఎలాంటి థ్రిల్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.