మోసం చేసి పెండ్లి చేసుకున్నడని పాకిస్తానీ వ్యక్తిపై యువతి ఫిర్యాదు

మోసం చేసి పెండ్లి చేసుకున్నడని పాకిస్తానీ వ్యక్తిపై యువతి ఫిర్యాదు

మెహిదీపట్నం/జూబ్లీహిల్స్, వెలుగు: తనపై ఒత్తిడి చేసి బలవంతంగా మతం, పేరు మార్చి పెండ్లి చేసుకుని ఇప్పుడు వేరే యువతులతో తిరుగుతూ తనను వేధిస్తున్నాడని, పాకిస్తానీ జాతీయుడినని చెప్పకుండా మోసం చేశాడని నగరానికి చెందిన ఓ సాఫ్ట్​వేర్​ఇంజినీర్​ఓ పాకిస్తానీపై ఫిర్యాదు చేసింది. లంగర్​హౌస్​ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు. బాధితురాలు, ఇన్​స్పెక్టర్​ వెంకట రాములు కథనం ప్రకారం..లంగర్ హౌస్‎కు చెందిన కీర్తి జగదీశ్ (39) హైటెక్ సిటీలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్. 

2011లో పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫహద్ అలీ(34) ఆమె పని చేస్తున్న కంపెనీలో పని చేస్తూ పరిచయమయ్యాడు. కీర్తి అప్పటికే భర్తతో విడాకులు తీసుకుని ఉండడంతో ఫహద్​ఆమెకు దగ్గరయ్యాడు. కొంతకాలం తర్వాత ఇద్దరూ ఒకటయ్యారు. అప్పటికే కీర్తికి ఓ కూతురు కూడా ఉంది. ఫహద్.. కీర్తిని పెండ్లి చేసుకుంటానని కోరాడు. మతం మార్చుకోవాల్సి ఉంటుందని ఒత్తిడి చేసి దోహా ఫాతిమాగా పేరు, మతం మార్చి 2016లో పెండ్లి చేసుకున్నాడు. 

వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. రెండేండ్లుగా ఫాతిమా అలియాస్ కీర్తిని ఫహద్ పట్టించుకోవడం లేదు. కట్నం కోసం వేధించడంతో పాటు బెదిరింపులకు గురి చేస్తున్నాడు. మరికొందరు యువతులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. దీంతో కీర్తి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.  బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీ అపార్ట్​మెంట్‎లో మరో యువతితో కలిసి ఉండగా గురువారం రాత్రి పోలీసుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

నిందితులను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు బాధితురాలు లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో ఉంటుండడంతో వారికి అప్పగించారు. లంగర్ హౌస్ పోలీసులు విచారణ జరిపి అలీని రిమాండ్‎కు తరలించారు. అలీ పాకిస్తాన్‎కు చెందిన యువకుడిగా ఆధారాలు ఉండడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఫహద్ తన పాకిస్తానీ మూలాలను దాచాడని, నకిలీ ఎడ్యుకేషన్​సర్టిఫికెట్లను ఉపయోగించాడని కీర్తి ఆరోపిస్తోంది. తనను మతం మార్చుకోమని బలవంతం చేశాడని, పెండ్లి చేసుకుని తర్వాత మోసం చేశాడని ఆరోపించింది.

తండ్రి పాకిస్తానీ.. తల్లి ఇండియన్​

పాకిస్తాన్‎కి చెందిన అలీ తండ్రి 1990లో సౌదీ వెళ్లాడు. ఆ టైంలో తమిళనాడుకు చెందిన మహిళను పెండ్లి చేసుకున్నాడు. 98లో ఫహద్​తండ్రి చనిపోయాడు. వీరికి నలుగురు పిల్లలు ఉండగా, ఫహద్​మూడో కొడుకు. ఫహద్​తల్లికి పాకిస్తాన్ సిటిజన్ షిప్ కూడా ఉంది. ఫహద్ 1998లోనే తల్లి, సోదరితో కలిసి హైదరాబాద్‌‌ వచ్చాడు. తర్వాత ఓ సాఫ్ట్​వేర్​కంపెనీలో పని చేస్తున్నాడు. 

ఫహద్​పాకిస్తాన్‎కు చెందిన వ్యక్తి అని చెప్పకుండా పెండ్లి చేసుకుని మోసం చేశాడని ఫాతిమా అలియాస్​కీర్తి జగదీశ్​ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. పాకిస్తాన్‎కు చెందిన వ్యక్తి ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని, తనకు ఇండియన్​సిటిజన్​షిప్​ఉందని చెప్తున్నాడని, అయినా అతడి డాక్యుమెంట్లు చూపించలేదన్నారు.