చెరువులో మట్టి తీసుకెళ్తున్రు..వేస్టేజ్​ను తెచ్చి నింపుతున్రు..అడ్డుకున్న రైతులు

చెరువులో మట్టి తీసుకెళ్తున్రు..వేస్టేజ్​ను తెచ్చి నింపుతున్రు..అడ్డుకున్న రైతులు

పెనుబల్లి, వెలుగు : నేషనల్​ హైవే పనులకోసం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. మళ్లీ ఆ గుంతలను చెత్తాచెదారం, చెట్ల మొద్దులతో నింపేస్తున్నారు. పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామంలోని మర్లకుంట చెరువు నుంచి ఖమ్మం టు దేవరపల్లి వరకు నిర్మిస్తున్న నేషనల్​ హైవే పనుల కోసం రెండు నెలలు నుంచి మట్టి తరలిస్తున్నారు. ఇన్నాళ్లు చెరువు లోతు పెరగడం కోసం ఇరిగేషన్​ అధికారుల అనుమతితో మట్టి తీసుకెళ్తుండడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. నేషనల్​ హైవే పనులు చేస్తున్న సబ్​ కాంట్రాక్టర్​ చెరువులో మట్టిని తీసిన తరువాత అడుగున ఉన్న గ్రావెల్​ ను హైవే పనులకు తరలించి పైన తీసిన మట్టిని మళ్లీ పూడ్చాలి. 

కానీ ఇతరప్రదేశాలలో హైవే పనులలో పనికిరాని మట్టిని, చెట్ల మొద్దులను, వేస్టేజ్​ను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పోసి పూడ్చుతున్నారు.  ఈ విషయమై బుధవారం  వేస్టేజ్​ను  తీసుకొస్తున్న టిప్పర్లను రైతులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్​ ఆఫీసర్లు ఎన్​హెచ్​ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో వేసిన వేస్టేజ్​ ను వారం రోజుల్లో తొలగించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.