
- కలెక్టర్లకు భూసేకరణ బాధ్యతలు
- ఇప్పటికే ఒక ప్లాంటుకు 4 ఎకరాల భూమి గుర్తింపు
- ఒక్కో ప్లాంటుకు రూ.1.50 కోట్ల ఖర్చు
- మొత్తం ప్రాజెక్టుకు రూ.675 కోట్ల రుణం కోసం నాబార్డుకు దరఖాస్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ కింద మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జీ) ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఎస్ హెచ్ జీలకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించింది. ఈ దసరా నాటికి ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాకు రెండు చొప్పున మొత్తం 64 సోలార్ ప్లాంట్లను తొలి విడతలో నిర్మించనున్నారు. ప్రతి సోలార్ ప్లాంట్ను 0.5 మెగావాట్ల (500 కిలోవాట్ల) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కో సోలార్ ప్లాంట్ స్థాపనకు సుమారు రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. 64 ప్లాంట్లకు మొత్తం రూ.96 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేసింది. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) కు ది రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్) దరఖాస్తు చేయగా.. మొత్తం ప్రాజెక్టుకు రూ.675 కోట్ల రుణం మంజూరుకు అంగీకరించింది. 5 శాతం వడ్డీతో రుణ సదుపాయం కల్పించనున్నది. అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సబ్సిడీలు, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సమకూరనున్నాయి. ఈ ప్లాంట్లు విజయవంతం అయితే మరిన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
భూసేకరణ బాధ్యతలు కలెక్టర్లకు..
సోలార్ ప్లాంట్ల స్థాపనకు అవసరమైన భూమిని సేకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఒక్కో సోలార్ ప్లాంట్కు 4 ఎకరాల భూమి సేకరించనున్నారు. ప్రతి జిల్లాలో1 మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలో 64 ప్లాంట్లకు మొత్తం 256 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. విద్యుత్తు సబ్ స్టేషన్లు, విద్యుత్ గ్రిడ్కు సమీపంలో స్థలాలు అనుకూలంగా ఉంటాయని అటువైపు భూములు సేకరిస్తున్నారు. బీడు భూములు లేదా ప్రభుత్వ భూములకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భూసేకరణ పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. జూన్ లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
7 కంపెనీలతో ఒప్పందాలు..
31 జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల స్థాపన కోసం 7 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 25 సంవత్సరాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) చేసుకున్నాయి. 25 ఏండ్ల తర్వాత ప్లాంట్ల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా స్థానిక మహిళా సంఘాలకు బదిలీ అవుతుంది. పారదర్శకమైన టెండర్ ప్రక్రియ ద్వారా అర్హత కలిగిన సోలార్ టెక్నాలజీ కంపెనీలను ఎంపిక చేశారు.
ఈ కంపెనీలు అధునాతన సోలార్ ప్యానెళ్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ను సరఫరా చేస్తాయి. తొలుత రాష్ట్రంలో 62 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. జునా సోలార్ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ మహుబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 10 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో 8 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఏడాదికి రూ.85.93 కోట్ల టర్నోవర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
డైనిరీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరంగల్, మహబూబాబాద్, ములుగు, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 10 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించనుంది. వీటి ద్వారా రూ.48.64 కోట్ల టర్నోవర్ అవుతుందని అంచనా. ప్రొటెన్షన్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. వీటితో రూ.20.46 కోట్ల టర్నోవర్ అవుతుందని అంచనా. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏ అండ్ టీ పవర్ సిస్టమ్ కంపెనీ ఏర్పాటు చేసే ప్లాంట్లతో 4 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. కైన్ ప్రాజెక్టు, ఇండస్ట్రీస్ కంపెనీ సూర్యాపేట, నల్లొండ జిల్లాల్లో.. సాయిబాజాజ్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో.. వామన సోలార్ ఈపీసీ కంపెనీ యాద్రాద్రి భువనగిరి జిల్లాలో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాయి.